Thursday, 24 April 2025

*ఆదానీ, అంబానీ పేరు చెప్పగానే అధికారపక్షం, ప్రతిపక్షం ఒకటైపోతున్నారు*

*ఆదానీ, అంబానీ పేరు చెప్పగానే అధికారపక్షం, ప్రతిపక్షం ఒకటైపోతున్నారు*

 

‘సెకీ- ఆదానీ  సోలార్‌ విద్యుత్తు ఒప్పందం రద్దు చేయాలి’

రౌండ్ టేబుల్ సదస్సులో సివిల్ సొసైటీ కన్వీనర్ డానీ ప్రసంగం.

 

24 ఏప్రిల్ 2025, గురువారం, బాలోత్సవ్ భవన్, విజయవాడ  

 

6 mnts.

(నిముషానికి 75 పదాలు / 500 క్యారెక్టర్స్) 




 

మిత్రులారా!

సెంటర్ ఫర్ లిబర్టి సంస్థకూ,

ఇవ్వాల్టి రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ నిర్వాహకులు నలమోతు చక్రవర్తిగారికి,

నాకు మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు.

 

చక్రవర్తిగారు ఈ సదస్సుకు నన్ను ఆహ్వానిస్తూ ఒక సూచన చేశారు.

మీరు వచ్చి మీ కమ్యూనిస్టు అభిప్రాయాల్ని చెప్పాలి అన్నారు.

నేను దానికి కట్టుబడే మాట్లాడుతాను.

 

కేంద్ర ప్రభుత్వం గురించి మనుకున్న సాధారణ అభిప్రాయం ఏమంటే నరేంద్ర మోదీజీ ప్రధాన మంత్రి అయ్యాక ఆదానీ, అంబానీల సంపదను అడ్డగోలుగా పెంచేస్తున్నారు అని.  ఈ నేరేటివ్ నే మనం నమ్ముతున్నాం. అదే మాట్లాడుతున్నాం.

 

ఇది తలకిందులు అవగాహన.

వాస్తవం అదికాదు.

 

1848 నాటి కమ్యూనిస్టు పార్టి మ్యానిఫెస్టో లోనే కార్ల్ మార్క్స్ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు.

పెట్టుబడీదారీవర్గం తన ప్రయోజనాలను సాధించిపెట్టే విధంగా రాజకీయ రంగంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రూపొందించుకుంది అన్నాడు.

 

పెట్టుబడీదారులకు ఒక్కటే ప్రయోజనం. విపరీతంగా లాభాలు సంపాదించుకోవడం.

 

దాని అర్ధం ఏమంటే, ఆదానీ, అంబానీ తదితరులు కలిసి నరేంద్ర మోదీజీ ప్రధాని అయితే తమ సంస్థలు మరింత లాభాలు గడిస్తాయని అనుకున్నారు. గుజరాత్ ప్రయోగం సక్సెస్ అయ్యాక ఆయన్ని తీసుకుని వచ్చి ప్రధానిని చేసుకున్నారు.

 

మెగా కార్పొరేట్లు చేసిన ప్రధాని గాబట్టి మోదీజీ కూడ  కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు.

 

మోదీజీ మూలంగా కార్పొరేట్లు బలపడడంలేదు; తాము బలపడడం కోసమే కార్పొరేట్లు మోదీజీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టుకున్నారు.

దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నయినా వుండవచ్చు. వాటన్నింటి రాజకీయార్ధిక  అవగాహన మాత్రం ఇదే.  

 

ఈ సదస్సులో చిగురుపాటి బాబూరావు తొలి ప్రసంగం చేసినప్పటి నుండి, తుంగ లక్ష్మీనారాయణ తదితరుల ఉపన్యాసాలు వింటుంటే నాకు ఎన్నడో పదో తరగతిలో విన్న బమ్మెర పోతన భాగవత పురాణం గుర్తుకు వస్తున్నది.

 

మహా భాగవతం తొలి స్కందంలోనే ఒక ఆసక్తికర సన్నివేశం వుంటుంది. వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు శాపగ్రస్తులై భూలోకానికి పోవాల్సి వస్తుంది. అప్పుడు వారికి విష్ణుమూర్తి రెండు ఛాయిస్ లు ఇస్తాడు. నా భక్తులుగా అయితే ఆరు జన్మల్లోనూ, నా ప్రత్యర్ధులుగా అయితే మూడు జన్మల్లోనూ వైకుంఠానికి తిరిగి వస్తారు అంటాడు.

 

ఆ సన్నివేశాన్ని ఇప్పటి రాజకీయాలకు వర్తింపజేస్తే  ఏమవుతుందీ?

చంద్రబాబులా ఎన్డీయే కూటమిలో సభ్యులుగావున్నా, జగన్ లా కూటమికి ప్రత్యర్ధిగా వున్నా ఇద్దరూ ఐక్యమై తరించాల్సింది మోదీజీ సేవలోనే.

 

అటునేనే – ఇటూ నేనే అన్నమాట. బేధం ఒక భ్రమ.

 

మోదీజీ సేవలో తరించడం అంటే దేశ సహజ సంపదను, కుత్రిమ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడం.

 

బయటికి ప్రత్యర్ధులుగా కనిపిస్తూ ఒకే పనిచేసేవారి గురించి గోగోల్ కథ ఒకటి వుంది. నాకు అది కూడా ఇప్పుడు గుర్తుకు వస్తున్నది.

 

ఆదానీ సంస్థతో జగన్  సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు అది రాష్ట్రానికి నష్టదాయకం అని, దాన్ని ఆపాలని తెలుగు దేశం పార్టి చాలా పెద్ద రాద్దాంతం చేసింది. ఆ పార్టికి చెందిన ఓ సీనియర్  నాయకుడు న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వాజ్యం – పిల్ - వేశారు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ఆర్ధిక శాఖామంత్రి. కానీ, విచిత్రంగా ఆ ఒప్పందాన్నీ , ఆ వాజ్యాన్నీ వారు మరచి పోయారు.

 

వారు నిద్రపోవడానికి ఏం పిల్లు వేశారో?

 

భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు వంటి పాత పంచభూతాలన్నీ వాళ్లకు కావాలి. వాటితోపాటు విద్యుత్తు, గ్యాస్, టెలీకామ్, రైల్వేలు వంటి కొత్త పంచభూతాలు కూడా వారికే కావాలి.

 

అస్మదీయ కార్పొరేట్లకు ఇవ్వడం కోసం ఇండియాలో 30 కోట్ల ఎకరాల ల్యాండ్‍ బ్యాంకును సిధ్ధం చేశారు.

 

అంతర్జాతీయ సరిహద్దు నుండి వంద కిలో మీటర్ల లోపున్న ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి ఎప్పుడయినా వాడుకోవచ్చు అని ఒక చట్టం చేశారు. వ్యూహాత్మక ప్రాజెక్టులు అంటే ఏమిటీ? ఆదానీ అంబానీలకు అప్పచెప్పడం.

 

 మణిపూర్ లో అల్లర్లు వుధృతంగా చెలరేగుతున్నప్పుడు ఈ చట్టం వచ్చింది. ఆ సమయంలో నేను మిజోరంలో మణిపూర్ బాధితుల శిబిరంలో వున్నాను. అప్పుడు నాతో వున్న ఒక కుకీ జో ప్రొఫెసర్ తమకు నిలబడడనికి నేల లేకుండ చేయడానికే  ఆ చట్టాన్ని తెచ్చారని అన్నాడు.

 

అది నిజమే. మిజోరం వెడల్పు 120 కిలో మీటర్లు. అటు మయన్మార్, ఇటు బంగ్లాదేశ్. చెరోవైపు చెరో వంద కిలోమీటర్లు తీసేస్తే  ఆ రాష్ట్రం వుండదు. అలాగే మణిపూర్, అలాగే నాగాలాండ్. అసలు ఈశాన్య రాష్ట్రాలే దాదాపు వుండవు.

 

దేశంలోని షిప్ యార్డులన్నీ వాళ్ళవే. విమానాశ్రయాలన్నీ వాళ్ళవే, ఒకటి అరా ఇతరులు ఎవరికైనా వుంటే వాటిని స్వాధీనం చేసుకోవడం వాళ్ళకు బాగా తెలుసు. సామ దాన బేధ దండోపాయాల్ని ఉపయోగించి లక్ష్యాన్ని సాధించుకోవడంలో వాళ్లు నిపుణులు.

 

బాహాటంగా సాగుతున్న ఈ క్రౌర్యం, ఈ కపటం అన్నీ మనకు స్పష్టంగా  తెలుసు. రోజూ మనం ఐమ్యాక్స్ స్క్రీన్  మీద 3డి సినిమా చూస్తున్నాం.

 

కానీ, వీటిని ఎలా ఆపాలో మనకు తెలియడం లేదు.

 

రాష్ట్రంలో గత ప్రభుత్వం మీద అన్ని ఆరోపణలు చేసిన వారు అంత రగడ చేసిన వారు తమ చేతికి అధికారం వచ్చాక ఎందుకు మౌనంగా వుండిపోతున్నారూ?

 

టిటిడి ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ మీద టిడిపి ఎంత  గొడవ చేసిందో  మనకు తెలుసు. ఏడాదికి ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం వచ్చే  సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం మీద  అంతకన్నా పెద్ద గొడవ చేయాలి కదా?

 

కానీ, రాజీ పడిపోతున్నారు. ఆదానీ, అంబానీల పేరు చెప్పగానే భయంతో వణికిపోతున్నారు. ఈ విషయంలో అధికారపక్షం, ప్రతిపక్షం ఒకటే.

 

ఇప్పుడు టెండర్లన్నీ ఒక్కరికే దక్కేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు. బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో  కేసుల్ని ఎదుర్కొంటున్నవారు మాత్రమే టెండర్ వేయడానికి అర్హులు అన్నా ఆశ్చర్యం ఏమీలేదు. రేపు గౌతమ్ ఆదానీ ఎత్తూ బరువు వున్న వాళ్ళు మాత్రమే టెండర్ వేయాలని అన్నా అనవచ్చు.

 

మోదీజీ పాలనలో ఏదీ అసాధ్యం కాదు. ఏదీ ఆశ్చర్యమూ కాదు.

 

మొత్తం వ్యవహారం ఒక ప్రహసనంగా నవ్వులాటగా మారిపోయింది. చట్టాన్ని వాడడం కాదు; అతిగా వాడడంకాదు; దుర్వినియోగం చేయడం కూడ కాదు; ఎబ్యూజ్ చేస్తున్నారు. అత్యాచారం!

 

నిజానికి ఇది సాంప్రదాయ పెట్టుబడీదారీ సమాజం కూడ కాదు; దానికో పధ్ధతి వుండేది.

 

ఇది లుంపెన్ పెట్టుబడీదారీ సమాజం. అరాచక పెట్టుబడీదారీ సమాజం.

 

ఇది మారాలి. దీన్ని మార్చాలి.

దాని కోసం మనందరం ప్రత్నించాలి.

 


సెకీ - అదానీ ఒప్పందం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం |

https://www.youtube.com/live/4_OOe66KXmg

No comments:

Post a Comment