Tuesday 14 March 2023

MTF stand on Bharat Bachavo

  *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) భారత్ బచావోతో అంశాలవారీగా కలిసి పనిచేస్తుంది*

 భారత్ బచావో జాతీయ సదస్సు ఢిల్లీలో రెండు రోజులపాటు విజయవంతంగా జరిగింది. దాదాపు వెయ్యిమంది ప్రతినిధులు పాల్గొన్నారు. సిపియం కేంద్ర కార్యాలయమైన హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్ లోని మూడు సమావేశ మందిరాలు నిండిపోయాయి. ప్రతినిధుల్లో ఆంధ్రా, తెలంగాణకు చెందిన వారు 70-80 శాతంవున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 20-30 శాతం వుంటారు.

ఉపన్యాసకుల్లో మొదటిరోజు, ప్రొఫెసర్ అపూర్వానంద చాలా గొప్పగా ఆకట్టుకున్నారు. దంతేవాడకు చెందిన హిమాంశు కుమార్ ప్రసంగం ఉద్వేగంగా సాగింది. రచయిత్రి సీమా ఆనంద్ ప్రసంగం ఆలోచించదగ్గట్టుగా వుంది.  రెండో రోజు దీపాంకర్ భట్టాచార్య, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ప్రసంగాలు బాగున్నాయి.

జాతీయ సదస్సుకు కీలకమైన ‘భారత్ బచావో అవగాహనా పత్రం’ చాలా నిరుత్సాహ పరచింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మార్క్సిస్టు-లెనిస్టు పార్టీలు ‘కాషాయ కార్పొరేట్ ఫాసిజం నశించాలి’ అంటూ సభలు పెట్టాయి. భారత్ బచావో విజయవాడ రాష్ట్ర సదస్సులో ఒ కమ్యూనిస్టు పార్టి ప్రతినిధి సిఏఏ వ్యతిరేక ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీలే నాయకత్వం వహించాయని చాలా గట్టిగా చెప్పారు.   అలాంటి స్పష్టత  భారత్ బచావో   అవగాహనా పత్రంలో కనీసంగానైనా కనిపించలేదు.

 ఈ కీలక పత్రం 1983కు ముందు భారత సమాజంలోని వ్యవస్థల మీద వివిధ కమ్యూనిస్టు పార్టిలకున్న అవగాహనను ప్రతిబింబించింది. గత నలభై ఏళ్ళుగా భారత సమాజంలో వెలుగులోనికి వచ్చిన కొత్త వ్యవస్థల్ని అర్ధం చేసుకోవడానికి  సాగుతున్న పరిశోధనలు  సాధించిన అవగాహనని భారత్ బచావో  అవగాహన పత్రం నిరాకరించింది. అంటే, భారత్ బచావో  అవగాహన పత్రం దాదాపు నలభై యేళ్ళు నెగటివ్ విలువలో వుంది.

 “ *ఎవరు మితృలు ? ఎవరు శతృవులు ?* అని RSS వారు 1990 లలోనే వారి  అంతరంగిక సర్క్యులర్ లో రాసుకున్నారు. ముస్లింలు, క్రిష్టియన్లు, అంబేద్కర్ వాదులయిన దళితులు, వామపక్ష సంస్తలు తమ శతృవులుగా అందులో వారు రాసుకున్నారు. ఎవరయితే వారి శతృవులని రాసుకున్నారో వారందరు ఐక్యమై ఇతర బహుజనులను,  శ్రమ జీవులను ఐక్య పరచి పోరాడి సంఘ పరివార్ ఫాసిస్టు శక్తులను ఓడించాలి” అంటూ భారత్ బచావో వాట్సప్ గ్రూపులో కనీసం పదిసార్లు పోస్టులు పెట్టిన అడ్మిన్ లు ఢిల్లీలో ప్లేటు ఫిరాయించారు. దేశంలో తీవ్ర అణిచివేతకు గురవుతున్న మైనారిటీలు మా మిత్రులు అనడానికిగానీ, మైనారిటీలకు మేము అండగా వుంటాం అని గానీ ప్రకటించడానికి భయపడ్డారు.

 సంఘపరివారానికి ప్రధాన  శతృవులైనవారు తమకు చివరి మిత్రులు కూడ కారని దేశ రాజధానిలో సంజాయిషీ ఇచ్చుకోవడానికి చాలా తాపత్రయపడ్డారు.

 ప్రొఫెసర్ అపూర్వానంద దేశంలో ముస్లింలను లక్ష్యాంగా పెట్టుకుని ఎంతటి క్రూరమైన దాడులు జరుగుతున్నాయో సుదీర్ఘంగా వివరించారు. హీమాంశు కుమార్ మనసమాజానికి కుల వర్గ మత తెగ స్వభావాలున్నాయని విశ్లేషించారు. వాళ్ళిద్దరి ప్రసంగ సారాన్ని అభావం చేయడం కోసం భారత్ బచావో అవగాహన పత్రం అదనపు గంటలు పనిచేసింది.  

 అంతేగాక మైనారిటీల్లో బోలెడు హిందూత్వ వుందని నిరూపించడానికి భారత్ బచావో సిధ్ధాంతకర్తలు గట్టి కసరత్తు చేశారు.  “గుజరాత్ అల్లర్ల సందర్భంగా భారత రాష్ట్రపతి ఎవరూ? ఏపిజే కలాం కాదా? ఆయన ముస్లిం కాదా?” అని సాక్షాత్తు భారత్ బచావో వ్యవస్థాపకులు సభలోని ముస్లిం ప్రతినిధుల్ని నిలదీశారు. గోడీ మీడియా, వాట్సప్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లను మించిన పరిజ్ఞానాన్ని వారు ఎంతో సమర్ధంగా ప్రదర్శించారు. కోర్టులో కేసులు గెలవడానికి ఎంతకైనా తెగించే రామ్ జెఠ్  మలానీ వంటి వివాదాస్పద అడ్వకేట్ కూడ ఈ స్థాయి అబధ్ధాలను ఇంత ధైర్యంగా చెప్పి వుండరు. ఇంతటి అనితరసాధ్యమైన నైపుణ్యాన్ని సాధించినందుకు భారత్ బచావో అడ్మిన్ లకు ప్రత్యేక అభినందనలు.

సత్యాన్వేషన మార్గాల గురించి కొందరు  ప్రవచనకారులు భారత్ బచావో వాట్సప్ గ్రూపులో తరచూ ఉపదేశాలు చేస్తుంటారు. ఆ సత్యాన్వేషణ మార్గాల్ని ఢిల్లీ జాతీయ వేదిక మీద వాళ్ళు డిజిటల్ డిస్ ప్లే చేసి చూపించారు.  

 ఫాసిజానికి ప్రధాన బాధితులు మత అల్పసంఖ్యాకవర్గాలనే ప్రాధమిక వాస్తవాన్ని అవగాహనా పత్రం గుర్తించ నిరాకరించింది. పైగా మీ సమస్యలు మీవి మీ యుధ్ధం మీరే చేసుకోవాలంటూ ముస్లింలకు ఒక గొప్ప హితబోధ చేశారు.  కార్పొరేట్ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం మీద తాను పోరాడడం లేదంటూ  భారత్ బచావో సంస్థ ముందుగానే అస్త్రసన్యాసం చేసింది.  భారత్ బచావో అవగాహనా పత్రంవల్ల ముస్లిం. క్రైస్తవ, శిక్కు మత అల్ప సంఖ్యాక వర్గాలకు ఏమాత్రం ఉపయోగంలేదు.

 ‘We and Our Nationhood Defined’‘ పుస్తకంలో గురూజీ గోల్వాల్కర్ భారత ప్రజల్ని మత ప్రాతిపదికన  ‘మేము-వారు’ అని విభజించారు. ఆ బాటలో  “మేము 80 శాతం వాళ్లు 20 శాతం’ అంటూ  కేంద్ర హోంమంత్రి   అమిత్ షా తరచుగా ప్రకటిస్తుంటారు. తాము సహితం ముస్లింలకు దూరం అని భారత్ బచావో జాతీయ సదస్సు చెప్పకనే చెప్పింది.  ముస్లింలను దరిచేర్చుకుని అమిత్ షా ఆగ్రహానికి గురికావడంకన్నా ముస్లింలను దూరంగా పెట్టి అమిత్ షా అనుగ్రహానికి పాత్రులు కావాలనుకోవడం తెలివైన ఆలోచనే!.

భారత్ బచావో జాతీయ సదస్సు  ఆహ్వాన కమిటీలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా, లిబరేషన్. క్లాస్ స్ట్రగుల్, న్యూ డెమోక్రసీ, రెడ్ స్టార్, రివల్యూషనరీ ఇనీషియేటివ్ ల పేర్లు వున్నాయి. వీటితోపాటూ మరికొన్ని కమ్యూనిస్టు పార్టిలు కూడ భారత్ బచావోకు మద్దతు పలకవచ్చు; పలికి వుండవచ్చు. అమిత్ షా, భారత్ బచావోలు దూరంగా పెట్టాలనుకున్న 20 శాతం సమూహాన్ని ఈ పార్టీలు కూడ దూరంగా పెట్టాలనుకుంటున్నాయా? పరిశోధించి తెలుసుకోవాల్సిన అంశమే.

 భారత దేశాన్ని కుల మత తెగ లింగ ప్రాంత భాషా వర్గ వువస్థల సమాజంగా గుర్తించనివాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి మార్పులూ తేలేరు. వాళ్లు ఏనుగును గుర్తించలేకపోయిన నలుగురు గుడ్డివాళ్ళుగా మిగిలిపోతారు. వాళ్ళు దివ్యాంగులు కనుక వాళ్ళ మీద  కొంచెం జాలిపడుదాం!.

భారత ఫాసిజానికి ప్రధానంగా బలి అయ్యేది ముస్లింలు, ఆదివాసులు అనేది  *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)* అవగాహన. భారత్ బచావో  అవగాహన పత్రంతో ఆదివాసులకు ఏ మేరకు మేలు జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఈ అవగాహన పత్రంతో కొనసాగే భారత్ బచావో ఉద్యమంవల్ల హిందూ సమాజంలోని అణగారిన కులాలకు ఏ మాత్రం  మేలు జరిగినా అది గొప్ప విషయమే. అలాంటి అణగారిన కులాల శ్రేయస్సు కొరకు భారత్ బచావోకు *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)* సంఘీభావాన్ని తెలుపుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం ప్రాతిపదికగా ఆయా సందర్భాల్లో  అంశాలవారిగా తప్పక కలిసిపనిచేస్తుంది.

ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*

No comments:

Post a Comment