Saturday, 26 April 2014

Gulam Yazdani - A Memory

Gulam Yazdani - A Memory 


గులాం యజ్దానీ – ఒక అనుబంధం  

డానీ

                     విఖ్యాత చరిత్రకారుడు గులాం యజ్దానీ పై  డా. ద్యావనపల్లి సత్యనారాయణగారి  వ్యాసం తెలంగాణ చరిత్ర పితామహుడుఈరోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో  (http://www.andhrajyothy.com/node/88452) వచ్చింది. గులాం యజ్దానీగారిని నేను ఎన్నడూ చూడలేదు. అయితే, వారితో నాకు ఓ దూరపు  అనుబంధంవుంది.

          మా తాతగారి పేరు గులాం మొహిద్దీన్ ఖాన్ గారు. వారి అన్నగారు గులాం గౌస్ ఖాన్ గారు.  మా తాతగారు నరసాపురంలో స్థిరపడగా, వారి అన్నగారు నిజాం సంస్థానం  రెవెన్యూ విభాగంలో కొలతల ఉద్యోగి (ఓవర్ సీర్) గా స్థిరపడ్డారు. మా పెదతాతగారి పెద్దల్లుడు అబ్దుల్ సత్తార్ పాషా నిజాం సంస్థానంలో ఉన్నతాధికారి. వారు నిజామాబాద్ పరిసరాల్లో తహశీలుదారుగా పనిచేశారో  అంతకన్నా పెద్ద హోదాలో పనిచేశారోగానీ వారిని మా ఇళ్లల్లో గవర్నర్ సాబ్ అని పిలిచేవారు. వారు మా నాన్నగారికి పెద్ద బావగారు.  న్యాయశాఖ మాజీమంత్రి ఆసిఫ్ పాషాగారు  అబ్దుల్ సత్తార్ పాషాగారికి స్వయాన అల్లుడు. ఆసిఫ్ పాషా నాకు మేనత్త కొడుకు.

మా కుటుంబంలో మౌలానా హజ్రత్ గారని ఒక ధార్మిక గురువుగారు వుండేవారు. వారు ఆరు నెలలు నరసాపురంలోనూ, ఆరు నెలలు హైదరాబాద్ లోనూ వుండేవారు. ఆ కాలంలో, మా కుటుంబంలో ఎవరు పుట్టినా మౌలానా హజ్రత్ గారే పేర్లు నిర్ణయించేవారు. సాంప్రదాయ వంశం (బతికి చెడిన కుటుంబం అనేది దీనికి మరోపేరు) కావడాన మా కుటుంబంలో పేర్లు అనేక సమీకరణలతో వుంటాయి. గులాం మొహిద్దీన్ ఖాన్ ఆసిఫ్, గులాం గౌస్ ఖాన్ షానవాజ్, గులాం మొహిద్దీన్ ఖాన్ దుర్రానీ, గులాం మొహిద్దీన్ ఖాన్ సమ్దానీ, లియాఖత్ అలీ ఖాన్ రబ్బానీ ఇలా వుంటాయి.

1951లో నేను పుట్టినపుడు, మౌలానా హజ్రత్ గారు హైదరాబాద్ లో వున్నారు. పిల్లాడికి పేరు సూచించమని మా అమ్మ వారికి ఉత్తరం రాసిందట. వారు యజ్దానీ అని పెట్టమన్నారట.  మా హైదరాబాద్ దాయాదులకు గులాం యజ్దానీ గారు చాలా సన్నిహితులు.

ఇతర సమీకరణలు అన్నీ సరిచేసుకుని చివరకు నా పేరు అహమ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ అయింది. నాపేరులో అహమ్మద్ అనేది మా నాయనమ్మగారి తండ్రి అహమ్మద్ షరీఫ్ గారి పేరు. వీరే నరసాపురం టేలర్ పేట మసీదు వీధి వ్యవస్థాపకులు.  మొహిద్దీన్ అనేది మా తాతగారు గులాం మొహిద్దీన్ ఖాన్ గారి పేరు. ఖాన్ అనేది మా తెగ పేరు. జర్రానీ అనేది మా వంశం పేరు. నరసాపురం పాతబజారు, పఠాన్ వీధిలోని సూఫీ గురువు హజ్రత్ ఖాన్ జాన్ ఖాన్ దర్గావల్ల మా వంశానికి  ఆ పేరు వచ్చింది. (ఆ దర్గా చరిత్ర రాయాలనేది నా కోరికల్లో ఒకటి) ఇక మిగిలిన యజ్దానీ ఒక్కటే నా స్వంత నాపేరు.

యజ్దానీ అనేది కాలక్రమేణ ఉఛ్ఛరణ సౌలభ్యం కోసం  యస్ డానీ అయ్యింది. నా పేరు నేపథ్యాన్ని తొలిసారిగా నాకు గుర్తు చేసింది కేవి రమణా రెడ్డిగారు. యజ్దానీ అంత మంచి పేరుని ఇలా ముక్కలు చేశారా? అని వాపోయారాయన. కేవీయార్ ఇచ్చిన ప్రేరణతోనే, నా పేరు వెనక వున్న చరిత్రను తవ్వే పనిచేశాను. యంటీ ఖాన్ సాబ్ కూడా పహలే యే దానీ థే! అబ్ డాన్ బన్ గయేఅంటూ ఆటపట్టిస్తుంటారు.   


26 April 2014

Thursday, 24 April 2014

Thank God I am not Communist!

దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా
చేసినందుకు నీకు ధన్యవాదాలు!

డానీ


ప్రతి ఘర్షణలో, మేధో సంఘర్షణలో రెండు సామాజికవర్గాలుంటాయి. వాటిల్లో తప్పని సరిగా ఒకటి బలమైనది, మరొకటి బలహీనమైనది వుంటుంది. ఒకటి పీడిస్తుంది. మరొకటి పీడితురాలిగా వుంటుంది.  మనం ఎప్పుడయినా చేయాల్సింది పీడితుల పక్షం నిలబడడమే! ఇలా నిలబడాలంటే చాలా నైతిక స్థైర్యంకావాలి.

                        పెత్తందారీ కులాలు. వెనుకబడిన కులాల మధ్య వివాదం మొదలయితే నేను  వెనుకబడిన కులాల పక్షం వహిస్తాను. వెనుకబడిన కులాలు, దళితుల మధ్య వివాదం మొదలయితే నేను  దళితుల పక్షం వహిస్తాను. దళితుల్లో మాలలు, మాదిగల మధ్య వివాదం మొదలయితే నేను మాదిగలపక్షం వహిస్తాను. హిందువులకు శిక్కులకు మధ్య వివాదం మొదలయితే నేను శిక్కులపక్షం వహిస్తాను. హిందువులకు క్రైస్తవులకు మధ్య వివాదం మొదలయితే నేను క్రైస్తవుల పక్షం వహిస్తాను. తెలంగాణకు సీమాంధ్రకూ మధ్య వివాదం మొదలయితే నేను తెలంగాణ పక్షం వహిస్తాను. తీరాంధ్రకూ, రాయలసీమకూ మధ్య వివాదం మొదలయితే నేను రాయలసీమ పక్షం వహిస్తాను.

  పురుషులకూ, స్త్రీలకు మధ్య మధ్య వివాదం మొదలయితే నేను స్త్రీల పక్షాన నిలబడతాను. కార్మికులకూ యజమానులకూ మధ్య వివాదం మొదలయితే నేను కార్మికుల పక్షాన నిలబడతాను. ఉత్తరాదికీ దక్షనాదికీ మధ్య వివాదం మొదలయితే నేను దక్షణాది పక్షాన నిలబడతాను. ప్రపంచదేశాల మధ్య వివాదం మొదలయితే నేను మూడవ ప్రపంచదేశాల పక్షాన నిలబడతాను.

                        ఇవన్నీ నేను దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తూనే వున్నాను. ఇక ముందు కూడా చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది నన్ను లౌకికవాది, ప్రజాస్వామికవాది అంటూ మెచుకుంటూ కూడా వుంటారు. కానీ, హిందువులకు ముస్లింలకు మధ్య వివాదం మొదలయినపుడు ముస్లింల పక్షం వహిస్తే  వెంటనే నేను కొందరి దృష్టిలో మతవాది అయిపోతున్నాను.  మరి కొందరయితే నాకు కమ్యూనిజం మూల సూత్రాలు నేర్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది విషాదం.  నిజానికి  ముస్లిం సమాజంలోనూ అష్రాఫ్, అజ్లాఫ్. అర్జాల్  లమధ్య వివాదం మొదలయినా నేను అజ్లాఫ్. అర్జాల్  ల పక్షం వహిస్తాను.

                        కష్టకాలంలో పీడితుల పక్షాన నిలబడడానికి కమ్యూనిస్టు సిధ్ధాంతం అడ్డంకిగా మారితే అది అసలు కమ్యూనిజమేకాదు. దాన్నే కమ్యునిజమని ఎవరైనా చెలాయించదలిస్తే అలాంటి కమ్యూనిజం నాకు అక్కరలేదు. అసలు విషయం ఏమంటే భారతదేశంలో  కమ్యూనిజంతో పనిలేనివాళ్ళంతా, పీడిత జీవితం తెలియనివాళ్ళంతా కమ్యునిస్టు నాయకులుగా చెలామణి అయిపోతున్నారు. దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా చేసినందుకు నీకు ధన్యవాదాలు!


24 April 2014

Wednesday, 23 April 2014

గురువులూ మీకు వందనం!

My Teachers in Journalism

పాత్రికేయ గురువులూ మీకు వందనం!
డానీ

నోటికి అన్నమే తింటున్నారా? అనే అరుణ్ సాగర్ పోస్టింగ్ (https://www.facebook.com/arun.sagar.9440?fref=nf) చూశాక రెండు విషయాలు రాయాలనిపించింది. అతని ఆవేదన నా జర్నలిజం కెరీర్ లో కొన్ని మైలురాళ్ళని గుర్తుతెచ్చింది. ముఖ్యంగా, నా గురువుల్ని తలుచుకోవాలనిపించింది.

       నాకు అప్పర్ ప్రైమరీ స్కూలు దశ నుండే రాయడం అలవాటు అయింది. నియతవిద్య  మానేశాక 1973లో రాసిన ప్రగతి నాటికకు  పరిషత్తు నాటకాల్లో మంచి గుర్తింపు వచ్చింది. రచయితగా నేను యవ్వనంలో ప్రవేశించింది 1978 లో విప్లవ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాతే. ఉపస్రవంతి పత్రికల్లో ఎనిమిదేళ్ళపాటు రచనావ్యాసంగాన్ని కొనశాగించాక 1986 జనవరిలో ప్రధాన స్రవంతి పత్రికల్లో  ప్రవేశించాను.  ప్రధాన స్రవంతి పత్రికల్లో   నా తొలి వ్యాసం ఉదయంలో అచ్చయింది. అప్పట్లో ఆ పత్రిక్కి ఏబీకే ప్రసాద్ సంపాదకుడు. ఆయనే నాకు తొలి బ్రేక్ ఇచ్చారు. మాది ఏబికే ప్రసాద్ కల్ట్ అని చెప్పుకోవడానికి నేను ఇప్పటికీ గర్వపడతాను.

                     విప్లవ పత్రికల రచనల్లో భావోద్వేగానికి పెద్దపీట వేస్తారు. ప్రధాన స్రవంతి పత్రికల్లో ఆవేశం పాళ్లను తగ్గించి, నిష్కామంగా రాయాలి; కనీసం రాస్తున్నట్టు వుండాలి. ఈ కిటుకుని నేను మిత్రులు కే శ్రీనివాస్ (ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్)  దగ్గర చేతులుకట్టుకుని నేర్చుకున్నాను. కొన్ని టాపిక్స్ చెప్పి పనికట్టుకుని నాతో రాయించింది వేమన వసంత లక్ష్మీ.

                     ఇంకో మూడేళ్ళు ప్రధాన స్రవంతి పత్రికల్లో ఎడిట్ పేజీ ఆర్టికల్స్ రాసిన అనుభవం తరువాత 1988లో ప్రేమ కొద్దీ ఆంధ్రభూమితో వర్కింగ్ జర్నలిస్టుగా మారాను. అప్పుడూ ఆ వుద్యోగం ఇచ్చింది ఏబీకే ప్రసాద్. అప్పటి మా బ్యూరో చీఫ్ సతీష్ చందర్. 1990లో నన్ను డక్కన్ క్రానికల్ కు మార్చారు. అప్పుడు మా బ్యూరో చీఫ్ కే శ్రీరాములుగారు. నాకు తొలి ప్రమోషన్ ఇప్పించింది శ్రీరాములుగారే!  డక్కన్ క్రానికల్ లో పనిచేస్తున్నపుడు ఎడిషన్ ఇన్ చార్జి బీ. జయప్రకాశ్ రెడ్డి నను చాలా ప్రోత్సహించారు.

 1991లో నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. దీనికి సమన్వయకర్తలు రావి రాంప్రసాద్, త్రిపురనేని శ్రీనివాస్. అక్కడ ఎడిషన్ ఇన్ చార్జి యూయస్ ఎన్ రాజుగారు.  2003లో నేను సీటీవి ద్వార టెలివిజన్ జర్నలిజంలో చేరాను. దాని ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య. జీయం ధనేకుల సుందరయ్య. 

                     ఇందులో విశేషం ఏమంటే నేను గురువులుగా పేర్కొన్న వాళ్ళలో కొందరు నాకన్నా వయసులో చిన్నవారు. మినహాయింపులేకుండా నా గురువులందరూ నా మీద వాత్సల్యాన్నే చూపించారు. వాళ్ళకు గురుదక్షణగా అన్నట్టు నేను కూడా నా శిష్యపరంపర మీద వాత్సల్యాన్నే ప్రదర్శిస్తూ వచ్చాను.

                     అయితే, దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘకాలంలో ఎంతటి మిత్రులతో అయినా మధ్యలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. నాకు నా గురువుల్లో కొందరితో అలాంటి సంఘటనలు కూడా వున్నాయి.  ఇలాంటి సందర్భాల్లో నేను ఎన్నడూ నా గురువులకు ప్రత్యర్ధిగా నిలబడదలచలేదు. నాకు కొంచెం నష్ఠం జరిగినాసరే అస్త్రసన్యాసంచేసి అక్కడి నుండి తప్పుకునేవాడిని. (తోక ముడిచేవాడిని అన్నా తప్పుకాదు)  అసలు నా గురువులకు వ్యతిరేకంగా వాళ్ళ పరోక్షంలో మాట్లాడడం కూడా నాకు రుచించదు; ఏవో కొన్ని సరదా మాటలుతప్ప.

                     ఏడాది క్రితం నా గురువు ఒకరు నన్ను కలవడానికి  ఎన్-టీవీ ఆఫీసుకు వచ్చారు. వారి చొక్కా చిరిగివుంది. దాన్ని దాయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు నేను కొత్త బట్టలు వేసుకుని ఆఫీసుకు వచ్చాను. జీవితంలో ఇంతటి కాంట్రాస్టు ప్రత్యక్షంగా ఎదురయితే నేను భరించలేను. ఒంటి మీద చొక్కా తీసేసి ఇచ్చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఇలాంటి నాటకీయ ఆలోచనలు వస్తుంటాయి. కానీ తమాయించు కున్నాను. వారు కొన్ని డబ్బులు కావాలన్నారు. పర్సు చేతికి ఇచ్చి తీసుకోండి అన్నాను. వారు అందులో నుండి రెండువేలో, మూడు వేలో తీసుకుని ఇది చాలు అన్నారు. ఫస్ట్  వీక్ లో తిరిగి ఇచ్చేస్తానని రెండు మూడుసార్లు అన్నారు. మీకు నేను అప్పు ఇవ్వడంలేదు మీరు తిరిగి ఇవ్వడానికి. ఈ విషయాన్ని నేను ఇక్కడితో మరిచిపోతాను. మీరూ మరిచిపొండి. ఎప్పుడయినా ఇబ్బందిగా వుంటే నా దగ్గరికి రండి. మొఖమాటపడవద్దు. నా దగ్గర గొప్పగా డబ్బులు వుండవు. అయినా  వున్నది సర్దుకుందాం అన్నాను.

తల్లిదండ్రులు దయనీయ స్థితిలో వుంటే ఆ పాపం పిల్లలదే అయినట్టు గురువులు దయనీయ స్థితిలోవుంటే ఆ పాపం శిష్యులదే!


ఏప్రిల్ 24, 20014

Tuesday, 1 April 2014

బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి

వర్తమానం
బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి
డానీ
      
       బీజేపి, టిడిపి పొత్తు కుదిరినట్టు ఇరువైపుల నుండి బలమైన సంకేతాలు వస్తున్నాయి. పొత్తుల చర్చలు, అభ్యర్ధుల ఎంపిక కసరత్తుల నుండి రాష్ట్రానికి చెందిన బీజేపి సీనియర్ నేత స్వచ్చందఘా తప్పుకోవడంవల్ల ఆ పార్టి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకరో, రాజ్యసభాపక్ష నేత అరుణ్ జైట్లో టిడిపితో పాటూ పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు వ్యవహారంకూడా వచ్చేవారం ప్రకటించే అవకాశాలున్నాయి.

నిజానికి టిడిపి, బీజీపి పొత్తు ఎప్పుడో  పొడవాల్సింది. నరేంద్ర మోదీని బీజేపి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణం నుండే చంద్రబాబు పొత్తు దిశగా కదలడం మొదలెట్టారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపి ముందంజ వేయగానే కాంగ్రెస్  జగన్ కు బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చిందనీ,  తాను రాజ్ నాథ్ సింగ్ ను కలవగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటి  తెలంగాణ ఏర్పాటును ప్రకటించిందనీ, తాను నరేంద్ర మోదీని  కలవగానే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చంద్రబాబు చాలాసార్లు అంటున్నారు. అయితే, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ బీజేపి సభ్యులు ప్రదర్శించిన అతిఉత్సాహం టీడిపీని ముఖ్యంగా సీమాంధ్ర తమ్ముళ్లని ఇరుకున పెట్టేసింది. తమకు జరిగిన అన్యాయానికి ప్రతిగా సీమాంధ్ర ఏకంగా భారతదేశం నుండి విడిపోతుందని కొందరు ఎస్-తమ్ముళ్ళు ఆవేశంగా ప్రకటించగా, బీజేపిని సీమాంధ్ర ద్రోహిగా  ప్రకటించాలని మరికొందరు ఎస్-తమ్ముళ్ళు ఆక్రోశం వెళ్ళగక్కారు. హఠాత్తుగా రాజకీయవాతావరణం వేడేక్కడంతో టిడిపి-బీజేపి రాజకీయ సహజీవనం నెలన్నర రోజులు వాయిదా పడింది. ఇప్పుడు వాతావరణం మళ్ళీ పొత్తులకు అనుకూలంగా మారుతోంది.

        బీజేపి-టిడిపి పొత్తు ఒక విధంగా ఓడలు, బండ్లు లాంటిది.  సీమాంధ్రలో బీజేపి భారాన్ని టీడిపి మోస్తే, తెలంగాణలో టీడిపి భారాన్ని బీజేపి మోయాల్సివుంటుంది.  ప్రస్తుతం బీజేపికి సీమాంధ్రలో ఎమ్మెల్యేలుగానీ, ఎంపీలుగానీ లేరు. అక్కడ కాలుమోపాలంటే మోదీ ఇమేజితోపాటూ టీడిపితో పొత్తు అనివార్యమని బీజేపి భావిస్తోంది. పైగా సీమాంధ్రలో ఇప్పుడు అన్నిపార్టీలకన్నా టిడిపి ముందంజలో వున్నట్టు కనిపిస్తోంది. జగన్ పార్టి గతంకన్నా బలహీనపడుతున్నట్టు సంకేతాలు వస్తుండడంతో టిడీపీతో కలిసి ఎన్నికలకు పోవడమే మంచిదని కమలనాధులు భావిస్తున్నారు.

తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ టీడీపిని బలహీనపర్చడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. అధినేత మీద నమ్మకం కుదరని టి-తమ్ముళ్ళు ఎన్టీఆర్ భవన్ ను వదిలి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిలో బీజేపి అండలేనిదే తెలంగాణలో టీడీపీ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించే స్థితిలోలేదు.  ఈ నేపథ్యంలో సీమాంధ్రలో అయినా, తెలంగాణలో అయినా తాము కలిసి నడిస్తేనే ఇద్దరికీ శ్రేయస్కరం అనే అభిప్రాయం టిడిపి, బీజేపి రెండింటికీ వుంది.

టిడిపి-బీజేపి అనుబంధానికి దాదాపు దశాబ్దంన్నర చరిత్రవుంది. 1996  ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో  చక్రంతిప్పి  యునైటేడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, 1998ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో  చక్రం తిప్పడానికి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా  ఢిల్లీ విమానం ఎక్కిన చంద్రబాబు బీజేపి అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పాయిని ప్రధానిని చేసి, ఎన్డీయే కన్వీనర్ గా హైదరాబాద్ లో విమానం దిగారు.

దేవేగౌడ, ఐకే గుజ్రాల్ లను ప్రధానుల్ని చేయడానికి చంద్రబాబు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పుడు పెద్దగా విమర్శలు రాలేదుగానీ, వాజ్ పాయికి మద్దతు పలికినపుడు మాత్రం చంద్రబాబు లౌకికపార్శ్వం విమర్శలకు గురైంది. తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ ముస్లిం సామాజికవర్గం టిడిపి మీద గట్టిగానే నిరసన వ్యక్తం చేసింది. అప్పటి భారీ పరిశ్రమల మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మనస్థాపం చెంది  ఏకంగా రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకున్నారు. అయితే, వాజ్ పాయిని సమర్ధించడం చంద్రబాబుకు రాజకీయంగా కలిసి వచ్చింది. 1999ఎన్నికల్లో కార్గిల్ సెంటిమెంటు వాజ్ పాయి ప్రభుత్వాన్ని  గెలిపించగా, వాజ్ పాయిని నమ్ముకున్న చంద్రబాబు ఆ ఏడాది జమిలిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కారు. ఎన్నికల్లోచంద్రబాబు టీడిపిని గట్టెక్కించిన  సందర్భం ఇప్పటికి అదొక్కటే!

        ఇప్పుడు పునరేకీకరణకు ప్రధాన ఆకర్షణగా మారిన నరేంద్ర మోదీ వల్లనే అప్పట్లో టిడిపి_బీజేపి రాజకీయ దాంపత్యానికి సమస్యలు మొదలయ్యాయి. 2002 లో సాగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరేంద్ర మోదీని చంద్రబాబు విమర్శించినప్పటికీ.  బీజేపీతో దోస్తీని మాత్రం వదలలేదు. దీని ఫలితం 2004 ఎన్నికల్లో కనిపించింది. కార్గిల్ యుధ్ధం అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ  1999 ఎన్నికల్లో గెలిపించినట్టు, నరేంద్ర మోదీ మార్కు గుజరాత్ అల్లర్లు అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ కూడా ఆ తరువాతి ఎన్నికల్లో అధికారం నుండి తప్పించాయి. 

        అలిపిరిలో నక్సలైట్ల బాంబు పేలుడు తరువాత, తన మీద సానుభూతి పవనాలు వీస్తున్నాయని చంద్రభాబు గట్టిగా నమ్మారు. దానితో, 2004లో ముందస్తు ఎన్నికలుకు వెళ్ళారు. తనతోపాటు ఎన్డీయేను కూడా  ముందస్తు ఎన్నికలకు సిధ్ధం చేశారు. తమ హయాంలో దేశం వెలిగిపోతున్నదనే భ్రమలోవున్న బీజేపి, 2020వరకు  తానే హైటెక్కు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని గట్టి నమ్మకంతోవున్న చంద్రబాబు ఇద్దరూ ఆ ఎన్నికల్లో భంగపడ్డారు. నిర్ణిత కాలవ్యవధికన్నా ముందుగానే అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పచెప్పారు.

        2004 జమిలి ఎన్నికల్లో అనూహ్య పరాజయం తరువాత రాష్ట్రంలో టిడిపి, బీజేపిల మధ్య కొంతకాలం పరస్పరం తిట్ల పర్వం కొనసాగింది. టిడీపి హైటెక్కు పోకడలవల్లనే తమపార్టీ ఓడిపోయిందని బీజేపి నేతలు, బీజేపి మీద వ్యతిరేకతవల్లనే తమ పార్టి ఓడిపోయిందని టిడీపి నేతలు విమర్శించుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీలు లాఛనంగా రాజకీయ విడాకులు తీసుకున్నాయి.        2009 ఎన్నికల్లో రెండుపార్టీలు విడివిడిగానే పోటిచేశాయి. అయినా పెద్దగా మార్పురాలేదు.

మతవాద రాజకీయాలు కొన్ని ఓట్లను సంపాదించిపెట్టేమాట నిజమే. కానీ, భారతీయుల్లో అత్యధికులు మతాన్ని ఎంతగా అభిమానిస్తారో, మతవాద రాజకీయాల్ని అంతగా ద్వేషిస్తారు.

మతవాద శిబిరంలో చాలాకాలం అతివాదిగా కొనశాగిన లాల్ కిషన్ అడవాణీజీకి 2005 లో ఒక విషయం అర్ధం అయింది. ఇంతకాలం తన బలానికి కారణం అనుకుంటున్న మతవాద ముద్రే భారత ప్రధాని కావడానికి తనకు ప్రధాన అడ్దంకిగా మారిందని  భావించారు. దానితో, మతవాద ముద్రను తొలగించుకోవడానికి కరాచి వెళ్ళి సాక్షాత్తు మహమ్మదాలీ జిన్నా సమాధి దగ్గర నిలబడి పాకిస్తాన్ నిర్మాతను లౌకికవాది అని కొనియాడి వచ్చారు.

        ఆ తరువాత ఆరేళ్ళకు చంద్రబాబు కూడా అడవాణి మార్గంలో పాపప్రక్షాళన కార్యక్రమం మొదలెట్టారు. బీజేపీతో అంటకాగిన గుర్తుల్ని చెరిపేసుకుని లౌకిక స్వరూపాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నించారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించడం తప్పేనని ఒప్పుకుని  2011 మే 28నటీడిపి మహానాడు వేదిక నుండి వారు ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో కలిసేదిలేదని మరీ ఒట్టేసి వాగ్దానం చేశారు.  ఒక దశలో లౌకిక రాజకీయాలు ప్రాతిపదికగా యూపియే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కూడా వారు సిధ్ధమయినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇవన్నీ జగన్ కు బెయిలు రాకముందు,  నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిడానికి ముందు నాటి పరిణామాలు.   

రాజకీయాల్లో శాశ్విత శత్రులు వుండనట్టు, శాశ్విత వాగ్దానాలూ వుండవు, తరువాత మోదిఫికేషన్, నమో, మోదీ మానియా దేశరాజకీయాల్ని హోరెత్తించడం మొదలేట్టిన తరువాత చంద్రబాబు తన పాలసీని మరోమారు మార్చుకున్నారు. బీజేపీతో సాధ్యమైనంత త్వరగా పొత్తు కుదుర్చుకుంటేనేగానీ తెలంగాణలో కేసిఆర్ దగ్గరికి పొతున్న తమ్ముళ్లని ఆపలేమని వారు అనుకుంటున్నారు. అలాగే, చంద్రబాబుతో పొత్తు వుంటేనే సీమాంధ్రలో పార్టీ పున:ప్రవేశానికి మార్గం సుగమం అవుతుందని బీజేపి నమ్మతోంది. ఆ నేపథ్యంలో టీడిపి, బీజేపి రాజకీయ పునర్వివాహాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 9010 75 7776


హైదరాబాద్‌
 20 మార్చి 2014
ప్రచురణ :

Tuesday, 18 March 2014

కులాల కూర్పు మారాలి

Social Adjustment in Political Structure
కులాల కూర్పు మారాలి
డానీ

భవన్ పాతబిల్డింగును తెలంగాణ పిసిసి కార్యాలయంగా మార్చారు. నిన్ననే ప్రారంభోత్సవం జరుపుకున్న కొత్త బిల్డింగ్ ను సీమాంధ్ర పిసిసికి ఇచ్చారు. విచిత్రం ఏమంటే పాతబిల్డింగు కళకళలాడుతూ వైష్ణవాలయంలావుంది. కొత్తబిల్డింగులో బుడ్డిదీపం వెలిగించేవారు కూడా లేక   శివాలయంలా వుంది. ఏఐసిసిలో రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్  నగరంలోనే వున్నారు. అయినా, కొత్త బిల్డింగులో మనిషన్నవాడు కనిపించలేదు. ఎన్నికల ముంగిట సీమాంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఒక్కరూ లేకపోవడం ఆశ్చర్యం! సీమాంధ్రలో కాంగ్రెస్ దయనీయస్థితికి ఇది అద్దం పడుతోంది. పైగా, కొత్త బిల్డింగ్ పేరు ఇందిరా భవన్!

కొత్తతరం రాజకీయ నాయకులకు నిరంతరం పచ్చటి పచ్చిక బయళ్ళుకావాలి.  వాళ్ళెప్పుడూ అలాంటి పచ్చికబయళ్ల వేటలో వుంటారు. ఒకచోట గ్రాసం నిండుకుందని తెలియాగానే కంచె దూకేస్తారు. దీనికి రాజకీయ సిధ్ధాంతాలు ఒక సాకు మాత్రమే!  అట్ట చింపేస్తే, ఏ ఎన్నికల ప్రణాళిక ఏ పార్టీదో చెప్పడం కష్టం అయ్యే రోజులివి. ఇప్పుడు కాంగ్రెస్ అతిరధులంతా గాంధీభవన్ ను వదిలి అయితే ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటున్నారు; కాకుంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ భవనానికి చేరుకుంటున్నారు.

        ప్రతి పార్టీకీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్థితితప్పదు. పాతికేళ్లక్రితం కూడా కాంగ్రెస్ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది.  అత్యయిక పరిస్థితి తరువాత జరిగిన 1977 లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. సాక్షాత్తు ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ కూడా ఓడిపోయారు. కానీ, ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రం జరిగింది. రాష్ట్రంలోని 42 లోక్ సభాస్థానాల్లో ఒక్క నంద్యాల సీటుతప్ప మిగిలిన 41 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాలలో జనతా టిక్కెట్టుపై నీలం సంజీవరెడ్డి గెలిచారు. వారు రాష్ట్రపతి కావడంతో నంద్యాల స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. అంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నూటికి నూరు శాతం సీట్లను గెలుచుకుంది. ఇది అప్పటికీ ఇప్పటికీ రికార్డు.

ఆ తరువాత ఇందిరా గాంధీ మీద వెంగళరావు తిరుగుబాటు చేశారు.  బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో రెడ్డి కాంగ్రెస్ పెట్టారు. ఆనాటి కాంగ్రెస్ అతిరథ మహారథులంతా రెడ్డి కాంగ్రెస్ కు మారిపోయారు. ఇందిరా కాంగ్రెస్ కార్యాలయాల్లో లైటు వెలిగించేవారు కూడా లేకుండాపోయారు. శనివారం దిగ్విజయ్ సింగ్ ముందు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొరపెట్టుకున్నట్టు అప్పుడూ ఇందిరా కాంగ్రెస్ టిక్కెట్టు తీసుకునేవారే  కరువయ్యారు. మాజీ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఇందిరాగాంధీకి విజయవాడలో గెస్ట్ హౌస్ కూడా దొరకలేదు. అలాంటి కష్టకాలంలో, ఇందిరా కాంగ్రెస్ లో మిగిలిన మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహారావు, నాదెండ్ల భాస్కరరావు, పరకాల శేషావతారం తదితరులు ఒక కొత్త వ్యూహంతో పార్టీకి జీవం పోశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజలకు ఎంతో కొంత వ్యతిరేకత వుంటుందిగనుక కొత్తవారికి, కొత్త సామాజికవర్గాలకి  అవకాశంఇచ్చి ఒక ప్రయోగం చేశారు.  ఆ ప్రయోగం ఘనవిజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ కు 175 సీట్లు రాగా, రెడ్డి కాంగ్రెస్ కు కేవలం 30 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

1978 ఎన్నికలని కొందరు రెడ్డికాంగ్రెస్ పై ఇందిరాకాంగ్రెస్ సాధించిన విజయంగా భావించవచ్చు. వాస్తవానికి అది రాజకీయాల్లో పాత పెత్తందారీవర్గాలపై కొత్తశక్తుల విజయం. ఆ ఎన్నికల్లో కొత్త సామాజికవర్గాలు సాధించిన విజయానికి కంకిపాడు ఒక గొప్ప ఉదాహరణ. ఓటర్ల సంఖ్యరీత్యా కంకిపాడు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నియోజకవర్గం. ఓటర్లలో కమ్మసామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగిన    కోనేరు రంగారావుది మాదిగ సామాజికవర్గం. అప్పటికి వారు రాజకీయాల్లో అనామకులనే చెప్పవచ్చు. అయినా రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ వారు ఆ ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు.

భారత పార్లమెంటరీ రాజకీయాల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మనకు ఒక ఆసక్తికర సామాజిక నియమం కనిపిస్తూ వుంటుంది. ప్రతి రెండు దశాబ్దాలకో, మూడు దశాబ్దాలకో ఒకసారి రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటుంటాయి. పాతశక్తుల పక్కన దిగువ నుండి కొత్త శక్తులు వచ్చి చేరుతుంటాయి. కొత్తవాటికి స్థానం ఇవ్వాల్సి వుంటుంది.  రాజకీయ నిర్మాణంలో సామాజిక సర్దుబాటు తప్పనిసరవుతుంది. అలాంటి సర్దుబాటును నిరాకరిస్తే మొత్తం రాజకీయ వ్యవస్తే కూలిపోతుంది. అలాంటి చారిత్రక సంధి సమయాల్లో  రాజకీయ నిర్మాణంలో సామాజిక సర్దుబాటును ప్రోత్సహించిన రాజకీయపార్టి విజయాన్ని సాధిస్తుంది. 1978లో ఇందిరా కాంగ్రెస్ విజయాన్నీ,  1983లో యన్టీ రామారావు విజయాన్నీ, 1989లో తిరిగి కాంగ్రెస్  సాధించిన విజయాన్నీ, 1994లో తిరిగి టిడిపి అధికారంలోనికి రావడాన్నీ అచ్చంగా రాజకీయ అర్ధంలోకాక ఇలాగే రాజకీయార్ధిక, సామాజిక కోణంలో అర్ధం చేసుకోవాల్సి వుంటుంది.

పైకి రాజకీయ పార్టీల మధ్య పోటీగా కనిపిస్తున్నవన్నీ, సారాంశంలో కుల మత వర్గ సంఘర్షణలే.  ప్రతి రాజకీయ పార్టీ కులాలు, మతాలు, వర్గాల రూపంలో తనదైన ఒక సామాజిక పునాదిని ఏర్పాటు చేసుకుంటుంది. అదే ఓటు బ్యాంకు. కొన్ని సందర్భాల్లో ఇది తలకిందులుగానూ జరగవచ్చు. కొన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిసి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోనూవచ్చు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని కొందరు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పరిణామంగా మాత్రమే భావిస్తారుగానీ రాజకీయ నిర్మాణంలో వచ్చిన సామాజిక సర్దుబాటుగా  గుర్తించరు. మనరాష్ట్రంలో పార్లమెంటరీ రాజకీయాల మీద మొదట బ్రాహ్మణ సామాజికవర్గాల ప్రాబల్యం కొనసాగింది. క్రమంగా ఆ స్థానాన్ని రెడ్డి  సామాజికవర్గం ఆక్రమించింది. రాజకీయ ఆధిపత్యంలో కమ్మ సామాజికవర్గానికి సముచిత స్థానం కల్పించడానికి యన్టీ రామారావు రూపంలో భారీ ప్రయత్నం జరిగింది.  వెనుకబడిన కులాలు, షెడ్యూలు కులాలు, ముస్లిం సామాజికవర్గాల మద్దతుతో వారు తమ లక్ష్యాన్ని సాధించారు. ఆ తరువాత రాజకీయాల్లో రెడ్డి-కమ్మ కాంబినేషన్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

కమ్మ సామాజికవర్గం నాయకత్వంలో  రెడ్డి సామాజికవర్గం కొనసాగితే అది తెలుగుదేశం రాజకీయాలుగానూ, రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలో కమ్మ సామాజికవర్గం  కొనసాగితే అది కాంగ్రెస్  రాజకీయాలుగానూ గత మూడున్నర దశాబ్దాలుగా సాగుతోంది. అధికారంలోనికి టిడిపి వస్తుందా? కాంగ్రెస్ వస్తుందా? వైయస్సార్  కాంగ్రెస్ వస్తుందా? అని జరిగే చర్చ అంతా సారాంశంలో కమ్మ సామాజికవర్గం నాయకత్వంలో  రెడ్డి సామాజికవర్గం అధికారాన్ని పంచుకోవాలా? లేక రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలో కమ్మ సామాజికవర్గం అధికారాన్ని పంచుకోవాలా? అనేదే! ఇప్పుడు ఆ అధ్యాయం కూడా ముగింపుకు చేరుకుంటున్నది.  దళిత బహుజనులు, మతమైనారిటీలు తదితర కొత్త శక్తులు రాజకీయాధికారంలో సముచిత వాటాను కోరుతున్నాయి. దిగువశ్రేణుల్లో రగులుతున్న సామాజిక కల్లోలాన్ని మరుగుపరచడానికి దాదాపు అన్ని పార్టీలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది నిప్పును గడ్డితో కప్పడం వంటి ప్రయత్నం మాత్రమే!


కాపుసామాజికవర్గం ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాధిపత్యంలో చిన్నతరహా భాగస్వామిగా వుంటున్నదేతప్ప నేరుగా నాయకత్వం వహించిన సందర్భంలేదు. రాజకీయాధిపత్యంలో కాపుసామాజికవర్గాన్ని నాయకత్వ స్థానంలో నిలపడానికి అప్పట్లో, వంగవీటి మోహనరంగా రూపంలో, ఇటీవల  చిరంజీవి రూపంలో కొన్ని ప్రయత్నాలు  జరిగాయి. ఆ ప్రయత్నాలు విఫలం కావడానికి చాలామంది కాపు సామాజికవర్గ నాయకుల వ్యక్తిగత పరిమితుల్ని ప్రస్తావిస్తుంటారు. అది ఒక పార్శ్వం మాత్రమే. నిజానికి సామాజికవర్గాల నిచ్చెనలో కాపు సామాజికవర్గం స్థానాన్ని నిర్ధారించడంలోనే ఒక దందరగోళం వుంది. కాపు సామాజికవర్గం ఆధిపత్య కులాల్లో వెనుకబడినతరగతిగానూ, వెనుకబడినతరగతుల్లో ఆధిపత్య కులంగానూ కొనసాగుతోంది.  కాపు సామాజికవర్గం ఇలాంటి ద్వంద్వసభత్వం నుండి బయటపడితే రాష్ట్ర రాజకీయ సామాజిక సమీకరణల్లో  మరింత స్పష్టత వస్తుంది.
          ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టి పడుతున్న కష్టాలన్నీ 1990వ దశకంలో తెలుగుదేశం పార్టికి వచ్చాయి. 1991 లోక్ సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వుంది. ఎన్టీఆర్ ప్రతిపక్షనేతగా వున్నారు. కష్టకాలంలో వచ్చిన ఆ ఎన్నికల్లో   ఎన్టీఆర్ ఒక అద్భుత సామాజిక ప్రయోగం చేశారు. కొత్త రఘురామయ్య ఐదుసార్లు, ఆచార్య యన్జీ రంగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన ప్రతిష్ఠాత్మక గుంటూరు నియోజకవర్గాన్ని ముస్లిం అభ్యర్ధికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆచార్య యన్జీ రంగాపై  తెలుగు దేశం అభ్యర్ధి  ఎస్ యం లాల్ జాన్ బాషా విజయం సాధించి పార్లమెంటరీ రాజకీయాల పరిభాషలో జెయింట్ కిల్లర్అయ్యారు. ఆ ఎన్నికల్లోనే మచిలీపట్నం నియోజకవర్గంలోనూ ఎన్టీఆర్ మరో ప్రయోగం చేశారు. మాగంటి అంకినీడు, కావూరు సాంబశివరావు నాలుగు విడుతలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం స్థానాన్ని వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన కేపి రెడ్డయ్యకు కేటాయించి విజయం సాధించారు. కమ్మసామాజికవర్గం తమ ప్రధాన రాజకీయ కార్యక్షేత్రంగా భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యన్టీఆర్ ఈ ప్రయోగాన్ని చేయడం విశేషం. దీని ఫలితాలు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించాయి. ఆ ఎన్నికల్లో హిందూ వెనుకబడిన సామాజికవర్గాలు, ముస్లిం సామాజికవర్గాలు టిడిపికి భారీ విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించాయి. అలా యన్టీఆర్ మళ్ళీ అధికారంలోనికి వచ్చారు.

ఈ గుణపాఠాలన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం నేర్చుకోవాల్సివుంది. అంటే, రాజకీయాల్లో సామాజికవర్గాల కూర్పు మారాల్సిన సమయం వచ్చిందని గమనించాలి. పాత కూర్పు మీద నిరసన వ్యక్తం అవుతున్నప్పుడు దాన్ని తొలగించి కొత్త కూర్పును ఏర్పాటుచేసే చర్యల్ని తక్షణం చేపట్టాలని గుర్తించాలి. అలాంటి కొత్త ప్రయోగాలకు ఇది సరైన సమయం

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
16 మార్చి 2014
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక, ఎడిట్ పేజీ, 19  మార్చి 2014

Wednesday, 12 March 2014

సినీస్టార్ల రాజకీయం అంత ఈజీ్కాదు

సినీస్టార్ల రాజకీయం అంత ఈజీ్కాదు
డానీ

సినిమా స్టార్లవారసులకు సినిమాల్లో ప్రవేశించడానికి సులువుగా  ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరుకుతుంది. అలాగే సినిమా స్టార్లు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కూడా సులువుగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరుకుతుంది. అయితే ఈ సౌలభ్యం సినిమాల్లోకి అయినా, రాజకీయాల్లోకి అయినా ప్రవేశించడానికి మాత్రమే పనికివస్తుంది. అక్కడ నిలదొక్కుకోవడం అనేది వాళ్లవాళ్ల వ్యక్తిగత సామర్ధ్యం మీద ఆధారపడివుంటుంది. సినిమాల్లోకి వచ్చినవాళ్లందరూ మహానటులు కాలేనట్టే, రాజకీయాల్లోకి వచ్చిన నటులందరూ మహానాయకులు కాలేరు.

గత ఎన్నికల్లో మెగాస్టార్  చిరంజీవి రాజకీయపార్టి పెట్టి రెండేళ్ళు కూడా తిరక్కుండానే బోర్డు తిప్పేశారు. ఈసారి ఎన్నికల్లో మెగాఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే యన్టీ రామారావు ప్రస్తావన వస్తుంది. 

సినిమాలకు కథ ముఖ్యం. పార్టీలకు రాజకీయాలు ముఖ్యం. తెలుగునాట ఈ విజయ రహాస్యం యన్టీఆర్ కు తెలిసినంతగా మరెవరీకీ తెలియదంటే అతిశయోక్తికాదు. వెండితెర మీద పురాణ పురుషులకు ఒక రూపాన్నిచ్చినట్టే, రాజకీయ రంగంలోనూ సంక్షేమ పథకాలకు అయన ఒక కొత్త వూపునిచ్చారు. యన్టీరామారావు  రాజకీయరంగంలో అడుగుపెట్టగానే గానే రాష్ట్ర రాజకీయాలేకాదు, దేశరాజకీయాలు సహితం ఆయన చుట్టూ తిరగడం ఆరంభించాయి.

వెండి తెర సూపర్ స్టార్ గా వున్న యన్టీ రామారావు ఆ ఇమేజితో తెలుగుదేశం పార్టి పెట్టి  ఏడాది తిరక్కుండానే అధికారాన్ని చేపట్టారని చాలామంది ఘనంగా చెపుతుంటారు.  ఇందులో వాస్తవదోషం లేదుగానీ, ఆనాడు టిడిపి అధికారంలోనికి రావడానికి అనేక అంతర్ బహిర్ కారణాలున్నాయి. ఇప్పటికీ కొందరు గుర్తించని అంశం ఏమంటే, యన్టీ రామారావు పార్టీ అయితే అప్పుడు కొత్తగా పెట్టారుగానీ, ఆయన సినిమారంగంలో వుండగానే ఒక రాజకీయ దృక్పధాన్ని రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. సందర్భాన్నిబట్టి దాన్ని ప్రచారంలో పెడుతూవచ్చారు.

ఆర్య దేవుళ్ళయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగు సినిమా ప్రేక్షకుల కళ్ళల్లో యన్టీఆర్ కనపడతారు. వెండితెర మీద పౌరాణిక పాత్రలకు ఆయన జీవంపోశారు.  చాలామంది గమనించని విషయం ఏమంటే ఎన్టీఆర్ మొదటీ నుండీ ద్రావిడ అభిమాని. ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం  వహించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలోనే అది ప్రస్పుటంగా కనిపించింది. స్వంత బేనర్‌ అయిన నేషనల్‌ ఆర్ట్‌ ధియేటర్స్‌ నిర్మించిన ఆ సినిమాలో రామారావు కథానాయకుడుకాదు. ప్రతినాయకుడు.! రావణాసురునిగా బహుళ ప్రచారంలో వున్న పాత్రను ఆయన రావణబ్రహ్మగా మలిచి ప్రాణప్రతిష్ట చేశారు. ఆ తరువాత దర్శకత్వం వహించిన  'శ్రీకృష్ణపాండవీయం' లోనూ దుర్యోధనుణ్ణి సుయోధనుడ్ని చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇటు తెలంగాణాలో ముల్కీ ఆందోళన, అటు ఆంధ్రాలో  జై ఆంధ్రా ఉద్యమం జరుగుతున్న కాలం ''తెలుగు జాతిమనది నిండుగా వెలుగు జాతి మనది'' అనగలిగిన ధీర కళాకారుడు యన్టీ రామారావు. ఇవన్నీ ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి రెండు దశాబ్దాల ముందు విషయం.

ఆర్యవ్యతిరేక సాంస్కృతిక దృక్పధాన్ని ఆయన సినిమాల్లో అంతర్లీనంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ద్రావిడ దృక్పథం ఆయనకు, పుట్టినిల్లు గుడివాడ తాలూకాలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సూతాశ్రమం ద్వార అబ్బిందో, మెట్టినిల్లు మదరాసులో పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ ద్వారా అబ్బిందో, లేక సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనకు మార్గదర్శిగా భావించే యం.జీ. రామచంద్రన్‌ ద్వారా అబ్బిందో చరిత్రకారులు తేల్చాల్సేవుంది.
సినిమాల్లో నటిస్తున్న రోజుల్లోనే యన్టీఆర్ ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీలపట్ల తన వ్యతిరేకతను చాటేవారు.  యన్టీఆర్‌ రాజకీయం కాంగ్రెస్‌ వ్యతిరేక శ్రేణుల ఐక్యత. రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని పాటించే సాంప్రదాయాన్ని ఆరంభించింది కూడా ఆయనే.

భౌగోళికరాజకీయాల్లో ఆయన దక్షణాది అభిమానాన్నీ, ఉత్తరాది వ్యతిరేకతను ప్రదర్శించేవారు. తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిన ఎన్టీఆర్ సాంస్కృతిక నినాదం తెలుగుజాతి ఆత్మగౌరవం ఈ నేపథ్యంలో పుట్టిందే! ''కేంద్రప్రభుత్వం ఒక మిధ్య'' అంటూ ఆయన చేసిన ఫెడరల్ తిరుగుబాటు కూడా ఆర్య-ద్రావిడ వివాదానికి కొనసాగింపే.

ఇవన్నీ ఆయన వ్యక్తిగత ప్రయత్నం.  ఆంధ్రప్రదేశ్ లో 1980-82  మధ్య రెండేళ్ల వ్యవధిలో నలుగురు ముఖ్యమంత్రుల్ని మార్చిన కాంగ్రెస్ పార్టి భ్రష్టుపడిపోవడంతో రాష్ట్రరాజకీయల్లో భారీ శూన్యత అలుముకుంది. ఇది అప్పటి బాహ్యాత్మక వాతావరణం. వ్యక్తిగత ప్రయత్నం,  బాహ్యాత్మక వాతావరణంతో పొసిగినపుడే లక్ష్యలు గమ్యానికి చేరుతాయి. (ఆబ్జెక్టివ్ కండీషన్స్ సబ్జెక్టివ్ ఎఫర్ట్స్).

ప్రజలకు యన్టీరామారావు ఇచ్చుకున్న నిర్వచనం కూడా విచిత్రంగా వుంటుంది.  యన్టీ రామారావు దృష్టిలో ప్రజలంటే కర్షకులు, కార్మికులు మాత్రమే.  వాళ్లను ఆయన అమితంగా ప్రేమించేవారు. వారికోసం ఇతర వర్గాలతో తలపడడానికి కూడా వెనుకాడేవారుకాదు. ఆయన 'అందరివాడు' కాదు. ప్రభుత్వోద్యోగులు, పాత్రికేయులు, చివరకు విద్యార్థులు కూడా ఆయనకు ప్రజలుగా కనిపించే వారుకాదు. వాళ్లందరితోనూ ఆయన తలపడిన సందర్భాలున్నాయి.

        ప్రజారాజ్యం పార్టి  వైఫల్యాలకు కూడా అంతర్ బహిర్ కారణలు పుష్కలంగా వున్నాయి. రాష్ట్ర రాజకీయరంగాన్ని ప్రభుత్వాధినేత వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత  చంద్రబాబునాయుడు దాదాపు సంపూర్ణంగా ఆక్రమించుకునివున్న కాలంలో ప్రజారాజ్యం పార్టి  ఆవిర్భవించింది. అప్పటికే హౌస్ ఫుల్ కారణంగా పీఆర్పీకి పెద్ద సీట్లు రాలేదు.  వ్యక్తిగతంగా చిరంజీవి కూడా ప్రజల్ని కదిలించి, ఉత్తేజాన్నిచ్చే  ఒక్క నినాదం కూడా ఇవ్వలేకపోయారు. అందరివాడు అనిపించుకుని ఓట్లు దండుకోవాలనే ఆతృతలో ఒక నిర్దిష్ట రాజకీయ విధానాన్ని రూపొందించుకోకపోవడంతో ఎవ్వరివాడూ కాకుండాపోయారు. 

ఇప్పుటి రాష్ట్ర రాజకీయ పరిస్థితీ పీఆర్పీ నాటికన్నా భిన్నంగా ఏమీలేదు. తెలంగాణలో టీ.ఆర్.ఎస్, బీజేపి బలపడుతున్నప్పటికీ  అధికార కాంగ్రెస్ పార్టి  సహితం గట్టిపోటీ ఇచ్చే స్థితిలోనే వుంది. మరోవైపు సీమాంధ్రలో జగన్ కు చెందిన వైయస్సార్ సిపీ, తెలుగుదేశం పార్టిలతోపాటూ బీజేపి సహితం పుంజుకుంటుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్కటే బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కూడా రంగ ప్రవేశం చేస్తుండడంతో సీమాంధ్రలో రాజకీయ శూన్యత ఏమాత్రంలేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ నాలుగు పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరుతారా? లేకపోతే దైర్యంచేసి కొత్తపార్టీ పెడతారా అన్నది అసలు ప్రశ్న.  పవన్ కళ్యాణ్  వెనుకనడిచే సామాజికవర్గాలు ఏవీ? అనేది అంతకన్నా కీలకమైన ప్రశ్న.

        సినిమా స్టార్లకు మాస్ ఫాలోయింగ్ పెద్ద స్థాయిలో వుంటుంది. పైగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భారీ విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ గా వున్నారు.   అయితే, సినిమా స్టార్ల మాస్ ఫాలోయింగ్ కూ ఓటింగుకూ పెద్దగా సంబంధంవున్నట్టు కనిపించదు. వాళ్ళ రోడ్ షోలకు జనం ఫుల్లు, పోలింగ్ బూత్ లో ఓట్లునిల్లు అనే నానుడి ఎలాగూవుంది.

        కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తన సినీఅభిమానులతోపాటూ,  తన స్వంత సామాజికవర్గాన్ని ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. అయితే, దీనికీ పరిమితులున్నాయి. ఆయన ఆభిమానులందరూ ఆయన రాజకీయపార్టీకి అభిమానులు కావాలనే నియమం ఏమీలేదు.  అలానే, కాపు సామాజికవర్గం మొత్తం ఆయన వెనుక నడవాలనే నియమమూలేదు. 

మరోవైపు, సీమాంధ్ర కాంగ్రెస్ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఆసక్తికర సామాజిక సమీకరణలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను విడిచి బయటికి పోతున్న ప్రజాప్రతినిధుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ముందు పంక్తిలో వున్నారు.  కాంగ్రెస్ లోవున్న కాపు సామాజికవర్గం దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయి. పైగా, కాంగ్రెస్-కాపు సామాజికవర్గానికి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మెగాబ్రదర్ చిరంజీవే నాయకత్వం వహిస్తున్నారు. ఇన్ని పరిమితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.

        హిట్ల కోసం దాదాపు ఒక దశాబ్ద కాలం ముఖం వాచివున్న పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సంభాషణల చాతూర్యంతో హీట్లు ఇచ్చారు. వారే, నాలుగు ప్రభావశీలమైన నాలుగు నినాదాలు అందిస్తే, పవన్ కళ్యాణ్ కు ఇతర సామాజికవర్గాల నుండి కూడా చెప్పుకోదగ్గ ఓట్లు పడవచ్చు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
మార్చి  2014
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక, ఎడిట్ పేజీ, 13 మార్చి   2014

http://www.prabhanews.com/specialstories/article-430271

Monday, 3 March 2014

పోలవరం నిర్ణేతలుగా నిర్వాసితులు

పోలవరం నిర్ణేతలుగా నిర్వాసితులు
ఏ యం ఖాన్ యజ్దాని (డానీ)

పోలవరం  ప్రాజెక్టును అర్ధంచేసుకున్నవాళ్లకన్నా అపార్ధం చేసుకున్నవాళ్ళే ఎక్కువ.  దాన్ని అపార్ధం చేసుకున్నవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో మాత్రమే వున్నారనుకుంటే తప్పు. రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతంలోనూ ఈ ప్రాజెక్టు గురించి అపార్ధమే బలంగా కొనసాగుతోంది. నాలుగు జిల్లాలకు విస్తరించిన కృష్ణా డెల్టాలోని దాదాపు పధ్నాలుగు లక్షల ఎకరాల్లో మూడవ పంటకో, నాలుగవ పంటకో  సాగునీరు అందించడానికి పోలవరం కడుతున్నారనే అభిప్రాయం తెలంగాణలో బలంగా ప్రచారంలోవుంది. రాయలసీమ నాయకుల్లో కూడా కొందరు పోలవరం మీద దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. విచిత్రంగా, తీరాంధ్ర ప్రజల్లోనూ ఇది తమ కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు అనే అపోహే బలంగావుంది.

తెలంగాణకు చెందినవారేకాక, స్వయంగా కేసిఆర్ కు సన్నిహితులైనవాళ్ళ  నిర్మాణసంస్థలు కూడా గతంలో పోలవరం నిర్మాణ కాంట్రాక్టు కోసం  పోటీలు పడ్డాయి. ఇప్పుడు పోలవరం నిర్మాణ సంస్ద్థల్లో  సీమాంధ్రకు చెందిన వాటికి సింహవాటా  దక్కవచ్చు. రాష్ట్ర విభజన రాయితీల్లో అవి కూడా ఒకటి కావచ్చు. 

గోదావరి నది నుండి 80 టీయంసీల నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణానదిలోనికి మళ్ళించి,  ఆమేరకు, నాగార్జునసాగర్‌ నుండి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీటిని ఆదాచేసి, తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌. ఎల్‌. బి.సి) లకు నికర జలాలను కేటాయించాలనేది పోలవరం ప్రాజెక్టు ప్రకటిత ప్రధాన లక్ష్యం. ఆ విధంగా అది తీరాంధ్ర నేలమీద కడుతున్న రాయలసీమ ప్రాజెక్టు.  విశాఖపట్నానికి 23 టియంసీల తాగునీరు, కొత్త కాలువల పరివాహక ప్రాంతంలో 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు  సాగునీరు అందించడం, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కూడా ఈ బహుళార్ధసాధక  ప్రాజెక్టులో వున్నాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనేకాక, నిర్వహణలోనూ అనేక మెలికలున్నాయి. దిగువ రాష్ట్రమైన అంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానంవల్ల అదనపు నీళ్ళను మళ్ళిస్తే, అందులో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వాలని 1976 నాటి  ఆర్.యస్. బచావత్‌ కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్‌  తీర్పులో  oఒక షరతు వుంది.

పోలవరం నిర్మిస్తే,  80 టియంసీలలో మహారాష్ట్రకు 18  శాతంగా 14 టియంసీలు, కర్ణాటకకు 27  శాతంగా 21 టీయంసీల నీళ్ళు  ఇవ్వాల్సి వుంటుంది.  అంటే, ఎగువరాష్ట్రాలకు 35 టీయంసీలు పోగా మిగిలేది 45 టీయంసీలే. వీటిల్లో  30 టీయంసీలు ఎస్‌.ఎల్‌.బి.సి.కు  15 టీయంసీలు తెలుగుగంగకు  కేటాయించాలని 1985లో, యన్‌.టీ. రామారావు ప్రభుత్వం నిర్వహింహించిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.  ఈ రెండు ప్రాజెక్టులకు ఇప్పటివరకు నికర జలాల కేటాయింపులులేవు..

మనం  చాలా వెనుకబడివున్నాంగానీ, 1996లో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన  ఆంధ్రప్రదేశ్ లో ఊపందుకున్న మరుక్షణం నుండే  తమకు రాబోయే అదనపు వాటా నీటిని నిల్వ చేసుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సంపూర్ణ ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నాయి. అల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదల ప్రాజెక్టు ఈ నేపథ్యంలో చేపట్టిందే. ఇటీవలి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు   కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదలను సమర్ధించుకున్నది కూడా  పోలవరం ప్రాజెక్టు నెపంతోనే.

పొలవరం ప్రాజెక్టు పూర్తయ్యి, కృష్ణా బేసిన్‌ కు నీరు విడుదల అయిన మరుక్షణం,  మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా మన రాష్ట్రంలోనికి  వచ్చే కృష్ణా నికరజలాలు  అధికారికంగా 35 టీయంసీలు తగ్గిపోతాయి. మరో 45 టీయంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమకు విడుదలైపోతాయి. ఆమేరకు, నాగార్జునసాగర్ నుండి కృష్ణాడెల్టాకు విడుదలయ్యే నీటిలో 80 టీయంసీల కోత విధిస్తారు. ఆ విధంగా పోలవరంవల్ల కృష్ణాడెల్టాకు నీటి కేటాయింపులో  ఒక్క చుక్క నీరు కూడా పెరగదు. అయితే, రావలసిన వాటా నీరు  బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో అందుబాటులో వుండడంవల్ల కృష్ణాడెల్టా ఆయకట్టు రైతులు  ఖరీఫ్, రబీ నాట్లు  సకాలంలో వేయడానికి వీలు కుదురుతుంది. పోలవరంవల్ల కృష్ణాడెల్టాకు అదొక్కటే ప్రయోజనం! 

పోలవరం అనేకాదు, ప్రతి ప్రాజెక్టులోనూ ప్రకటిత లక్ష్యాలతోపాటూ అప్రకటిత లక్ష్యాలు, దారిమళ్ళింపులూ, వాటర్ హైజాకులు  వుంటాయి. అన్నింటికన్నా కీలకమైనది ఏ ప్రాజెక్టు అయినా ఆ ప్రాంత ధనికవర్గాలకు ప్రత్యంక్షంగానూ, పేదవర్గాలకు  పరోక్షంగాను మాత్రమే ఉపయోగపడుతుంది. సామాజికంగా పెత్తందారీ కులాలకు ప్రధానంగానూ, బడుగు బలహీనవర్గాలకు నామమాత్రంగానూ ఉపయోగపడుతుంది.  

అందరికీ తేలిసిన విషయం ఏమంటే సాగునీరు వాడుకోవడానికి స్వంత కమతం ఒకటి కావాలి. గోదావరికి ఉత్త చేతులతో వెళ్ళినవాళ్లకు దోసేడు నీల్లే దక్కుతాయి. చెంబు తీసుకుపోయినవాళ్లకు చెంబుడు, బిందె తీసుకుపోయినవాళ్ళకు బిందెడు, ట్యాంకురుతో పెళ్ళినవాళ్ళకు ట్యాంకరు నీళ్ళు దక్కుతాయి.  సాగునీరూ అంతే ఎంత పోలం వుంటే అంత నీరు దక్కుతుంది.

ప్రాజెక్టులవల్ల ధనికులు మరింత ధనికులవుతారనీ, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళైపోతారనే ఆందోళన కొట్టివేయదగ్గదేమీకాదు. అంటే,  దాని అర్ధం ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలనీకాదు. ఆలోచనాపరులు చేయాల్సిందల్లా ప్రాజెక్టుల ద్వారా జరిగే అభివృధ్ధిని ప్రజలకు సమపంపిణి జరిగే మార్గాలని అన్వేషించడం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రధాన కార్యక్షేత్రం నల్గొండజిల్లా. పోరాటం వుధృతంగా సాగుతున్న కాలంలోనే నాగార్జునసాగర్ (అప్పట్లో నందికొండ) ప్రాజెక్టు సర్వే జరిగింది. అంతటి ఉద్రిక్త  పరిస్థితిల్లోనూ కమ్యూనిస్టు నాయకులు తమ బృందానికి సహకరించేవారని  విఖ్యాత నీటిపారుదలా ఇంజినీర్ కేయల్  రావు చెప్పేవారు. 

        పోలవరం ప్రాజెక్టు వివాదాల్లో రెండు అంశాలు  ప్రాణప్రదమైనవి. ఇందులో మొదటిది సాంకేతికపరమైనది. రెండోది జనావాసానికి సంబంధించింది.
రెండు మూడేళ్లకు వచ్చే  వరద వుధృతి సమయంలో గోదావరి నదిలో నీటి ప్రవాహ వేగం  సగటున పది లక్షల కుసెక్కులు ( సెకనుకు ఘనపు అడుగులు)  వుంటుంది. 1953 ఆగస్టు 16 న ధవిళేశ్వరం ఆనకట్ట మీదుగా  29 లక్షల  కుసెక్కుల చొప్పున పది రోజులు వరద ప్రవాహం సాగింది. ఇప్పటి వరకు గోదావరి వరదల్లో అదే గరిష్ట స్థాయి.  దాదాపు ఆ స్థాయి వరదలు మళ్ళీ 1986, 2012 లలో వచ్చాయి.  

ఆనకట్టలు, బ్యారేజీల్ని  మైదాన ప్రాంతంలోనూ, డ్యాముల్ని కొండ ప్రాంతంలోను నిర్మించాల్సివుంటుంది. మైదాన ప్రాంతంలో  ఆర్ధర్ కాటన్ కట్టిన  ఆనకట్ట  స్పిల్ వే పొడవు దాదాపు 12 వేల అడుగులు. అయితే,  పాపికొండల్లో నిర్మించ తలపెట్టిన పోలవరం  ప్రాజెక్టు స్పిల్ వే పొడవు ప్రస్తుత డిజైన్ ప్రకారం మూడు వేల అడుగులకన్నా తక్కువే.  క్రస్ట్ గేట్ల ఎత్తు కాటన్ ఆనకట్టకన్నా  ఎక్కువే వున్నప్పటికీ,  గోదావరినదికి ముఫ్ఫయి యేళ్లకు ఒకసారి 30 లక్షల కుసెక్కుల వేగంతో ప్రవహించే  భారీ వరద నీటిని విడుదల చేసే సామర్ధ్యం పోలవరం స్పిల్ వేకు వుంటుందా? అనేది నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఏమాత్రం అదుపు తప్పినా ఘోరప్రమాదం  జరిగిపోతుందని వాళ్ళు హెచరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా  అందుబాటులో వుందా? అనేది ఆలోచించాలి. లేదా పోలవరం డిజైను మార్చి  ఒక డ్యాం బదులు  అనేక చిన్న డ్యాములు నిర్మించాలి.  

ఎక్కడైనా మితవాదులు వున్నట్టే అతివాదులూ వుంటారు.  గోదావరి నదిలో వెయ్యేళ్లకు ఒకసారి  50 లక్షల కుసెక్కులతో వరద నీరు ప్రవహిస్తుందని అంచన. అలాంటి భారీ వరద నీటిని కూడా సులువుగా విడుదల చేసే విధంగా పోలవరం డ్యాం స్పిల్ వేను పెంచాలని ఒరిస్సా రాష్ట్రం వాదిస్తోంది. 30 లక్షల క్యుసెక్కులకే అభ్యంతరాలొస్తున్నపుడు 50 లక్షల కుసెక్కుల నీటి విడుదల సామర్ధ్యం గల స్పిల్ వేను నిర్మించడం సాధ్యమా? అనేది ప్రశ్న.

అమెరికా సంయుక్త రాష్ట్రాల  దక్షణ ప్రాంతంలో ఆరిజోనా, నెవెడా రాష్ట్రాల సరిహద్దుల వెంబడి బ్లాక్ కాన్యాన్ ప్రాంతంలో కొలరాడో నదిమీద నిర్మించిన హోవర్ డ్యాంతో పోలవరం కు ఫొలికలున్నాయి. బ్లాక్ కాన్యాన్ ప్రాంతంలో మన పాపికొండల్లా  లోతైన నల్లరాతి లోయ దిగువ నుండి కొలరాడో నది  ప్రవహిస్తుంటుంది. పోలవరం డిజైన్ ను రూపొందించే క్రమంలో కేయల్ రావు  స్వయంగా హోవర్ డ్యాం ను సందర్శించి దాని నిర్మాణ విధానాన్ని అధ్యయనం చేసివచ్చారు. పోలవరం డిజైన్  మీద అభ్యంతరాలున్నవారిలో  కేయల్ రావు కూడా ఒకరు. సాంకేతిక అంశాల్లో అలాంటి నిపుణులు వెలిబుచ్చిన సూచనల్ని పరిగణన లోనికి తీసుకోవాలి.

        పోలవరం డ్యాము నిర్మాణంలో సాంకేతిక అంశంకన్నా ప్రాణపదమైనది జనావాసాల తొలగింపు.. ఆంధ్రప్రదేశ్ తో పాటూ ఒరిస్సా, ఛత్తీస్ గడ్ లకు చెందిన 274 గ్రామాలు ముంపుకు గురికాగా, దాదాపు 40 వేల కుటుంబాలకు ఇతర ప్రాంతాల్లో తక్షణసహాయంతోపాటు  పునరావాస పథకాన్ని పెద్దఎత్తున చేపట్టాల్సి వుంటుంది. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో వున్న ముంపు గ్రామాల్ని రేపు ఏర్పడబోయే విభక్త ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పటికీ, ఒరిస్సా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలతో ముంపు గ్రామాల వివాదం అంత సులభంగా సమసిపోకపోవచ్చు. ఆర్ ఆర్ ప్యాకేజిని  కొత్త చట్టం ప్రకారం ఉదారంగా అమలుచేసినా మరిన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్వాసితుల్లో అత్యధికులు గిరిజన తెగలవాళ్ళు కనుక వాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడం కష్టసాధ్యం మాత్రమేకాదు, సంస్కృతీపరంగా చాలా సున్నితమైన అంశం.


సామూహిక వలస, పునరావాసం  విషయంలోను అతివాదులూ, మితవాదులూ వుంటారు. పోలవరం పరిసరాల్లో ఇప్పుడు అడివి అనేదే లేదు కనుక గిరిజనులు మైదాన ప్రాంత జీవితానికి అలవాటు పడిపోయారనేది ఒక వాదన. ఇప్పటికీ ఆ ప్రాంతపు గిరిజన తెగలు అడవిపై ఆధారపడి, సాంప్రదాయిక ఆదివాసీ జీవితాన్ని  మాత్రమే గడుపుతున్నారనేది ఇంకో వాదన. ఈ రెండు వాదనలూ వాస్తవం కాదు.  వాస్తవం ఈ రెండింటికి మధ్యన వుంటుంది.  దాన్ని తేల్చాసింది ప్రాజెక్టు లబ్దిదారులుకాదు; బాధితులు. వాళ్ళే పోలవరం ప్రాజెక్టు డిజైనును నిర్ణయించాలి

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ _  90102 34336
హైదరాబాద్‌, 27 ఫిబ్రవరి  2014


ప్రచురణ : ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎడిట్ పేజీ 4  మార్చి 2014