చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు.
మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో
మైనారిటీ మత సమూహాల మీద మెజారిటీ మత సమూహాలు సాగిస్తున్న అణిచివేతని
వర్గ వైరం అందామా? వర్గ పీడన అందామా? వర్గ పోరాటం అందామా? ఇంకేదయినా అందామా?
ఇది మొదటి అంశం
ఇక రెండో అంశం -
మార్క్స్ ఏంగిల్స్ లిఖిత చరిత్ర అన్నట్టు మత వైరుధ్యానికీ ఒక కాల పరిమితిని విధిద్దామా?
మూడవ అంశం
మత వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఒక చైతన్యయుత సంఘటిత ప్రయత్నం ఏమైనా కావాలా? అక్కరలేదా?
నాలుగవ అంశం
పెట్టుబడీదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశకు చేరుకున్నప్పుడు ప్రధాన బాధిత సమూహం ఏమిటో మనకు ఒక అంచనా వుంది.
పెట్టుబడీదారీ వ్యవస్థ మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థగా మారినపుడు బాధిత సమూహాలు ఏవీ?
ఐదవ అంశం
మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో బాధిత సమూహాలు వంద వరకు వుండవచ్చు.
వాటిల్లో ప్రధాన బాధిత సమూహాలు ఏవీ?
ఆరవ అంశం
ఒక నిర్దిష్ట సమాజంలో ప్రధాన బాధిత సమూహాలు ఏవో నిర్ధారించకుండా ఒక పోరాట / విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడం సాధ్యమౌతుందా?
మార్క్సో, ఏంగిల్సో మరొకరో చెప్పినంత మాత్రాన అది అంతిమ సత్యమనీ దాన్ని ప్రశ్నించకూడదనే అభిప్రాయం నాకు లేదు.
సామ్రాజ్యవాద పెట్టుబడీదారీ వ్యవస్థ మార్క్స్ . ఏంగిల్స్ కాలానికి లేదు. దాన్ని విశ్లేషించే బాధ్యతను లెనిన్ తీసుకున్నాడు.
మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ లెనిన్, మావో, చారు మజుందార్ కాలానికి కూడ లేదు.
మన కాలంలో అది ముందుకు వచ్చింది.
దాన్నీ విశ్లేషించడం, దాని పరిష్కారానికి చేయాల్సిన పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం ఈ కాలపు ఆలోచనాపరుల బాధ్యత.
వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక మైనారిటీ మత సమూహాలు ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఎవ్వరూ ఇవ్వరని ఆశిస్తాను.
ఈ అంశం మీద ఇంకా విస్తృత చర్చ జరగాలనేదే నా ఉద్దేశ్యం.
- డానీ
*నిన్నటి విప్లకారులు ఈరోజు విప్లవకారులు కావలసిన పనిలేదు*
1992 డిసెంబరులో మెజారిటీ మతతత్త్వ శక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశాయి. ఆ వెంటనే విరసం 1993 జనవరిలో గుడివాడలో జరిగిన పాఠశాలలో 'విప్లవ సాహిత్యంలో మతతత్త్వం' అనే అంశం మీద ఒక సెషన్ నిర్వహించింది. 'విప్లవోద్యమంలో మతతత్త్వం' గా దీనిని కొనసాగించవచ్చు.
అంతకు ముందే కేవిఆర్ 'మతవర్గతత్వం' పేరుతో గద్వాలలో ఒక పాఠం చెప్పారు. బాలగోపాల్ 'హిందూ మతరాజ్యం' అనే పుస్తకం రాశాడు. ఇప్పుడు నేను 'మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ' అంటున్నాను. ఇది అవగాహనకు సంబంధించిన ఒక చారిత్రక క్రమం.
ఇది నచ్చనివాళ్ళు. దీన్ని గట్టిగా అడ్డుకోవాలనుకునే వాళ్ళూ చాలామంది వుంటారు. వాళ్లలో కమ్యూనిస్టులూ వుంటారు. వాళ్ళ అవసరాలు వాళ్లకుంటాయి. వాళ్ల తర్కం వారికుంటుంది. కారంచెడు ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు మాదిగల మీద అగ్ర కులస్తులు దాడి చేశారంంటే పాత కమ్యూనిస్టులు కొందరు నా మీద విరుచుకుపడ్డారు. రైతు కూలీల మీద భూస్వాములు దాడి చేశారు అనేది వాళ్ల నేరేటివ్.
మనుషులు ప్రపంచాన్ని తమ భౌతిక, సామాజిక అస్తిత్వాల నుండి చూస్తారు. దీనికి మీరూ నేనూ మినహాయింపు కాదు.
1950లలో కమ్యూనిస్టు పార్టీలు భారత దేశాన్ని ఒకలా చూశాయి. అప్పటికి వాళ్లు విప్లవకారులు. 1960లలో వాళ్లను తీవ్రంగా విమర్శిస్తూ కొత్త దృక్పథంతో కొత్త కమ్యూనిస్టులు వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. 1970లలో వాళ్లనూ విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ఇంకో కొత్త దృక్పథంతో వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. ఇప్పుడు మళ్ళీ వాళ్లను విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి వాళ్ళూ విప్లవకారులే.
కొత్త దృక్పథాలతో ముందుకు వచ్చేవారిని పాత కమ్యూనిస్టులు నిరాకరించడం పాత సాంప్రదాయమే. ఒక చారిత్రక దశలో విప్లవ ఆలోచనాపరులుగా వ్యవహరించినవారు ఇంకో చారిత్రక దశలో విప్లవ విఘాత శక్తులుగా మారిపోతారన్నది గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రమే.
- డానీ

No comments:
Post a Comment