Monday, 14 April 2025

Peace Talks and Constitution

 *పాలకులు - మావోయిస్టులు, మధ్యలో రాజ్యాంగం!*

-        *డానీ*

ఈరోజు ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం.

చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పండి.





 

రెండు దేశాలు ఆయుధాలతో తలపడితే యుధ్ధం. ప్రభుత్వం తన ప్రజల మీద ఆయుధాలతో తలపడితే అంతర్యుధ్ధంఛత్తీస్ గడ్, దంతేవాడలో ఇప్పుడు ఒక భీకర అంతర్యుధ్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం  భారీగా సైన్యాన్ని దింపి అక్కడ మావోయిస్టుల అణిచివేత కార్యక్రమాన్ని  చేపట్టింది. యుధ్ధానికయినా  అంతర్యుధ్ధానికయినా లక్ష్యం మార్కెట్టే అని తెలిసినపుడు నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ఎవరికోసమో ఊహించడం ఎవరికీ పెద్ద కష్టం ఏమీకాదు.

            రక్షణ వ్యవహారాలను బహిరంగపరచరు గాబట్టి, ఛతీస్ గడ్ లో కేంద్ర ప్రభుత్వం ఎంత సైన్యాన్ని దించిందో, ఎన్నిరకాల ఆధునిక ఆయుధాలను వినియోగిస్తున్నదో వివరాలు అందుబాటులో లేవు. దాదాపు లక్షమంది పారామిలటరీ దళాలను బస్తర్ లో దించారని ఒక అంచనా. దీని కోసం కేటాయించిన బడ్జెట్ విషయంలోనూ నమ్మశక్యంకాని అంకెలు వినిపిస్తున్నాయి.

కొన్నేళ్ళుగా సాగుతున్న అంతర్యుధ్ధంలో ప్రస్తుతం కేంద్రబలగాలదే  పైచేయిగా వుందని చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఉత్సాహంతోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే చైత్ర నవరాత్రి (మార్చి 2026) నాటికినక్సల్ ముక్త్ భారత్ను సాకారం చేస్తాము అంటున్నారు. బస్తర్ లో పారా మిలటరీ దళాల దూకుడును చూస్తుంటే వచ్చే మార్చికన్నా ముందే వాళ్ళు లక్ష్యాన్ని  సాధించనూ వచ్చు.

పీడన అణిచివేత కొనసాగుతున్నప్పుడు తిరుగుబాటు తప్పక వస్తుంది. సమాజానికి అయినా ఇది సహజ సూత్రం. కేంద్ర హోం మంత్రి ఆశిస్తున్నట్టు నక్సల్ ముక్త్ భారత్ ఏర్పడకపోయినా ఇప్పటికయితే నక్సల్ ముక్త్ బస్తర్ ఏర్పడవచ్చు. బస్తర్ లో ఇంకో విచిత్రం జరుగుతోంది. అటు మావోయిస్టుల పైచేయి అయిన రోజైనా, ఇటు కేంద్ర సాయుధబలగాల పైచేయి అయిన రోజైనాఇరువైపులా - చనిపోతున్నది ఆదివాసులే.

 

ఇదేమీ కొత్త కాదు. వందేళ్ళ క్రితం మన్యంలో సాగిన తిరుబాటును అణిచివేయడానికి నాటి బ్రిటీష్ మిలటరీ అధికారి థామస్ జార్జ్ రూథర్ ఫోర్డ్ విధమైన వ్యూహాన్నే రచించాడు. ఇరువైపుల ఆదివాసులే చనిపోతుండడాన్ని చూసి తట్టుకోలేకే అల్లూరి శ్రీరామరాజు పోరాటాన్ని విరమించాలనే నిర్ణయం తీసుకున్నాడు.

మన్యానికి ఉత్తర దిక్కున, జైపూర్ సంస్థానానికి పశ్చిమ దిక్కున  బస్తర్ ఎస్టేట్ వుండేది. అల్లూరికన్నా ముందు 1910 ప్రాంతంలో గుండ ధూర్ నాయకత్వంలో భూమికాల్ పేరున బస్తర్ లో చాలా పెద్ద ఎత్తున ఆదివాసుల తిరుగుబాటు సాగింది. తిరుగుబాటును కూడ బ్రిటీష్ సైన్యం క్రూరంగా అణిచివేసింది. గుండ ధూర్ ఏమైపోయాడో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ప్రతిఏటా ఫిబ్రవరి 10 బస్తర్ అంతటా  భూమికాల్ తిరుగుబాటు స్మారకోతవాలు జరుపుకుంటారు.

ఆధునిక యంత్రీకరణ ప్రకృతిని విధ్వంసం చేస్తుంది. దాన్ని  ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వాళ్ల పోరాటాల్లోజల్ జంగల్ జమీన్అనేది ప్రాణప్రదమైన నినాదం. ప్రకృతిని విధ్వంసం చేయడాన్ని  ఒకప్పుడు పాపకార్యంగా భావించేవారు ఇప్పుడదిఅభివృధ్ధిఅని పేరు మార్చుకుని గొప్ప పుణ్యకార్యంగా చెలామణి అవుతోంది.  

మావోయిస్టు పార్టి సిధ్ధాంతాలు, దాని ఆచరణల మీద నమ్మకం, అభిమానం లేనివాళ్లు సహితం ఇప్పుడు ఆదివాసుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలోనే అనేక పౌర సంఘాలు శాంతిచర్చలు నిర్వహించమని ఇటు మావోయిస్టుల్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. ప్రతిపాదనలకు మావోయిస్టు పార్టి సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ఇక ప్రభుత్వం వంతు.   

శాంతి చర్చల విషయంలో ఛత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం ఊగీసలాటలో వుంది. దానికి ఒకవైపు, శాంతి చర్చలు జరిపి మావోయిస్టుల సమస్యను  శాశ్వితంగా వదిలించుకోవాలనీ వుంది. మరోవైపు, ప్రస్తుతం వెనుకంజలో వున్న మావోయిస్టులు శాంతి చర్చల నెపంతో లభించే వెసులుబాటుతో మళ్ళీ  పుంజుకుంటారనే భయాందోళనా వుంది.

మావోయిస్టులతో కేంద్రప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతుందా? లేదా? అన్నది ఒక అంశం. అయితే, దానికి రాజ్యాంగం ప్రాతిపదికగా వుంటుందా? లేదా? అన్నది మరో ఆసక్తికర  పార్శ్వం.

            *ఇప్పుడు కేంద్రంలో అధికారంలోవున్న బిజేపికి బౌధ్ధిక సరోవరం ఆరెస్సెస్. అది మొదటి నుండీ రాజ్యాంగాన్ని స్వదేశీ విలువలు సాంప్రదాయాలకు వ్యతిరేకమైన విదేశీ భావన అంటోంది. మరోవైపు, మావోయిస్టులు సహితం రాజ్యాంగం పెట్టుబడీదారీ ప్రయోజనాలను నెరవేర్చేందుకు పుట్టింది అని విమర్శిస్తుంటారు. చెరో వైపు నుండి చెరో విధంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించే శక్తులు రాజ్యాంగం ప్రాతిపదికగా శాంతి చర్చలు ఎలా సాగిస్తాయో చూడాలి.*

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టు పార్టి కూడ ఇప్పుడు రాజ్యాంగం మీద నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టులు రాజ్యాంగబధ్ధంగా వ్యవహరించాలి అని ఛత్తీస్ గడ్ హోంమంత్రి విజయ్ శర్మ అంటున్నారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది అని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తూ మావోయిస్టులు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో రెండుసార్లు రాజ్యాంగ విలువల ప్రస్తావన వుండడం ఒక విశేషం అనొచ్చు.

కాల్పుల విరమణఅనే గంభీరపు మాటల్ని పక్కన పెట్టి మావోయిస్టులే ఒక శాంతి కమిటీనో, ఒక రాయబారినో ప్రభుత్వం దగ్గరికి పంపించాలని ఛత్తీస్ గడ్ ప్రభుత్వం అంటున్నది. అమిత్ షా అయితే, మావోయిస్టులు ఆయుధాలను దించే పక్షంలో వాళ్ళ కోసం ఒక ఆకర్షణీయమైన ఫ్యాకేజీని అందజేస్తామంటున్నారు. బస్తర్ లో విద్యా, వైద్య సదుపాయాలు, రోడ్లు, కరెంటు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను కల్పించడమేగాక, ప్రతి కుటుంబానికి 60 కేజీల బియ్యం, కొంత నగదు, ఒక్కో గ్రామానికి కోటి రూపాయల మంజూరుతో పాటు ప్రముఖ మావోయిస్టుల తలల మీదున్న రివార్డుల్ని కూడ వారికే ఇస్తామంటున్నారు. ఇటీవల బస్తర్ పాండుం ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షా మావోయిస్టుల్నిసోదరులుఅని సంబోధించడం విశేషం. “మీ మరణం మాకేమీ ఆనందాన్ని ఇవ్వదు. ఆయుధాలు వదిలిపెట్టి దేశ అభివృధ్ధికి తోడ్పడండిఅని ఆయన పిలుపిచ్చారు.

బస్తర్ లోనికి మావోయిస్టులు ప్రవేశించిన తరువాత అక్కడ ఒకరకం సమసమాజం ఏర్పడిందనే ప్రచారం ఒకటి జరుగుతోంది. ఇదొక తప్పుడు అవగాహన. ఆదివాసి సమూహాల్లో అనాదిగానే ఒకరకం కమ్యూనిస్టు సమాజం వుంటుంది. అంతేకాక, మాతృస్వామిక సమాజ లక్షణాలు కూడ వాళ్ళలో వుంటాయి. అక్కడికి బయటి సమాజం ప్రవేశించినపుడే కాలుష్యం మొదలవుతుంది.

సందర్భంగా, ఒక సైధ్ధాంతిక సందేహం కూడ ముందుకు వస్తోంది. సిపిఐ- మావోయిస్టులు ప్రకటిత కార్యక్రమానికీ బస్తర్ లో వాళ్ళు సాగిస్తున్న కార్యకలాపాలకూ పొంతన వుందా?. బయటి ప్రపంచానికి తెలిసినంత వరకువ్యవసాయ విప్లవం - నూతన ప్రజాస్వామిక విప్లవంఅంతిమంగా సామ్యవాద సమాజ నిర్మాణం అనే మూడంచెల కార్యక్రమం మావోయిస్టులకు వుంది. ఇందులో మొదటిదయిన వ్యవసాయ విప్లవానికిదున్నేవానిదే భూమిఅనేది ప్రధాన నినాదం. దానికి అద్భుతంగా అనువైన ప్రాంతం గోదావరి, కృష్ణా మండలాలు. అక్కడి నాలుగు జిల్లాల్లో 95 శాతం కమతాల్ని కౌలు రైతులే దున్నుతారు. డెల్టా ప్రాంతంలో వ్యవసాయిక విప్లవానికి  అంతటి అనువైన అవకాశాల్ని వదులుకుని అడవులకు  వెళ్ళడం అంటే వాళ్ళు తమ ప్రకటిత కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వుండాలి.   

మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఫాసిజం ప్రస్తావన వుంది. దానికి ప్రధాన బాధితులు ఆదివాసులు , మత మైనారిటీలు అనే అర్ధం వచ్చే వాక్యాలూ వున్నాయి. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి బాధితులయిన ఆదివాసులు, మత మైనారిటీలు, తదితర పీడిత సమూహాల  విముక్తి కోసం ఒక కొత్త విప్లవ కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్టు వాళ్లు ప్రకటించవచ్చు. వాళ్లు పనీ చేయలేదు. సైధ్ధాంతిక గందరగోళం నుండి బయటపడనంత వరకు మావోయిస్టుల మీద బస్తర్ బయటవున్న సామాన్య ప్రజలకు ఒక స్పష్టత రాదు.

1970లలో నక్సలైట్ల కేసులు విచారణకు వచ్చినపుడు ఒక వాదన బలంగా వినిపించేది. ఆయుధాలతో మాత్రమే ప్రజావ్యతిరేక వ్యవస్థను నిర్మూలించగలమనేది నక్సలైట్ల ప్రధాన సిధ్ధాంతం. ప్రభుత్వంకత వేరురాజ్యాంగాన్ని అమలు చేస్తామని  రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చేపడుతాయి కనుక ప్రభుత్వాలు రాజ్యాంగానికే కట్టుబడి వుండి తీరాలి అనే భావన అప్పట్లో బలంగా వుండేది. ఆయుధాన్ని చేపట్టి నేరానికి పాల్పడిన వారిని మాత్రమే శిక్షించాలనీ, పీడక సమాజాన్ని ఆయుధాలతో కూల్చక తప్పదనే భావాలను శిక్షించరాదనీ అప్పట్లో న్యాయమూర్తులు సహితం బలంగా నమ్మేవారుఇప్పుడు భావన బలహీనపడింది. సమాజాన్ని మార్చడానికి హింస తప్పదని భావించేవారిని సహితం హింసతోనే అణిచివేయాలనే భావన బలపడుతోంది.

            స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, ప్రజాందోళనల్ని అదుపు చేయడానికి పోలీసుల్ని ప్రయోగించడాన్ని  చాలామంది తప్పుపట్టేవారు. 1948లో మద్రాసు స్టేట్ లో చెలరేగిన హింది వ్యతిరేక ఆందోళనను అణిచివేయడానికి అప్పటి ముఖ్యమంత్రి సి రాజగోపాలచారి  పోలీసులను రంగంలో దించారు. చర్యను స్వాతంత్ర్య సమర యోధులు గట్టిగా విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో 1950 నాటి  ఆహార కొరత ఆందోళనను అణిచివేయడానికి అప్పటి ముఖ్యమంత్రి బిసి రాయ్ పోలీసుల్ని వుపయోగించడం కూడ పలు విమర్శల్ని ఎదుర్కొంది. ప్రజల్ని అదుపు చేయడానికి ఇప్పుడు పోలీసుల్నే కాక ఏకంగా సైన్యాన్నే రంగంలోనికి దించుతున్నారు.

దేశ శత్రువులు సరిహద్దుకు ఆవల మాత్రమే వుండరు; దేశం లోపల కూడ వుంటారు. ఆయుధాల్లోనేకాక ఆలోచనల్లోనూ దేశానికి ప్రమాదం పొంచివుంది - అనే ఒక కొత్త సిధ్ధాంతాన్ని రక్షణ వ్యవహారాల సలహాదారు అజిత్ దొవ్వాల్ ముందుకు నెడుతున్నారు. దీనికి వారు పెట్టిన ముద్దు పేరుఅర్బన్ నక్సల్స్ఆయుధాలను చేపట్టిన వారినేగాక, అలాంటి ఆలోచనలు కలిగిన వారిని సమర్ధించేవారిని  సహితం శిక్షించాలనేది కొత్త సిధ్ధాంతం. భావాలను సహితం శిక్షించాలనేది దీని సారాంశంఆలోచనాపరులు, పౌరసమాజం మీద విరుచుకుపడడానికి ప్రభుత్వం రంగం సిధ్ధం చేసుకుంటోంది అనడానికి ఇది సంకేతం. ఆలోచనాపరులు, పౌరసమాజం దీన్ని తీవ్రంగా ఖండించాలి. లేకుంటే పూడ్చుకోలేని నష్టం జరిగిపోతుంది.

*డానీ*

సమాజ విశ్లేషకులు

9010757776

https://www.andhrajyothy.com/2025/editorial/chhattisgarh-maoist-conflict-bastar-region-naxaluprising-1393108.html

No comments:

Post a Comment