Wednesday, 28 May 2025

The only winning formula - 20:80 !

 *ఒక్కటే గెలుపు ఫార్మూలా - 20:80  !*

 

నా వ్యాసాన్ని ఈ రోజు సాక్షి దినపత్రిక ప్రచురించింది.

సాక్షి యాజమాన్యానికి, ఎడిటర్ గారికి, ఎడిట్ పేజి నిర్వాహకులకు ధన్యవాదాలు.

 

ఈ వ్యాసం చదివి మీ అభిప్రాయాల్ని  తెలిపితే  ఆనందిస్తాను.

మీ

-        డానీ

    


                      

          ఎన్నికలకు ముందు కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం, కొత్త రాజకీయ కూటములు ఏర్పడడం ఆనవాయితి.  ఈసారి ఎందుకోగానీ లోక్ సభ ఎన్నికలు ముగిసి పూర్తిగా ఏడాది కాకుండానే వచ్చే ఎన్నికల గురించి చర్చ మొదలైంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఆశించిన మేరకు  పనిచేయడం లేదని ప్రజల్లో అప్పుడే ఒక అసంతృప్తి మొదలయినట్టుంది.  

          మనకు తెలిసిన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల పార్టీలే.  కొందరు వాటిని గొప్పగా పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథా అనుకోవచ్చు. అప్పట్లో పీపుల్స్ వార్, ఇప్పట్లో సిపిఐ-మావోయిస్టు పార్టి ఒక్కటి మాత్రమే దీనికి భిన్నంగా వుంటూ వచ్చింది. అది తన పరిథి పరిమితుల్లో  సాయుధపోరాట పంథాను కొనసాగిస్తూ వుండేది. ప్రస్తుతం దాని భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. మావోయిస్టు పార్టి కూడ ఎన్నికల పంథాను స్వీకరించవచ్చు అనే ఊహాగానాలు అప్పుడే వినిపిస్తున్నాయి. 

          స్వాతంత్ర్యానంతర కాలపు  తొలి దశ రాజకీయాలు వేరు. అవి ఎంతోకొంత సిధ్ధాంతపరంగా వుండేవి. వాటి ఆర్ధిక విధానాలు కూడ ఆదర్శవంతంగా వుండేవి. ఇటు వ్యవసాయరంగంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ ఉత్పత్తిని పెంచడానికి భారీ ప్రాజెక్టుల్ని నిర్మించడం మీద కాంగ్రెస్ దృష్టి పెట్టేది. ఇటు వ్యవసాయ రంగంలో రైతు కూలీలు, అటు పారిశ్రామిక రంగంలో శ్రామికుల  శ్రేయస్సు  దిశగా కమ్యూనిస్టు పార్టీల కృషి సాగుతుండేది.  

          రాజకీయాల్లో కులమతాలకు ఒక పాత్ర, పెట్టుబడికి ఇంకో పాత్ర వుంటుంది. మన ఆలోచనాపరులది ఒంటికన్ను వ్యవహారం. కులమతాల్ని  చూసేవాళ్లు పెట్టుబడిని చూడలేరు; పెట్టుబడిని చూసేవాళ్లు కులమతాల్ని చూడలేరు. నిజానికి ఎన్నికల్లో కులమతాలకన్నా పెట్టుబడి ప్రభావమే ఎక్కువగా వుంటుంది. ఎప్పుడయినాసరే పెద్ద పెట్టుబడి  చిన్న పెట్టుబడుల్ని తన వైపుకు లాక్కుంటుంది. రాజకీయ కూటములు అలాగే ఏర్పడుతుంటాయి. 

          దేశ తొలి ఎన్నికల్లో ప్రధాని నుండి  రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు దాదాపు అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం నుండే ఎన్నికయ్యారు. ఆ తరువాత వ్యవసాయిక కులాల్లో పెట్టుబడి పెరిగింది. సహజంగానే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనికి మారింది. ఆ తరువాత వెనుకబడిన తరగతుల్లోనూ పెట్టుబడి పోగవడం మొదలయింది. వాళ్ళూ కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులయ్యారు. 

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఎస్సీ బిసిలకు అధికారం వచ్చిందనడం అర్ధసత్యం మాత్రమే. ఎస్సీ, బిసీ కులాల్లొ పెట్టుబడి ఎక్కువగా పోగయిన కులాలకు, కుటుంబాలకు మాత్రమే అధికారం దక్కుతుంది. కులమతాలకూ, పెట్టుబడికి వున్న సంబంధాన్ని అర్ధం చేసుకోకపోతే వర్తమాన రాజకీయాలు అర్ధం కావు. 

1991లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్ పిజి) ఆర్ధిక విధానాలు వచ్చాక రాజకీయాలు ఫక్తు వాణిజ్య వ్యవహారంగా మారిపోయాయి. కొంతకాలం ఆశావహులుగా కొనసాగిన ఎస్సీ, బీసీ రాజకీయ పార్టీల్ని వాణిజ్య రాజకీయాలు గట్టిగా దెబ్బతీశాయి. స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేసుకుని బతికిన ముస్లిం సమూహానికి ఆర్ధిక పునాది బీటలు వారడంతో ప్రేకషక పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. 

పైకి ఎంత వైవిధ్యపూరితంగా కనిపించినా సమస్త రాజకీయ పార్టీల గెలుపు మంత్రం  ఒక్కటే; 20 : 80!. 20 శత్రువర్గం; 80 మన వర్గం. 20 వాళ్ళు; 80 మనం! 

ఓటర్లలో 20 శాతంగా వుండే రాజవంశీకులు , బడా భూస్వాములకు తాను వ్యతిరేకం అని కాంగ్రెస్ చెప్పుకునేది. మిగిలిన 80 శాతం ఓటర్లను ఎన్నికల్లో ఆకర్షించడానికి ఆ పార్టి ప్రయత్నించేది. అది క్యాచ్ మెంట్ ఏరియా; ఆరగాణి ప్రాంతం. అందులో సగం ఓట్లు పడినా విజయం తథ్యం. మరోవైపు కమ్యూనిస్టు పార్టిలు కూడ ఓటర్లల్లో 20 శాతంగా వుండే పెట్టుబడీదారులు, భూస్వాములకు తాము వ్యతిరేకులమనీ, 80 శాతంగా వుండే కార్మికులు, వ్యవసాయకూలీలకు తాము రక్షకులమని చెప్పుకునేవారు. 1990వ దశకంలో బహుజన రాజకీయాల్ని ముందుకు తెచ్చిన  కాన్షీరామ్ కూడ దేశంలో పెత్తందారీ కులాలు 20 శాతం మాత్రమేననీ, 80 శాతం మంది బహుజనులని మరీ లెఖ్ఖలు కట్టి చెప్పేవారు. 

భారతీయ జనతా పార్టీది కూడ సరిగ్గా అదే వ్యూహం. దేశంలో 20 శాతం మాత్రమే హిందూయేతరులు; 80 శాతం హిందువులు అనేది దాని విభజన. మనుషులకుండే సమస్త భావోద్వేగాల్లో మతం చాలా శక్తివంతమైనది. ఈ 80 శాతం హిందువుల్లో 36 శాతం ఓట్లు పడినా అధికారం ఖాయం అని గత మూడు ఎన్నికల్లో బిజెపి నిరూపించింది. 

మతభావోద్వేగాలనీ, కార్పొరేట్ శక్తుల్ని, రాజకీయ అధికారాన్నీ మిళితం చేయడంలో బిజెపి గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ఇప్పుడు బిజెపిని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాల్ని రచించడానికి దాదాపు అన్ని పార్టీలు తలలు పగలగొట్టుకుంటున్నాయి. బిజేపి నాయకత్వంలో కొనసాగుతున్న కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి ఓటర్లలో 80 శాతంను ఏకం చేసే బైడింగ్ వైర్ ను కనిపెట్టడం అంత సులువుకాదు.  

కమ్యూనిస్టులు, అంబేడ్కరైట్లు  ఏకం అయితే (లాల్ నీల్ మైత్రి)  బిజెపిని నిలవరించవచ్చు అనేది ఒక ఆలోచన. 2019 ఎన్నికల్లో దీన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో అమలు చేశారు. మొత్తం రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడ దక్కలేదు.  ఓటర్లు తిరస్కరించారు. 

మరోవైపు, ఒక వ్యూహం ప్రకారం అంబేడ్కర్ ను బిజెపి క్రమంగా హైజాక్ చేసింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిఎస్పి అధినేత్రి మయావతి ఉత్తరప్రదేశ్ లోనే ఉనికిని కోల్పోయింది. 403 స్థానాలున్న యూపి అసెంబ్లీలో ఆ పార్టికి ఒక్క స్థానం మాత్రమే దక్కింది.  దాదాపు మూడున్నర దశాబ్దాలు నిరాఘాటంగా పశ్చిమ బెంగాల్ ను ఏలిన సిపియం  2021 ఎన్నికల్లో  తనకున్న 26 సీట్లనూ కోల్పోగా బిజేపి అదనంగా 74 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టుల స్పేస్ ను కూడ బిజెపి ఆక్రమించుకుంటున్నది అనడానికి ఇదొక ఉదాహరణ.    

అంబేడ్కరైట్లు, కమ్యూనిస్టులు కొత్తగా ఆదివాసులు, మైనారిటీలతో (లాల్ నీల్ హర్యాలి) కలిసి నడిస్తే ఎమైనా మెరుగైన ఫలితాలు వస్తాయా? అనేది ఒక కొత్త ఆలోచన. ముందు అలాంటి కూటమి ఏర్పడాలి. అంత పెట్టుబడి సమకూరాలి.  ఆ తరువాత అది ఎన్నికల్లో పనిచేయాలి. వచ్చే ఎన్నికల వరకు ఇంకే మార్పులు వస్తాయో చూడాలి. 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

90107 57776 

రచన : 25 మే 2025

ప్రచురణ:  సాక్షి, 29 మే 2025

No comments:

Post a Comment