Tuesday, 1 September 2026

సంపద పెరుగుదల జనాభా తరుగుదల

 

For

Publication in the Edit pages of Sakshi

 

*సంపద పెరుగుదల జనాభా తరుగుదల*

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

 

 

ఎల్‌పిజి కాలంలో కుటుంబ బడ్జెట్ ఒక యుద్ధం. పిల్లలు ఒక లగ్జరీ. భవిష్యత్తు ఒక లెక్క. డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ - డింక్.  సింగిల్ ఇన్‌కమ్ నో కిడ్స్- సింక్. డబుల్ ఇన్‌కమ్ సింగిల్ కిడ్- డిస్క్. ఇవి కొత్త ఫార్ములాలు. ఇది కుటుంబ నియంత్రణ కాదు; సర్వైవల్ బడ్జెట్. జీవికను నిలబెట్టుకునే వనరుల సర్దుబాటు.

 

1991లో ఎల్‌పిజి వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్.
గ్లోబలైజేషన్. ఇవి మూడు పదాలుకాదు. మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాల మనుగడ మీద  వేలాడుతున్న  మూడు కత్తులు. పేదవాళ్ల నెత్తిమీద అనాదిగా కత్తి వేలాడుతూనే వుంటుంది. వృధ్ధ్యాప్య పెన్షన్లు వాళ్ళను చావనివ్వవుగానీ సౌఖ్యంగా వుండనివ్వవు.

 

విద్య ప్రైవేట్ అయింది. ఫీజులు పైకి ఎగిరాయి. కోచింగ్ మాఫియా పుట్టింది. ఒక పిల్లవాడి చదువు అంటే ఒక కుటుంబం అప్పుల్లో మునగడం. ఆరోగ్యం ప్రైవేట్ అయింది. ఒక జబ్బు. అంటే ఒక ఇల్లు అమ్మడం. .ఇల్లు ప్రైవేట్ అయింది.  ఇఎమ్‌ఐ జీవితాంతం వుంటోంది. మరి ఉద్యోగం? గిగ్. కాంట్రాక్ట్. నో సెక్యూరిటీ. నో పెన్షన్.

 

ఇప్పుడు లెక్క వేసుకోండి భార్యాభర్తలిద్దరూ ఇద్దరు సంపాదిస్తూ పిల్లలు లేకుంటే; బయటపడతారు. ఒక్కరే  సంపాదిస్తుంటే పిల్లలు లేకుంటేనే. బయటపడతారు. ఇద్దరు సంపాదిస్తూ ఒక్క పిల్లవాడు.
వుంటే ఏదో సర్దుబాటు చేసుకోవచ్చు.

 

ఇది కుటుంబం కాదఇది కార్పొరేట్ స్ట్రాటజీ. టోటల్ ఫర్టిలిటీ రేట్ (టిఎఫ్ఆర్) 50 యేళ్ల క్రితం 5 వుండేది. అంటే ఒక జంటకు ఐదుగురు సంతానం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడ వుండడం లేదు.  కఛ్ఛితంగా చెప్పాలంటే 1.9.

 

దేశంలో చనిపోతున్నవారికన్నా పుట్టేవారు తగ్గిపోతే  రిప్లేస్‌మెంట్ లెవల్  పడిపోతుంది. ఎందుకు ఇలా? పిల్లల్ని కనడం ఖరీదైపోయింది. వాళ్లను పెంచడం ఇంకా ఖరీదయిపోయింది. 1947లో పది రూపాయల ఖర్చుతో ఆసుపత్రుల్లో పిల్ల డెలివరీ చేసేవారు. 1980లలో విజయవాడ సెయింట్ ఆన్స్ (అమెరికన్) వంటి ఆసుపత్రుల్లో మూడు, నాలుగు వందల రూపాయలు వుండేది. 21వ శతాబ్దాంలో దాని రేంజ్ వెయ్యి రేట్లు పెరిగింది. ఇప్పుడు ఒక కార్పొర్ఫేట్ హాస్పిటల్ లో సంతానాన్ని కనడం అంటే లక్షల్లోనే ఖర్చుపెట్టాల్సివస్తున్నది. అంతెందుకూ? అని ఎవరయినా అడగవచ్చు. దానికి దొరికే ఏకైక సమాధానం క్వాలిటి!! అదేమిటో ఎవ్వరికీ అర్ధంకాని బ్రహ్మపదార్ధం అయి కూర్చున్నది.

 

 

తీరా కన్నాక పెంచడం ఖరీదు; చదివించడం ఖరీదు. ఇప్పుడు ఒక మంచి స్కూలులో కొత్తగా చేర్చాలన్నా లక్షల్లో పోయాలి. ఈ మంచికి కూడ ఎవరి అర్ధాలు వారికి వుంటాయి. అనిశ్ఛిత ఉద్యోగాలతో భవిష్యత్తు అనిశ్చితం.

 

మనం ఇప్పుడు జెన్ -జీ నిరసనల్ని చూస్తున్నాం. జెన్ – ఆల్పా కూడ రంగ ప్రవేశం చేసేసింది.  ఏడాదిన్నరగా  జెన్ -బీటా ప్రవేశం  మొదలయ్యింది. ఓ ఇరవై ఏళ్ళ తరువాత వాళ్ళ ఆక్రోశాన్ని సమాజం చూస్తుంది. ఇప్పటికే కొత్తతరాల పుట్టుక రేటు పడిపోయింది. ఇక ముందు ఇంకా తగ్గిపోతుందని ఆందోళన.

 

పుట్టేవాళ్ళు తగ్గడం అంటే వస్తూత్పత్తి చేసేవాళ్ళు తగ్గడం అని అర్ధం. జనాభా కొరత సవాలును ఎదుర్కోవడానికి,  తక్కువ మందితో ఎక్కువ   వస్తూత్పత్తి  చేయడానికి ఏఐ ఇప్పటికే ప్రయత్నిస్తున్నది. అయితే ఇక్కడో చిక్కుముడి వుంది.  జరిగిన ఉత్పత్తిని అమ్ముకుంటేనే పెట్టుబడీదారులకు పెట్టిన పెట్టుబడి, ఆపైన లాభాలూ వస్తాయి.  కొనేవాళ్ళు లేకపోతే, ఉత్పత్తి అయిన సరుకు అమ్ముడు కాకపోతే పెట్టిన పెట్టుబడి కూడ రాకపోతే మార్కెట్ సంక్షోభం వస్తుంది.

 

 

ఎల్‌పిజి ఆశపెట్టింది ఏమిటీ?  గ్రోత్ వస్తుందన్నది. ఉద్యోగాలు వస్తాయన్నది. సంపద పెరుగుతుందన్నది.  కానీ, ఇది అర్ధ సత్యం.
సంపద పెరిగిందిగానీ కానీ, ఉద్యోగాలు పెరగలేదు. జాబ్‌లెస్ గ్రోత్ అన్నమాట. ఇక్కడా ఇంకో మెలిక వుంది.  సంపద పెరిగింది పై పది శాతానికి మాత్రమే. కింది కింది తొంభై శాతం నలిగిపోయింది. అంటే ఎల్పీజి సిధ్ధాంతం పై పది శాతానిదే అని నిర్ధారణ అయ్యింది.

 

పది శాతం వెర్సెస్ తోభయి శాతం ఇది సంపద పంపకాల సమస్య మాత్రమేకాదు. జీవన విధానాల సాంస్కృతిక ఘర్షణ. సంపన్నులు పిల్లల్ని బాజాప్త కంటారు, పెంచుతారు. కార్పోరేట్ హాస్పిటల్ లో పుట్టుక, కార్పోరేట్ స్కూల్లో, విదేశీ యూనివర్సిటీల్లో విద్య. ఆ లెఖ్ఖలు పేదవాళ్ళకేకాక మధ్యతరగతికి కూడ అందుబాటులో వుండవు. వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. భయం వేసి పిల్లల్ని కనకూడదు అనుకుంటారు. ఇది ప్రకృతి సహజంగా జరిగేదేమీ కాదు, ఆర్ధిక నియమాలు, మార్కెట్ ప్రవృత్తి నిర్ణయించే అంశాలు. అప్పటికే కన్న పిల్లలకు విద్యా ఇవ్వక, ఉపాధి కల్పించలేకపోతే  వాళ్ళు ఉత్సవాల్లో తీన్మార్ డాన్సులు చేసుకుంటూ వుండిపోతారు. రాజకీయరంగంలో ఇలాంటి సమూహాలకు ఇటీవల మంచి గిరాకీ వుంది.

 

జాతి. మతం. కులం. అన్నీ బడ్జెట్ కిందికి వచ్చేస్తాయి. ఒక వైపు సాంప్రదాయం చెప్తుతుంటుంది పిల్లల్ని కనాలని. మరోవైపు బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తుతుంటుంది . పిల్లలు వద్దని. చివరకు బ్యాంక్ బాలెన్స్ గెలుస్తుంది.

సింక్ జంట; ఒక్కటే  జీతం. పిల్లల్ని కనే సాహసం చేయలేరు. భయం. డిస్క్ జంట; రెండు జీతాలు. సాహసించి ఒక్క మగపిల్లనో ఆడపిల్లనో కని ఆగిపోతారు. ఆ ఒక్క సంతానం మీదే అన్ని ఆశలూ పెట్టుకుంటారు. వాళ్లు ఫెయిల్ అయితే  మొత్తం కుటుంబం ఫెయిల్. డింక్ జంట;  రెండు జీతాలు; డిస్క్ జంటను చూసి భయపడతారు. అవకాశం వున్నా అయినా  పిల్లల్ని కనరు. ఇవన్నీ కొత్త ఫార్ములాలు. సంతోషంతో పుట్టినవికావు; భవిష్యత్తు మీద భయంతో పుట్టినవి. ఇవి సర్వైవల్ మ్యాథమెటిక్స్.

 

ఎల్‌పిజి విషం కుటుంబాల్లోకి చొచ్చుకొచ్చింది. పిల్లల్ని కాస్ట్ సెంటర్ చేసింది. ప్రేమకు  లెక్కలు నేర్పింది. ఒకప్పుడు పిల్లలు ఆస్తి.
ఇప్పుడు పిల్లలు లయబిలిటీ. టిఎఫ్ఆర్ పడిపోతోంది. ఉత్తర రాష్ట్రాలకన్నా దక్షణ్సా రాష్ట్రాల్లో మరింత వేగంగా తగ్గిపోతోంది. పిల్లలు లేని తరం. ఇది డెమోగ్రాఫిక్ టైమ్ బాంబ్. కొత్త నియమాలు వచ్చేశాయి. మార్కెట్ దేవుడు.
లాభం ధర్మం. కుటుంబం సెకండరీ. జాయింట్ ఫ్యామిలీ కూలింది.
న్యూక్లియర్. ఇంకా ఒంటరి. ఒక తరం పిల్లలు పుట్టకుండా చేసింది. డింక్. సింక్. డిస్క్. ఇవి కొత్త కులాలు.

 

ఎబ్బెట్టుగానో, అతిశయం గానో వుండవచ్చుగానీ ఇదోరకం  భ్రూణహత్యలు!!.

 

01 సెప్టెంబరు 2026

న్యూయార్క్‌లో వేదాంతం! భారతదేశంలో మౌనం!!

 న్యూయార్క్‌లో వేదాంతం!  భారతదేశంలో మౌనం!!

డానీ

సమాజ విశ్లేషకులు 





ఆరెస్సెస్ సర్సంగ్ ఛాలక్ మోహన్ భగవత్  న్యూయార్క్‌లో మాట్లాడారు. 

చాలా గొప్పగా మాట్లాడారు. మానవత్వం ఒక్కటన్నాడు. సత్యం ఒక్కటన్నారు. మతాలు వేరైనా, మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే అన్నారు.  వైవిధ్యం ప్రకృతి నియమమన్నారు. ఏకత్వం ప్రకృతి సత్యమన్నారు. వైవిధ్యాన్ని అంగీకరించాలన్నారు. దాన్ని అందరూ గౌరవించాలి, . రక్షించాలి అన్నారు. 


వినడానికి ఎంత గొప్పగా ఉంది! కానీ ఒక చిన్న ప్రశ్న. ఈ మాటలు న్యూయార్క్‌లోనే ఎందుకు అంటున్నారూ? భారతదేశంలో ఎందుకు అనడం లేదూ?


భారతదేశంలో వైవిధ్యాన్ని ఎవరు రక్షించాలి? మతసామరస్యాన్ని ఎవరు కాపాడాలి? దేశంలో ద్వేషం వ్యాపిస్తున్నప్పుడు ఎవరు మాట్లాడాలి? ఒక మత సమూహం భయంతో జీవిస్తున్నప్పుడు “మనందరం ఒక్కటే” అని ఎవరు చెప్పాలి?


మోహన్ భగవత్  మరో గొప్ప మాట చెప్పారు. ధార్మిక వైవిధ్యాన్ని రక్షించాలని పిలుపిచ్చారు. వైవిధ్యం అలంకారమన్నారు. దాన్ని అందరూ  అంగీకరించాలన్నారు. గౌరవించాలన్నారు. రక్షించాలన్నారు. 


ఇక్కడా అదే ప్రశ్న.  అయితే భారత్‌లో పరిస్థితి ఏమిటీ? వైవిధ్యాన్ని ఎవరు కూలదోస్తున్నారూ? ఎవరు రక్షిస్తున్నారూ? 


మసీదులు కూలుతున్నప్పుడు, వాణిజ్య భవనాలు బుల్‌డోజర్ల కింద నలిగిపోతున్నప్పుడు, అల్పసంఖ్యాక సమూహాలకు చెందిన పేదల ఇళ్లు శిథిలమై పోతున్నపుడు, ఆ సమూహాలను తప్పుడు కేసులతో వేధిస్తున్నప్పుడు, “లవ్ జిహాద్” పేరుతో యువకులను వెంటాడుతున్నప్పుడు, ఆవుల అక్రమ రవాణా పేరుతో ముస్లింలపై కేసులు పెడుతున్నప్పుడు, మూకలు దాడులు చేస్తున్నప్పుడు, నడి రోడ్ల మీద లించింగ్‌లు సాగుతున్నప్పుడు వైవిధ్యాన్ని రక్షించాలి అన్న భగవత్ ఎక్కడున్నారూ?  బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు నిందితుల్ని  పూల మాలలతో సత్కరిస్తున్నపుడు మోహన్ భాగ్వత్ ఈ హితవులు పలికితే బాగుండేది. పైగా, అలా సన్మానించినవారు భగవత్ అనుచరులే.  ఇదేమి ద్వంద్వ నీతీ?  ‘మాటల్లో సమానత్వం. మైదానంలో మౌనం’!! 


భగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ ఉపన్యాసంలో  ఒక గొప్ప ప్రకటన చేషారు. “భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని భావించే హిందువులు నిజమైన హిందువులు కాదు” అన్నారు. అది నిస్సందేహంగా గొప్ప మాట.


కానీ, ఒక  గొప్ప మాట చెప్పడం ఒకటి. ఆ మాటను తన అనుచరులు పాటించేలా చేయడం మరోటి. మాట్లాడటం ఒకటి. చర్య తీసుకోవడం మరోటి.

వేదాంతం చెప్పడం ఒకటి. చెప్పిన వేదాంతాన్ని సమాజ ఆచరణలో పెట్టడం మరోటి.


మోహన్ భగవత్ తో సమస్య ఇక్కడే. వారు ప్రపంచానికి మతసామరస్యాన్ని బోధిస్తారు. కానీ భారతదేశంలో ద్వేషం వ్యాపించినప్పుడు

అంతే తీవ్రంగా ఖండిస్తారా? అల్పసంఖ్యాక మత సమూహాల మీద హింసాత్మక దాడులు సాగుతున్నప్పుడు తమ సంస్థాను, తన అనుచర గణాన్ని అయినా  నిలదీస్తారా? తన అనుచర సమూహాల్లో విద్వేష ప్రచారం సాగించే వారి మీద చర్యలు తీసుకుంటారా? మౌన ప్రేక్షకుడిలా వుండిపోతారా? 


ఇవే అసలు ప్రశ్నలు. ఎందుకంటే - నిశ్శబ్దం కూడా ఒక రాజకీయ భాషే. ముఖ్యంగా, మీ మాటకు బరువు ఉన్నప్పుడు. మీ సంస్థకు దేశవ్యాప్తంగా విసృత ప్రభావం ఉన్నప్పుడు. మీ భావజాలం అధికార రాజకీయాలను ప్రభావితం చేస్తున్నప్పుడు. మీ మౌనం కేవలం మౌనం కాదు. అది ఒక రాజకీయ వైఖరి.


మోహన్ భగవత్ ది ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలి. వారి మాటల్లో ఆవేశం తక్కువ. వేదాంతం ఎక్కువ. సంస్కృతి ఎక్కువ. మానవత్వం ఎక్కువ. “మనమంతా ఒక్కటే” అన్న తత్వం ఎక్కువ. వారి మాటల్ని వింటుంటే ఒక ఆధ్యాత్మిక గురువు మాట్లాడుతున్నట్టుంటుంది. ఓ ప్రవచనకారుడిలా, ఓ వేదాంతిలా కనిపిస్తుంటారు. అది వారి ప్రయత్నం.


కానీ,  దేశ రాజకీయాల దగ్గరకు రాగానే – ప్రశ్నలు, సమాధానాలు అన్నీ మారిపోతాయి. ఆ వేదాంతం ఎక్కడికి పోతోంది? వారి మానవత్వం మాటల్లోనే ఎందుకు మిగిలిపోతోంది? వైవిధ్యరక్షణ ఉపన్యాసాల్లోనే ఎందుకు ఉండిపోతోంది?  భారత సమాజంలోని వైవిధ్యానికి భద్రత కల్పించడంలో వారి సంకల్పం ఎందుకు కనిపించదు? ఇది మొహన్ భగవత్ వ్యక్తిత్వంలోని

పెద్ద వైరుధ్యం. వారికి వేదాంతం ఒక ముఖం. రాజకీయ మౌనం మరో ముఖం.


న్యూయార్క్‌లో వైవిధ్యం గొప్పది అంటారు మరి భారతదేశంలో? విదేశాల్లో వైవిధ్యం అందంగా కనిపిస్తుంది. అమెరికాలో వివిధ మతాల వారితో సమావేశాలు మంచిగుంటాయి. ప్రపంచ మతసామరస్యం గురించి మాట్లాడటం గొప్పగా వుంటుంది.  కానీ, ఆ ఆదర్శాలనూ, ఆ ప్రమాణాలనూ భారతదేశంలో అమలు చేయాలి కదా? అదే అసలు పరీక్ష.


మతసామరస్యం అంటే పదిమంది భిన్నమతాచార్యులు ఒక  వేదిక మీద కూర్చోవడం మాత్రమే కాదు; వాళ్ళు బలహీన సమూహాల పక్కన నిలబడాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఎక్కడయినా సరే ద్వేషాన్ని ఖండించాలి. మూక హింసను ఆపాలి. న్యాయాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని గట్టిగా కోరాలి.  బుల్‌డోజర్ రాజకీయాలను ప్రశ్నించాలి. తప్పుడు ఆరోపణలతో సాగే  వేధింపుల్ని  ఖండించాలి.  ఇవేవీ  చేయకుండా  “మానవత్వం ఒక్కటే; మతాల లక్ష్యం ఒక్కటే ” అని చెప్పడం ఎంతవరకు సబబూ?


భారత అధికార రాజకీయాలను గమనిస్తే ఒకే శిబిరం నుండి మూడు భిన్నమైన భాషలు కనిపిస్తాయి. మూడు వేర్వేరు శైలులు. మూడు వేర్వేరు ముఖాలు.


మోహన్ భగవత్; వేదాంతం మాట్లాడతారు. సంస్కృతి మాట్లాడతారు. 

మానవత్వం మాట్లాడతారు. ధార్మిక వైవిధ్యం గురించి మాట్లాడతారు.


నరేంద్ర మోదీ; ప్రజాస్వామ్య భాష మాట్లాడతారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటారు. అందరికీ అభివృద్ధి ఫలాలు దక్కాలి అంటారు. అందరికీ అవకాశాలు అంటారు.


అమిత్ షా. అధికార భాష మాట్లాడతారు. విపక్షాలపై రాజకీయ దాడుల భాష మాట్లాడతారు. నిరసనల మీద కఠిన చర్యల హెచ్చరికలు చేస్తుంటారు.


అంటే— ఒకరు వేదాంతం. మరొకరు అభివృద్ధి. ఇంకొకరు అధికారం.  మూడు ముఖాల మధ్య  అదే వైవిధ్యం. ముగ్గురి లక్ష్యాల మధ్య అదే ఏకత్వం.  ఒకే భాజాలనికి, ఒకే లక్ష్యానికి  భగవత్ నైతిక ముఖం ఇస్తారు; మోదీ అభివృధ్ధి భాషను జోడిస్తారు. అమిత్ షా అధికార ముఖాన్ని ప్రదర్శిస్తారు.  


నాటి హెగ్దేవార్ నుండి ఇప్పటి మొహన్ భగవత్  వరకు ఆరెస్సెస్ సర్సంగ్ ఛాలకులు అందరిదీ ఒకటే మాట. తమది మత సంస్థ కాదు; రాజకీయ సంస్థకాదు; కేవలం సేవా సంస్థ అని వారంటుంటారు. వాళ్ళ ఆచరణను దగ్గరగా గమనించేవారెవరయినా  ఆరెస్సెస్ ను స్థూలంగా  మత రాజకీయాలకు సేవలందించే సంస్థ అనే నిర్ధారణకు వస్తారు. మత విశ్వాసాలు వేరు; మత రాజకీయాలు వేరు  అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 


ప్రపంచ వేదికల మీద మతసామరస్య విలువల గురించి మాట్లాడటం సులభం. భారతదేశంలో మతసామరస్యం కోసం నిలబడటం కష్టం. న్యూయార్క్ లో ప్రకటించిన ఆదర్శాలను ఇకముందు భారత్ లో భగవత్ ఏ మేరకు ఆచరిస్తారన్నది ఇప్పుడు ప్రాణప్రదమైన ప్రశ్న. 


1 సెప్టెంబరు 2026