Sir,
ఈ
వెర్షన్ ను ప్రచురణకు పరిశీలించండి.
-డానీ.
Constitution Vs Rifle
రాజ్యాంగం వెర్సస్ రైఫిల్
డానీ
సమాజ విశ్లేషకులు
మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడ సానుభూతి వుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే
వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరు నవ్వినా మరొకరు ఏడ్చినా జరగాల్సిందే జరుగుతోంది!.
మావోయిస్టు గెరిల్లాలు 70 మంది తుపాకులు తెచ్చి
ముఖ్యమంత్రికి స్వాధీనంచేసి వారి చేతుల మీదుగా రాజ్యాంగ ప్రతుల్ని అందుకున్నారు. ఇదొక
పారడాక్సీ వేడుక. రాజ్యాంగం వెర్సస్ రైఫిల్! ఇలాంటి వేడుకలు
సమీప భవిష్యత్తులో ధారావాహికంగా మరికొన్ని జరగవచ్చు. మనలో చాలామంది గుర్తించడానికి నిరాకరిస్తారుగానీ ఇలా జరగాలని 1990లోనే ‘లిఖించబడింది’.
ఇప్పుడు చాలామంది మరచిపోయినట్టున్నారుగానీ,
దేశంలో రక్తపాత విప్లవాన్ని నివారించడానికే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. నిజాం సంస్థానంలోని
తెలంగాణలో 1946 జులై 4న రైతాంగ సాయుధ పోరాటం ఆరంభం అయింది. ఆ ఏడాది డిసెంబరు 9న భారత
రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. నాలుగు
రోజుల తరువాత డిసెంబరు 13న జవహర్ లాల్ నెహ్రు లక్ష్య ప్రకటన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
రాజ్యాంగంలో పొందుపరచిన ప్రతి ఆదర్శం వెనుక,
ప్రతి ఉద్దీపన చర్య వెనుక రక్తపాత విప్లవాన్ని నివారించాలనే లక్ష్యం వుంది. రాజ్యాంగ
రచనా కమిటి అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించిన బిఆర్ అంబేడ్కర్ ఈ విషయాన్ని దాదాపు స్పష్టంగానే
చెప్పారు. రాబోయే ప్రభుత్వాలు సామాజిక, ఆర్ధిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు
తిరగబడి ప్రజాస్వామిక భవనాన్ని పేల్చిపడేస్తారు అని రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో
హెచ్చరించారు.
మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రకటనగా
రూపొందడానికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం కూడ ఒక కారణం అంటే అతిశయోక్తి ఏమీకాదు. ఆ తరువాత
చెలరేగిన నక్సలైట్ పోరాటాల వ్యాప్తిని నిరోధించడానికే భూపరిమితి, అటవీ భూములు, ఆదివాసుల
హక్కుల రక్షణ వగయిరా చట్టాలు రూపొందాయి. ప్రతి
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు అల్పాదాయవర్గాలకు ఏవో కొన్ని కొత్త సంక్షేమ పథకాలను
ప్రకటిస్తూనే వస్తున్నాయి. రాజ్యాంగ తొలి ఆదర్శాలయిన సమానత్వం సోదర భావాలకు మరింత బలాన్ని,
స్పష్టతను చేకూర్చడానికి రాజ్యాంగ పీఠికలో మతసామరస్యం, సామ్యవాదం ఆదర్శాలు చేరింది
కూడ నక్సలైట్ల భయంతోనే. అంచేత నక్సలైట్ల పోరాటాలు, ప్రాణత్యాగాలు వృధా ప్రయాసలు అనడానికి
వీల్లేదు. వాటి పని అవి చేశాయి. వాటిని మనం
ఆస్వాదిస్తున్నాం కూడ.
వందేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టి చరిత్రను
మన ఆసక్తి మేరకు వంద సంకలనాలుగా రాయవచ్చు. రెండు అధ్యాయాల్లో రాయాలంటే మాత్రం దానికో
ప్రమాణం వుంది. అది;1990లకు ముందు, 1990ల తరువాత.
పెట్టుబడీదారీ
సమాజం రెండు పనులు చేస్తుంది; యంత్రాల వినియోగాన్ని పెంచి సంపదని విపరీతంగా సృష్టిస్తుంది;
అదే సందర్భంలో సృష్టికర్తలకు యజమానులకు మధ్య శతృత్త్వాన్ని కూడ విపరీతంగా పెంచుతుంది.
ఈ రెండు ధోరణులు సమాజాన్ని అనివార్యంగా సామ్యవాదం
వైపుకు నడిపిస్తాయనేది మార్క్సిస్టు మూల సిధ్ధాంతం. వైచిత్రి ఏమంటే, పెట్టుబడీదారీ
వ్యవస్థ శ్రామికులు, యజమానుల మధ్య శత్రుత్త్వాన్ని పెంచకుండానూ బతకలేదు; పెంచినా బతకలేదు.
రెండింటి మధ్య తెలివిగా తన అస్తిత్త్వాన్ని కాపాడుకోవడానికి అది నిరంతరం సృజనాత్మకంగా
జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తుంటుంది.
1917లో రష్యాలో అక్టోబరు విప్లవం తరువాత ప్రపంచవ్యాప్తంగా
పెట్టుబడీదారీ వ్యవస్థ వెలుగు తగ్గింది. రెండో ప్రపంచ యుధ్ధకాలంలో ఫాసిజం, నాజీజంలను
ఓడించడంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్రను నిర్వహించడంవల్లనూ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇరుకున
పడింది.
అయితే, అంతర్గత బలహీనతలు లోపాలు శాపాలు కమ్యూనిస్టులకు
బోలెడు వున్నాయి. అలనాడు తెలంగాణలో సాగినవిగానీ,
తరువాత నక్సలబరీ ప్రేరణతో అనేక రాష్ట్రాల్లో కొనసాగినవి గానీ కొన్ని గెరిల్లా చర్యలేగానీ
సాయుధ పోరాటం కాదు. స్థాయీ సైన్యాలను ఎదుర్కొనేలా
ప్రజల్ని సన్నధ్ధం చేయడంలో విప్లవ కమ్యూనిస్టు పార్టిల వరుస నాయకత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి.
పార్లమెంటరీ పంథాను ఎంచుకున్న కమ్యూనిస్టు పార్టీలు కూడ తాము ఎంచుకున్న మార్గంలో అంతే
దారుణంగా చతికిలపడ్డాయి.
1990లకు కొంచెం అటూ ఇటుగా తూర్పు యూరప్ లోని
సోషలిస్టు దేశాలు పతనమయ్యాయి. సోవియట్ రష్యా విఛ్ఛిన్నం అయ్యింది. చైనాలోనూ సోషలిస్టు
ధోరణులు తగ్గి పెట్టుబడీదారీ ధోరణులు పెరిగాయి.
ఫలితంగా, కమ్యూనిజానికి ఆమోదాంశమే ఇరుకున పడిపోయింది.
సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న
ప్రపంచ పెట్టుబడీదారులు ఏకం అయ్యారు. మరోవైపు, ప్రపంచ కార్మికులు ఏకం కాకుండా ఈసారి
హైటెక్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్ధిక వనరులు ఎలాగూ పుష్కలంగా వున్నాయి. మేధోవనరుల్ని
కూడ సమకూర్చుకున్నారు. అప్పటికే క్లౌస్ మార్టిన్ స్క్వాబ్ వంటివారు ప్రపంచ ఆర్ధిక వేదికను
నడుపుతున్నాడు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ‘నిర్మాణాత్మక
సర్ధుబాట్లు’ సిధ్ధాంతాన్ని రూపొందించాయి. మరోవైపు, ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ విధానం
వచ్చింది. ఇదే అదనుగా, గ్యాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ సూదర్ ల్యాండ్ ప్రపంచ వాణిజ్య
సంస్థ నిర్మాణానికి నడుంబిగించాడు. చాలాకాలం ముందే ఆస్ట్రియా రాజకీయార్ధికవేత్త జోసెఫ్
షుంపీటర్ ‘సృజనాత్మక విధ్వంసం’ సిధ్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. జోయెల్ మోక్యర్, ఫిలిప్
అఘియన్,
పీటర్ హోవిట్ త్రయం దీనికో రోడ్ మ్యాప్ గీసిపెట్టారు.
2025 నోబెల్ బహుమానం ఇచ్చింది ఈ ముగ్గురికే!.
వీళ్ళందరూ చాలా తెలివైనవాళ్ళు. ఎక్కడా తాము సామ్యవాదానికి వ్యతిరేకులం అని చెప్పరు.
అలాగే పెట్టుబడీదారీ వ్యవస్థకు అనుకూలంగానూ మాట్లాడరు. మార్కెట్ ప్రజాస్వామ్యం, పర్యావరణ
రక్షణ, ప్రపంచ రక్షణ, మానవజాతి మనుగడ వంటి చాలా అందమైన పదాల్ని వాడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా
పెట్టుబడీదారుల సంపదను పెంచే ప్రణాళికలు రచిస్తుంటారు. కొత్త టెక్నాలజీలను సృష్టించి
ఉత్పాదకరంగంలో ఉత్పత్తిశక్తుల్ని అనుక్షణం మార్చేసుకుంటూ పోతుంటారు. మార్క్సిస్టులు సామాజిక పరిణామాలకు కొలబద్దగా భావించే ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు,
కమ్యూనిస్టు పార్టీలకే అర్ధంకాని ఒక మార్మిక వ్యవహారంగా మార్చేశారు.
వ్యవసాయాన్ని ఫ్యాక్టరీలు, రైళ్ళను ఆటోమోబైళ్ళు
అధిగమించడం వంటివి సాంప్రదాయ పెట్టుబడీదారీ వ్యవస్థల్లోనే జరిగాయి. ఇప్పుడు ఈ మార్పుల
వేగం విజృంభించింది. ఒకరోజు మార్కెట్లో వెలిగిన బ్రాండు మరునాడు కనిపించవు. మొబైల్
ఫోన్లలో కొన్నాళ్ళు వెలిగిపోయిన నోకియా, బ్లాక్ బెర్రీ, మోటరోలాలు ఇప్పుడు ఎక్కడా?
జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్లు ఇప్పుడు లేవు. ఒకదాన్ని అర్ధం చేసుకునేలోపునే దాన్ని
తీసివేసి దాని స్థానంలో మరోదాన్ని ప్రవేశ పెడుతుంటారు. దీనికి వాళ్ళు పెట్టిన అందమైన పేరు ‘సృజనాత్మక విధ్వంసం’!
దీనికి తోడు అనేక దేశాల్లో సనాతనవాదాలు, మతతత్త్వాలను
రెచ్చగొట్టడం మొదలెట్టారు. దీనితో రాజకీయలబ్దిని సులువుగా పొందడమేగాక కొత్తతరాలు సామ్యవాదం
వైపుకు మరలకుండా అడ్డుకోవడమూ సాధ్యం అవుతుంది. దీనికి సమాంతరంగా సామాజిక ఉనికివాద ఉద్యమాలు తలెత్తి సన్నివేశాన్ని ఇంకా సంక్లిష్టంగా
మార్చాయి. ఇంత జరిగిపోతున్నా సైధ్ధాంతిక రంగంలో పెట్టుబడీదారీ వ్యూహకర్తల్ని డీకొనే
ఆలోచనాపరుల్ని కమ్యూనిస్టు పార్టీలు సృష్టించుకోలేకపోయాయి.
దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న ఏకేశ్వరోపాశన!.
ప్రపంచ పెట్టుబడిదారులు ఇంతగా విజృంభిస్తున్న
సమయంలో, ఇండియాలో ప్రధాన నక్సలైట్ పార్టీగా భావించే పీపుల్స్
వార్ పార్టి నాయకత్వపోరులో నిండా మునిగివుంది. ముందు కేజి సత్యమూర్తిని తరిమేశారు.
తరువాత, సరిగ్గా అదే పధ్ధతుల్లో కొండపల్లి సీతారామయ్యను బయటికి పంపించారు. నిజానికి
కొండపల్లి, సత్యమూర్తి కలిసి కొనసాగినా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అనూహ్య మార్పులు
ఏమీ వచ్చేవికావు. వాళ్ళు చేయగలిగింది చేసేశారు. చరిత్రలో వాళ్ళ పాత్రలు అక్కడికే పరిమితం.
ఆ
తరువాత విప్లవపార్టీలకు నాయకత్వం వహించినవాళ్ళు ఆపాటి సమర్ధులు కూడ కాదు. పెట్టుబడీదారీ సమాజంలో అతి వేగంగా
జరిగిపోతున్న పరిణామాలను అర్ధం చేసుకుని విరుగుడు కనిపెట్టే స్తోమత వాళ్ళకు లేకపోయింది.
బ్రిటీష్ కాలంలో 303 రైఫిల్ గొప్పది. ఓ నలభైయేళ్ళ క్రితం ఏకే 47 గొప్పది. ఇప్పుడు మానవరహిత డ్రోన్లు, యుధ్ధవిమానాలు వచ్చేశాయి.
పాత అవగాహనలతో, పాత ఆయుధాలతో కొత్త శక్తుల్ని
ఎదుర్కోవడానికి సిధ్ధమైతే అది దుస్సాహసం అవుతుంది!
ఏ
ఉద్యమంలో అయినా విధిగా మూడు తరాలుండాలి. యువతరం, మధ్యతరం, అనుభవతరం. అనుభవతరం బండిని
లాగుతుండాలి. యువతరం బండిని గెంటుతుండాలి. యువతరాలే ప్రాణవాయువు. కొత్తతరాల్ని ఆకర్షించలేకపోతే విప్లవ పార్టీలు వృధ్ధాశ్రమాలుగా
మారిపోతాయి. ఆయుధాలను ఉపయోగించడం అటుంచి వాటిని మోయడం కూడ సాధ్యం కాదు.
ఒక
వ్యూహం ప్రకారం ఉద్యమాల్లోనికి యువతరం రిక్రూట్మెంటును ఆపగలిగినవాళ్ళు, కల్లోల ప్రాంతాల్లో
ప్రాణరక్షణ మందుల సరఫరానూ ఆవేశారు. వృధ్ధాప్యంలో వచ్చే జీవనశైలి వ్యాధులకు అడవిలో మందులు అందకపోతే అల్లకల్లోలం జరిగిపోతుంది. గ్లూకోజ్
స్థాయిలు పెరిగి రెటీనోపతితో అంధులైన నాయకులు దారి కనిపించక పోలీసులకు దొరికిపోతున్న
బాధాకరమైన కేసులు ఇటీవలి కాలంలో అనేకం వున్నాయి.
అణగారిన
సమూహాల సహజమైన ఆప్షన్ సమసమాజమే. ఆ లక్ష్యసాధన
కోసం పుట్టిన పార్టీలు బలహీనంగా వున్నప్పుడే మరోవైపు చూడాల్సి వస్తుంది. సాయుధ పోరాటానికి
ప్రత్యామ్నాయం రాజ్యంగం అనడం కూడ ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. పాలకులు మంచోళ్ళయితే చెడ్డ రాజ్యంగం కూడ ప్రజలకు మంచిదయిపోతుంది; పాలకులు
చెడ్డోళ్ళయితే మంచి రాజ్యంగం కూడ ప్రజలకు చెడ్డదయిపోతుందని అంబేడ్కర్ చెప్పివున్నారు.
ఇప్పుడు సమస్య రాజ్యాంగం మంచిదా? కాదా? అన్నదికాదు; పాలకుల స్వభావం ఏమిటీ అన్నదే అసలు
సమస్య.
మన
రాజ్యాంగానికి ప్రాణం ప్రజాస్వామిక ఎన్నికలతో కూడుకున్న పార్లమెంటరి వ్యవస్థ. ఈ రెండింటినీ,
కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్త్వం భ్రష్టు పట్టించగలిగిన దానికన్నా ఎక్కువగానే భ్రష్టు
పట్టించింది. ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు పార్లమెంటరీ పంథా చేపడతారా? అక్కడ మార్పులు తేగలుగుతారా? అనేవి ఊహాజనిత
సందేహాలు. దానికి సమాధానం కోసం మరి కొంతకాలం వేచిచూడాలి.
16 అక్టోబరు 2025
No comments:
Post a Comment