Wednesday 13 September 2023

Chandrababu Political Dilemma / 11 09 2023 / Danny Comment

 Chandrababu  Political Dilemma / 11 09 2023 / Danny Comment

 చంద్రబాబు 'ఇండియా' కూటమిలో  చేరుతారా?

 తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును  అరెస్టు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు గురయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సెప్టెంబరు 9 సోమవారం  చంద్రబాబును సిఐడి పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు. సిఐడి న్యాయస్థానం వారిని మంగళవారం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడికి రాజమండ్రి జైలుకు పంపింది.

 చిత్రమైన రాజకీయాలు

 ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు చిత్రమైనవి.  వైయస్ జగన్ మోహనరెడ్డి నాయకత్వంలోని వైసిపి ఇక్కడ అధికార పార్టి. నారా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టి ఇక్కడ ప్రతిపక్షపార్టి. బిజెపికి ఇక్కడ ఒక్క శాసనసభ్యుడు కూడ లేరు. ఒక్క శాతం ఓట్లు కూడ లేవు. గత ఎన్నికల్లో బిజెపికి 0.85 శాతం ఓట్లు పడ్డాయి.  అయినప్పటికీ వైసిపి, టిడిపి రెండూ పార్లమెంటులో బిజెపికి అనుకూలంగా వుంటాయి. జగన్ చంద్రబాబు ఏపిలో కుస్తీ – ఢిల్లీలో దోస్తి.

 జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. అయితే, ఏపిలో జనసేన మూడవ పెద్ద పార్టి.  గత ఎన్నికల్లో జనసేనకు 5.5 శాతం ఓట్లు వచ్చాయి. ఏపిలో బిజెపికన్నా జనసేన 6, 7 రెట్లు పెద్ద పార్టి. కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ వుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ బిజెపి ఇచ్చే రోడ్ మ్యాప్ ప్రకారం చాలా నమ్మకంగా నడుచుకుంటుంటారు.  ఆయన్ని జనసైనికుడు అనడంకన్నా బిజేపి సైనికుడు అనడం మేలు.

 ‘కింగ్ మేకర్ ‘

వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిచి అధికారాన్ని చేపడుతుందనే నమ్మకం పవర్ స్టార్ కు లేదు. అది వారి గొప్పతనం. తన బలహీనతల గురించి తనకు స్పష్టమైన అంచనా వుండడం కూడ గొప్పతనమే. అందువల్ల వారికి వారే పెట్టుకున్న టైటిల్ ‘కింగ్ మేకర్ ’ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో గ్రీసు యువరాజు అలెగ్జాండర్ కు అనేక శాస్త్రాలు బోధించి కింగ్ మేకర్ అనిపించుకున్నాడు అరిస్టాటిల్. ఇప్పటి  కింగ్ మేకర్ వేరు. చంద్రబాబు గెలుపుకు పదో పరకో సీట్లు తగ్గితే తను సరఫరా చేసి ఆదుకుందామనే గొప్ప హృదయం వారిది. పవర్ స్టార్ కింగ్ మేకర్ వ్యూహం నచ్చని వాళ్ళు ఆయన్ని ‘ప్యాకేజి స్టార్’ అంటుంటారు. 

 ఒకప్పుడు శాసన సభల్లో ప్రతిపక్షం అంటేనే కమ్యూనిస్టులు అనుకునేవారు. ముందు ఆంధ్ర రాష్ట్రంలో, తరువాత ఆంధ్రప్రదేశ్ లో  చాలాకాలం కమ్యూనిస్టుల హవా నడిచింది. పార్లమెంటేరియన్లు అంటేనే కమ్యూనిస్టులు అనుకునేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. విలువలు లేనివారినే జనం  ఏరికోరి ఓట్లు వేస్తున్నారు.  నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటి వరకు వామపక్షాలకు  ప్రాతినిధ్యం లేదు.  దానితో సిపిఎం, సిపిఐ  అవమాన భారంతో కుమిలిపోతున్నాయి.  ఎవరో ఒకరి పంచన చేరి ఈసారైనా ఒక్క సీటు అయినా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని అవి తపిస్తున్నాయి. టిడిపితో పొత్తుకోసం సిపిఐ ప్రయత్నిస్తున్నట్టు వైసిపితో పొత్తు కోసం సిపిఎం ప్రయత్నిస్తున్నట్టు కొంతకాలంగా గట్టిగానే వినిపిస్తోంది.

నైరాశ్యలో కాంగ్రెస్

 ఏపి కాంగ్రెస్ గత పదేళ్ళుగా పూర్తి నైరాశ్యంలో వుంది. కాంగ్రెస్ ద్వార ప్రయోజనాలు పొందిన నాయకులు  క్రమంగా ఇతర పార్టీలకు  వలస వెళ్ళిపోయారు. పార్టి భవిష్యత్తును నమ్మి కాంగ్రెస్ మీద నిధులు ఖర్చు పెట్టేవారు ఇప్పుడు లేరు. రాహుల్ గాంధీ ‘భారత జోడో’ యాత్ర తరువాత మాత్రమే కాంగ్రెస్ రాష్ట్ర ఆఫీసులో కొందరు కార్యకర్తలు కనిపిస్తున్నారు.  కొన్ని కార్లు ఆగుతున్నాయి. రాత్రుళ్ళు కొన్ని లైట్లు వెలుగుతున్నాయి.

 అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బిజెపి

రాష్ట్ర విభజన కారణంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ మీద చాలా గుర్రుగా వున్నారు.  అప్పటికి అధికారంలో వున్న పార్టికి ఒక్క సీటు కూడ రాకుండా ఓడించారు.  ఇప్పటి పరిస్థితి వేరు.  ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృధ్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తదితర అంశాల్లో బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపిని నిర్లక్ష్యం చేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది.  ఇప్పుడు ఏపి ప్రజలు స్థూలంగా బిజెపికి వ్యతిరేకంగా వున్నారు.  ఇక్కడ ఓట్లు సాధించడానికి బిజెపి దగ్గర ఒక్క ఆయుధం కూడ లేదు. ఒక్క నినాదం కూడ లేదు.

 జగన్ రాజును మించిన రాజభక్తి’

తన స్వంత బలం మీదనే, సింగిల్ హ్యాండెడ్ గా ఎన్నికల్లో గెలవాలనేది జగన్ అభిమతంగా వుంది.  గతంలో లానే 2024 ఎన్నికల్లోనూ వైసిపి  మరొకరితో పొత్తు పెట్టుకోవడం, సీట్లు పంచుకోవడం జగన్ కు ఏమాత్రం ఇష్టంలేదు. కేంద్రంలో బిజెపి విషయంలో జగన్ ‘రాజును మించిన రాజభక్తి’ని చాటుకుంటున్నారు. విచిత్రం ఏమంటే జగన్ ఓటు బ్యాంకులో రెడ్డి సామాజికవర్గంతప్ప అత్యధికులు బిజెపికి పూర్తి  వ్యతిరేకులు. మరీ ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు. జగన్ బిజెపికి అంతే విధేయంగావుంటే ఆ మేరకు ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీల ఓట్లు తగ్గుతాయి. ఏపి పోలీసులు కూడ జగన్ ఓట్లను తగ్గించడంలో తమవంతు కృషి గట్టిగానే చేస్తున్నారు.

 జగన్ కు  లోక్ సభలో 22 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం లోక్ సభకన్నా విలువైన రాజ్యసభలో 12 మంది సభ్యులున్నాయి. అయినప్పటికీ, ఒక్క మంత్రి పదవిని కూడ కోరుకోకుండా జగన్ బిజెపికి ఉచిత సేవలు అందిస్తున్నారు.  ఆయన ఏపిలో ‘బిజెపికాని బిజెపి’.

 చంద్రబాబు పొత్తు సెంటిమెంటు

 2019 ఎన్నికల్లో అనూహ్యంగా  ఘోర పరాజయం పొందిన తరువాత  చంద్రబాబుకు ఎన్నికల ఫోబియా పట్టుకుంది. ఎన్నికల్లో ఒంటరిగా పోవడానికి వారు భయపడుతున్నారు.  కూటమిగా పోవడమే మేలని వారు భావిస్తున్నారు.  ఆయన్నిప్పుడు 2014 ఎన్నికల సెంటిమెంటు వెంటాడుతోంది.  తనూ, మోదీ, పవన్ కళ్యాణ్  మళ్ళీ కలిస్తే మరొక్కసారి ఘనవిజయాన్ని సాధించవచ్చని ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారు.  అది జరిగే పని కాదని ఆయన సన్నిహితులకు, ఆయన్ను సమర్ధించే మీడియా సంస్థలకు  కూడ తెలుసు.కానీ, ఆ విషయం వారికి మాత్రం అర్ధం కావడంలేదు.

 ఓట్లు చీలకూడదు

పవన్ కళ్యాణ్ కూడ దాదాపు చంద్రబాబు మైండ్ తోనే ఆలోచిస్తున్నారు.  జనసేన, టిడిపి, బిజేపి కలిసి  జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండ చూస్తే  తమ గెలుపు ఖాయమని ఆయన పదేపదే చెపుతున్నారు.  కేంద్రంలో అధికారంలో వున్న పార్టి అనే ఒకే ఒక్క మాటతప్ప  ఏపిలో బిజెపికి ఓట్లు లేవు.  పవన్ కళ్యాణ్ నే నమ్ముకుని ముందుకు పోవాల్సిన దయనీయ స్థితి ఆ పార్టీది. 

 జగన్ మీదే బిజెపికి నమ్మకం

బిజెపి దృష్టిలో జగన్ కాంగ్రెస్ తో విభేధించి బిజెపి పంచచేరిన రాజకీయ నాయకుడు. చంద్రబాబు బిజెపి తో విభేధించి కాంగ్రెస్ దగ్గరకు వెళ్ళగల నాయకుడు.  అంచేత, బిజెపి జగన్ ను నమ్మినంతగా చంద్రబాబును నమ్మదు. ఏపిలో వచ్చే ఎన్నికల్లోనూ జగన్ గెలవడమే మేలని బిజెపి భావిస్తోంది.  ఆ తరువాత వచ్చే 2029 ఎన్నికల సంగతి అప్పుడు చూసుకోవచ్చనేది ఆ పార్టి వ్యూహంగా కనిపిస్తున్నది.

 చంద్రబాబు ఒన్ సైడ్ లవ్

`         కేంద్ర హోంమంత్రి అమిత్ షా  బహిరంగ సభల్లోనూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశాల్లోనూ జగన్ ను గట్టిగానే విమర్శించారు. వాళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ తో పొత్తు వుంటుంది అన్నారేగానీ చంద్రబాబుతో పొత్తు వుంటుందని ఒక్కసారి కూడ అనలేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తను గట్టెక్కాలంటే కేంద్రంలో అధికారంలోవున్న బిజెపి సహకారం అవసరం అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బిజేపితో ఆయన ‘ఒన్ సైడ్ లవ్’లో బాగా లోతుగా మునిగి తేలుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్ డిఏకు వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి సరిగ్గా ఈ కారణంగానే చంద్రబాబును  దూరంగా పెట్టింది.

 ఎద్దేలు కర్ణాటక దిగ్భ్రాంతి

ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించే ఏకైన లక్ష్యంతో పనిచేసిన  పౌరసమాజం ‘ఎద్దేలు కర్ణాటక’ తెలుగులో ‘మేలుకో కర్ణాటక’ అని అర్ధం. ‘ఎద్దేలు కర్ణాటక’ బృదం రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. ఇక్కడి పరిస్థితుల్ని పరిశీలించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ బిజెపిని ఓడించాలనేది ఆ సంస్థ లక్ష్యం. అయితే, ఇక్కడి రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా గందర గోళంలో వుంది. లోక్ సభ ఎన్నికల్లో వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి నాలుగు పార్టిల్లో దేనికి ఓటేసినా అవి అంతిమంగా బిజెపి ఖాతాలోనికే పోతాయనే అభిప్రాయం ఏపిలో కొన్నాళ్ళుగా  స్థిరపడిపోయింది. అందువల్ల, అసెంబ్లీ ఎన్నికల మీద వున్నంత ఆసక్తి ఎవ్వరికీ లోక్ సభ ఎన్నికల మీద లేకుండా పోయింది. ఏపీలో బిజెపిని ఓడించే ఒక పటిష్ట  వ్యూహాన్ని రచించలేక ‘ఎద్దేలు కర్ణాటక’  బృందం వెళ్ళిపోయింది.

 మోదీ అమిత్ షా లకు ముందే తెలుసా?

దేశ ప్రతిష్టకు సంబంధించిన జి-20 సమావేశాలు జరుగుతుండగా చంద్రబాబు అరెస్టుకు ముహూర్తం పెట్టారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాజీలకు ఎపి ప్రభుత్వం బాబు అరెస్టు గురించి  ముందే తెలిపి వుంటుంది. మోదీ, అమిత్ షాలకు అసౌకర్యాన్ని కలిగించే పనులు ఏవీ జగన్ చేయరు; చేయలేరు. చేస్తారని ఎవరయినా అనుకుంటే అంతకన్నా అమాయకులు ఎవ్వరూ వుండరు.

 బాబు అరెస్టు టిడిపికి లాభమా? నష్టమా?

చంద్రబాబు అరెస్టు టిడిపికి లాభమా? నష్టమా? అనేదే ఇప్పుడు బిజెపి పరిశీలిస్తున్న అంశం. టిడిపి బుధవారం  పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ఏపిలోని ఏ జిల్లాలోనూ కనీస స్పందన కూడ రాలేదు. తెలుగుదేశం  రాజకీయాల కేంద్రంగా భావించే విజయవాడ నగరంలోనూ బంద్ ప్రభావం కనిపించలేదు. వన్ టౌన్ లో వస్త్ర సముదాయం మాత్రం మూసివేశారు. టిడిపి బంద్ ను ప్రజలు పట్టించుకోకపోవడం వైసిపికికన్నా బిజెపికే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి వుంటుంది. వాళ్ళు అశిస్తున్నది కూడ ఇదే.  

  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు. 

 ఎన్ టి రామారావు నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా వున్న కాలంలోనే విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుండే చంద్రబాబుకు జాతీయ రాజకీయాలతో ఒక అనుబంధం వుంది. హెచ్ డి దేవ గౌడను  ప్రధానిని చేసిన యునైటెడ్ ఫ్రంట్ కు, అనంతరం ఏబి వాజ్ పాయిను ప్రధానిని చేసిన ఎన్ డిఏ కు కూడ అయనే కన్వీనర్ గా వున్నారు.  తన సూచన మేరకే ఏపిజే కలాం ను వాజ్ పాయి రాష్ట్రపతి చేశారని వారు తరచూ గుర్తు చేస్తుంటారు.  

 ఒంటరి బాబు

అప్పుడయితే వారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారుగానీ ఇవ్వాల్టి పరిస్థితి వేరు. చంద్రబాబు అరెస్టు అయితే ఎన్ డి ఏ నాయకులు స్పందించలేదు; ‘ఇండియా’ నాయకులు పరామర్శించలేదు. రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు ఒంటరివారయ్యారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జి, అఖిలెష్ యాదవ్ తదితరులు లాంఛనంగా,  ఖండనలు ఇచ్చారు. అలా అనుకుంటే పురందేశ్వరి కూడ అరెస్టును ఖండించారు.  అదే పాతరోజులు అయితే, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, సీతారామ్ ఏచూరి ఈ పాటికి విజయవాడలో దిగిపోయేవారు.

 పవన్ కు రాజకీయం తెలీదు

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా లేత  కనుక చంద్రబాబు అరెస్టు కేసులో  జగన్ ను మాత్రమే విమర్శించారు. బాబు అరెస్టు వెనుక బిజెపి కేంద్ర పెద్దల సహకారం వున్నట్టు ఆయనకు తెలిసినట్టులేదు. సోము వీర్రాజును తప్పించినపుడే పవన్ కళ్యాణ్ కు ఒక విషయం అర్ధమై వుండాల్సింది; పురందేశ్వరిని పంపింది చంద్రబాబు కాళ్ళ కింది భూమిని లాగడానికని.  ఎపి రాజకీయాల్లో చంద్రబాబును బలహీనపరచి పవన్ కళ్యాణ్ ను ముందుకు తీసుకుని రావడం ఢిల్లీ బిజెపి  ‘డబుల్ ఇంజిన్’ వ్యూహం.  బిజెపి స్వంతంగా బలపడలేనప్పుడు పవన్ కళ్యానే వారికి దిక్కు.

 జైలు సెల్లో  జ్ఞానోదయం

రాజమండ్రి సెంట్రల్ జైలు రాజకీయ ఖైదీల స్పెషల్ విభాగంలో  ప్రవేశించాక చంద్రబాబుకు ఏపి కొత్త రాజకీయాల కొత్త కోణాల గురించి జ్ఞానోదయం అయ్యుంటుంది.  తను బిజెపితో ఒన్ సైడ్ లవ్ సాగించడం ఏపి ప్రజలకు నచ్చడంలేదని వారు తెలుసుకుని వుంటారు.  రాష్ట్ర బంద్ విఫలం కావడానికి అదే ప్రధాన కారణం అని గుర్తించి వుంటారు.  చంద్రబాబు అరెస్టు తరువాత ఒక్క టిడిపి నాయకుడు కూడ బిజెపి నేతల్ని పల్లెత్తు మాట అనలేదు. ఇప్పటికీ ఎన్డీఏ శిబిరంలో చేరాలనేది వారి ఆశయంగా కనిపిస్తున్నది. తాను మోదీ ప్రేమలో వున్నానంటూ పదేపదే చెప్పుకునే  రాజకీయ నాయకునితో ‘ఇండీయా’ టీమ్ కు పనేముంటుంది?

 బాబు వుండాల్సింది ‘ఇండియా’లో

 తను ఇప్పుడు వుండాల్సింది ‘ఇండియా’లో అని చంద్రబాబు గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోతాయి.   వామపక్షాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘ఇండియా’లో వున్నాయి.  పొత్తుల నిర్ణయం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని సీతారాం ఏచూరి వంటివారు చెప్పి వున్నారు.  ఏపిలో కాంగ్రెస్ వామపక్షాలతో టిడిపి కలిసే అవకాశాలు పెరుగుతాయి.  చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదు.  పవన్ కళ్యాణ్ ను బిజెపి మరింతగా ప్రమోట్ చేస్తుంది.  జగన్ తాను బిజెపి కాదంటూనే బిజెపి వెంట వుండక తప్పదు. అప్పుడుగానీ ఏపి రాజకీయాల్ని ఇప్పటిదాక కమ్ముకున్న మబ్బులు ఇక వీడిపోతాయి.

 జరిగేది ఇదే

జగన్ వైసిపి ఒంటరిగానే రంగంలో దిగుతుంది. ఇండియా టీమ్ లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ వగయిరాలు  ఎలాగూ వుంటాయి. చంద్రబాబుకు బిజెపి ఛాన్స్ ఇవ్వదు కనుక టిడిపి ఇండియాలో చేరుతుంది.  పవన్ కళ్యాణ్ బిజెపి ఇచ్చిన రోడ్ మ్యాప్ లో ముందుకుపోతారు.

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు

మొబైల్ : 9010757776

 రచన : 11 సెప్టెంబరు 2023

No comments:

Post a Comment