Wednesday 5 June 2024

AP Election Results Surpass Tsunami

 AP Election Results Surpass Tsunami

*సునామీని మించిపోయిన ఏపి ఎన్నికల ఫలితాలు*

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ జగన్ మోహన రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించేశారు.  అధికార పార్టి మీద ప్రజల్లో  సహజంగానే కొంత వ్యతిరేకత వుంటుంది.  కానీ ఇంతటి వ్యతిరేకత వుందని విపక్ష పార్టీలు కూడ ఊహించి వుండవు. 2019లో వైసిపికి 151 స్థానాలిచ్చిన ప్రజలు ఐదేళ్ళు తిరగ్గానే 11 స్థానాలకు దించేశారు. ఇది ఓటమి మాత్రమే కాదు; ఘోర పరాజయం.

          జగన్ ఓటమి మీద రెండు రకాల నేరేటివ్స్ బలంగా  వినిపిస్తున్నాయి. జగన్ తన నియంతృత్వ పోకడలవల్ల, ఫ్యాక్షనిస్టు మనస్తత్వంవల్ల, వ్యవస్థల్ని ఓవర్ యూజ్ కాదు; అబ్యూజ్ చేయడం మూలంగా ఓడిపోయారు అనేది  మొదటి నేరేటివ్. తెలుగులో దీన్ని క్రూరంగా  చెరచడం అనవచ్చు. సంక్షేమపథకాలు – ఉచితాలవల్ల ఓడిపోయారు అనేది రెండవ నేరేటివ్. మొదటి నేరేటివ్ తో ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. కానీ, రెండో నేరేటివ్ మీద కొంత వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి.

          అవకాశాలు వున్నోళ్ళు అవకాశాలు లేనోళ్ళు కలిసి వుండే సమాజాల్లో అవకాశాలు లేనోళ్ల మీద ప్రభుత్వాలు అదనపు ప్రేమను చూపించాల్సివుంటుంది. దీన్ని వివక్షగా చిత్రించి విమర్శించేవాళ్ళూ సమాజంలో వుంటారు. వాళ్ళు వీటిని ‘ఉచితాలు’ అంటూ ఎద్దేవ చేస్తుంటారు. అవకాశాలు ఎక్కువగా వున్నోళ్ళు సాధారణంగా ఇలాంటి వాదనలు చేస్తుంటారు. అవకాశాలు లేనోళ్ళను ఆదుకోవడానికి ‘సానుకూల వివక్ష’ (Positive Discrimination) ను పాటించడం అవసరం.  జగన్ ఓటమి కారణంగా భవిష్యత్తులో ‘సానుకూల వివక్ష’ అనే విధానం మాసిపోకూడదు. ఎలాగూ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో మరిన్ని సంక్షేపథకాలు ప్రకటించారు. సంక్షేమం కొనసాగుతుంది. కొనసాగాలి కూడ.

          గత ఏడాది జరిగిన  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ ఓడిపోయినపుడు, ఆయన్ని అభిమానించే ఓ పత్రికాధిపతి నాకు ఫోన్ చేశారు. “అనేక రకాల సంక్షేమ పథకాలతో అన్నివిధాలా ఆదుకున్న కేసిఆర్ ను ప్రజలు ఓడించారు” అనే కాన్సెప్ట్ తో ఒక వ్యాసం రాసిపంపమన్నారు. “కేసిఆర్ ఓడిపోవడానికి కారణం సంక్షేమ పథకాలు, నీటిపారుదలా  ప్రాజెక్టులు కాదు; ఆయన అహంకారం, నిరంకుశత్వం, కుటుంబ పాలన ఆయన్ను ఓడించింది” అన్నాను.

          జగన్  విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రివర్గంలో గొప్ప టీం వుండేది.  ఆర్ధికమంత్రి రోశయ్య, హోంమంత్రి జానా రెడ్డి, వ్యవసాయశాఖామంత్రి రఘువీరారెడ్డి, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాద రావు, మునిసిపల్ శాఖామంత్రి కోనేరు రంగారావు, దేవాదాయ శాఖామంత్రి జేసి దివాకర్ రెడ్డి, నీటిపారుదలాశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంఎస్ సత్యనారాయణ, డి శ్రీనివాస్,  సబితా ఇంద్రారెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, గీతారెడ్డి ఎవరికి వారు తమ శాఖల విషయాల్లో చాలా అప్ డేట్ గా వుండేవారు. డి శ్రీనివాస్, ఎంఎస్ సత్యనారాయణ,  జేసి దివాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు అప్పుడప్పుడు విలేకరుల ముందే వైయస్ మీద కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుండేవారు. అది వైయస్ కు కూడ తెలుసు.  కానీ అందరూ టీమ్ ధర్మాన్ని పాటించేవారు. అందుకే, విపక్షాలు మహాకూటమి కట్టినా వైయస్ టీం 2009 ఎన్నికల్లో మళ్ళీ గెలిచింది. ఆ టీమ్ వారసత్వం జగన్ కు లేదు; రాలేదు. జగన్ ఎన్నడూ బహువచనం కాదు; ఏకవచనం.        

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ప్రభుత్వంలో వ్యవసాయ, నీటిపారుదలా శాఖలు ప్రాణం వంటివి. వ్యవసాయశాఖామంత్రి వ్యవసాయం గురించి మాట్లాడడం, నీటిపారుదలాశాఖామంత్రి నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం గత ఐదేళ్లలో మనం  వినివుండం. జగన్ కేబినేట్ లో సకలశాఖలకు ఒకరే మంత్రి; సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ప్రజలకు ఏమాత్రం  నచ్చలేదు. తెలంగాణలో కేటిఆర్, కవిత కలిసి కేసిఆర్ ను ఓడించినట్టు ఏపిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటి చేతి మీద జగన్ ను ఓడించారు.

జగన్ నిర్మూలన మీద పెట్టినంత శ్రధ్ధను నిర్మాణం మీద పెట్టలేదు. ‘వాళ్ళ ఇల్లు కూలగొట్టారు, వీళ్ల ఇళ్ళు కూలగొట్టారు’ అనే వార్తలుతప్ప  ఆ ప్రాజెక్టు కట్టించారు, ఈ రోడ్డు వేయించారు అనే వార్తలు వినిపించలేదు. చంద్రబాబును అరెస్టు చేయడం దీనికి పరాకాష్ట. అప్పట్లో జగన్ ను అరెస్టు చేయడంవల్ల సానుభూతి పెరిగినట్టు ఇప్పుడు చంద్రబాబు మీద సానుభూతి పెరిగింది. ఈ చిన్న లాజిక్ ను జగన్ ఎలా మరిచారో?  

వైయస్ రాజశేఖర రెడ్డి తన మీద ఫ్యాక్షనిస్ట్ ముద్రపడకుండ జాగ్రత్తలు పడేవారు. జగన్ ఫ్యాక్షనిస్టుగా గుర్తింపు పొందడానికి ఉత్సాహం చూపారు. వారు సాగించిన ప్రతీకార చర్యలు ప్రజలకు  నచ్చలేదు. ఆయన ‘నవరత్నాల’ లబ్దిదారులు సహితం జగన్ కు వ్యతిరేకంగా ఓటేశారు. కులంలేదు మతంలేదు ప్రాంతంలేదు అందరిదీ సింగిల్ పాయింట్ ప్రోగ్రాం జగన్ ను దించేయడం. అందరిదీ అంటే అతిశయోక్తి కావచ్చుగానీ, రాష్ట్రంలో కనీసం 60 శాతం మంది జగన్ ను కఛ్ఛితంగా ఓడించాలనుకున్నారు!.

సామ్యవాద, మతసామరస్య భావాలు కలిగిన పౌరసమాజం కూడ ఏపి ఎన్నికల్లో సైధ్ధాంతిక గందరగోళంలో పడిపోయింది. వర్తమాన భారత సమాజంలో పౌరసమాజం ఎదుర్కొనే ప్రధాన సమస్య గుజరాత్ ఆధిపత్య బిజేపి. మహారాష్ట్ర ఆధిపత్య ఆరెస్సెస్ కన్నా గుజరాత్ ఆధిపత్య బిజెపి  మరింత ప్రమాదకారి అని పౌరసమాజం భావిస్తోంది.  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగులోనికి వచ్చిన  ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) ఉద్యమం అక్కడ అధికార బిజెపిని ఓడించడంలో సఫలం అయింది. దానికి కొనసాగింపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన ‘జాగో తెలంగాణ’ కూడ ప్రభుత్వాన్ని మార్చడంలో తనవంతు పాత్రను పోషించింది.

చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం కూడ వుందనే మాట బలంగా వినిపించినపుడు ఏపి  పౌర సమాజం ఆలోచనల్లో పడింది.  చంద్రబాబును సమర్ధించే ప్రధాన మీడియా, సోషల్ మీడియాలు ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడ విమర్శలు మొదలెట్టాయి. కర్ణాటక, తెలంగాణ మోడల్ లో ఏపిలో అధికార వైసిపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష టిడిపి పక్షం వహించాలనే ఆలోచనలు పౌరసమాజంలో మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి జాతీయ ప్రత్యామ్నాయంగా ఎలాగూ వుంది. చంద్రబాబు ఇండియా కూటమికి దగ్గర కావచ్చనే ఊహాగానాలు కూడ చెలరేగాయి.  చంద్రబాబు వైపు సానుకూలంగా మారడానికి  పౌరసమాజానికి అలా ఒక సమర్ధన దొరికింది.

అయితే, చంద్రబాబు నేరుగా బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో సన్నివేశం మళ్ళీ మారిపోయింది. మోదీజీ ఎన్నికల ప్రచారంలో ముస్లింల మీద విపరీతమైన ద్వేషాన్ని వెళ్ళగక్కారు. ఎక్కువమంది పిల్లల్నికనేవారు వంటి వ్యాఖ్యలతో మొదలెట్టి  టోపీవాలే, చొరబాటుదార్లు (ఘూస్ పైఠియే),  మదరసా, ముల్లా, మాఫియా, ముజ్రా వరకు ఏ పదాన్నీ వదలలేదు. ఈ స్థితిలో, అన్యమనస్కంగానే అయినా సరే, చంద్రబాబును కాదని  జగన్ ను సమర్ధించక తప్పదనే ప్రతిపాదనను  ముస్లీం సమాజంలోని కొందరు ముందుకు తెచ్చారు.  

విధేయులనుతప్ప ముసిం సమాజంలో కొంచెం గౌరవమర్యాదలు వ్యక్తిత్వంవున్న వారెవర్నీ జగన్ గుర్తించలేదు. పైగా, వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను కొనసాగించడంతప్ప కొత్తగా ముస్లింల శ్రేయస్సు కోసం చేసిందేమీలేదు. జగన్ మీద అసంతృప్తితోవున్న ముస్లీం సమాజం ఏపి ముస్లిం ప్రముఖులు ఇచ్చిన ప్రకటనను పట్టించుకోలేదు. మరోవైపు, బిజెపితో జతకట్టినా సరే ముస్లింల ప్రయోజనాలనూ కాపాడుతానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆ సమాజం మీద బాగా పనిచేసింది. వాళ్ళు సహితం అటు మొగ్గారు.  సునామీ వచ్చినపుడు ఏదీ ఆగదు. ఏపీ ఎన్నికలు సునామీని మించిపోయాయి.

4 మే 2024

ప్రచురణ ః

ఆంధ్రజ్యోతి డైలీ, 6 మే 2024

https://www.andhrajyothy.com/2024/editorial/ap-election-beyond-tsunami-1264410.html

 

 

ఏపి ఎన్నికల ఫలితాల మీద నేను రాసిన వ్యాసం *సునామీని మించిపోయిన ఏపి ఎన్నికల ఫలితాలు* ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చింది. పత్రికాధిపతులకు, సంపాదకులకు, ఎడిట్ పేజీ ఇన్ చార్జీలకు ధన్యవాదాలు.

ఆసక్తికలవారు కింది లింకులో నా వ్యాసాన్ని చదవవచ్చు.

https://www.andhrajyothy.com/2024/editorial/ap-election-beyond-tsunami-1264410.html

No comments:

Post a Comment