What would Ambedkar do if he were here now?
*ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం చేసేవారు?*
*డానీ*
*సమాజ విశ్లేషకులు*
మావోయిస్టులది ప్రకటిత సాయుధపోరాటం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. హింసామార్గాన్ని చేపట్టిన మావోయిస్టుల్ని హింసతోనే అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ధృఢ నిశ్ఛయంతో వుంది. కగార్, బ్లాక్ ఫారెస్ట్ తదితర ఆపరేషన్లు ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. ఈ విషయంలోనూ ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. అయితే, ప్రభుత్వం చేపట్టిన హింసామార్గం రాజ్యాంగ ఆదర్శాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వుందా? లేదా? అన్నది వర్తమాన ప్రజాస్వామికవాదుల్ని వెంటాడుతున్న సందేహం.
అంబుజ్ మడ్ లోని నారాయణ్ పూర్ అడవుల్లో మే 21న సిపిఐ – మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతాదళాలు చంపేశాయి. ఆయనతోపాటు మరో పాతికమంది స్త్రీ పురుష మావోయిస్టుల్నీ చంపేశారు. ఈ సంఘటనపై ఎక్స్ వేదిక మీద స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, “నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం” అన్నారు.
హింసావాదుల్ని హింసతోనే అంతం చేయడం ధర్మబధ్ధమే అని కొందరు అనవచ్చు. కేంద్ర హోం మంత్రి ప్రకటనలు కొందరికి సమంజసంగా అనిపించవచ్చు. మరి కొందరికి గొప్ప ఉత్సాహాన్ని కూడ కలిగించవచ్చు. ఇంకొందరు ఉన్మాదంతో ఉగిపోనూవచ్చు. కమ్యూనిస్టుల్ని చీదరించుకునేవారో, విప్లవ వ్యతిరేకులో అలా అనుకుంటే అదో ఇది. కానీ, ప్రజలకూ ప్రభుత్వానికి మధ్య భారత రాజ్యాంగం అనే ఆధునిక పవిత్రగ్రంధం ఒకటుందని మరచిపోవడం ఆలోచనాపరులకు సమంజసం కాదు.
రాజ్యాంగ ప్రకటిత ఆదర్శాలను మార్గదర్శకాలనూ ప్రభుత్వాలు సరిగ్గా పాటిస్తే తిరుగుబాట్లు తలెత్తాల్సిన అవసరమే వుండదు. ప్రభుత్వాలు రాజ్యాంగ ఆదర్శాలను తుంగలో తొక్కినపుడే తిరుగుబాట్లు తలెత్తుతాయి. ఇది అందరికీ తెలిసిన సమాజ నియమం.
జాతియోద్యమ కాలంలోనే రాజకీయాల్లో రెండు స్రవంతులు ఏర్పడ్డాయి. మనం ఎంతగానో ఉద్వేగభరితంగా తలచుకునే భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, ఉధ్ధామ్ సింగ్ తదితరులది బాహాటంగా హింసామార్గం. గాంధీ, నెహ్రు, అంబేడ్కర్ లది అహింసామార్గం. వాళ్ళ మధ్య అభిప్రాయ బేధాలు, ఇతర వివాదాలు కూడ వుండవచ్చుగాక; వున్నాయి కూడ. అయితే, అంతిమంగా వాళ్ళది అహింసామార్గం. చాలామంది వాళ్ల మధ్య ఘర్షణను మాత్రమే చూస్తుంటారుగానీ ఐక్యతను చూడరు. ఇదొక సెలెక్టివ్ విజన్.
రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే పొరుగుదేశం చైనాలో రక్తపాత విప్లవం విజయవంతమై ఒక రకం సామ్యవాద సమాజం ఏర్పడింది. మనదేశంలో భారత కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట పంథాను కొనసాగిస్తున్నది. పైగా, అల్లూరి, భగత్ సింగ్ ల మీద ప్రజలకు ఆరాధనా భావం వుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాల పనితీరుతో విసిగిగిపోయిన ప్రజలు సాయుధులై తిరగబడే ప్రమాదాన్ని నివారించాలనేది భారత రాజ్యాంగ రచనకు ప్రధాన లక్ష్యంగా మారింది. రాజ్యాంగ రచనా కమిటి చైర్మన్ బిఆర్ అంబేడ్కర్ ఇదే విషయాన్ని ఇంకో పధ్ధతిలో చెప్పాడు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తరువాత ముందు రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధిస్తుంది. ఆ తరువాత, భావి ప్రభుత్వాలు ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలి అన్నాడు. పాలకులు అలా చేయకపోతే, వివిధ రంగాల్లొ కొనసాగుతున్న అసమానత్వానికి బాధితులైనవారు తిరగబడి ఏకంగా ‘ప్రజాస్వామ్య భవనాన్ని’ పేల్చేస్తారు అని హెచ్చరించాడు.
వివిధ రంగాల్లొ కొనసాగుతున్న అసమానత్వాన్ని రూపుమాపని ప్రభుత్వాలను మనం ఏమీ అనము. వాళ్ళు అసమానత్వాన్ని పెంచిపోషిస్తున్నా అభ్యంతరం చెప్పము. అసమానత్వం మీద తిరగబడే ప్రజల్ని మాత్రం దోషులుగా, దారితప్పినవారిగా, హింసావాదులుగా, నైరాశ్యంలో కూరుకుపోయినవారిగా నిందార్ధంలో చూస్తాము. మన ఆలోచనల్లో ఇదొక ద్వంద్వం.
. 19వ శతాబ్దం చివర్లో మద్రాసు- కలకత్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ నిర్మించడానికి, దారి కోసం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసుల్ని అడవి నుండి తరిమేసింది. రైలు పట్టాల కింద వేసే చెక్క స్లీపర్ల కోసం తూర్పుకనుమల్లోని అడవుల్ని విచక్షణా రహితంగా నరికి వేసింది. అడవిని కోల్పోయి రోడ్డు నిర్మాణ కూలీలుగా మారిన ఆదివాసుల్ని అణా (6 నయాపైసలు), అర్ధణా (3 నయాపైసలు) వేతనం ఇవ్వడానికి కూడ వేధించింది. అణిచివేత ఈ స్థాయికి చేరుకోవడంతో అత్యంత సహజంగానే మన్యంలో తిరుగుబాటు తలెత్తింది.
మన్యంకు వాయువ్య దిశలోనే బస్తర్ వుంటుంది. అక్కడా అప్పట్లో మన్యం వంటి తిరుగుబాట్లు సాగాయి. అక్కడా అల్లూరివంటి పోరాట వీరులు పుట్టుకొచ్చారు. అక్కడి ఆదివాసులు ఇప్పటికీ ఆ వీరుల్ని ఏడాదికి ఒకసారైనా తలుచుకుంటుంటారు. ఇప్పుడూ బస్తర్ లో వందేళ్ల నాటి వేధింపులు సాగుతున్నాయి. ఆదివాసుల్ని అడవుల నుండి తరిమేసి అటవీ సంపదనీ, ఖనిజ వనరుల్ని అస్మదీయ కార్పొరేట్లకు అప్పగించేందుకు ఒక మహాయజ్ఞం అక్కడ సాగుతోంది. ఆదివాసులకు అప్పుడూ అణిచివేత స్వీయ అనుభవం. ఇప్పుడూ స్వీయ అనుభవమే. తెల్లవాళ్ళ మీద తిరగబడడం న్యాయమేగానీ, నల్లవాళ్ల మీద తిరగబడడం అన్యాయం అని ఆదివాసులకు మన మైదానవాసులు హితవు చెపుతారా?
అల్లూరిని చంపినపుడూ ఇంగ్లండులో సహితం మారుమోగేలా అదొక మైలురాయి విజయం అంటూ చాలా గట్టిగానే వికటాట్టహాసం చేశారు ఇక్కడి బ్రిటీషు అధికారులు. భగత్ సింగ్ ను ఉరి వేసిన తరువాత 1931 ఏప్రిల్ 13 నాటి జనతా వార్తాపత్రికలో ’ముగ్గురు బాధితులు’ శీర్షికతో అంబేడ్కర్ ఒక వ్యాసం రాశాడు. న్యాయదేవత మీద భక్తివిశ్వాశాలతో వాళ్ళీ పని చేయలేదు; ఇంగ్లండ్ లోని కన్జర్వేటివ్ పార్టీ పెద్దల్నీ, అక్కడి మూర్ఖులయిన జనాన్నీ సంతృప్తిపరచడానికి ఒక బలిదానాన్ని ఉరికభం ఎక్కించారన్న వాస్తవం ఈ ప్రభుత్వానికే కాదు ; మొత్తం ప్రపంచానికి కూడ స్పష్టంగా తెలుసు అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇప్పుడు నంబాల కేశవరావును చంపి సరిగ్గా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు ఏలినవారు. ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం రాసేవాడో?
చరిత్ర ఒక ప్రహసనంగా పునరావృతం అవుతోందోలేదోగానీ, మన మధ్యనే మరో ప్రపంచం, మరో సమాజం, మరో జాతి, మరో తెగ కొనసాగుతున్నాయని గుర్తించకపోవడం మాత్రం మన కాలపు విషాదం.
రాజ్యాంగం తొలి ప్రతిలో ప్రజాస్వామ్యం అనే ఆదర్శం ఒక్కటే వుంది. దానికి మరింత వివరణ ఇస్తూ, దాని పరిధిని పెంచుతూ సామ్యవాద, మతసామరస్య రాజ్యాంగం అని పునర్ నిర్వచించుకున్నాము. ఆ తరువాత లెఖ్ఖ ప్రకారం ప్రజల కష్టాలు తగ్గిపోవాలి. కానీ, అలా జరగడంలేదు., రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నవారు, పార్లమెంటు భవనం మెట్లను ముద్దాడుతున్నవారు అనుక్షణం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు.
రాక్షసులు రాక్షసులుగానూ దేవతలు దేవతలుగానూ వుంటే సమాజం సులువుగా అర్ధం అవుతుంది. రాక్షసులు దేవతల రూపంలో తిరగడం మొదలెట్టినపుడే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది.
దేశ సంపదలో 70 శాతం కేవలం పది శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 40 శాతం సంపద ఒక్క శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 70 నుండి 80 శాతం జనాభా కేవలం 3 శాతం దేశ సంపదతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నది. రాజ్యాంగ ప్రకటిత ఆదర్శమయిన సామ్యవాదాన్ని ఇంతగా అపహాస్యం చేస్తున్నది ఎవరూ?
దేశంలో మతసామరస్యం గురించి ఇక చెప్పనక్కర లేదు. దేశంలోని ఒక సమూహాన్ని బాహాటంగా శత్రువర్గం జాబితాలో పడేశారు. ఒక చట్టాన్ని తెచ్చి వాళ్ళ పడక గదుల్లోనికి ప్రవేశించారు. ఇంకో చట్టాన్ని తెచ్చి వాళ్ళ పౌరసత్వాన్ని సంధిగ్ధంలో పడేశారు. మరో చట్టంతో వాళ్ళ ఆస్తి హక్కుని నిరాకరిస్తామన్నారు. వాణిజ్య కుడళ్ళ పక్కన హాకర్లు, చిరు వ్యాపారులుగా మారి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా సరే సహించలేక వాళ్ళ బతుకుల్ని బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అయినా, మతసామరస్యం అనే అక్షరాలు రాజ్యాంగంలో మెరుస్తూనే వున్నాయి. ఇంతటి వైరుధ్యాన్ని, బూటకాన్ని భరించడం మనుషులకు ఎక్కువ కాలం సాధ్యం కాకపోవచ్చు.
మైదాన ప్రాంతాల్లో ముస్లింలను భయపెట్టి కొత్త అస్పృశ్యులుగా మార్చాలనీ, అడవుల్లో ఆదివాసుల్ని తుడిచి పెట్టేయాలనీ ఏలినవారు ఒక ధృఢ నిశ్చయంతో వున్నట్టు ఇప్పుడు అందరికీ స్పష్టంగానే కనపడుతోంది. చర్యల మీద మనకు అభ్యంతరాలు లేనపుడు ప్రతిచర్యల మీద మాత్రమే అభ్యంతరాలుండడం సబబుకాదు.
బస్తర్ ఆదివాసులు మావోయిస్టులుగా మారాలని ఏమీ అనుకోలేదు. అణిచివేతను అడ్డుకోవాలనుకున్నారు. అందుబాటులో మావోయిస్టులు వున్నారుగాబట్టి వాళ్లలో చేరారు. రేపు మరొకరితో చేతులు కలపవచ్చు. ఆయుధాలను చేపట్టడాన్ని తప్పుపడుతున్నవాళ్ళు అణిచివేతనూ తప్పుపట్టాలి. లేకుంటే మనలోనే ఏదో తప్పు వున్నట్టు లెఖ్ఖ.
నారాయణపూర్ మృతుల ఫొటోల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు సర్వత్రా అవి అందుబాటులో వున్నాయి. వాళ్ళ తలల్లో తుపాకుల బాయినేట్లను గుచ్చినట్టు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. పొరుగుదేశం నుండి వచ్చి పెహల్గాంలో యాత్రికుల మీద భీభత్సాన్ని సృష్టించిన ఉగ్రవాదుల ఫొటోల్ని ప్రభుత్వం ఇలా విడుదల చేస్తుందని చాలా మంది ఆశించారు. కానీ, ప్రభుత్వం బస్తర్ ఆదివాసుల ఫొటోలు విడుదల చేసింది. ఇదొక వైచిత్రి.
రాజ్యాంగం చెడ్డదయినాసరే అమలు చేసేవాడు మంచోడయితే అది మంచిదయిపోతుంది. రాజ్యాంగం మంచిదయినాసరే అమలు చేసేవాడు చెడ్డోడయితే అది చెడ్డదయిపోతుంది అని అంబేడ్కరే అన్నాడు. పార్లమెంటు అనే దేవాలయాన్ని నిర్మించి అందులో రాజ్యాంగమనే దేవతను ప్రతిష్ఠించాలనుకుంటే ముందే దాన్ని దెయ్యాలు ఆక్రమించుకున్నాయని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అవకాశం వస్తే తానే ఈ రాజ్యాంగాన్ని తొలుత తగులబెడతానని 1950లలోనే అన్నాడు. ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం చేసేవాడో? దెయ్యాలు, భూతాలు కన్నా పెద్ద పదాల్ని ప్రయోగించేవాడు. తగులబెట్టడంకన్నా పెద్ద పనే చేసి వుండేవాడు.
23 మే 2025
ప్రచురణ : ఆంధ్రజ్యోతి
24 మే 2025
https://www.andhrajyothy.com/2025/editorial/maoist-insurgency-violence-and-constitution-challenges-1407915.html
https://epaper.andhrajyothy.com/Hyderabad?eid=34&edate=24/05/2025&pgid=1076701&device=desktop&view=2
No comments:
Post a Comment