Friday, 23 May 2025

ఆ రకమైన గణన జరపాలి !

ఆ రకమైన గణన జరపాలి !

డానీ

సమాజ విశ్లేషకులు  


కులగణన డిమాండును మొదటి నుండీ చాలా తీవ్రంగా నిరాకరిస్తూ వస్తున్న బిజేపి ఇప్పుడు తానే ఆ పని చేస్తాను అంటోంది. ఒకవేళ ఎన్నికల్లో లబ్ది కోసమే తన విధానాన్ని మార్చుకుందనుకున్నా సరే ఇది గొప్ప నిర్ణయం. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం  తప్పక  మెచ్చుకోవాలి. 


అయితే,  సామాజిక న్యాయం దిశగా చేసే ప్రయాణంలో కులగణన అనేది తొలి అడుగు మాత్రమే. ఇది ఒక పరికరమేగానీ పరిష్కారం కాదు; సాధనమేగానీ సమాధానం కాదు. రాజకీయార్ధిక సామాజిక రంగాల్లో సమానత్వాన్ని సాధించడానికి చాలా పెద్ద కసరత్తు చేయాలి. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కొలవడానికీ,  అందులోని అపార వైవిధ్యాన్నీ, సంక్లిష్టతను అర్ధం చేసుకోవడానికీ కులగణన ఒక్కటే సరిపోదు. రాజకీయార్ధిక, సామాజిక, కులమత గణన (PESRCC)) జరగాలి. 


కులగణన వల్ల దేశంలో ఏ కులస్తులు ఎంతమంది వున్నారో తెలుస్తుంది. ప్రభుత్వంలోనో ప్రభుత్వరంగ సంస్థల్లోనో ఈ కులాలన్నింటికీ  ఎంతెంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రభుత్వానికి నిజాయితీ వుంటే ఈ కేటాయింపుల్ని వెంటనే అమలు చేయనూవచ్చు. కానీ, అలాంటి కార్యక్రమం ప్రభుత్వానికి వున్నట్టు లేదు. 


ఆర్ధికంగా మెరుగైన స్థితిలో వున్న కులాలే రిజర్వేషన్ అవకాశాలను దక్కించుకోగలుగుతాయనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది హిందూ సమాజానికేకాక ముస్లిం సమాజానికి కూడ వర్తిస్తుంది. ఇక ముందు ఓసి, బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలు వంటి అమూర్త, సామూహిక ఉనికిలు వుండవు. చాకలి, సాలె, వడ్రంగి, లద్దాఫ్. నూర్ బాషా, సంబన్, రెల్లి వంటి నిర్దిష్ట కులాలు మాత్రమే వుంటాయి. ఇటీవల ఎస్సీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇక ముందు ఈ వర్గీకరణ  కూడ వుండదు. ప్రతి కులానికీ  వాళ్ళ జనాభా   ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వాల్సి వుంటుంది. జిస్కే జిత్నీ ఉస్కే ఉత్నీ. 


దేశంలో ముస్లిం సమాజం మీద సాగుతున్న వివక్ష మరీ క్రూరంగా తయారయ్యింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో నయా అస్పృశ్యులుగా మార్చేశారు. కొన్ని కీలకమైన ఉద్యోగాలను వారికి నిషేధంగా మార్చారు. వాళ్ళ చేతివృత్తుల్ని, వ్యాపారాలని, ఓలా, ఊబర్, స్వీగ్గీ,  జమాటో వంటి చిరు ఉద్యోగాలను సహితం బహిష్కరించాలంటూ ఏలినవారి కాల్బలం  ప్రకటనలు చేస్తున్నది. రోడ్డు పక్కన జీవనాధారాన్ని ఎంచుకున్న చిరువ్యారుల్ని హింసిస్తున్న  వీడియోలు సోషల్ మీడియాలో  నిత్యం మనం చూస్తున్నాం.   


ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్య రీత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా ప్రైవేటుపరం అయిపోతున్నాయి. అంటే, అక్కడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. అప్పుడు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండు సహజంగానే ముందుకు వస్తుంది. దానికి ప్రభుత్వం సిధ్ధమా? కార్పొరేట్లను ప్రభుత్వం ఒప్పించ గలుగుతుందా? 


దేశ సంపద ఏ సమూహాల్లో తగ్గిపోతున్నది, ఏ సమూహాల్లో పోగవుతున్నది అనేది ప్రాణప్రదమైన అంశం. టెలీకమ్యూనికేషన్స్,  ఐటి, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌళికరంగ నిర్మాణాలు, ఇ-కామర్స్, డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్, ఆయిల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గనులు, సహజవనరులు, కార్పొరేట్ విద్యా సంస్థలు తదితర రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది.  వీటి యాజమాన్యంలో సమస్త కులాలకు స్థానం కల్పిస్తారా? అణగారిన సమూహాలను ఎప్పటిలానే సేవకులుగా కొనసాగించి ప్రాతినిధ్యం కల్పించాము అంటారా?   


వర్తమాన భారత దేశంలో రెండు పరస్పర విరుధ్ధ పరిణామాలు ఒకే సందర్భంలో సాగుతున్నాయి. ఒకవైపు, సంపద వేగంగా పెరుగుతోంది; మరోవైపు; పేదరికం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనా ప్రకారం 2025 సంవత్సరంలో భారత స్థూల జాతియోత్పత్తి (GDP) నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను మించుతుంది. త్వరలో జర్మనీని అధిగమిస్తుంది. ట్రిలియన్ అంటే లక్ష కోట్లు కనుక మన కరెన్సీలో 379 లక్షల 80 వేల కోట్ల రూపాయలు.    


ఆక్స్ ఫాం సంస్థ ఇటీవల ప్రకటించిన ‘ఇండియా రిపోర్టు – 2024’లో దిగ్రాం్నతి కలిగించే అనేక అంశాలున్నాయి. మొత్తం జాతీయ సంపదలో 70 శాతం ఓ పది శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 40 శాతం జాతీయ సంపద కేవలం ఒక్క శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 50 శాతం జనాభాకు జాతీయ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే దక్కుతున్నదట. అంటే పేదరికం ఏ స్థాయిలో వున్నదో అంచనా వేయవచ్చు. 


సంపద పంపిణిలో అసమానత్వం అత్యధికంగా వున్న దేశాల్లో ఇండియా ఒకటి. విచిత్రం ఏమంటే, మన రాజ్యాంగ ఆదర్శాల్లో సామ్యవాదం కూడా వుంది. 39వ అధీకరణం భౌతిక వనరుల పంపిణీలో సమానత్వాన్ని  పాటించాలని ఆదేశిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచాలని రాజ్యాంగం అదేశిస్తున్నదంటూ  రెండేళ్ళ క్రితం బిజెపి చాలా హంగామా చేసింది. ఆటు ఆదేశిక సూత్రాల్లోనేగాక, ప్రధాన ఆదర్శాల్లోనూ వున్న సామ్యవాదం గురించి మాత్రం ఆ పార్టి మాట్లాడడంలేదు. 

7 మే 2025

ప్రచురణ ః సాక్షి 

17 మే 2025 

No comments:

Post a Comment