*నయా అర్బన్ నక్సలైటు నరేంద్ర మోదీ!*
* అర్బన్ నక్సలైటుగా మారిన మోదీ!*
* మోదీ అర్బన్ నక్సలైటు అవతారం!*
*డానీ*
*సమాజ విశ్లేషకులు*
ప్రేమ,
యుధ్ధం, రాజకీయాలు. వీటిల్లో ఎప్పుడయినా ఏమైనా జరగవచ్చు. కులగణన కోరుతున్న రాహుల్
గాంధీని అర్బన్ నక్సలైట్ అంటూ విమర్శిస్తున్న
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వారే అర్బన్
నక్సలైటు అవతారం ఎత్తారు. దేశమంతటా కులగణన జరుపుతామని ప్రకటించారు. ఇలాంటి బోల్ట్
ఫ్రం ద బ్లూ పరిణామాలు బిజెపిలో చాలా వుంటాయి.
కులం
భారత సమాజపు ప్రత్యేక లక్షణం. అది అందరికీ తెలుసు. అయితే, దానితో వ్యవహరించడం అంత
ఈజీ కాదు. భారత సమాజాన్ని కుల ప్రమాణాలతో విశ్లేషిస్తే వర్గం గొంతులో అడ్డుపడుతుంది.
వర్గ ప్రమాణాలతో విశ్లేషిస్తే కులం అడ్డుపడుతుంది. కులవర్గమత ప్రమాణాలతో
విశ్లేషించాలి అనడం సులువేగానీ దాని విధివిధానాలు ఇప్పటికీ సరిగ్గా రూపొందలేదు. స్వాతంత్ర్యం
వచ్చాక గడిచిన 78 సంవత్సరాల్లో 14 మంది ప్రధానులు మారారుగానీ ఒక్కరూ కులగణన జరపడానికి సాహసించలేదు.
బ్రిటిష్
ప్రభుత్వంలో జనాభా లెఖ్ఖల కమీషనర్ గా వున్న జె.హెచ్. హట్టన్ 1931లో తొలిసారిగా
మనదేశంలో కులగణన నిర్వహించాడు. అదే చివరిసారి కూడ. మన్మోహన్ సింగ్ ప్రధానిగా
వుండగా కేంద్ర గ్రామీణాభివృధ్ధి శాఖ 2011లో సామాజిక, ఆర్ధిక, కుల గణన (SECC)
నిర్వహించింది. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో ఆ నివేదికను బయటికి
రాకుండా నిలిపివేశారు. చాలా మందికి గుర్తించని విషయం ఏమంటే; మనం ఇప్పటికీ తొంభైయేళ్ళ క్రితపు
గణాంకాల ఆధారంగానే దేశ జనాభాలో కులాల
శాతాల గురించి మాట్లాడుతున్నాము.
జనాభా
లెఖ్ఖల్లో ఎస్సీ, ఎస్టిల వరకు వివరాలు సేకరిస్తుంటారు. అది కూడ 2011 తరువాత
ఆగిపోయింది. వెనుకబడిన తరగతులు, ముస్లిం సామాజికవర్గాల సంఖ్య, శాతాల విషయంలోనే
తరచూ అనేక ఉహాగానాలు, వివాదాలు చెలరేగుతుంటాయి.
ముస్లిం
జనాభా అతి వేగంగా పెరిగిపోతూ సమీప భవిష్యత్తులో ఇండియా ఒక ఇస్లామిక్ దేశం గా
మారిపోతుందని సంఘపరివారం తరచూ ఒక ప్రచారం
చేస్తుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
కాంగ్రెస్ పార్టి 2005లో ముస్లిం
సమాజంలోని వెనుకబడిన తరగతులకు బిసి-ఇ జాబితాలో 4 శాతం రిజర్వేషన్ కల్పించినపుడు
పెద్ద దుమారం రేగింది. ముస్లిం బిసిల
జనాభా అంత లేదంటూ సంఘపరివారవర్గాలు
హైకోర్టును ఆశ్రయించాయి. జనాభా గణాంకాలను శాస్త్రీయంగా సేకరించకుండా రిజర్వేషన్
కల్పించారని ఆరోపించాయి. న్యాయస్థానం కూడ ఆ ఆరోపణని పరిగణన లోనికి తీసుకుంది.
కానీ, జనాభా గణాంకాలను శాస్త్రీయంగా ఎలా సేకరించాలో మాత్రం ప్రభుత్వానికి
సూచించలేదు.
ఓబిసిలకు
రాజ్యాంగం తొలి ప్రతిలో రిజర్వేషన్ లేదు.
తమిళనాడులో నిరసనలు చెలరేగాక, సుప్రీం కోర్టు జోక్యంతో రాజ్యాంగానికి తొలి సవరణగా ఆర్టికల్
15 (4) చేర్చి రాష్ట్రాల స్థాయిలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అయితే,
కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ సౌకర్యం కల్పించలేదు.
ఓబిసిలు
సామాజిక, విద్యా, ఆర్ధిక రంగాల్లో ఎదుర్కొంటున్న వివక్ష, వెనుకబాటుతనం, పేదరికాలను
తొలగించడానికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి 1979
జనవరి 1న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి బిపి మండల్ కమీషన్ వేశారు. దేశ జనాభాలో ఓబిసిలు 54 శాతం
వున్నారని మండల్ కమీషన్ తేల్చింది. వారికి కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ
సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. ఆ సిఫార్సుల్ని ఓ దశాబ్దం తరువాత 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని
విపి సింగ్ ఆమోదించారు.
ఓబిసిలకు రిజర్వేషన్ కల్పించడం సహించలేని ఆధిపత్య కులాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాయి. వాళ్ళ
సంతతి వీధి పోరాటాలు నడిపింది. ఉత్తర భారతదేశంలో నిరసన జ్వాలలు చెలరేగాయి.
1984
లోక్ సభ ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుని పార్లమెంటులో ప్రవేశించిన బిజెపి, 1989 ఎన్నికల్లో బాగా పుంజుకుని 85 స్థానాలకు
చేరుకుంది. ఆ పార్టి తన రాజకీయ భవిష్యత్తును ఆధిపత్య కులాల నిరసనల్లో
గుర్తించింది. ‘మండల్ కు వ్యతిరేకంగా కమండలం’ చేపట్టి రామ్ రథయాత్ర మొదలెట్టింది. ఇందులో బిజెపికి నాలుగు లక్ష్యాలున్నాయి. మొదటిది; రాజకీయ రంగంలో
ఆధిపత్య కులాల ప్రతినిధిగా ప్రకటించుకోవడం. రెండోది; ఓబిసిలకు రిజర్వేషన్
కల్పించిన విపి సింగ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం. మూడోది; ముస్లింల నుండి
హిందూమతానికి ముప్పు పొంచి వుందని ప్రచారం చేయడం. నాలుగోది; దేశంలోని ఓబిసి తదితర
బహుజనుల దృష్టిని రిజర్వేషన్ల నుండి అయొధ్య శ్రీరాముని వైపు మళ్ళీంచడం. రామ్
రథయాత్ర పెట్టుకున్న లక్ష్యాల్లో కొన్నింటిని పూర్తిగా కొన్నింటిని పాక్షికంగా సాధించింది.
సంఘపరివారం
రోడ్ మ్యాప్ లో 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేతతో ఒక ఘట్టం ముగిసింది. ఆ
మహాసంస్థ తను చేపట్టిన ‘పవిత్ర యుధ్ధం’లో హిందూ
ఎస్టి, ఎస్సి, బిసిలలో చెప్పుకోదగ్గ భాగాన్ని తన కాల్బలంగా మార్చుకోగలిగింది. ఈ
పరిణామం 2002 నాటి గుజరాత్ అల్లర్లలో స్పష్టంగా కనిపించింది.
సంఘపరివారం
కులాలను గుర్తించదు. హిందూసమాజం మొత్తం ఒకే మతం అనేది దాని సిధ్ధాంతం. ఈ సిధ్ధాంతానికి
ప్రభావితులైన ఎస్టి, ఎస్సి, బిసి నేతలు కొందరు బిజెపికి తమ శక్తిమేర సేవలు
అందించారు. వారిలో ప్రముఖ అంబేడ్కరైట్లు కూడ వున్నారు. రాడికల్ అంబేడ్కరైట్లు,
రాడికల్ ఫూలేయైట్లు కులాన్ని ప్రధాన వైరుధ్యంగా భావిస్తారు. వాళ్లు సంఘపరివారాన్ని
గట్టిగా వ్యతిరేకిస్తారు.
బయటి
ప్రపంచానికి అంతగా తెలియదుగానీ ఆదివాసుల్లో
తండాకు ఒక మతం వుంటుంది. మరింత
లోతుకు వెళితే ఒక్కో సమూహానికి ఒక్కో మత విశ్వాసం వుంటుంది. ఇప్పుడు జనాభా
లెఖ్ఖల్లో ఆ వైవిధ్యాన్ని పూర్తిగా తొలగించేశారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవం, శిక్కు,
బౌద్ధ జైన మతాల్లో ఏదో ఒకదాన్ని ఆదివాసులు ఎంచుకునేలా జనాభా లెఖ్ఖల చట్టాన్ని
సవరించారు.
భారత
ముస్లింసమాజంలో కూడ శాఖ, కుల వర్గీకరణ తెచ్చి ‘సున్నీ అష్రాఫ్’లకు
వ్యతిరేకంగా షియా, సున్నీ బిసి, ఎంబిసిలను దగ్గరికి
చేర్చుకోవడానికి ఒక దశలో బిజెపి ప్రయత్నించింది. అది ‘పవిత్రయుధ్ధం’ ఫార్మూలాకే
ముప్పుగా మారుతుందని భయపడి ఆ కాడిని దించేసింది.
బ్రిటీష్ పాలకులు నేరస్మృతిని ఇంగ్లండు నుండి
తెచ్చారుగానీ పౌరస్మృతిని ఇక్కడి స్థానికుల్నే ఎంచుకోమన్నారు. బెంగాల్ గవర్నర్
జనరల్ గావున్న వారెన్ హేస్టింగ్స్ 1772లో హిందూ ప్రతిధుల కోరిక మేరకు మనుధర్మాన్ని
పౌరస్మృతిగా ప్రకటించాడు. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించిన
బిఆర్ అంబేడ్కర్ ఇక మనుసృతికి కాలం చెల్లింది అని ప్రకటించడం సంఘీయులకు బాగా ఆగ్రహాన్ని
తెప్పించింది. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోనికి రాగా, ఆ వెంటనే వచ్చిన
ఆర్గనైజర్ ఫిబ్రవరి 6 సంచిక "మనువు మన హృదయాలను పాలిస్తుంటాడు" అని
ప్రకటించింది.
హిందూ
ఎస్సి, బిసి, ఎస్టిలను మత ప్రాతిపదిక మీద తమకు దగ్గరగా తీసుకొని ఓటు బ్యాంకును
పెంచుకోవాలనుకుంటున్న సంఘీయులు అంబేడ్కర్
ను వ్యూహాత్మకంగా స్వంతం చేసుకుంటున్నారు. అంబేడ్కర్ రచనల్ని వాళ్ళు ఆరు భాగాలుగా
విభజిస్తున్నారు.
మొదటిది;
మనుస్మృతి, కులఅణిచివేత మీద అంబేడ్కర్
చేసిన ఘాటైన విమర్శను దాచి పెడతారు. లేదా, వర్ణం తప్ప కులం అనేది అస్సలు హిందూ
సాంప్రదాయమే కాదనే వాక్యంతో అంబేడ్కర్ ఆరోపణలన్నింటినీ తేలిగ్గా కొట్టిపడేస్తారు.
రెండవది;
ఇస్లాం, ముస్లింల మీద కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంబేడ్కర్ చేసిన విమర్శల్ని తమ
పవిత్ర యుధ్ధానికి అనుకూలంగా వాడుకుంటారు.
మూడవది;
గాంధీ అంబేడ్కర్ల మధ్య సాగిన వివాదాలకు ఎక్కువ ప్రచారం కల్పించి ఎస్సి, ఎస్టి,
బిసిలు జాతీయ కాంగ్రెస్ కు దగ్గర కాకుండ చూసేందుకు వాడుతారు.
నాలుగవది;
కమ్యూనిస్టు పార్టిల్ని అంబేడ్కర్ తన ప్రధాన శత్రువులని భావించేవారని
విస్తృతంగా ప్రచారం చేసి ఎస్సి, ఎస్టి, బిసిలు మార్క్సిజానికి ఆకర్షితులు కాకుండా జాగ్రత్తలు
తీసుకుంటారు.
ఐదవది;
కుల వివక్ష రద్దుకు అంబేడ్కర్ చూపిన పరిష్కారాల్ని మెచ్చుకుంటూ ఆయన్ని హిందూమత
సంస్కర్తగా కొనియాడుతారు. అంబేడ్కర్ పేరులోనే రాముడు (రాంజీ) వున్నాడని ఈమధ్య ప్రత్యేకంగా పేర్కొంటున్నారు.
శ్రీరాముడ్ని విశ్వసించే ఎస్సీ, బిసిల మీద ఈ మాటలు బాగా పనిచేస్తాయి.
ఆరవది;
రాజ్యాంగం మన దేశానికి అంబేడ్కర్ ఇచ్చిన ప్రసాదమని పేర్కొనడమేగాక, ఇప్పుడు
రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతారు. తాము ఏది చేసినా రాజ్యాంగానికి విధేయులమై వుంటున్నామని
బుకాయిస్తారు.
ఇంతటి
ప్రచార హోరుతో ప్రజల్ని సంఘ్ పరివారం వశీకరిస్తున్నా
సమస్త రంగాల్లో కులవివక్ష అనే కఠిన వాస్తవం
బహుజనుల్ని ఎప్పుడో ఒకప్పుడు మెలుకువ వచ్చేలా చేస్తుంది. అప్పుడు వాళ్లు కులగణన
జరిపించమని తప్పక అడుగుతారు. పైగా, రాహుల్ గాంధీ రోజుకు ఒకసారి ‘జిస్కే జిత్నీ
భాగేదారీ ఉస్కే ఉత్నీ హిస్సేదారి’ (ఎవరి జనాభా ఎంతో సంపదలో వారికి అంత’) అని
నినదిస్తున్నారు.
అసెంబ్లీ
ఎన్నికల భయంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరికన్నా ముందుగా కులగణన చేపట్టారు.
వెనుకబడిన తరగతులు 27 శాతం, అతి వెనుకబడిన తరగతులు 36 శాతం, ఎస్సిలు 20 శాతం అని బీహార్
ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు ముంపు నీరు బిజెపి కాళ్ళ కిందికి వచ్చింది. ఆ పార్టి
ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అవతారం ఎత్తక తప్పలేదు.
ఈ
అర్బన్ నక్సలైట్ సిధ్ధాంతం ఒక విధంగా అంబేడ్కర్ దే. రాజకీయ రంగంతోపాటు సామాజిక,
ఆర్ధిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించకపోతే ప్రజలు తిరగబడతారని అంబేడ్కర్
సాక్షాత్తు రాజ్యాంగ సభలోనే హెచ్చరించాడు. రాజకీయాల్లో ఎస్టి రాష్ట్రపతిని చూసి అడవిలో
ఆదివాసులు, బిసి ప్రధానిని చూసి
మైదానాల్లో బిసిలు సంతృప్తి పడిపోరు.
వాళ్ళకు సాంఘీక, ఆర్ధిక సమానత్వం కావాలి. అదీ అసలు విషయం. వాళ్ళను అడవి
నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అని ఎద్దేవ చేయవచ్చుగానీ అది పరిష్కారం కాదు. పిక్చర్
అభి బాఖీ హై!
5 మే 2025
No comments:
Post a Comment