Thursday 28 September 2023

1948 Police Action - 1948 పోలీస్ యాక్షన్ - మరోకోణం!

 మిత్రమా!

ఈ వ్యాసాన్ని ఇప్పుడే రాశాను.

దీనిని మరెక్కడా ప్రచురించలేదు

సాక్షి ఎడిట్ పేజీలో ప్రచురణకు పరిశీలించ గలరు.

 

సౌలభ్యం కోసం మూడు టైటిల్ ఆప్షన్స్ ఇచ్చాను.

 

అవసరాన్నిబట్టి టైటిల్ ను, ఆర్టీకల్ సైజును మార్చుకునే స్వేఛ్ఛ మీకు ఎలాగూ వుంటుంది.

 

ప్రచురణకు ఎన్నిక కాకుంటే వెంటనే తెలుప గలరు.

వేరే పత్రిక్కి పంపుకుంటాను.

 

-     డానీ

 

 

తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి మరోకోణం!

తెలంగాణ మీద పోలీస్ యాక్షన్ కు మరోకోణం !

1948 పోలీస్ యాక్షన్ - మరోకోణం!

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ఒక్క ప్రతినిధి కూడ లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష భావజాలమే ఇప్పటికీ చాలా బలంగా వుంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే వుందటే అతిశయోక్తికాదు.

 

భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్గొండ, వరంగల్ రెండు జిల్లాల్లో ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంధస్తం చేసిన ఆ పోరాట అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు. తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’ అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు కారణాలు మొదటిది; ఉర్దూ భాషా సమస్య, రెండోది; ముస్లిం మత సమస్య.

 

తెలంగాణేతర నిజాం సంస్థానంలోనేకాక, కమ్యూనిస్టుల ప్రభావం లేని తెలంగాణ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజాస్వామికవాదులు, భారత జాతీయవాదులు, కమ్యూనిస్టులు వున్నారు. వీరిలో ముస్లింలు కూడ పెద్ద సంఖ్యలో వున్నారు.  వీరి గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు.

 

నిజాం పాలన గురించి మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో పెట్టుబడీదారీ అభివృధ్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్ కొందరు లేకపోలేదు. వారిలో ఒకడైన సివి సుబ్బారావు నాకు మంచి మిత్రుడు. ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానం చేస్తుండిన ఇండియాకన్నా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న అభివృధ్ధి మెరుగ్గా వుందనే నిర్ధారణకు వచ్చాడు తను.

 

ఇంతకీ తెలంగాణ సాయుధ పోరాటం ద్వార భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమీటీ? వాదన కోసం; నిజాం రాచరిక పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము.  భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు  ‘కమ్యూనిస్టు పార్టి ప్రణాళిక’లో కార్ల్ మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగిల్స్ చెప్పారు.

 

పెట్టుబడీదారీ వ్యవస్థ ఆవిర్భవించి, అందులో పారిశ్రామిక ఉత్పత్తి సంపూర్ణ, గరిష్ట స్థాయిలకు పెరిగి, ఒకవైపు; సమస్త సంపదను హస్తగతం చేసుకున్న పెట్టుబడీదారులు, మరోవైపు; ఎలాంటి సంపదాలేని శ్రామికులుగా సమాజం బరి గీసి విడిపోయినప్పుడు ఆ (పెట్టుబడీదారీ) వ్యవస్థను కూల్చితే సమసమాజ స్థాపన సాధ్యం అవుతుందని వాళ్ళు చెప్పారు. ‘ప్రణాళిక’లో ఇది కీలక అంశం మాత్రమేకాదు అదే దాని ప్రాణం.  భూస్వామ్య వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం “రైతు-కూలీ రాజ్యం” వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.

 

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టి రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృధ్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం. మరోమాటల్లో చెప్పాలంటే; తెలంగాణలో పెట్టుబడీదారీ వ్యవస్థ పుట్టి పెరగడానికి  కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు శ్రమదానం, ప్రాణదానం కూడ చేశాయి!!. ఓ 35 యేళ్ళ తరువాతి కాలంలో కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో నక్సలైట్ పార్టీలు చేసిందీ అదే; భూస్వాముల్ని పెట్టుబడీదారులుగా మార్చడం!!.

 

1940ల చివర్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్ పార్టీలుగానీ వుద్దేశ్యపూర్వకంగా ప్రణాళిక బధ్ధంగా పెట్టుబడీదారీ వ్యవస్థను పెంచిపోషించాయని చెప్పడం సరికాదు. సమాజానికి తనదైన ఒక రోడ్ మ్యాప్ వుంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. అయితే, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించినవాళ్ళకు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ సరిగ్గా అర్ధం కాలేదని మాత్రం చెప్పవచ్చు. పెట్టుబడీదారీ వ్యవస్థ పరిపక్వం కాకముందే, పారిశ్రామిక ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరక ముందే జరిపే సోషలిస్టు విప్లవాలు నిలదొక్కుకోలేవని రష్యా, చైనా అనుభవాలు చెపుతున్నాయి.

 

ఛత్తీస్ గడ్ లోని దంతేవాడ, బీజాపూర్, నారాయణ్ పూర్ జిల్లాల పరిధిలోని కొండలు-అడవులతో అబుజ్ మడ్ప్రాంతంలో  గిరిజనులు, ఆదివాసులతో తామొక ‘నమూనా సామ్యవాద సమాజం’ను స్థాపించినట్టు కొన్ని కమ్యూనిస్టు పార్టీలు చెపుతుంటాయి. కొండలు, ఆడవులు సమిష్టి సంపదగావుండే ఆదివాసి తెగల్లో ఆర్ధిక సామాజిక సమానత్వం (ఆర్గానిక్ సోషలిజం) సహజంగానే వుంటుంది. 4 వేల సంవత్సరాల క్రితమే ‘ఆదిమ కమ్యూనిస్టు సమాజం’ వుండిందని మార్క్స్ – ఏంగిల్స్ కూడా చెప్పివున్నారు.  ఈశాన్య రాష్ట్రాల్లోని కొండలు అడవుల్లో నివశించే సమూహాల్లో ‘సహజ సామ్యవాద సమాజం’ను ఇప్పటికీ చూడవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తి గరిష్టస్థాయిలో పెరగనిచోట సోషలిస్టు రాజ్యాన్ని సాధించామని ఎవరయినా చెపితే వాళ్లకు చారిత్రక భౌతికవాదం బొత్తిగా తెలీదని అర్ధం.

 

ఒక కఠోర చారిత్రక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృధ్ది చెందిన ఏ దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారు భూస్వాములకన్నా తెలివైనవారేతప్ప పెట్టుబడీదార్లుల్ని ఎదుర్కోలేరు. పెట్టుబడీదారీ వ్యవస్థల్లో సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేయగల సిధ్ధాంత బలం, వ్యూహాలు, ఎత్తుగడలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ వ్యవస్థ, ప్రజల మద్దతు మన దేశంలో ఏ కమ్యూనిస్టు పార్టీకీ లేదు. వాటికున్న బలాలు మూడు; పాలక పార్టీల విధానాల మీద పటిష్టమైన విమర్శను ప్రకటించగలవు; పెద్ద ఎత్తున ప్రచారాందోళనను సాగించగలవు; ‘సామ్యవాద వాస్తవికత’ వాదంతో విస్తృతంగా సాహిత్యాన్ని సృష్టించగలవు.

 

1948 నాటి పోలీస్ యాక్షన్ తమ కోసమే జరిగిందనీ, అందులో దాదాపు 3 వేలమంది కమ్యూనిస్టు కార్యకర్తలు చనిపోయారని కమ్యూనిస్టు పార్టీల నాయకులు తరచూ చెపుతుంటారు. అది నిజం కూడ. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ చనిపోయిన వారిలో ముస్లిం-కమ్యూనిస్టులు కూడా వున్నారని విడిగా చెప్పాల్సిన పనిలేదు.

 

కమ్యూనిస్టు నాయకులు చెప్పని ఇంకో పెద్ద నిజం కూడా వుంది.  జే.ఎన్. చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో 3 వేలకు ఓ పది రెట్లకు పైగా  ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు.  వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు, వాళ్ల ఆడవాళ్లను ----- చేశారు. దీనిపైన నెహ్రు వేసిన సుందర్ లాల్ బహుగుణ కమిటి మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టికి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల వేదికగావున్న పీపుల్స్ డెమోక్రాటిక్  ఫ్రంట్ (పిడిఎఫ్) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు.  సుందర్ లాల్ బహుగుణ నివేదికను జాతీయభద్రత కారణంగా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది.

 

సుందర్ లాల్ బహుగుణ నివేదిక బయటికి రాకపోయినా ఆ జాతిహననాన్ని అనుభవించినవారు దాన్నెలా మరచిపోతారూ? అవి వాళ్ల జ్ఞాపకాల్లో పీడకలలుగా కొనసాగుతూనే వుంటాయి. 1984 ఢిల్లీ అల్లర్లు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత భారతీయ సాహిత్యంలో అత్యంత సహజంగానే, ఒక చారిత్రక అవసరంగానే మైనారిటివాదం అనే ఒక కొత్త ధోరణి ఆరంభమయింది.  2002 గుజరాత్ అల్లర్ల తరువాత ఇది వేగాన్ని పుంజుకుంది. 2014 తరువాత దీనికి ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు మణిపూర్ అల్లర్ల తరువాత దీని ఆవశ్యకత మరీ పెరిగింది. మైనారిటీవాదాన్ని కొందరు అతిఉత్సాహంగా ‘ముస్లివాదం’, ‘ఇస్లాంవాదం’ అంటున్నారుగానీ అవి తెలిసో తెలియకో ‘హిందూవాదం’కు ఆమోదాంశాన్ని కలిగిస్తాయి.

 

ఇండో-అమెరికన్ రచయిత అఫ్సర్ ముహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దంపాటు విస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు “Remaking History -1948 Police Action and the muslims of Hyderabad” శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ను ప్రచురించాడు. 

 

సెప్టెంబరు 26 రాత్రి హైదరాబాద్ లా మకాన్ లో జూమ్ మీటింగ్ ద్వార ఈ పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ పుస్తకం రాయాల్సిన అవసరాన్నీ, తన అనుభవాల్నీ రచయిత చాలా ఉద్వేగంగా వివరించాడు.

 

2002 గుజరాత్ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిధ్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంధం. అతని పుస్తకం ఇంకా ఇండియాకు రాలేదు.


మనలో దాదాపు అందరికీ ఒక సెలెక్టివ్ ఆసక్తి వుంటుంది. మనకు కనిపించేదే, మనకు చెందినదే, మనకు ఇష్టమైనదే ప్రపంచం అనుకుంటాము. ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి వుండదు. ప్రపంచం మొత్తం తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా.

 

దానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తాను.

 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

9010757776


No comments:

Post a Comment