Tuesday 4 October 2022

The Respectful Prostitute గౌరవనీయురాలైన వేశ్యగారు

గౌరవనీయురాలైన వేశ్యగారు

The Respectful Prostitute

Jean-Paul Sartre

1946 play ‘La Putain Respectueuse’

1952  French Movie  ‘La Putain Respectueuse’

English ‘The Respectful Whore’

 

జీన్ పాల్ సార్త్ 1946లో రాసిన ఫ్రెంచ్ నాటకం La Putain Respectueuse’.  The Respectful Prostitute అనేది దీనికి ఇంగ్లీషు అనువాదం. తెలుగులో ‘గౌరవనీయురాలైన వేశ్యగారు’ అనుకోవచ్చు.

 

ఇందులో, ఐదు ప్రధాన పాత్రలు రెండు పోలీసు పాత్రలు వుంటాయి. రెండు అంకాలు, తొమ్మిది సీన్లు వున్న చిన్న నాటకం ఇది.

 

అమెరిక సమాజంతోపాటు ఏకంగా న్యాయవ్యవస్థలోనే తిష్టవేసిన అమానవీయ జాతివివక్షను  చిత్రించడానికి సార్త్ ఈ నాటకాన్ని రాశాడు.

 

అస్తిత్వవాద/ దృగ్విషయవాద (existentialism / phenomenology) ఫ్రెంచ్ ఆలోచనాపరునిగా జీన్ పాల్ సార్త్ (Sartre) మనకు తెలుసు. సార్త్ మార్క్సిస్టు. అయితే, కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి వ్యతిరేకి.  

 

సైనికోద్యోగి అయిన సార్త్ రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో జర్మన్ ఆక్రమిత ఫ్రాన్స్ ప్రాంతంలో దాదాపు ఏడాది పాటు నాజీల యుధ్ధ ఖైదీగా వున్నాడు. రెండవ ప్రపంచ యుధ్ధం ముగిశాక సార్త్ రెండుసార్లు అమెరికాలో పర్యటించాడు. అమెరిక న్యాయవ్యవస్థ పాటిస్తున్న జాతి వివక్షను చూసి చలించిపోయాడు.

 

అప్పటికి 15 యేళ్ళ క్రితం అలబామ కోర్టులో నడిచిన సంచలనాత్మక స్కాట్స్ బరో  కేసు (Scottsboro Case) ఈ నాటకానికి ప్రేరణ. 

 

అలబమా రాష్ట్రంలో 1931మార్చి 25న ఒక దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ఆ రోజు ఓ ఓవర్ నైట్ రైలు పెట్టెలో తెల్లజాతీయులు, నల్ల జాతీయులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. తెల్లజాతి బాలురు కొందరు జాత్యహంకారంతో నల్లజాతి బాలుర్ని ఆ రాత్రి చీకట్లో ట్రైన్ నుండి గెంటివేద్దామని  దాడి చేశారు. ఆ దాడిని నల్లజాతి బాలురు గట్టిగా ప్రతిఘటించారు.

ఈ అవమానాన్ని భరించలేక నల్లజాతి బాలుర మీద తెల్ల జాతీయులు ఎదురు కేసు పెట్టారు. వాస్తవానికి ఆ రాత్రి ఆ రైలుపెట్టెలో  జరిగిందేమిటో పోలీసులకు, న్యాయమూర్తులకూ తెలుసు. పోలీసులు 13 మంది నల్లజాతి బాలులతోపాటు  తెల్లజాతికి చెందిన ఇద్దరు  కమ్మర్షియల్ సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. ఆ ఇద్దరిచేత  తప్పుడు సాక్ష్యం ఇప్పించి,  నడుస్తున్న రైల్లో ఆ ఇద్దరు మహిళల్ని నల్లజాతి బాలురు గ్యాంగ్ రేప్ చేసినట్టు  కేసు పెట్టారు. అప్పటి చట్టం ప్రకారం తెల్లజాతి స్త్రీని మానభగం చేసినట్టు రుజువయితే,  నేరుగా ఉరిశిక్ష విధించేవారు. ఆ ప్రకారం అలబామ కోర్టు నల్లజాతి బాలురు అందరికీ ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు మీద అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది.

 

ఈ కేసు నుండి ఓ నల్లజాతి నిందితుడ్ని, సాక్షిగా ఓ తెల్లజాతి వేశ్యను తీసుకుని ఆనాటి అమెరిక రాజకీయ, న్యాయ వ్యవస్థలు పాటిస్తున్న జాతివివక్షను, ఆ సమాజంలో పెచ్చరిల్లుతున్న మూకోన్మాదాన్నీ  చిత్రిస్తూ  గౌరవనీయురాలైన వేశ్యగారు నాటకాన్ని సృష్టించాడు సార్త్.

 

ఈ నాటకాన్ని తొలుత 1946లో పారిస్ లో ప్రదర్శించారు. తరువాత అమెరికాలో దీన్ని ప్రదర్శించినపుడు సార్త్ మీద అమెరిక వ్యతిరేకత (anti-Americanism) చట్టం కింద కేసు పెట్టారు. అయినప్పటికీ ఈ నాటకం విశేష జనాదరణ పొందింది. ఇప్పటికీ  ఈ నాటకాన్ని అనేక భాషల్లో ప్రదర్శిస్తూనే వున్నారు. ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషల్లో ఇది సినిమాగానూ వచ్చింది. కొందరు దీన్ని ఒపెరాగా మార్చి ప్రదర్శించారు.

 (https://www.youtube.com/watch?v=1jLfeRJX4j8)

 

కథా సారాంశం

 

ఓ సెనేటర్ మేనల్లుడు తప్పతాగి రైల్లో ఓ నల్లజాతి వ్యక్తిని  అకారణంగా హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరు మాత్రమే సాక్షులు; ఒకామె న్యూయార్క్‌లో  తెల్లజాతికి చెందిన లిజ్జీ మెక్‌కే అనే ఒక కమ్మర్షియల్ సెక్స్ వర్కర్. మరొకడు ఓ నల్లజాతి యువకుడు. 

 

తన మేనత్త కొడుక్కి  శిక్షపడకుండ కాపాడడానికి సెనేటర్ కొడుకు ఫ్రెడ్ క్లార్కే రంగంలో దిగుతాడు.  

 

“ఆ రైల్లో ఇద్దరు నిగ్గర్లు నీ మీద అత్యాచారయత్నం చేశారు. ఓ తెల్లవాడు నిన్ను కాపాడానికి వచ్చాడు.  రివాల్వర్ తో ఓ నల్లవాడిని చంపాడు; రెండో నల్లవాడు పారిపోయాడు” అని కోర్టులో చెప్పాలని లిజ్జికి చెపుతాడు. ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు పెద్ద మొత్తం చెల్లిస్తానంటాడు. సెనేటర్ కూడ లిజ్జిని కలిసి తెల్లవాళ్ళెప్పుడూ నల్లవాల్లవాళ్ళ  పక్షం వహించకూడదంటాడు.

 

ఫ్రెడ్ క్లార్కే అల్లిన కథ అప్పటికే పత్రికల్లో ప్రముఖంగా వచ్చేస్తుంది.  తెల్లవాళ్లంతా ఏకమై మూకోన్మాదంతో నగర వీధుల్లో నల్లవాళ్ల మీద దాడులు మొదలెడతారు. నిందితుడైన అ నల్ల యువకుడు ప్రాణాలు అరచేత పట్టుకుని మూకోన్మాదులకు చిక్కకుండ పరుగులు పెడుతుంటాడు.

 

లిజ్జి ఒక నైతిక సంధిగ్ధంలో పడిపోతుంది. డబ్బు తీసుకోవాలా? తెల్లవాళ్ళ పక్షాన్నే వుండాలా? ఒక తెల్లజాతి మహిళగా ఆమెకూ నల్లవాళ్ల మీద వ్యతిరేకతే వుంది. కానీ,  అన్యాయంగా ఒక నిరపరాధికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పాలా? అనే ప్రశ్నలు ఆమెను వెంటాడుతుంటాయి.

 

అంతటి ఉత్కంఠలో ఆ నల్లజాతి యువకుడు నేరుగా  లిజ్జీ ఇంటికే వచ్చి ఆమె ముందు నిలబడతాడు. చివరకు ఆ మూకోన్మాదుల చేతుల్లో చనిపోతాడు.  

 

ఈ నాటకంలో ఆ నల్లజాతి యువకునికి పేరు కూడ వుండదు. న్యుయార్క్ నగరాన్ని న్యూఢిల్లీగా మార్చి, ఆ నల్లజాతి యువకుడిని ముస్లిం చేస్తే ఇది ఇప్పటికీ అద్భుత ప్రాసంగికత గలిగిన నాటకం అవుతుంది.

 

కొన్నాళ్లుగా  నేను ఆ ప్రయత్నంలో వున్నాను.

 

05 సెప్టెంబరు 2022


No comments:

Post a Comment