శాంతిచర్చలకు వచ్చిన నక్సల్ నాయకుడిని ఒరిస్సాలోని డెన్ కు సురక్షితంగా చేర్చిన
*ఒక అద్భుత ప్రయాణం!*
కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు మావోయిస్టులు
సిధ్ధం అయ్యారు. ఇటీవల బస్తర్ పాండుమ్ ఉత్సవాల
ముగింపు కార్యక్రమానికి దంతేవాడ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడ శాంతిచర్చలకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. మావోయిస్టుల్ని
‘సోదరులు’ అని సంభోదించారు. ఛత్తీస్ గడ్ తోపాటు మావోయిస్టుల ప్రభావం వున్న పరిసర రాష్ట్రాల
ప్రభుత్వాలతో కూడ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో త్వరలో శాంతి చర్చలు జరగవచ్చు.
గతంలో జరిగిన శాంతిచర్చలు సహజంగానే
ఈ సందర్భంలో గుర్తుకు వస్తాయి. తిరుపతిలోని అలిపిరి దగ్గర 2003 అక్టోబరు 1న అప్పటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు కారు మీద పీపుల్స్ వార్ నక్సలైట్లు బాంబుదాడి చేశారు. ఆ దాడి
నుండి ఒక అద్భుతంగా చంద్రబాబు బయటపడ్డారు. ప్రజల ఐఏఎస్ అధికారిగా పేరుగాంచిన ఎస్
ఆర్ శంకరన్, ఈ నేపథ్యంలో, చొరవ చేసి శాంతి
చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. విచిత్రం ఏమంటే 1987లో తూర్పుగోదావరిజిల్లా
గుర్తేడులో పీపుల్స్ వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేసిన ఏడుగురు ఐఏఎస్ అధికారుల్లో
శంకరన్ కూడ ఒకరు. అప్పట్లో వారు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా వుండేవారు.
శాంతి చర్చలకు పీపుల్స్ వార్ కూడ
సంసిధ్ధత వ్యక్తం చేసింది. విధివిధానాల గురించి చర్చలు సాగుతున్న దశలోనే 2004
ఎన్నికలొచ్చి చంద్రబాబు ప్రభుత్వం పడిపోయింది.
కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయిన
వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన వాగ్దానాల్లో నక్సలైట్లతో శాంతి చర్చలు జరుపుతామన్నది ఒకటి.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చే జీవో మీద తొలి సంతకం చేసిన రాజశేఖర రెడ్డి పీపుల్స్
వార్, జనశక్తి పార్టీలకు చెందిన నక్సలైట్లను శాంతి చర్చలకు పిలిచారు. ఆ తరువాత
చాలా కసరత్తు సాగింది. వాటిల్లోనూ ఎస్ ఆర్ శంకరన్ కీలక పాత్ర వహించారు. ముందు రాయబారుల
కమిటి ఏర్పడింది. వరవరరావు, గద్దర్, కళ్యాణరావు , మరొకరు అందులో సభ్యులు.
అప్పట్లో కే. జానా రెడ్డి
హోంమంత్రిగా వుండేవారు. ఆయనే ప్రభుత్వ బృందానికి నేత. ఆయనతోపాటు మరో ముగ్గురు
మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరో నలుగురు అందులో వున్నారు. పీపుల్స్ వార్ రాష్ట్ర
కార్యదర్శి రామకృష్ణ (ఆర్కే), సుధాకర్ (చెలం) మరొకరు పీపుల్స్ వార్ పక్షాన, అమర్,
మరొకరు జనశక్తి పక్షాన నక్సల్స్ ప్రతినిధులుగా వచ్చారు.
జూబిలీ హిల్స్ లోని మర్రి
చెన్నారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ లో
అక్టోబరు 15 ఉదయం చర్చలు మొదలయ్యాయి. అదేరోజు వైయస్ రాజశేఖర రెడ్డి పులిచింతల ప్రాజెక్టుకు
శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఇంకో విచిత్రం జరిగింది వైయస్ ప్రభుత్వం పీపుల్స్ వార్ ను
చర్చలకు పిలిచింది. వాళ్ళ రాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ చేరుకున్నాక పీపుల్స్
వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టిల కేంద్ర కమిటీలు ఏకమై సిపిఐ – మావోయిస్టుగా
ఏర్పడ్డాయి.
నాలుగు రోజులు సాగిన చర్చలు రాజకీయ
వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ చాలా ఆసక్తిని కలిగించాయి. నక్సల్
ప్రతినిధులకు విడిదిగా ఇచ్చిన మంజీర గెస్ట్ హౌస్ కు నిరంతరం అనేక ప్రజా సంఘాల
ప్రతినిధులు గుంపులు గుంపులుగా వచ్చి తమ సమస్యల్ని చెప్పుకునేవారు.
నక్సల్ ప్రతినిధులు అనేక
డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. వాటిల్లో పేదలకు భూమి పంపిణి అనే అంశం మీద
వైయస్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఆ నాలుగేళ్ళు చాలా
పెద్ద స్థాయిలో భూమిని పంచింది. ఇది స్పష్టంగా కనిపించిన విజయం.
శాంతి చర్చలు లాభించలేదనే అభిప్రాయం
నక్సల్స్ అభిమానులు చాలా మందిలో వుంది. చర్చలవల్ల ప్రభుత్వ పరపతి పెరిగినంతగా
నక్సల్స్ పరపతి పెరగలేదు. దానికి అనేక కారణాలున్నాయి. మావోయిస్టులు తెలంగాణ
ఉద్యమానికి మద్దతు పలకిన తరువాత అటు ఆంధ్రా ప్రాంతంలో వారికి సాధారణ అభిమానులు
తగ్గుముఖం పట్టారు. ఇటు తెలంగాణలోనూ వారికి లాభించిందేమీ లేదు. కేసిఆర్ వారికి
చేసిన మేలేమీ లేకపోగా టిఆర్ ఎస్
ప్రభుత్వం మీద ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత మావోయిస్టుల మీద కూడ పడింది.
జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా
ఆనాటి చర్చల్లో పాల్గొన్న అమర్ అభిప్రాయం ఇందుకు భిన్నంగా వుంది. ఆనాడు గోదావరి
లోయలో వరుస ఎన్ కౌంటర్లతో తమ పార్టి ఊపిరి ఆడని స్థితిలో పడిపోయిందనీ, చర్చలకు
ఆహ్వానించడంతో ‘బ్రీదింగ్’ స్పేస్ దక్కిందని ఆయన ఇటీవల ఓ సందర్భంలో అన్నారు.
నాకు వైయస్ జరిపిన శాంతి చర్చలతో
ఒక వ్యక్తిగత అనుబంధం వుంది. నేను అప్పట్లో ఓ శాటిలైట్ ఛానల్ కు ముఖ్యమంత్రి పేషీ
బీట్ చూస్తున్నాను. అటు ముఖ్యమంత్రి, హోంమంత్రి, కోనేరు రంగారావు, పాలడుగు
వెంకట్రావులతో సన్నిహితంగా వుండేవాడిని. ఇటు, వరవరరావు, గద్దర్, శంకరన్ లతో కూడ
సన్నిహితంగా వుండేవాడిని.
పీపుల్స్ వార్ ప్రతినిధిగా చర్చలకు
వచ్చిన సుధాకర్ ( చెలం) ఉద్యమంలో నాకు జూనియర్. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ
సమీపంలోని జమీందార్ బిల్డింగు హాస్టల్ లో మేమిద్దరం ఒకే గదిలో వుండేవాళ్ళం. 1981లో నేను హోల్ టైమర్ జీవితం నుండి పార్ట్
టైమర్ గా మారినపుడు చెలానికి శిక్షణ ఇవ్వాల్సిందిగా కేజి సత్యమూర్తి నన్ను కోరారు.
చెలం నా భార్య అజితకు సీనియర్; గురువు కూడ.
నక్సల్ ప్రతినిధులు శ్రీశైలం
సమీపంలోని చిన ఆరుట్ల దగ్గర అక్టోబరు 12న బయటపడి, చారిత్రాత్మక గుత్తికొండబిలం దగ్గర సభ
జరిపి ప్రభుత్వంతో చర్చలకు వచ్చారు.
ప్రభుత్వం కూడ చర్చల తరువాత టెక్నికల్ గా
వాళ్ళను చిన ఆరుట్ల దగ్గరే సురక్షితంగా దించేసింది. కానీ, అది వాళ్ళ స్థావరం కాదు.
ఐదుగురికి వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు డెన్ లున్నాయి. వాళ్ళు తమ పధ్ధతుల్లో
రహాస్యంగా తమ డెన్ లకు చేరుకోవాలి.
నేను, అజిత ఇద్దరం సుధాకర్ (చెలం)ను
చినఆరుట్ల నుండి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో సురక్షితంగా దించి వచ్చాము. అదొక అద్భుత
ప్రయాణం. ఆ వివరాలు ఇంకో సందర్భంలో చెప్పుకుందాం.
10 ఏప్రిల్ 2025
శాంతిచర్చలకు వచ్చిన నక్సల్ నాయకుడిని ఒరిస్సాలోని డెన్ కు సురక్షితంగా చేర్చిన
*ఒక అద్భుత ప్రయాణం!*
No comments:
Post a Comment