Friday 9 June 2023

BJP is scaring in Telangana.

BJP is scaring in Telangana.

టిడిపి బిజెపి పొత్తు ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఏఎం ఖాన్ యజ్దానీ (డానీ)  

ఉక్కు కరుగుతోంది. లావా చల్లారుతోంది. మేరు పర్వతం వణుకుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకునే ధీశాలి ఇప్పుడు లేరు. వారిప్పుడు మహిళా రెజలర్ల ముందు నిలబడి “బేటీ బచావో!” అనలేరు. పార్లమెంటులో నిలబడి ఆదానీ డిఫెన్స్ కంపెనీలో చైనా జాతీయుడు పెట్టుబడి పెట్టలేదని  గట్టిగా చెప్పలేరు. ఓడిశాలో వందల మంది ప్రయాణికులు చనిపోయినా  రైల్వేమంత్రి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరు. వీరంతా ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ను ‘తోలుబొమ్మ ప్రధాని’ అని ఎద్దేవ చేసేవారు. ఇప్పుడు వీరినే ఇంకెవరో ఆడిస్తున్నారనే అనుమానం రోజురోజుకు బలపడుతోంది.

గ్రీకు పురాణం ఇలియాడ్‍ లో అచెల్లిస్ అనే మహావీరుడు వుంటాడు. అతని తల్లి కొడుకును శక్తివంతుడ్ని చేయడం కోసం చిన్నప్పుడు పాదాలు పట్టుకుని స్టైక్స్ నదిలో ముంచుతుంది. నదిలో అతని ఒళ్ళంతా ఉక్కుగా మారిపొతుంది. కానీ అతని పాదాలు రక్తమాంసాలతో సామాన్యునులవలే వుండిపోతాయి. ట్రోజన్ యుధ్ధంలో చెలరేగిపోయి శత్రుసంహారం గావిస్తున్న అచెల్లిస్ ను నిలవరించడానికి ట్రాయ్ నగర యువరాజు పారిస్ అతని పాదం మీద బాణం విసురుతాడు. అలా అచెల్లిస్ మరణిస్తాడు. మహాభారతంలో మనకూ ఇలాంటి ఉదాహరణ ఒకటుంది. మనం సాధారణంగా ప్రత్యర్ధుల తల చూస్తాం, భుజాలు చూస్తాం, ఛాతీ చూస్తాం. కానీ పాదాలు చూడం. అవి ‘అచెల్లెస్ హీల్’ కావచ్చు.

గత ఏడాది చివర్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో  జైరామ్ ఠాకూర్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే బిజెపికి తొలి దెబ్బ  తగిలింది. హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం కనుక కాంగ్రెస్ కూడ దాన్ని ఘన విజయం అనుకోలేదు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర పనిచేస్తున్నదని మాత్రం అనిపించింది. ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కర్ణాటకలో బిజెపిని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం సామాన్యమైన విజయంకాదు.

రెవెన్యూ పంపిణీలో (డివల్యూషన్) కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారత పక్షపాతాన్ని చూపుతున్నదని ఇప్పటికే రాజకియ రంగంలో ఒక అపవాదు కొనసాగుతోంది. కర్ణాటకలో తమ పార్టి ప్రభుత్వాన్ని చూపి ప్రజల్లో ఉత్తర దక్షణ భావనలు లేవని బిజెపి పెద్దలు చెపుతూ వచ్చారు. ఇప్పుడు దక్షణాదిలో వున్న ఒక్క రాష్ట్రాన్ని కూడ బిజెపి కోల్పోయింది. అది అక్కడితో ఆగలేదు. “ఇప్పుడు బిజెపి ముక్త దక్షణ భారత దేశం – రేపు బిజెపి ముక్త సంపూర్ణ భారతదేశం” అనే నినాదం ముందుక్లు వచ్చింది.

మనదేశంలో క్రీడల్ని రాజకీయాల్నీ విడదీసి చూడడం కుదరదు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్  తమను లైంగిక వేధింపులకు గురిచేశారని మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఐదు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్  ప్రస్తుతం లోక్ సభ సభ్యుడు.

ఇతర కేసుల్లో అయితే , ఆరోపించిన నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత పిర్యాదిదారులపై వుంటుంది. లైంగిక వేధింపుల కేసుల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుల మీద వుంటుంది. బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్   కు బిజేపి పెద్దలు శరణం ఇచ్చారు. వాళ్ళిప్పుడు ‘బ్రిజ్ భూషన్ బచావో’ కార్యక్రమంలో వున్నారు.  

క్రీడలు రాజకీయాల అనుబంధం అక్కడే ఆగలేదు. కపిల్ దేవ్ సారధ్యంలో భారత్ కు తొలిసారిగా 1983లో  క్రెకెట్ ప్రపంచ కప్పు దక్కినట్టు మనకు తెలుసు. ఆ టీం మొత్తం ఇప్పుడు మహిళా రెజ్లర్లకు నైతిక మద్దతు ఇస్తోంది.  క్రికెట్ లో ఒక సాంప్రదాయం వుంటుంది. వరుస రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన బౌలరు మూడో బంతి విసరడానికి సిధ్ధపడితే దాన్ని హాట్రిక్ బాల్ అంటారు.

ఇప్పుడు తెలంగాణలో హ్యాట్రిక్ బాల్ ను విసరడానికి కాంగ్రెస్ సిధ్ధమైంది. ఒకవేళ మూడో బాల్ కు కూడ  వికెట్ పడితే  ఆ హ్యాట్రిక్ ఓటమిని బిజెపి తట్టుకోలేదు. అది 2024 లోక్ సభ ఎన్నికల మీద భారీ ప్రభావాన్ని వేస్తుందని దానికి తెలుసు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడానికి ఏమి చేయడానికి అయినా బిజెపి సిధ్ధం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. గోషామహల్ సియోజకవర్గం నుండి రాజా సింగ్ ఒక్కరే గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు దక్కడమేగాక వరుస ఉప ఎన్నికల్లో మరో రెండు విజయాలు చేకూరడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో బిజెపి పవనాలు  వీస్తున్నాయని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తనదైన  శైలిలో వుధృత ప్రచారం సాగించారు. దాన్ని నమ్మి కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు బిజెపి వైపు చూడడం మొదలెట్టారు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఈ ప్రచారం బుడగలా పేలిపోయింది. సంజయ్ బండి వేగానికి బ్రేకులు పడ్డాయి.  రాజాసింగ్ కు నోరు పెద్దది. దాన్ని తట్టుకోవడం బిజెపికి కూడ సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఆయన సస్పెండ్ అయివున్నారు. బిజెపి ఊపును చూసి వచ్చిన వారు ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఉక్కబోతకు గురవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పార్టి యంత్రాంగం ఉత్సాహాన్ని కోల్పోవడంతో  బిజెపి కేంద్ర పెద్దలు కలత చెందుతున్నారు.  పరిస్థితిని చక్క దిద్దడానికి సాక్షాత్తు అమిత్ షా రంగంలోనికి దిగి టిడిపి నేత చంద్రబాబుకు కబురు పెట్టారు. ఇప్పటి రాజకీయ పరిస్థితిలో అమిత్ షా చంద్రబాబుల సమావేశం అనేక ప్రత్యేకతల్ని సంతరించుకుంది.

చంద్రబాబు గతంలో ఎన్డీయేతో మూడుసార్లు పొలిటికల్ హానీమూన్ గడిపారు. రెండుసార్లు విడాకులు తీసుకున్నారు.  2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీజీతో గట్టిగానే ఘర్షణ పడ్డారు. రాష్ట్ర విభజన హామీలయిన ప్రత్యేక తరహా హోదా, వెనుకబడిన ప్రాంతాలకు చేయుత, రెవెన్యూ లోటు భర్తి, రైల్వేజోన్, ఇతర పరిశ్రమలు, పోలవరం డిపిఆర్-2 వగయిరాలను పక్కన పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వీటి సాధన కోసం ‘ధర్మపోరాటం’ చేశారు.  నరేంద్ర మోదీజీని ‘టెర్రరిస్టు’ అనడమేగాక ఆయన దాంపత్య జీవితాన్నీ విమర్శించారు.

          అయితే ఇదంతా గతం. ఏపిలో జగన్ వైసిపిను వచ్చే ఏడాడి ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా  ఎదుర్కోలేదని చంద్రబాబు భయపడుతున్నారు. ఇటీవలి టిడిపి మహానాడులో జగన్  ‘నవరత్నాలు’ కు పోటీగా కొన్ని ‘వజ్రాలను’ వారు ప్రకటించారు. దానికి అంతగా సానుకూల స్పందన వచ్చినట్టులేదు. 2014 మోడల్ లో జనసేన, బిజెపిలతో పొత్తు కుదుర్చుకోవాలని కొంతకాలంగా వారు చాలా ఆతృత చూపుతున్నారు. అంచేత దాదాపు ఐదేళ్ళ తరువాత అమిత్ షాతో సమావేశం కావడం వారికి చాలా ఆనందాన్ని ఇచ్చి వుంటుంది. 2009 ఎన్నికలకు ముందు కూడ వారు కేసిఆర్- టిఆర్ ఎస్ లతో పొత్తు పెట్టుకోవడానికి ఇలాగే తహతహ లాడారు.

ఏపిలో బిజెపికి జగన్ తో ఎలాంటి ఇబ్బందీ లేదు. 22 మంది లొక్ సభ సభ్యులు, ఓ డజను మంది రాజ్యసభ సభ్యులువున్నారు. అయినా కేబినేట్ లో ఒక్క మంత్రిపదవిని కూడ ఆశించకుండ కేంద్రానికి ఉచిత సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి భారత రాజకీయాల్లో మరొకరు కనిపించరు.

తెలంగాణలో కాంగ్రెస్ ను నిలవరించడానికి తనకు టిడిపి అవసరమని బిజెపి గట్టిగా భావిస్తోంది. సందర్భాన్నిబట్టి బిఆర్ ఎస్ తో జతకట్టడానికి కూడ ఆ పార్టి వెనుకాడకపోవచ్చు. బిజెపి కోరితే కేసిఆర్ కాదనలేకపోనూవచ్చు. అప్పుడే కేసిఆర్ మీద బండి సంజయ్ గొంతు తగ్గించినట్టు, కాంగ్రెస్ మీద కేసిఆర్ గొంతు పెంచినట్టు  స్పష్టంగానే కనిపిస్తోంది.

తెలంగాణలో టిడిపికి 10-15 నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభిమానులున్నారు. వాళ్ళు బిజెపికి సహకరిస్తారా? సహకరించినా వాటి ప్రభావం ఎంత? అనేవి కీలక ప్రశ్నలు. పదేళ్ళు పాలించిన కారణంగా కేసిఆర్ మీద కూడ ప్రజల్లో అసమ్మతి వుంది. మరో వైపు కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బిజెపిలో చేరిన కాంగ్రెస్ నేతలు కూడ స్వంతగూటికి చేరుకునే ప్రయత్నాల్లో వున్నారని వినిపిస్తుస్తోంది. .

          బిజెపితో కొత్త ప్రేమాయణం ఏపిలో టిడిపికి లాభమా? నష్టమా? అనేది కూడ పెద్ద ప్రశ్న. జనసేన, బిజెపిలతో కలిసి పోటీ చేయడం టిడిపికి లాభమే. గత ఎన్నికల ప్రచారం గుర్తున్నవారు బిజెపితో టిడిపి పొత్తును అవకాశవాదంగా భావించే వీలు లేకపోలేదు. అలాగే, బిజెపి అంటే గిట్టని   సమూహాలు మొత్తంగా కాకపోయినా కొంత మేరకయినా టిడిపికి దూరంకావచ్చు. అయితే, ఏపిలో టిడిపి లాభనష్టాలతో బిజెపికి పనిలేదు. తెలంగాణలో టిడిపిని వాడుకోవడం వరకే దానిపని.

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు)

9010757776

రచన : 9 జూన్ 2023

ప్రచురణ :

 


No comments:

Post a Comment