Friday 15 September 2023

ఇప్పుడయినా ' బాబు' కళ్ళు తెరుస్తారా? !

 ఇప్పుడయినా ' బాబు' కళ్ళు తెరుస్తారా? ! 

చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణల్లో ఒక స్పష్టత చోటు చేసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ అర్ధం కాని బ్రహ్మపదార్ధంగా వున్నాయి. ఇక ఆ రాజకీయ మబ్బులు విడిపోయే సందర్భం వచ్చేసింది.    

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన పౌరసమాజం ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. అయితే, ఇక్కడి రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా వుండడంతో బిజెపిని ఓడించే ఒక వ్యూహాన్ని ఆ బృందం రచించలేకపోయింది. 

పొత్తులేని పోటీకి ససేమిర !

ఏపిలో వైయస్సార్ సిపి (వైసిపి) అధికార పార్టి, తెలుగు దేశం (టిడిపి) ప్రతి పక్షపార్టి.  రంగంలో ఇంకా జనసేన, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, బిఎస్పి, సిపిఐ వున్నాయి. అయితే, ఈ ఆరు పార్టిల్లో ఒక్కదానికీ శాసన సభలో ప్రాతినిథ్యంలేదు. 

జగన్ నాయకత్వంలోని వైసిపికి మరొకరితో పొత్తు పెట్టుకోవడం, సీట్లు పంచుకోవడం ఏమాత్రం ఇష్టంలేదు. స్వంత బలం మీదనే గెలవాలనేది జగన్ అభిమతంగా వుంది. 2019 ఎన్నికల్లో అనూహ్య పరాజయం తరువాత  చంద్రబాబుకు 2014 ఎన్నికల సెంటిమెంటు వెంటాడుతోంది. తనూ, మోదీ, పవన్ కణ్యాణ్  మళ్ళీ కలిస్తే మరొక్కసారి ఘనవిజయాన్ని సాధించవచ్చని ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారు. కానీ అది జరిగే పని కాదని వారికి అర్ధం కావడంలేదు. 

పవన్ కళ్యాణ్ కూడ దాదాపు చంద్రబాబు బాటలోనే ఆలోచిస్తున్నారు. జనసేన, టిడిపి, బిజేపి కలిసి  జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండ చూస్తే  తమ గెలుపు ఖాయమని ఆయన పదేపదే చెపుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టి అనే ఒకే ఒక్క మాటతప్ప  ఏపిలో బిజెపికి ఓట్లు లేవు. గత ఎన్నికల్లో ఆ పార్టికి స్వంతంగా ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. పవన్ కళ్యాణ్ కే 5.5 శాతం ఓట్లు వచ్చాయి. ఆ లెఖ్ఖన ఏపిలో బిజేపికన్నా పవన్ కళ్యాణ్ పార్టి 6,7 రెట్లు పెద్దది. 

బిజెపితో ఒన్ సైడ్ లవ్ ! 

రాష్ట్ర విభజన కారణంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ మీద చాలా గుర్రుగా వున్నారు. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృధ్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తదితర అంశాల్లో బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది. స్థూలంగా వాళ్లు బిజెపికి వ్యతిరేకంగా వున్నారు. 

కేంద్రంలో బిజెపి విషయంలో జగన్ ‘రాజును మించిన రాజభక్తి’ని చాటుకుంటున్నారు. విచిత్రం ఏమంటే జగన్ ఓటు బ్యాంకులో రెడ్డి సామాజికవర్గంతప్ప అత్యధికులు బిజెపికి పూర్తి  వ్యతిరేకులు. మరీ ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు. ఆయనకు లోక్ సభలో 22 మంది సభ్యులున్నారు, ప్రస్తుతం లోక్ సభకన్నా విలువైన రాజ్యసభలో 12 మంది సభ్యులున్నాయి. అయినప్పటికీ, ఒక్క మంత్రి పదవిని కూడ కోరుకోకుండా జగన్ బిజెపికి ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన ఏపిలో ‘బిజెపికాని బిజెపి’. 

బిజెపి దృష్టిలో జగన్ కాంగ్రెస్ తో విభేధించి బిజెపి పంచచేరిన రాజకీయ నాయకుడు,  చంద్రబాబు బిజెపి తో విభేధించి కాంగ్రెస్ దగ్గరకు వెళ్ళగల నాయకుడు. అంచేత, బిజెపి జగన్ ను నమ్మినంతగా చంద్రబాబును నమ్మదు. ఏపిలో వచ్చే ఎన్నికల్లోనూ జగన్ గెలవడమే మేలని బిజెపి భావిస్తోంది. ఆ తరువాతి 2029 ఎన్నికల సంగతి అప్పుడు చూసుకోవచ్చనేది ఆ పార్టి వ్యూహంగా కనిపిస్తున్నది. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా  బహిరంగ సభల్లోనూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశాల్లోనూ జగన్ ను గట్టిగానే విమర్శించారు. వాళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ తో పొత్తు వుంటుంది అన్నారేగానీ చంద్రబాబుతో పొత్తు వుంటుందని ఒక్కసారి కూడ అనలేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తను గట్టెక్కాలంటే కేంద్రంలో అధికారంలోవున్న బిజెపి సహకారం అవసరం అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బిజేపితో ఆయన ‘ఒన్ సైడ్ లవ్’లో బాగా లోతుగా మునిగి తేలుతున్నారు. 

ఏపీలో బిజెపి వ్యూహమిదే ! 

జాతీయ రాజకీయాల్లో ఎన్ డిఏకు వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి సరిగ్గా ఈ కారణంగానే చంద్రబాబును  ఆహ్వానించలేదు. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో సిపిఎం, సిపిఐ  అవమాన భారంతో కుమిలిపోతున్నాయి. ఎవరో ఒకరి పంచన చేరి ఈసారైనా ఒక్క సీటు అయినా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని అవి తపిస్తున్నాయి. టిడిపితో పొత్తుకోసం సిపిఐ, వైసిపితో పొత్తు కోసం సిపిఎం ప్రయత్నిస్తున్నట్టు గట్టిగానే వినిపించింది.  

ఏపి కాంగ్రెస్ గత పదేళ్ళుగా పూర్తి నైరాశ్యంలో వుంది. కాంగ్రెస్ ద్వార ప్రయోజనాలు పొందినవారు క్రమంగా ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. పార్టి భవిష్యత్తును నమ్మి నిధులు ఖర్చు పెట్టేవారు లేరు. రాహుల్ గాంధీ ‘భారత జోడో’ యాత్ర తరువాత మాత్రమే కాంగ్రెస్ ఆఫీసులో కొందరు కార్యకర్తలు కనిపిస్తున్నారు. కొన్ని కార్లు ఆగుతున్నాయి. కొన్ని లైట్లు వెలుగుతున్నాయి.

వైసిపి, టిడిపి, జనసేన. బిజెపి నాలుగు పార్టిల్లో దేనికి ఓటేసినా అవి అంతిమంగా బిజెపి ఖాతాలోనికే పోతాయనే అభిప్రాయం ఏపిలో కొన్నాళ్ళుగా  స్థిరపడిపోయింది. అందువల్ల, అసెంబ్లీ ఎన్నికల మీద వున్నంత ఆసక్తి ఎవ్వరికీ లోక్ సభ ఎన్నికల మీద లేకుండా పోయింది. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబరు 9 సోమవారం   చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడికి పంపడంతో రాష్ట్రా రాజకీయాలు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు గురయ్యాయి. 

దేశ ప్రతిష్టకు సంబంధించిన జి-20 సమావేశాలు జరుగుతుండగా చంద్రబాబు అరెస్టుకు ముహూర్తం పెట్టారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాజీలకు ఎపి ప్రభుత్వం ముందే తెలిపి వుంటుంది. మోదీ, అమిత్ షాలకు అసౌకర్యాన్ని కలిగించే పనులు ఏవీ జగన్ చేయరు; చేయలేరు. చేస్తారని ఎవరయినా అనుకుంటే అంతకన్నా అమాయకులు ఎవ్వరూ వుండరు.

చంద్రబాబు అరెస్టు టిడిపికి లాభమా? నష్టమా? అనేదే ఇప్పుడు బిజెపి పరిశీలిస్తున్న అంశం. టిడిపి బుధవారం  పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ఏ జిల్లాలోనూ కనీస స్పందన రాలేదు. తెలుగుదేశం  రాజకీయాల కేంద్రంగా భావించే విజయవాడ నగరంలోనూ బంద్ ప్రభావం బొత్తిగా కనిపించలేదు. టిడిపి బంద్ ను ప్రజలు పట్టించుకోకపోవడం వైసిపికికన్నా బిజెపికే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి వుంటుంది. వాళ్ళు అశిస్తున్నది కూడ ఇదే.   

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా లేత  కనుక చంద్రబాబు అరెస్టు కేసులో  జగన్ ను మాత్రమే విమర్శించారు. సోము వీర్రాజును తప్పించినపుడే పవన్ కళ్యాణ్ కు ఒక విషయం అర్ధమై వుండాల్సింది; పురందేశ్వరిని పంపింది చంద్రబాబు కాళ్ళ కింది భూమిని లాగడానికని. ఎపి రాజకీయాల్లో చంద్రబాబును బలహీనపరచి పవన్ కళ్యాణ్ ను ముందుకు తీసుకుని రావడం ఢిల్లీ  ‘డబుల్ ఇంజిన్’ వ్యూహం. 

టిడిపు రాష్ట్ర బంద్ పిలుపు విఫలం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు బిజెపి ప్రేమలో వుండడమే. రాజమండ్రి సెంట్రల్ జైలు రాజకీయ ఖైదీల స్పెషల్ విభాగంలో  ప్రవేశించాక చంద్రబాబుకు కొత్త రాజకీయాల కొత్త కోణాలు అర్ధం అయ్యుంటాయి. 

బాబు గేమ్ చేంజరేగానీ 

ఎన్ టి రామారావు నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా వున్న కాలంలోనే విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుండే చంద్రబాబుకు జాతీయ రాజకీయాలతో ఒక అనుబంధం వుంది. హెచ్ డి దేవ గౌడను  ప్రధానిని చేసిన యునైటెడ్ ఫ్రంట్ కు, అనంతరం ఏబి వాజ్ పాయిను ప్రధానిని చేసిన ఎన్ డిఏ కు కూడ అయనే కన్వీనర్ గా వున్నారు. తన సూచన మేరకే ఏపిజే కలాం ను వాజ్ పాయి రాష్ట్రపతి చేశారని వారు తరచూ గుర్తు చేస్తుంటారు. ఇవ్వాల్టి పరిస్థితి వేరు. చంద్రబాబు అరెస్టు అయితే ఎన్ డి ఏ నాయకులు స్పందించలేదు; ‘ఇండియా’ నాయకులు పరామర్శించలేదు. రెంటికీ చెడ్డ రేవడ్ని అయినట్టు వారికి జైల్లో జ్ఞానోదయం అయ్యుంటుంది. లాంఛనంగా, రాహుల్ గాంధీ, మమతాస బెనర్జి ఖండనలు ఇచ్చారు. అలా అనుకుంటే పురందేశ్వరి కూడ అరెస్టును ఖండించారు. 

తను ఇప్పుడు వుండాల్సింది ‘ఇండియా’లో అని చంద్రబాబు గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోతాయి.  వామపక్షాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘ఇండియా’లో వున్నాయి. పొత్తుల నిర్ణయం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని సీతారాం ఏచూరి వంటివారు చెప్పి వున్నారు. ఏపిలో కాంగ్రెస్ వామపక్షాలతో టిడిపి కలిసే అవకాశాలు పెరుగుతాయి. చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదు.  పవన్ కళ్యాణ్ ను బిజెపి మరింతగా ప్రమోట్ చేస్తుంది. జగన్ తాను బిజెపి కాదంటూనే బిజెపి వెంట వుండక తప్పదు. 


డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు

మొబైల్ : 9010757776


రచన ః 12 సెప్టెంబరు 2023

ప్రచురణ ః 15 సెప్టెంబరు 2023

దిశ డైలీ 

https://www.dishadaily.com/editpage/chandrababu-should-think-about-his-role-in-national-politics-252738



No comments:

Post a Comment