Saturday 27 February 2021

Drishyam 1 & 2 - A thoughtful Movie.

 Drishyam 1 & 2 - A thoughtful Movie. 

దృశ్యం – 2 : ఆలోచింపచేసిన సినిమా.

-        డానీ

 నేరమూ శిక్ష మీద తత్వశాస్త్రం, సామాజికశాస్త్రం, నేరశాస్త్రం మూడింటిలోనూ ఎడతెగని చర్చ సాగుతుంటుంది. 

మనిషి మరో మనిషిని చంపడం నేరం.

అంతేకాదు; నేరం చేసిన మనిషిని చంపడం కూడా నేరమే!  

ఏది నేరం? ఏది శిక్ష?

నేరమే శిక్ష; శిక్షే నేరం.

రెండూ విడిగా వుంటాయా? కలిసే వుంటాయా?  

ఒక నేరానికి శిక్షవేయడానికి

రాజ్యమో సమాజమో మరో నేరం చేయాల్సిందేనా?   

‘నేరము-శిక్ష’ అనగానే మనకు రష్యన్ మహారచయిత ఫైదోర్ దాస్టోవయస్కీ అదే పేరుతో 1866లో రాసిన నవల గుర్తుకు వస్తుంది. 

ఒకే అంశాన్ని రెండు వైపుల నుండి డీల్ చేయడంలో దాస్టోవయస్కీ గొప్ప నిపుణుడు.

వర్గ సమాజంలో మనిషి నేరం చేయకతప్పని స్థితిని తనే వివరిస్తాడు.

నేరం జరగడం వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్నీ తనే వివరిస్తాడు. 

మనిషి తన సమస్యలకు అనివార్య పరిష్కారంగా భావించి నేరం చేస్తాడు.

ఆ నేరం ఆ సమస్యను పరిష్కారించకపోగా అతనికి అనేక కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. 

ఓ వడ్డీ వ్యాపారి మహిళను చంపితే తన పేదరికం పోతుందని రోడియన్ రాస్కోలికోవ్ నమ్ముతాడు. ఆ హత్య అతనికి ఆనందాన్ని ఇవ్వకపోగా, ఆ క్షణం నుండి మానసిక వ్యథ, నైతిక సంధిగ్ధం అతన్ని వెంటాడుతాయి.

ఇది పేదరికంకన్నా చాలా పెద్ద శిక్ష అంటాడు దాస్టోవయస్కీ .

 

ఇలాంటి ఒక అద్భుతమైన తాత్విక అంశంతో

రచయిత దర్శకుడు జీతూ జోసెఫ్ 2013లో

తీసిన సినిమా ‘దృశ్యం’.

 

ఒక హత్య –

ఒక నేరం -

రెండు కుటుంబాలకు శిక్ష.

రెండు కుంటుంబాలూ నేరస్తులే.

రెండు కుంటుంబాలూ బాధితులే.

ఇదీ దృశ్యం సినిమా సారాంశం.

 

మోహన్ లాల్ ప్రోటోగోనిస్టుగా నటించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.

 

ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు.

సినీ విమర్శకులు కూడ గొప్పగా మెచ్చుకున్నారు.

 

తరువాత ఈ సినిమాను

తమిళంలో కమల్ హాసన్ తో,

హిందీలో అజయ్ దేవ్ గన్ తో,

కన్నడలో రవిచంద్రన్ తో,

తెలుగులో వెంకటేష్ తో

రీ మేక్ చేశారు.

 

ఇప్పుడు ‘దృశ్యం’ కు సీక్వెల్ గా ‘దృశ్యం-2’ వచ్చింది.

అమేజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న విడుదలయ్యింది.

 

మొదటి సినిమా చూడకపోతే రెండవ సినిమా అర్థం కాదు.

ఈ సినిమా కథ  రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. 

 

మొదటి కుటుంబం -

జార్జ్ కుట్టి ( మోహన్ లాల్) ఓ చిన్న పట్టణంలో  లోకల్ టీవీ ఆపరేటర్.

అతని భార్య రాణి జార్జ్ ( మీనా),

పెద్ద కూతురు అంజూ జార్జ్ ( అంసిబా హసన్)

చిన్న కూతురు అనూ జార్జ్ (ఎస్తేర్ అనిల్)

 

వున్నదాంట్లో సంతృప్తిపడి ఆనందంగా బతుకుతున్న కుటుంబం వాళ్ళది.

వాళ్లకువాళ్ళే ఒక ప్రపంచం.

 

రెండవ కుటుంబం

గీతా ప్రభాకర్ (ఆశా శరత్) ఐజీ ఆఫ్ పోలీస్

ప్రభాకర్ (సిద్దీఖి) ఐజి గీత భర్త

వరుణ్ ప్రభాకర్ (రోషన్ బషీర్) ఐజీ కొడుకు.

 

లేకలేక పుట్టిన కొడుకు కావడంతో తల్లి గీత, తండ్రి ప్రభాకర్ ఇద్దరూ వరుణ్ ను అతిగారాబంగా పెంచుతారు.

డబ్బు, అధికారం రెండూ పుష్కలంగా వుండడంతో వరుణ్ చెడు మార్గాలు పడతాడు.

 

కాలేజీ స్టూడెంట్స్ నేచర్ క్యాంప్ కు వెళ్ళినపుడు అంజూ జార్జ్ బాత్ రూమ్ దృశ్యాల్ని వరుణ్ రహాస్యంగా  వీడియో తీస్తాడు.

దాన్ని అడ్డం పెట్టుకుని తన సెక్స్ కోర్కెను తీర్చమని అంజూను వేధిస్తుంటాడు.

ఓ రాత్రి ఇంటికే వచ్చి ఆమెను బలవంతం చేస్తాడు.

ఈ సందర్భంగా వరుణ్, అంజు, రాణిల మధ్య పెద్ద పెనుగులాట జరుగుతుంది. అందులో వరుణ్ చనిపోతాడు.

అనుకోని హత్యకు భయపడిపోయిన తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి  వరుణ్ శవాన్ని పూడ్చి పెట్టేస్తారు.

 

తన కొడుకును చంపారనే అనుమానంతో ఐజి గీత జార్జ్ కుటుంబం మీద ప్రతీకారంతో రగిలిపోతుంది.

 

కుటుంబాన్ని కాపాడే బాధ్యతను జార్జ్ తన భుజాలకు ఎత్తుకుంటాడు. తనకున్న సినిమా పరిజ్ఞానంతో నకిలీ సాక్ష్యాలు సృష్టించి కేసును తప్పుదోవ పట్టిస్తాడు.  

నేరం రుజువు కాకపోవడంతో జార్జ్ కుటుంబం బయటపడుతుంది.  

 

ఐజి గీత కొడుకును కోల్పోతుంది. కేసును ఓడిపోతుంది. తన కొడుకు చెడిపోయాడనీ ఆమెకు తెలిసివస్తుంది. ఆపైన వ్యక్తిగత కక్ష సాధింపు కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే చెడ్డ పేరు కూడ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్ళిపోవాలనుకుంటుంది.

 

వెళ్ళిపోయే ముందు ఐజీ దంపతులు జార్జ్ ను పిలిపిస్తారు. తమవల్ల జరిగిన తప్పుల్ని మన్నించమంటారు.

“ఎప్పటికయినా మా కొడుకు తిరిగివస్తాడని ఎదురు చూడవచ్చా?” అని అడుగుతాడు గీత భర్త. 

జార్జ్ మౌనంగా తలదించుకుని వుండిపోతాడు.

కొడుకు చనిపోయినట్టు వాళ్ళు నిర్ధారించుకుంటారు.

 

అప్పుడు జార్జ్ కూడ వాళ్ళను క్షమాపణ కోరుతాడు. తమ ఇంట్లోకి రాకూడని అతిథి ఒకడు వచ్చాడనీ, తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించాడనీ, తాము ప్రాధేయపడినా అతను వినలేదని. గత్యంతరంలేక మళ్ళీ తిరిగి రాకుండ అతన్ని బయటికి పంపించేయాల్సి వచ్చిందంటాడు.  

 

ఇప్పటికి తప్పించుకున్నావుగానీ ఎప్పుడో ఒకప్పుడు మాకు ఆధారాలు దొరక్కపోవు అని జార్జ్ ని సిఐ  హెచ్చరిస్తాడు. వరుణ్  శవాన్ని తాను ఎక్కడ పూడ్చాడో భార్యకు కూడ చెప్పడు జార్జ్. నిర్మాణంలోవున్న ఓ పోలీస్ స్టేషన్ కాంక్రీట్ బెడ్ కింద ఆ శవాన్ని కప్పిపెట్టినట్టు ప్రేక్షకులకు ఒక సంకేతాన్ని ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది.

 

ఆరేళ్ళ తరువాత  సీక్వల్ కథ దృశ్యం – 2 మొదలవుతుంది.

 

అప్పటికి జార్జ్ నాలుగు డబ్బులు సంపాదిస్తాడు. పట్టణంలో సినిమా హాలు నిర్మిస్తుంటాడు. ఓ క్రైం మిస్టరీ సినిమా తీయాలని ఓ ప్రసిధ్ధ రచయితతో స్టోరీ సిట్టింగులు వేస్తుంటాడు. అప్పటికే ఓ మర్డర్ మిస్టరీ నవల రాసి ప్రచురిస్తాడు.

 

ఇక్కడ ఓ కోఇన్సిడెన్స్ ఏమంటే  ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవలలోనూ రాస్కోలికోవ్ ‘ఆన్ క్రైమ్’ అనే ఒక వ్యాసం రాసి ప్రచురిస్తాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే రచయిత – దర్శకుడు జీతూ జోసెఫ్ కొంచెం దూరం నుండైనా దాస్టోవయోస్కీని అనుసరించాడేమో అనిపిస్తుంది. ఇది మొచ్చుకోవడమేగానీ తప్పుపట్టడంకాదు. క్రైమ్ అండ్ పనిష్ మెంట్ అంతటి క్లాసిక్ నుండి ఒక సినిమా ఉత్తేజాన్ని పొందడం మహత్తర విషయం.

 

ఇక సీక్వెల్  కథ లోనికి వస్తే, ఈ ఆరేళ్ళుగా జార్జ్ కుటుంబం  నిరంతరం మానసికంగా హింసను అనుభవిస్తూ వుంటుంది.  వాళ్లంతా భయం గుప్పెట్లో బతుకుతుంటారు. పోలీసులు కనిపించినా పోలీసు సైరన్  వినిపించినా,  ఉలిక్కి పడుతుంటారు. పెద్ద కూతురు అంజూకు  తరచూ ఫిట్స్ వస్తుంటాయి.   జార్జ్ పెరుగుదలను చూసి అసూయపడేవారు తరచూ వరుణ్ హత్య గురించి గుసగుసలాడుతుంటారు. అంజూకు వరుణ్ తో ‘అక్రమ’ సంబంధం వుండేదనీ, ఆమె పిలిస్తేనే ఆ రాత్రి ఆ కుర్రాడు వాళ్ళింటికి వచ్చాడనీ చెప్పుకుంటుంటారు.  పోలీసులు కూడ ఈ కేసులో ఎప్పుడో ఒకప్పుడు ఒక ఆధారం దొరుకుతుందని తమ ప్రయత్నాలు తాము చేస్తుంటారు.

 

పోలీసులు ప్రకటించిన నగదు బహుమతికి ఆశపడిన ఓ దొంగ వరుణ్ శవాన్ని జార్జ్ పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టాడని చెప్పడంతో కేసును మళ్ళీ తెరుస్తారు. మాజీ ఐజీ కుటుంబం అమెరికా నుండి మళ్ళీ రంగంలోనికి దిగుతుంది. వాళ్ళకు కొత్త ఐజీ సహకరిస్తుంటాడు. జార్జ్ కుటుంబాన్ని మళ్ళీ కష్టాలు కమ్ముకుంటాయి. జార్జ్ మరొక్కసారి తన సినిమా పరిజ్ఞానాన్ని ప్రయోగిస్తాడు. మొత్తం కుటుంబం మరొక్కసారి కేసు నుండి తప్పించుకుంటారు. 

 

“ఇంత క్రూరంగా నేరం చేసినా, మనం ఇంత పెద్ద హోదాల్లో వున్నా అతన్ని మాత్రం శిక్షించలేకపోయాం” అంటుంది మాజీ ఐజి నిస్పృహతో.

“తమ నేరం ఎక్కడ బయటపడిపోతుందోననే భయంతో ఆ కుటుంబం గత ఆరేళ్ళుగా బతుకుతోంది. ఇకముందూ అలాంటి భయంలోనే బతుకుతుంది. అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది వాళ్లకు?” అని కొత్త ఐజి చెప్పడంతో సినిమా ముగుస్తుంది.

 

మోహన్ లాల్ నటన పెద్ద ఎస్సెట్ అయితే రచయిత దర్శకుడు జీతూ జోసెఫ్ ట్రీట్ మెంట్ అంతకన్నా పెద్ద ఎస్సేట్ ఈ సినిమాకు. మనకు చాలా అరుదుగా వచ్చే సినిమాల్లో ఇది ఒకటి.

 

ఒక దృశ్య కళగా దృశ్యం-2 సినిమా ప్రేక్షకుల మనసుని తాకుతుంది; ఆ పైన మెదడుకూ పని చెపుతుంది.

 

ఫేస్ బుక్

27 ఫిబ్రవరి 2021


No comments:

Post a Comment