Sunday, 22 February 2026

‘సైనిక ఓటమా? సైధ్ధాంతిక వైఫల్యమా?’

 

‘సైనిక ఓటమా? సైధ్ధాంతిక వైఫల్యమా?’

 

డానీ

సామాజిక–రాజకీయ విశ్లేషకులు

సీనియర్ జర్నలిస్టు.

 

          నడుస్తున్న చరిత్రలో మనం ఊహించని విచిత్రాలు అనేకం జరుగుతుంటాయి. పోరాట సంసిధ్ధత తగ్గినపుడో, విప్లవ విజయం మీద నమ్మకం సన్నగిల్లినపుడో నక్సలైట్లు లొంగిపోవడం సహజం. అలాంటి సంఘటనలు గతంలో అనేకం వున్నాయి. అలా లొంగిపోయినవాళ్ళు ముఖం చాటేసి ప్రధాన స్రవంతికి దూరంగా బతికేవారు. ఇప్పుడు కాలం మారింది. సరళీకృత ఆర్ధిక విధానం కొనసాగుతోంది. లొంగిపోయేవారు ఒక జాతరలా ఉత్సవాలు జరుపుతున్నారు. ఆ తరువాత, సభలు పెట్టి తాము చేసిన ఘనకార్యాన్ని గొప్పగా ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం వస్తుందని నినదించినవాళ్ళు ఇప్పుడు తుపాకుల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ద్వారానే విప్లవం వస్తుందని ఉపదేశిస్తున్నారు.   ఇప్పుడు మావోయిస్టు పార్టి కేంద్ర కమిటి కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ వంతు వచ్చింది.

 

          పీపుల్స్ వార్ కేంద్ర కమిటి కార్యదర్శిగా పనిచేసిన కెజీ సత్యమూర్తి 1990లో అజ్ఞాత జీవితం నుండి బయటికి వచ్చి లీగలైజ్ అయిపోయారు. వారు లొంగుబాటు క్రతువును పాటించలేదు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్య 1995లో జైలు నుండి విడుదల కావడంతో ఆయనకు కూడ లొంగుబాటు ప్రక్రియ అవసరం రాలేదు. అలా గతంలో ఎవ్వరూ పార్టి కేంద్ర కమిటి కార్యదర్శులుగా వున్న కాలంలో లొంగిపోలేదు. దేవ్ జీ ఆ రికార్డును బద్దలు గొట్టారు.

 

ఒకరు లొంగిపోతే యాధృఛ్ఛికం. ఇద్దరు లొంగిపోతే వ్యక్తిగతం. వున్నోళ్లందరూ లొంగిపోతే అది ధోరణి.  ధోరణి మీద సైధ్ధాంతిక చర్చ తప్పనిసరి !

 

          మావోయిస్టుల చరిత్ర ఒక ముగింపుకు వచ్చేసిందనే భావం ఇప్పుడు అన్నిచోట్లా వినబడుతోంది. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఒక్కరే ఇప్పుడు లోపలున్న ప్రముఖ నాయకుడు అంటున్నారు. వారు కొన్నేళ్ల క్రితమే అనారోగ్య కారణాలతో పార్టి కేంద్ర కమిటి కార్యదర్శి బాధ్యతల నుండి తప్పుకున్నారు. వారు మళ్ళీ ఆ బాధ్యతల్ని నిర్వర్తించగలిగే స్థితిలో లేరనే మాట కూడ వినపడుతోంది. 

 

          మావోయిస్టుల విషాద ముగింపు ‘సైనిక ఓటమా? సైధ్ధాంతిక వైఫల్యమా?  అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఆ పార్టి అభిమానులు, సానుభూతిపరుల్లోనేగాక సమాజ విశ్లేషకుల్లోనూ వినిపిస్తున్నాయి.

 

          కమ్యూనిస్టు పార్టీలు ఆశించిన ఫలితాలను సాధించకపోవచ్చుగానీ వాటివల్ల భారత సమాజానికి జరిగిన మేలు తక్కువదేంకాదు. రాజ్యాంగ లక్ష్యాల రూపకల్పనలో పరోక్షంగా కమ్యూనిస్టు పోరాటాల ప్రభావం వున్నది.  భూపరిమితి చట్టాలు, రాజ సంస్థానాలు - రాజభరణాల రద్దు, కార్మిక హక్కులు, అటవీ భూములపై ఆదివాసి హక్కులు, రాజ్యాంగంలో “సోషలిస్టు, “సెక్యులర్ ఆదర్శాల చేర్పు తదితర చట్టాల వెనుకనూ పనిచేసింది  కమ్యూనిస్టు పోరాటాలే. అలాగే ఉనికివాద ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు తాముగా ప్రారంభించకపోయినా, ఎస్సీ, బిసి, ముస్లిం, ఆదివాసి, మహిళా ఉద్యమాలను ప్రారంభించిన వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు శిబిరాల్లో పనిచేసినవారే.

కమ్యూనిస్టుల ప్రభావంవున్న రాష్ట్రాల్లో కులనిర్మూలనో, మత నిర్మూలనో జరగకపోవచ్చుగానీ  కమ్యూనిస్టు సంఘాల్లో కులసామరస్యం, మత సామరస్యం గొప్పగా కొనసాగింది. కులాంతర, మతాంతర వివాహాలను ప్రత్యేకంగా  ప్రోత్సాహించకపోయినా వాటికి  ఆమోదం లభించింది.  తెలుగు సాహిత్యం మీద వామపక్ష ప్రభావం మరీ ఎక్కువ. కవులు కథకులు నవలాకారులు కమ్యూనిస్టు సంఘాల్లో వున్నాలేకపోయినా తెలుగు కవిత్వం, కథా నవల తదితర ప్రక్రియలన్నీ పీడితుల పక్షమే వహించాయి. ఇవన్నీ కమ్యూనిస్టుల చారిత్రక విజయాలే. వీటిని ఎవరూ కాదలేరు

1990 తరువాత ప్రపంచ సామాజిక-ఆర్థిక కూర్పు సమూలంగా మారిపోయింది. దీనిని “1990 - అనంతర సంక్షోభంఅంటున్నాము. పాత కూర్పుకు సరిపోయిన సిద్ధాంత-రాజకీయ-పోరాట పద్ధతులు కొత్త కూర్పులో పనిచేయవు. పనిచేయలేదు కూడ.   మార్పును కమ్యూనిస్టు నాయకత్వం సరిగ్గా విశ్లేషించుకోలేక పోయింది. కొత్త కార్యక్రమాన్ని రూపొందించుకోలేక కాలం చెల్లిన అర్ధ-వలస, అర్ధ- భూస్వామ్య వ్యవస్థ, నాలుగు వైరుధ్యాలు, వ్యవసాయిక విప్లవం,  నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కార్యక్రమాన్నే పట్టుకుని వేలాడుతున్నాయి. అలాగే, కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ బాధితుల్ని గుర్తించడంలోనూ వాటి పక్షాన నిలవడంలోనూ వారిలో మనోధైర్యాన్ని నింపడంలోనూ కమ్యూనిస్టు పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయి. కొత్త నీరు వచ్చి కలవడం అగిపోయినప్పుడైనా కళ్ళు తెరవాల్సింది. ఇది సైధ్ధాంతిక విభాగంలో  ఘోర వైఫల్యం.

మావోయిస్టుల్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం  ఒక గడువు పెట్టి ఆ దిశగా బలగాలను ముందుకు నడిపిస్తున్నప్పుడు సర్వశక్తుల్ని దంతేవాడలో మోహరించడం సైనికపరంగా తప్పు.

No comments:

Post a Comment