Tuesday 11 February 2020

Delhi Elections – 2020 Results



అభివృద్ధికే ఢిల్లీ ఓటరు పట్టం

-        డానీ

            ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమకారులకు, గొప్ప ఊరట నిచ్చాయి. దేశాన్ని మతోన్మాద కారు మేఘాలు కమ్ముకుంటున్న ఒక చారిత్రక దశలో ఒక తొలకరి జల్లులా వచ్చిన ఫలితాలివి.  మతోన్మాదంపై అభివృధ్ధి మంత్రం సాధించిన విజయం ఇది.

            1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత చెలరేగిన మత భావోద్వేగాలు సానుకూలంగా మారడంతో 1993 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి అధికారాన్ని చేపట్టింది. ఎన్నికల నినాదాలు రూపొందించడంలో గొప్ప నైపుణ్యం వున్న కమలనాధులు “ఇప్పుడు మినీ భారత్ (ఢిల్లీ) గెలిచాం, రేపు బిగ్ - భారత్ గెలుస్తాం”  అంటూ అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేసేవారు. 

2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు బిగ్-భారత్ ను గెలిచాయిగానీ మినీ భారత్ కు  2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టి (ఆప్) అధికారాన్ని చేపట్టింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలమెట్టుకున్నప్పటికీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వరుస పరాజయాలను ఎదుర్కోంటోంది. కేంద్రంలోని అధికార పక్షం ఈసారి మినీ భారత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  “దేశ్ బద్లా- అబ్ ఢిల్లీ బద్లో” (దేశం మారింది; ఇప్పుడు ఢిల్లీ నువ్వు మారు)! అనే నినాదంతో రంగంలో దిగింది.

అయితే ఈ నినాదంలో ఒక తిరకాసు వుంది. లోక్ సభ ఎన్నికల్లో మారిన దేశంలో ఢిల్లీ లేదా? అనే సందేహం వస్తుంది.  నిజానికి దేశంలోని పది రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం  బిజెపియేతర ప్రభుత్వాలున్నాయి.  దేశమంతా మారలేదనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలీ?

             బిజెపి ప్రచారం మొత్తం చీలిక విధానాలు, మతోన్మాద రాజకీయాలతోనే సాగింది.  ఈ ఎన్నికల్ని“షాహీన్ బాగ్ పై  భారత్ యుధ్ధం”గా ఒకరు చిత్రిస్తే  “పాకిస్తాన్ తో భారత్ యుధ్ధం”గా మరొకరు చిత్రించారు. బిజెపి ఢిల్లీ రాష్ట్ర శాఖకు మనోజ్ తివారి అధ్యక్షులుగా వున్నారు. అలాగే బిజెపికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపి నడ్డా వున్నారు. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీలే స్వయంగా పార్టీ ప్రచారాన్ని, వ్యూహాలు ఎత్తుగడల్ని దగ్గరుండి నడిపించారు. ఒక విధంగా ఇది మోదీజీ-షా ద్వయానికీ, కేజ్రీవాల్ –ప్రశాంత్ కిశోర్ ద్వయానికి  మధ్యన సాగిన  ఎన్నికల పోరుగా భావించవచ్చు.

మతభావోద్వేగాలు, లౌకిక విలువల మధ్య ఏటూ తేల్చుకోలేని సంధిగ్ధ స్థితిలో కాంగ్రెస్ వుంది. కాంగ్రెస్‍ అస్త్ర సన్యాసం చేసి యుధ్ధరంగాన్ని వదిలివేయడంవల్ల ఆప్ కు లాభించిన మాట  నిజమేగానీ బిజెపి ఓటమికి కాంగ్రెస్ తోడ్పడిన మాట అంతకన్నా వాస్తవం.  ఇప్పటి పరిస్థితిలో కాంగ్రెస్ చురుగ్గా పనిచేసివుంటే అది బిజెపికి లాభించివుండేది.   
            బిజెపి ప్రచారంలో ఆర్థిక సంక్షోభం నివారణ, ఉపాధికల్పన, విద్యా, వైద్యం వగయిరాల ఊసేలేదు. ప్రధానమంత్రి మోదీజీ పాల్గొన్న సభలు సహితం ఆ బాటలోనే నడిచాయి. మోదీజీ షాహీన్ బాగ్, సర్జికల్ స్ట్రైక్, జేఎన్ యూ, జామియా మిలియా, శీలంపూర్ నిరసనలు వంటి అంశాలతోనే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. అభివృధ్ధి గురించి ఒక్క మాటైనా ప్రస్తావించలేదు.

            పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు డిసెంబరు 11న  ఆమోదించినప్పటి నుండి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ముందు జెఎన్ యు, శీలంపూర్, జామియా మిలియాలలో మొదలయిన నిరసనలు జేడి బిర్లా మార్గ్ లో షాహీన్ బాగ్ వద్ద  ఒక శిబిరం ఏర్పడడంతో ఉధృతంగా మారాయి.  షాహీన్ బాగ్ ఉత్తేజంతో దేశంలో   ఇప్పుడు దాదాపు 150 సిఎఎ, ఎన్ పిఆర్, ఎన్ ఆర్ సి వ్యతిరేక శిబిరాలు నడుస్తున్నాయి.  ఒక చేతితో మువ్వన్నెల జాతీయ జెండాను, ఇంకో చేతితో రాజ్యాంగాన్ని పట్టుకుని,  ఒళ్ళో మహాత్మా గాంధీజీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ ల ఫొటోలు పెట్టుకుని, రాజ్యాంగ ప్రవేశికలోని “న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం” ఆదర్శాలను నినదిస్తూ సాగుతున్న మహత్తర లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఇది.  

             కేవలం ముస్లింలు మాత్రమే సిఎఎను వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలు ఇచ్చి హిందూ ఓటు బ్యాంకును సమీకరించాలని స్వయంగా ప్రధాన మంత్రి కూడ ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. శిక్కులు మొదటి నుండీ షాహీన్ బాగ్ నిరసనకారులకు అండగా వున్నారు. ఆ పిదప క్రైస్తవులేగాక, హిందూ సమాజానికి చెందిన అనేక సమూహాలు ఆ శిబిరానికి చేరుకున్నాయి. రోజూ షాహీన్ బాగ్ శిబిరంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి.  ఈ మతసామరస్య పరిణామాల్ని మోదీజీ- అమిత్ జీ ద్వయం ఊహించలేదు. అది వారికి జీర్ణం కావడంలేదు.  

            మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనిని ముందుగా బిజెపి ఎంపి  ప్రవేశ్ వర్మ మొదలెట్టారు. “షాహీన్ బాగ్ నిరసనకారులు మీ ఇళ్ళ లోనికి దూరి మీ మహిళల్ని చెరుస్తారు, మీ సోదరుల్ని హత్యలు చేస్తారు” అని జనాన్ని రెచ్చగొట్టారు. ప్రవేశ్ వర్మ మీద ఎన్నికల కమీషన్ నాలుగు రోజుల నిషేధాన్ని విధించింది. నిషేధం నుండి తిరిగి వచ్చిన వర్మ మరీ రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి కేజ్రివాల్ ను ఏకంగా టెర్రరిస్టు అన్నారు. మళ్ళీ ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుంది. ఒక్క వారంలో రెండుసార్లు ఎన్నికల కమీషన్ నిషేధించడంతో పార్టీలో వర్మ స్థాయి పెరిగిపోయింది!. రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చను ప్రవేశపెట్టే కీలక బాధ్యతను ప్రవేశ్ వర్మకు అప్పగించారు. ప్రజల్ని ఎంతగా రెచ్చగొడితే పార్టీలో అంత పెద్ద పీట వేస్తాం అని సంకేతాలిచ్చారు మోదీజీ-అమిత్ జీ.

            ప్రవేశ్ వర్మ  ప్రేరణతో ఆర్థికశాఖ సహాయ మంత్రి  అనురాగ్ ఠాకూర్ ఇంకా రెచ్చిపోయారు. “దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో” (సాలేగాళ్ళు దేశద్రోహులు; కాల్చిచంపండి వాళ్ళని)  అని రెచ్చగొట్టారు. గాంధీజీని హత్య చేసిన రోజైన జనవరి 30న జామియా మిలియా శిబిరం వద్ద ఒక అగంతకుడు నిరసనకారుల మీద కాల్పులు జరిపాడు. ఆ తరువాత మరో మూడు రోజుల్లో షాహీన్ బాగ్ దగ్గర రెండు సార్లు అగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వీరుళ్ళు ముగ్గురూ  “దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో”  నినాదాలే ఇవ్వడం విశేషం.  ప్రచారంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ తన సహజశైలిలో బుల్లెట్ల భాష మాట్లాడారు. బోలీ కి భాష నహి మానేగా తో గోలీ కే భాష సమ్జాయేగా” (షాహీన్ బాగ్ నిరసనకారులు “మాటల భాష వినకపొతే తూటాల భాష దారికి తెస్తుంది”) అన్నారాయన. కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్ తదితరులు తమ వంతు ఆజ్యం పోశారు. ప్రచారసారధి  అమిత్ షా చెలరేగిపోయారు. “మీరంతా ఇవియం బటన్ ను ఎంత గట్టిగా నొక్కాలంటే ఆ షాక్ షాహీన్ బాగ్ కు కొట్టాలి” అని పిలుపిచ్చారాయన.  “11వ తారీఖున ఎన్నికల్లో మనం గెలిచిన వార్త రాగానే సాయంత్రం ఆరు గంటల లోగ  విద్యార్థి నాయకులు షర్జీల్  ఇమామ్, కన్హయ్య కుమార్ ల మీద చార్జి షీట్  తయారయిపోతుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడిన గంట లోపులోనే వాళ్ళు జైల్లో వుంటారు” అన్నారాయన.  ఇంతటి ద్వేషపూరిత ప్రచారం గతంలో ఎన్నడూ చూడలేదు.

భావోద్వేగాలను రెచ్చగొట్టి మినీ భారత్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా లబ్ది పొందడానికే బిజెపి ముహూర్తం చూసి సరిగ్గా డిసెంబరులోనే సిఎ చట్టాన్ని తెచ్చింది. ఆ పార్టి ఊహించినట్టే షాహీన్ బాగ్ ఉద్యమం మొదలయింది. అయితే, షాహీన్ బాగ్  తమను ఓడిస్తుందని మాత్రం ల్కమలనాధులు అనుకొని వుండరు.            

            మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం చేజిక్కగానే బిజెపి అధ్యక్షునిగా  అమిత్ షా చేసిన మొదటి ప్రకటన “ఒక్క పార్టి కూడ తమ ప్రణాళికల్లో లౌకికవాదం ఊసే ఎత్తలేదు” అని. లౌకికవాదాన్ని భారత ప్రజలు తిరస్కరించారు అని చెప్పడం వారి అభిమతం. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో గెలవగానే ప్రజలు అభివృధ్ధిని కోరువడంలేదు; వాళ్ళకు మత భావోద్వేగాలే ముఖ్యం అని ప్రకటించి వుండేవారు. అదృష్టవశాత్తు వారికి ఆ అవకాశం రాలేదు. ముస్లిం ద్వేషం, పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్స్ వంటి మాటలు ప్రజలకు వెగటు పుట్టించాయి. ఇది షాహీన్ బాగ్ విజయం. లౌకిక  భారత ప్రజల విజయం.

             మరోవైపు, ఈ ఎన్నికల్లో  నోటిఫికేషన్ వెలువడిన రోజే ఆప్ గెలుపు ఖాయం అయిపోయింది.  అందివచ్చిన విజయాన్ని స్వీయ తప్పిదాలతో చేజార్చుకోకుండా కేజ్రివాల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మోదీజీ అమిత్ జీ తనను ఎంత రెచ్చగొట్టినా స్పందించలేదు.  సిఎఎను వ్యతిరేకిస్తున్నప్పటికీ షాహీన్ బాగ్ శిబిరానికి వెళ్ళలేదు. కేవలం అభివృధ్ధి మంత్రాన్నే ఎంచుకున్నారు. సిబిఎస్ ఇ పరీక్షల్లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు జాతీయ సగటుకన్నా, ప్రైవేటు విద్యా సంస్థల కన్నా మెరుగైన ఫలితాలను సాధించారు.  ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్యం పథకాలు, విద్యా రంగంలో సంస్కరణలు కేజ్రీవాల్ కు “ప్రో-ఇన్కుంబెన్సీ”గా  మారాయి.

కమలనాధులకు రాజకీయ ప్రాణవాయువుగా పని చేస్తున్న మతోన్మాదాన్ని, చీలిక విధానాలని పక్కకు తోసి అభివృధ్ధిని దేశ రాజకీయ ఎజెండాగా మార్చడానికి ఈ ఎన్నికలు నాంది పలికాయని ఆశించవచ్చు. అందుకు దోహద పడిన ఆమ్ ఆద్మీ పార్టి అధినేత కేజ్రీవాల్ కు అభినందనలు.

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు, రచయిత, సమాజ విశ్లేషకులు, మొబైల్ 90107 57776)

రచన : 11 ఫిబ్రవరి2020
ప్రచురణ :  సాక్షి దినపత్రిక, 12 ఫిబ్రవరి2020


No comments:

Post a Comment