State-sponsored religious bias
*ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం*
డానీ, సమాజ విశ్లేషకులు
9010757776
*ఈరోజు సాక్షిలో నా వ్యాసం. చదివి మీ అభిప్రాయాలు తెలపండి.*
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్ అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమల్లో వుంది. ఇప్పుడు దీన్ని United Waqf Management, Empowerment, Efficiency and Development (UWMEED) Act-2025గా మార్చారు.
వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్ సభలో 288 – 232 ఓట్లతో గెలిచింది. రాజ్య సభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్లతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడ పడిపోయింది.
ఇక్కడ ఒక విశేషం వుంది. 543 మంది సభ్యులున్న లోక్ సభలో ముస్లింలు 24గురు మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 208 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది.
కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుధ్ధంగా వుందనీ, దాన్ని పునఃస్సమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు, సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుధ్ధంగా బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి.
ఒక బిల్లు వుభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారేక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది.
కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం వున్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ప్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్ గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావీజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునోకాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం. కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం వివాదంగా మారింది.
వక్ఫ్ భూములకు దస్తావీజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మనదేశంలో అసలు దస్తావీజులు, రిజిస్ట్రేషన్ల సాంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్విత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడ ఇప్పటి బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారి విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దాం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి.
ఇక్కడ ఇంకో ప్రాణప్రదమైన అంశాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ రచన సాగుతున్న రోజుల్లోనే ఆలయాల మనుగడ అంశం ముందుకు వచ్చింది. కొత్తగా నిర్మించిన కొన్ని మసీదుల కింద హిందూ దేవాలయాల శిధిలాలు వుండే అవకాశం వుంది. ఆ హిందూ దేవాలయాల శిధిలాల కింద భౌధ్ధ జైన దేవాలయాల శిధిలాలు వుండవచ్చు. వాటి కింద అంతకన్నా పురాతన మత ఆరాధనా స్థలాల శిధిలాలు వుండవచ్చు. అంతిమంగా ఆదివాసుల ఆరాధనా చిహ్నాలు కనిపీంచవచ్చు. అలా ఎంత వెనక్కి మనం చరిత్రను తవ్వుకుంటూ పోతాం? దీనికో పరిష్కారాన్ని ఆనాటి పెద్దలు కనుగొన్నారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోవున్న సమస్త మతాల దేవాలయాల యధాస్థితిని కాపాడాలి అనేది ఆ అంగీకారం. అప్పటికే ఒక కోర్టు వివాదం నడుస్తున్న కారణంగా అయోధ్యలోని బాబ్రీ మసీదు ఒక్క దానికే ఇందులో మినహాయింపు ఇచ్చారు.
అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్తించుకుంది. “మనం చరిత్రను తిరగరాయలేం” అని భారత ప్రధాన న్యాయమూర్తి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు.
వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సోలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిన ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా?సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ-నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు వుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న, పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే కొత్త ప్రధాన న్యాయమూర్తి చేత అనుకూలమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.
రచన : 18 ఏప్రిల్ 2025
ప్రచురణ : sAkShi 20 ఏప్రిల్ 2025
https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=20/04/2025&pgid=606172&device=desktop&view=3
No comments:
Post a Comment