Thursday, 10 September 2026

మొదలైనచోటే ముగిసిన వివాదం! భయపడొద్దు! - లా విద్యార్థులకు సుప్రీం కోర్టు హామి

 భయపడొద్దు! - విద్యార్థులకు సుప్రీం కోర్టు హామి!

డానీ

సమాజ విశ్లేషకులు 



హైదరాబాద్ లోని నల్సార్ లా యూనివర్శిటీ విద్యార్ధుల వివాదం ఇప్పుడు ఆరంభమయిన  చోటే ముగిసింది.  అది సుప్రీంకోర్టులోనే ఆరంభం అయింది; అది సుప్రీంకోర్టులోనే ముగిసింది.   లా విద్యార్ఢులు, టీచింగ్ సిబ్బంది మీద క్రమ శిక్షణ చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు లేదని భారత ఉన్నత న్యాయస్థానం సెప్టెంబరు 3న అంతిమ తీర్పు చెప్పింది. 


ఈఏడాది సెప్టెంబరురు నెలలో జరగాల్సిన లా యూనివర్శిటీ కాన్వోకేషన్ కు భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంతను ఆహ్వానించారు. ప్రధానఅ న్యామ్యమూర్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం న్యాయశాస్త్ర విద్యార్ధులకు గొప్ప అవకాశం, అదృష్టం. కానీ నల్సార్ యూనివర్శిటీ విద్యార్ఢులు దానికి అభ్యంతరం చెప్పారు. జస్టిస్ సూర్యకాంతకు  రాజ్యాంగ  ప్రధాన విలువల మీద గౌరవం లేదనీ, అలాంటివారి చేతుల మీదుగా తాము   పట్టాలు తీసుకోము అన్నారు.  యూనివర్శిటీ బోధనా సిబ్బందిలో కొందరు విద్యార్ధుల పక్షాన నిలిచారు. విద్యార్ధుల నిరసనలకు స్పందించిన యూనివర్శిటీ  జస్టిస్ సూర్యకాత ను ఆహ్వానించే అంశాన్ని విరమించుకుంది.   


చీఫ్  జస్టిస్ ఆఫ్ ఇండియా  కు వ్యతిరేకంగా విద్యార్ధులు నిరసనలు తెలపడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ ) తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది నల్సార్  యూనివర్శిటీ నుండి   పట్టభద్రులైన వారిని దేశంలో ఏ బార్ అసోసియేయన్ లోనూ  నమోదు చేసుకోరాదని  బిసిఐ అధ్యక్షులు మానన్ కుమార్ మిశ్రా ఆగస్టు 13న ఒక తీవ్రమైన ఉత్తర్వులు జారీచేశారు.


నన్ కుమార్ మిశ్రా బిజెపి కి సన్నిహితులు. బిసిఐ  అధ్యక్ష పదవిలో  పదేళ్ళుగా నిరాఘాటంగా కొనసాగుతున్నారు. రెండేళ్ల క్రితం బిహార్  నుండి బిజెపి అభ్యర్ధిగా రాజ్యసభకు కూడ ఎన్నికయ్యారు. జస్టిస్ సూర్యకాంత  మీద కూడ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా వుంటున్నారనే  విమర్శలు వున్నాయి.  వారి పరువును రక్షించడానికే  మానన్ కుమార్ మిశ్రా వినూత్న ఉత్తర్వులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. 


న్యాయశాస్త్రంలో పట్టభద్రులు అయినవారిని లాయర్లు అంటారు. పట్టభద్రులు అయ్యాక బిసిఐ  నిర్వహించే ఒక అర్హత పరీక్షను పాసైన వారిని అడ్వకేట్లు అంటారు. ఆడ్వకేట్లు మాత్రమే బిసిఐ  పరిధిలోనికి వస్తారు.  


లాయర్ల జీవితాలను నాశనం చేసే అధికారం బిసిఐకి లేదని తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ తో సహా, దేశంలోని ప్రజాస్వామికవాదులు  అనేకులు మానన్ కుమార్ మిశ్రా వ్యవహారశైలి మీద తీవ్రంగా స్పందించారు. నిరసనలు పెల్లుబకడంతో  బిసిఐ  తన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ ఆ వివాదం ముగియకుండ మరికొన్ని ఆసక్తికర మలుపులు తిరిగింది. 


నల్సార్ యూనివర్శిటీ పూర్వవిద్యార్ధులు మిహిరా సూద్, అభిషేక్ తివారీ బిసిఐ అసమంజస తీరుపైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీనియర్ అడ్వకేట్ పరమేశ్వర్ లా విద్యార్ధుల కేసును వాదించారు. ఈ కేసు సిజెఐI  జస్టిస్ సూర్యకాంతతో కూడిన ధర్మాసనానికి వెళ్ళింది. ఇక్కడే  ఈకేసు కొత్త మలుపు తిరిగింది. 


ఇది నల్సార్ యూనివర్శీటీ కేసు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఈ కేసు అసలు సుప్రీంకోర్టులోనే ఆరంభం అయ్యి, తిరిగి సుప్రీం కోర్టుకే వచ్చింది. 


 ఈఏడాది మే నెలలో ఒక కేసు విషయమై సుప్రీం కోర్టుకు వచ్చిన సమాచార హక్కు కార్యకర్తల మీద సిజెఐ విసుక్కున్నారు. బొద్దింకలంటూ వారిని కసురుకున్నారు. వారి విసుర్లనే ఆత్మగౌరవంగా భావించి మొద్దింకల ఉద్యమం మొదలయ్యింది. 


ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన నిరసనలు 23 రోజులు సాగిన విషయం అందరికీ తెలుసు. ఆ ఉద్యమం మీద కేంద్ర  ప్రభుత్వ పెద్దలకు ఒక  లెఖ్ఖ వుంది.  అదేమంటే,   నిరాహార దీక్షలోవున్న  సోనమ్ వాంగ్చుక్ ను హాస్పిటల్ కు తరలించి, నిరసనకారుల మీద లాఠీలతో విరుచుకు పడితే విద్యార్ధులు పలాయనం చిత్తగిస్తారు. ఉద్యమం ఒక ముగింపుకు రావాలి. విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాల్సిన పనికూడ వుండేదికాదు. 


ఆ మరునాడు  విచిత్రంగా బొద్దింకల ఉద్యమానికి జస్టిస్ సూర్యకాంత   తనకు తెలియకుండానే పరోక్షంగా కొత్త ప్రాణం పోశారు. అంతకు ముందు రోజు విద్యార్ధుల మీద తీవ్రంగా లాఠీ చార్జి జరిగింది. లాఠీ  అంటే వెదురు కర్ర ముక్క.  ఆ కర్రకు మేకులు దించి కొట్టారు. సాంప్రదాయ నిర్వచనం ప్రకారం అది లాఠీ చార్జి కాదు; మేకులు దించడం. ఆపైన తుపాకుల్లో పిల్లెట్లు పెట్టి కాల్పులు జరిపారు. అలనాటి జలియన్ వాలా బాగ్ దురంతంలో  బ్రిటీష్ వలస పాలకులు కూడ ఒక విచారణ కమిటీ చేశారు. కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన   డయ్యర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 


నిజానికి ఇలాంటి దురంతాలు జరిగినప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం తనంతట తానుగా, సుమోటోగా స్పందించ వచ్చు. అలా జరగలేదు. పైగా, పోలీసుల వ్యవహార శైలి మీద స్పందించాలని కొందరు అడ్వకేట్లు  న్యాయస్థానాన్ని ఆశ్రయించి  లాఠీ చార్జీకి సంబంధించిన వీడియోలను పరిశీలించమన్నప్పుడు  CJI  అసహనాన్ని వ్యక్తం చేశారు.  తన  సమయాన్ని వృధా  చేయవద్దని  మందలించారు. ఈ వార్త వైరల్ అయ్యింది.  జెన్ -జీకి జరుగుతున్న ఆన్యాయాన్ని ప్రశ్నించడానికి దానికి ముందున్న తరాలు జెన్ -వై , జెన్-ఎక్స్   కూడ నిరసనలకు మద్దతుగా వచ్చాయి. అప్పుడుగానీ కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా రాజీనామా చేయించక తప్పలేదు.   వున్నత న్యాయమూర్తులకు పదవి విరమణానంతరం నామినేటెడ్ పదవులు ఇవ్వరాదు అన్న డిమాండును  బొద్దింకల ఉద్యమం  ముందుకు తెచ్చింది. ఎవరిని ఉద్దేశించి ఈ డిమాండు పుట్టిందెఓ తెలియని వారుండరు.  ఇన్ని మెలికలు తిరిగిన నల్సార్ కేసు చివరకు అదే సిజేఐ  ధర్మాసనానికే  వచ్చింది.


గతంలో రెండుసార్లు జరిగిన పొరపాట్లను జస్టిస్ సూర్యకాంత ఈసారి చేయదలచలేదు. విద్యార్ధులకూ తనకూ  మధ్య  జరుగుతున్న వ్యవహారంలో తలదూర్చడానికి బిసీఐ ఎవరూ? అని గట్టిగా అడిగారు. తొలిరోజే   మానన్ కుమార్ మిశ్రాకు చాలా పెద్ద షాకిచ్చారు. అంతేకాదు,  నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కు విద్యార్ధులకు వుందని గట్టిగా సమర్ధించారు. తాను కూడ కాలేజీ రీజుల్లో నిరసనల్లో పాల్గొనేవాడినని గుర్తు చేసుకున్నారు. . ఇప్పుడు అంతమ తీర్పులో - అడ్వాకేట్లు కాకముందు విద్యార్ధుల వ్యవహారాల్లో తలదూర్చే అధికారం బిసిఐ  కు లేదని తీర్పు ప్రకటించారు.  లా విద్యార్ధులు, బోధనా సిబ్బందికి వుండే ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలన్నారు. 

  మానన్ కుమార్ మిశ్రాకే కాదు;  బొద్దింకల నిరసనోద్యమం విషయంలో  ఢిల్లీ పెద్దల మెప్పు కోసం దిగజారుడు పనులు చేసిన వారందరికీ నల్సార్ లా విద్యార్ధుల నిరసన  కేసు తీర్పు ఒక చెంప దెబ్బ! కాకుంటే చెప్పుదెబ్బ!


03-09-2026

మొదలైనచోటే ముగిసిన వివాదం!

భయపడొద్దు! - లా విద్యార్థులకు సుప్రీం కోర్టు హామి



ఈరోజు నా వ్యాసాన్ని  ప్రచురించిన ఆంధ్రజ్యోతికి ధనవాదాలు. 

https://www.andhrajyothy.com/2026/editorial/nalsar-students-protest-supreme-court-judgment-bar-council-of-india-disciplinary-powers-1557103.html

No comments:

Post a Comment