Thursday, 12 February 2026

 


Uma Tenali

పీపుల్స్ వార్ గానీ, మావోయిస్టు పార్టీ గానీ 1990 తరువాత రంగంలో అయినా సాధించిన స్పష్టమైన విజయం ఏమిటో నాకు తెలియదు అన్నాను. “విజయంఅనే పదం నచ్చకపోతే — “కొత్తగా ఆవిష్కరించిన సిద్ధాంత అంశాలు ఏమిటి?” అని అడగవచ్చు. నిజంగా నాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే చెప్పండి. “గుడ్డోళ్లు, కళ్ళజోళ్లువంటి మాటలు అనవసరం.

ముందుగా నా అంధత్వం గురించి స్పష్టత: బాల్యంలోనే ఎడమ కన్ను తెగింది. అదే కంటికి ఇరవై ఏళ్ల క్రితం రెటీనోపతి వచ్చింది; దాని ప్రభావం కుడి కంటికి కూడా వస్తోంది. రెండు కళ్ళూ పోయినా ఎలా జీవించాలో ముందే శిక్షణ తీసుకున్నాను. కళ్ళో, కాళ్ళో పోతాయేమోనని భయపడే మనిషిని కాదు.

1980లో నేను కొండపల్లికి కొరియర్/బాడీగార్డ్గా పనిచేశాను. 1985లో కారంచేడు ఉద్యమానికి నాయకత్వం వహించాను. 1990లో పీపుల్స్ వార్ విధానాలతో విభేదించి బయటికి వచ్చాను. అంతకు ముందు ఆంధ్రజ్యోతి వారపత్రికలో వ్యాసం రాసి బహిరంగంగా ప్రకటించాను. వ్యాసాన్ని విరసం జనరల్ బాడీ చర్చించింది. అప్పటి నుండి పీపుల్స్ వార్ మీద నా అభిప్రాయాలు మారలేదు. రాజకీయ ఆలోచనల్ని నేను బహిరంగంగానే మాట్లాడుతాను.

పీపుల్స్ వార్కు ఒక సృజనాత్మక దశ ఉంది. ఎమర్జెన్సీ కాలంలో పూర్తిగా దెబ్బతిన్న పార్టీని కొండపల్లి మళ్ళీ పట్టాలు ఎక్కించారు. ఇందులో రెండు దశలున్నాయి. ఉద్యమం పెరుగుతున్నప్పుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం బలంగా వుండేది. దాన్ని నేను బాగా ఆస్వాదించాను. ఉద్యమం బలపడిన తరువాత  పార్టీలో బ్యూరాక్రసీ పెరిగింది. పార్టీ బాధ్యుల నైతిక విలువలు దిగజారిపోయాయి. 1989 తరువాత ఇవి విజృభించాయి. నాలాంటి వాళ్ళు భరించలేని స్థితి ఏర్పడింది. బయటి నుండి ప్రభుత్వ నిర్బంధం ఒక పార్శ్వం. లోపలి వికృతులు మరో పార్శ్వం. ‘ఆరు చెడులు’ అంటూ కొండపల్లి ప్రవేశపెట్టిన పత్రం కూడా అంతర్గత పతనానికి సంకేతమే. ఉద్యమం లోపల నుంచే క్షీణిస్తోంది అన్న భావన బలపడినప్పుడు నేను బయటికి వచ్చాను.ఇది జరిగిన కొద్ది రోజులకే  గ్రేటెస్ట్ తరానికి చెందిన కొండపల్లి సీతారామయ్యను బేబీ బూమర్లు పీపుల్స్ వార్ నుండి తరిమేశారు.

తరువాత పీపుల్స్ వార్ గానీ, మావోయిస్టు పార్టీ గానీ గురించి నేను ఒక్క మాట కూడా మెచ్చుకోలుగా చెప్పలేదు. వాటి మీద నాకు సదభిప్రాయం లేదు. వాటి పేరు చెప్పుకుని జీవించాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఉద్యమం మీద ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రజాస్వామిక దృక్కోణంలో ఖండించడం వేరే విషయం; వారి విధానాలను సమర్థించడం వేరే విషయం.

మావోయిస్టు అభిమానుల్లో ఒక అతిశయ ధోరణి కనిపిస్తోంది. పార్టీ నాయకత్వాన్ని నేను దగ్గరగా చూసిన వాడిని. కొన్ని మరచిపోలేని చేదు అనుభవాలున్నాయి.

ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని గుర్తించాలి. రాజ్యాంగ లక్ష్యాల రూపకల్పనలో, భూపరిమితి చట్టాలు, రాజాస్థానాలు-రాజభరణాల రద్దు, కార్మిక హక్కులు, అటవీ భూములపై ఆదివాసి హక్కులు, రాజ్యాంగంలో సోషలిస్టు”, “సెక్యులర్ఆదర్శాల చేర్పు తదితర అంశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పాత్ర ప్రధానంగా ఉన్నది. అలాగే ఉనికివాద ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు తాముగా ప్రారంభించకపోయినా, ఎస్సీ, బిసి, ముస్లిం, ఆదివాసి, మహిళా ఉద్యమాలను ప్రారంభించిన వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు శిబిరాల్లో పనిచేసినవారే. ఇవన్నీ కమ్యూనిస్టుల చారిత్రక విజయాలే. వీటిని ఎవరూ కాదలేరు.

కానీ 1990 తరువాత ప్రపంచ సామాజిక-ఆర్థిక కూర్పు సమూలంగా మారిపోయింది. దీనిని నేను “1990 అనంతర సంక్షోభంఅంటున్నాను. పాత కూర్పుకు సరిపోయిన సిద్ధాంత-రాజకీయ పద్ధతులు కొత్త కూర్పులో పనిచేయలేదు. మార్పును కమ్యూనిస్టు నాయకత్వం సరిగ్గా విశ్లేషించలేకపోయింది.

 

ఇక్కడ తరాల ప్రశ్న కీలకం:

Greatest Generation – Silent Generation – Baby Boomers – Gen X/Y/Z.

పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులు Greatest Generation‌కు చెందినవారు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలపు అంతర్జాతీయ కూర్పు వారికి బాగా అర్థమైంది; ఆ మేరకు వారు తమ కాలంలో గొప్ప ప్రభావం చూపారు.
మధ్యలో  silent Generation ఒకటుంది. కేజి సత్య మూర్తి ఆ తరానికి చెందినవారు. తరువాతి నాయకత్వం ప్రధానంగా Baby Boomers‌కి చెందింది. కొత్తగా ఎదిగి వచ్చిన  Gen X, Y, Z తరాలను వారు ఆకర్షించలేకపోయారు. విద్యావంతులైన పట్టణ మధ్యతరగతి సానుభూతి వర్గాన్ని కూడా క్రమంగా కోల్పోయారు.

1990ల దశకం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక సంధికాలం. ఆ మార్పును Baby Boomer నాయకత్వం హ్యాండిల్ చేయలేకపోయింది. అక్కడి నుంచే కమ్యూనిస్టు ఉద్యమం చారిత్రక పతన దశలోకి వెళ్లింది.

ఉద్యమాలకు చారుమజుందార్ కాంట్రిబ్యూషన్ మనకు తెలుసు. కొండపల్లి సీతారామయ్య కాంట్రిబ్యూషన్ మనకు తెలుసు. గణపతి సిద్ధాంతపరంగా కొత్తగా ఏమి జోడించారో మనకు తెలియదు. ఎవరైనా స్పష్టంగా చెప్పగలిగితే వినడానికి సిద్ధం.

విప్లవకారుల త్యాగాలను గౌరవించడం వేరు. వారి విప్లవ పంథాను సమర్థించడం వేరు. బయటివారికి పంథానే ముఖ్యం.

ఈరోజు మావోయిస్టుల విప్లవ పంథా ఏమిటి? నూతన ప్రజాస్వామిక విప్లవమేనా? దానికి ముందు కొండపల్లి వ్యవసాయిక విప్లవాన్ని జోడించారు.  వర్తమాన భారత సమాజాన్ని నేను “కార్పొరేట్-కమ్యూనల్ డిక్టేటర్‌షిప్”గా అర్థం చేసుకుంటాను. మావోయిస్టు పార్టీతో సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు  ఇంకా “అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థ” అనే నిర్వచనానికే కట్టుబడి ఉంటే అది చారిత్రక జఢత్వమే. పాత విశ్లేషణ పనికిరాకపోయినా కొత్త విశ్లేషణ సృష్టించలేని స్థితి — అదే అసలు సంక్షోభం.

సైనిక విజయాలు-పరాజయాలు నాకు ఆసక్తికరం కాదు. సిద్ధాంత పరాజయం గురించి మాత్రం విస్తృత చర్చ అవసరం. విప్లవ సిద్ధాంతం సామాజిక మార్పుకు ప్రాణవాయువు.

విమర్శించగానే తిట్లు మొదలుపెట్టడం వాదన కాదు. మర్యాద భాషలో చర్చించాలంటే నేను ఎప్పుడైనా సిద్ధం. తిట్ల భాష మాత్రమే మీకు వచ్చు అనుకుంటే — నేను నరసాపురోడినని గుర్తుంచుకోండి.

– డానీ

No comments:

Post a Comment