Tuesday 28 February 2023

లాల్ నీల్ హర్యాలి నేటి నినాదం కావాలి!

          లాల్ నీల్ హర్యాలి నేటి నినాదం కావాలి!

 

ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

 

          వైద్య ఆరోగ్యరంగంలో రోగ చికిత్సకు ఒక మూడు దశల  ప్రొసీజర్ వుంటుంది. మొదటి దశలో, వివిధ పరీక్షల ద్వార రోగాన్ని నిర్ధారిస్తారు. రెండవ దశలో, ఆ పరీక్షల నివేదికలనుబట్టి  రోగం నుండి రోగిని బయటపడేయడానికి మందులు సూచిస్తారు. మూడవ దశలో; నిర్ణిత సమయంలో ఆ మందుల్ని  వాడుతారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడ చేస్తారు. సమాజానికి సోకిన రోగాల్ని నయం చేయడానికి కూడ అలాంటి మూడు దశల ప్రొసీజర్ వుంటుంది. మొదటి దశలో,  వివిధ సర్వేల ద్వార సమాజ స్వభావాన్ని నిర్ధారించాలి. రెండవ దశలో, సర్వే నివేదికలను బట్టి సమాజన్ని  ఆరోగ్యంగా మార్చే విధానాలను సూచించాలి. మూడవ దశలో, ఒక నిర్ణిత కాలక్రమం ప్రకారం ఆ విధానాలను అమలు చేయాలి; అవసరం అయితే శస్త్ర చికిత్స కూడ చేయాలి.

 

          వైద్య ఆరోగ్య రంగానికీ, సమాజానికీ మధ్య ఒక కీలక తేడా వుంటుంది. వైద్యరంగంలో రోగి ఆరోగ్యాన్ని పునరుధ్ధరిస్తే సరిపోతుంది. సమాజంలో అలా కాదు; పాత సమీకరణల్ని మొత్తంగా అంతం చేసి మొత్తం కొత్త సమీకరణలతో ఒక కొత్త సమాజాన్ని ఏర్పారచాల్సివుంటుంది. అంచేత ఉద్యమకారులందరూ మూల సమాజంలోవున్న రుగ్మతల్ని చెప్పి వాటిని పరిష్కరిస్తామని చెప్పడమేగాక లక్ష్య సమాజంలో విభిన్న మానవ సమూహాల మధ్య సంబంధాలు ఎలావుంటాయో విధిగా వివరంగా చెప్పి తీరాలి.   తూర్పుయూరప్ పరిణామాలు, రష్యా విఛ్ఛిన్నం, చైనాలో మైనారిటీ సమూహాలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిసిన కాలంలో లక్ష్య సమాజం ఎలా వుండాలో వివరించాల్సిన అవసరం మరీ పెరిగింది.

 

          తెలుగువాళ్లకు కూడ ఇలాంటి అనుభవాలున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి చెప్పేటప్పుడు బందగీ, ఐలమ్మలు సాగించిన వీరోచిత పోరాటాల గురించి చాలా ఘనంగా చెపుతుంటారు. కమ్యూనిస్టుపార్టి సాయుధ పోరాటాన్ని విరమించిన తరువాత తెలంగాణ ప్రాంతంలో సంపద బందగీ, ఐలమ్మల సామాజికవర్గాలకు చేరిందా? లేక  నాటి  దేశ్ ముఖ్ ల సామాజికవర్గాలకే మళ్ళీ చేరిందా? అనేది మనల్ని వెంటాడుతున్న ప్రశ్నలు. పోరాటం అనంతరం కూడ  నాటి దేశ్ ముఖ్ ల సామాజికవర్గాల దగ్గరికే సంపద చేరుతుంటే అసలా పోరాటం దేనికీ? మనం ఇన్నాళ్ళు త్యాగాలను మాత్రమే కీర్తిస్తున్నాముగానీ; విజయాలను కీర్తించే అవకాశం మనకు రాలేదు.  

 

          పీపుల్స్ వార్ పార్టి ఘనంగా చెప్పుకునే ‘జగిత్యాల జైత్రయాత్ర’ విషయంలోనూ  ఇప్పుడు ఇలాంటి కథనాలే వినిపిస్తున్నాయి. మళ్ళీ ఆ ప్రాంత గ్రామాల్లో దొరల గడియలు కొత్త రంగులతో మెరిసిపోతున్నాయట. అంతేకాదు; కమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వంలో పేదలు ఆనాడు ఆక్రమించుకున్న భూములకు  పాత భూస్వాముల పేరిటే కేసిఆర్ కొత్త పట్టాలు జారిచేశారట. (ఈ సమాచారం తప్పయితే సరిదిద్దుకోగలను)

 

1948 ఫిబ్రవరి నెలలో సాయుధపోరాటం ఒక్కటే మార్గమని భారత కమ్యూనిస్టు పార్టి కేంద్ర కమిటి పిలుపిస్తే ఏడు నెలలు తిరగకుండానే ఆ ఏడాది సెప్టెంబరు మధ్యలో భారత కమ్యూనిస్టు పార్టి తెలంగాణ సమితి సాయుధపోరాట విరమణ ప్రకటన ఎందుకు చేసిందీ? ఇలాంటి ప్రకటన చేయడానికి కమ్యూనిస్టు పార్టి నాయకత్వపు వర్గ స్వభావం ఏ మేరకు ప్రభావితం చేసిందీ?  ఇవన్నీ ఎవరికయినా ఎప్పటికయినా రావలసిన సందేహాలే.  

 

          ఈ క్రమం మొత్తానికి భారత సమాజ స్వభావం ఏమిటనేది? మొదటి ప్రశ్న అయితే, దీన్ని మార్చి ఎలాంటి సమాజాన్ని నిర్మించదలిచాము అన్నది  రెండవ ప్రశ్న. ఆ సమాజాన్ని ఎలా నిర్మిస్తామూ? ఎవరెవరితో నిర్మిస్తామూ? ఎంత కాలంలో నిర్మిస్తామూ? అనేవి అన్నింటి కన్నా ముఖ్యమైన ప్రశ్నలు.

 

          భావి భారత సమాజం ఎలా వుండాలనే అంశం మీద జాతియోద్యమ కాలంలోనే  రెండు ధోరణులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా 1919-24 మధ్య కాలంలో ఒకవైపు ఖిలాఫత్ ఉద్యమం, మరోవైపు సహాయ నిరాకరణోద్యమం సాగుతున్న  సమయంలో ఈ ధోరణులు మొలకెత్తాయి. వీటిల్లో; మొదటిది, భౌగోళిక జాతీయవాదం. బ్రిటీష్ వలస పాలన ఆరంభం అయ్యేనాటికి భారత ఉపఖండంలో నివశిస్తున్న వారందరూ భారతీయులు అనేది దీని నిర్వచనం. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు (భారత ప్రధమ స్వాతంత్ర్య సమరం) నాటికే ఇలాంటి సమీకరణ ఒకటి స్థిరపడింది. బహుశ, సిపాయిల తిరుగుబాటు నాటి సామాజికవర్గాల సమీకరణ ఆధారంగానే మహాత్మా గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించాడు.  అయితే, ఖిలాఫత్ ఉద్యమంలో  ముందుకు వచ్చిన సీనియర్లు ఖిలాఫత్ ఉద్యమ  షౌకత్ అలీ, మౌలానా ముహమ్మద్ అలీ, హకీమ్ అజ్మల్ ఖాన్, అబ్దుల్ కలామ్ ఆజాద్ తదితరులు గాంధీజీ ప్రభావంతో  కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఆ ఉద్యమంలో వచ్చిన ముజాహిర్లలోని  యువతరం కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. వాళ్ళే రష్యా వెళ్ళి వచ్చి తాష్కెంట్ కోండల్లో 1920 అక్టోబరు 17న ముహమ్మద్ షఫీఖ్ కార్యదర్శిగా  భారతీయ కమ్యూనిస్టు పార్టిని నెలకొల్పారు.

 

రెండోది, సాంస్కృతిక జాతీయవాదం. భారత ఉపఖండంలో హిందూ  మతరాజ్యం ఏర్పడాలనేది దీని లక్ష్యం. అలా 1925 సెప్టెంబరు 27న ఆరెస్సెస్ ఆవిర్భవించింది. అంతకు ఓ ఏడాది ముందే 1924 జులై 20న  బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘బహిష్కృత హితకారిణీ సభ’ను నెలకొల్పాడు. హిందూ మత సమాజంలో వర్ణ-కుల అణిచివేతల నిర్మూలన జరగాలనేది దీని  లక్ష్యం.  

 

ఆరెస్సెస్ పుట్టిన మూడు నెలలకు 1925 డిసెంబరు 26న ఇండియన్ కమ్యూనిస్టు పార్టిని రద్దు చేసి భారత కమ్యూనిస్టు పార్టి ఆవిర్భవించింది. నిజానికి ఇండియన్ కమ్యూనిస్టు పార్టి అంటే ఒక స్వతంత్ర సంస్థ అని అర్ధం. కమ్యూనిస్ట్ పార్టి ఆఫ్ ఇండియా అంటే ఒక అంతర్జాతీయ సంస్థకు లోకల్ బ్రాంచ్ అనే అర్ధం వస్తుంది. పేరు పెట్టడంలోనే ఒక తప్పు జరిగింది. ఫలితంగా కొంతకాలం యూకేనో, మరి కొంత కాలం రష్యానో, ఇంకొంత కాలం చైనా మీదో ఆధారపడి బతకాల్సి వచ్చింది. స్టాలిన్ అయినా, మావో అయినా గొప్ప మార్క్సిస్టు సిధ్ధాంత వేత్తలు అనడంలో తప్పేమీలేదు. కానీ వాళ్ళు వేరే దేశాలకు అధినేతలు అనే ఎరుకను సహితం మన కమ్యూనిస్టు పార్టీలు మరిచిపోయాయి. ఇతర దేశాల అధినేతల్ని నమ్ముకుని సృజనాత్మకతను కోల్పోయాయి; స్వీయ సమాజం అర్ధం కాక వరుస పరాజయాలను మూటగట్టుకున్నాయి.

 

 

 

ఆరెస్సెస్ అభిప్రాయంలో భారత దేశం మతరాజ్యం. ఇంకా సూటిగా చెప్పాలంటే హిందూ మతరాజ్యం. ఆ విషయాన్ని వాళ్ళు ఎన్నడూ దాచుకోలేదు. ఆరెస్సెస్ ఆవిర్భవించిననప్పటి నుండి ఇప్పటి వరకు అరడజను సార్లు తన శత్రువులు ఎవరో బాహాటంగా ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఆరు జాబితాల్లోనూ ఒక సామాన్యాంశం వుంది. అన్నింటిలోనూ  వాళ్ళ తొలి శత్రువులు ముస్లింలు.

 

ఆరెస్సెస్ నో, బిజెపినో, కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్త్వాన్నో వ్యతిరేకించే శక్తులు, పార్టీలు, సంస్థలు, సంఘాలు, ఐక్య కార్యాచరణ కమిటీలు తమ తొలి మిత్రులుగా ఎవర్ని ప్రకటించాలీ? ఆసక్తికొద్ది అడగాలనిపించింది.  కొంచెం తర్కాన్ని, హేతువునూ ఉపయోగిస్తే ఎవరికైనా సమాధానం దొరుకుతుంది.

 

 

 

భారత దేశంలో ప్రతి రాజకీయ పార్టి ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత కాలం ఒక రాష్ట్రంలో అధికారంలో వున్నదే, లేదా అధికారపార్టికి మిత్రపక్షంగా వున్నదే. సరిగ్గా అలాగే మన దేశంలో ప్రతి సామాజిక సమూహం ఏదో ఒక యుగంలో, ఎంతోకొంత కాలం, ఏదో ఒక ప్రాంతాన్ని పాలించిందే.  అంచేత సామాజికవర్గాలన్నింటిలోనూ ఒక పాలకవర్గ స్వభావం, అణగారినవర్గ స్వభావం రెండూ వుంటాయి. శ్వాస నిశ్వాసల్లా, చీకటివెలుగుల్లా. మహిళలు సహితం దీనికి మినహాయింపుకాదు.

 

ఎవరయినా సామాజిక కార్యకర్తలు తారసపడినపుడు నేను వేసే ముఖ్యమయిన ప్రశ్న మన భారత సమాజ స్వభావం ఏమిటీ? అని. కొందరు వర్గ సమాజం అంటారు. కొందరు కుల సమాజం అంటారు. కొందరు కులవర్గ సమాజం అంటారు. ఈ అభిప్రాయాలు గలవారెవ్వరూ భారత  సమాజాన్ని మార్చలేరు. వర్తమాన భారత సమాజాన్ని మత సమాజం అని కూడ గుర్తించినవారు మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలరు.  ఇతరులు ఎన్ని విప్లవ సిధ్ధాంతాలు చెపుతున్నప్పటికీ యధాస్థితి వాదులుగా మిగిలిపోతారు.

 

సమాజ స్వభావం గురించి ఆరెస్సెస్ కు పుట్టుక నుండే ఒక స్పష్టత వుంది. దానితోపాటే పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టికి మొదటి నుండీ భారత సమాజ స్వభావం మీద తీవ్ర గందరగోళం వుంది. ఈ రెండు సంస్థలకు ఒక ఏడాది ముందే బాబా సాహెబ్ బిఆర్ అంబేడ్కర్ భారత సమాజాన్ని కులమతవర్గ సమాజంగా ప్రకటించాడు. చాలా మంది అంబేడ్కరిస్టులు ఆయన కుల-వర్ణ సమాజం అనిమాత్రమే అన్నట్టు ప్రచారం చేశారు. అంబేడ్కర్‍ ఆర్ధిక విధానాలను కూడ అర్ధం చేసుకున్న మరికొందరు ఆయన కుల-వర్గ సమాజం అన్నట్టు భావించారు. “నేను హిందువుగా పుట్టాను; కానీ హిందువుగా చనిపోను” అని అంబేడ్కర్ చేసిన ప్రతిజ్ఞలోగానీ, మనుస్మృతి మీద ఆయన  చేసిన నిష్కర్ష దాడిలో గానీ, చివరకు హిందూమతాన్ని త్యజించడం వల్లగానీ అంబేడ్కర్ దీన్ని హిందూ రాజ్యం అన్నట్టు చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు.

 

సమాజ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేయడానికీ వేయకపోవడానికీ ఫలితాల్లో చాలా తేడావుంటుంది. దాదాపు వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ తేడాలు మనకిప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.  భారత సమాజానికి వర్గ స్వభావాన్ని మాత్రమే గుర్తించిన భారత కమ్యూనిస్టు పార్టి వందేళ్ళలో  వంద ముక్కలయింది. భారత సమాజానికి మత స్వభావం వుందని గుర్తించిన ఆరెస్సెస్ వందేళ్ళలో  వంద సంస్థలుగా విస్తరించింది. అంబేడ్కర్ ను నమ్మిన వాళ్లలోనూ మనకు మూడు స్రవంతులు కనిపిస్తాయి. భారత సమాజానికి కుల స్వభావాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టులు ఒక తీరుగా వెళ్ళారు. కుల-వర్గాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టులు ఇంకో తీరుగా నడిచారు.  కులమత వర్గ స్వభావాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టులు విప్లవాత్మకంగా వున్నారు.

 

మొదటి రెండు రకాల అంబేడ్కరిస్టుల్ని తనలో ఇముడ్చుకునే ప్రయత్నం సంఘీయులు ఎన్నడో మొదలెట్టారు. బాబూ జగ్జీవన్ రామ్, రామ్ విలాస్ పాశ్వాన్, రామ్ దాస్ అథవాలే తదితరుల్ని బిజెపి తెలివిగానే ఇముడ్చుకుంది.  కులమత వర్గ స్వభావాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టుల్ని బిజెపి ఇప్పటికీ తనకు ప్రమాదకారులుగానే చూస్తున్నది. ఈ సమూహాన్నే ఆరెస్సెస్  “అంబేడ్కరిస్టులయిన ఎస్సీలు” అంటున్నది. మిగిలివరు అంబేడ్కర్ ను చదవలేదనో, చదివినా వాటిని పక్కన పెట్టారనో ఆరెస్సెస్ వ్యూహకర్తలు నమ్ముతున్నారు.

 

భారత కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. జాతీయ ప్రజాస్వామిక ఉద్యమం సిపిఐ కార్యక్రమం, సిపియం మొదలు సమస్య ఎంఎల్, మావోయిస్టు పార్టీల కార్యక్రమం నూతన ప్రజాస్వామిక విప్లవం, కనతా ప్రజాస్వామిక విప్లవం. ఈ కార్యక్రమాల అర్ధం ఏమిటో? ఈ గడిచిన వందేళ్ళలో రచించిన వ్యూహాలు, వేసిన ఎత్తుగడలతో ఈ విప్లవాలని వాళ్ళు ఏ మేరకు పూర్తి చేశారో ఎవరయినా వివరిస్తే వినాలని కోరిక. అర్ధవలస-అర్ధ భూస్వామ్య వ్యవస్థ, నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం, దున్నేవానికే భూమి, వ్యవసాయిన విప్లవం, ఆ పైన నూతన ప్రజాస్వామిక విప్లవం. అంతిమంగా సోషలిస్టు విప్లవం.  ఇదే రొడ్డ కొట్టుడు.

 

          కమ్యూనిస్టు సిధ్ధాంతం గొప్పది. ప్రజల వీరోచిత పోరాటం గొప్పది; వాళ్ళ త్యాగాలు అంతకన్నా మహత్తరమైనవి. ఆ అణగారిన సామాజికవర్గాలకు వందేళ్ళ తరువాత కూడ న్యాయం జరగలేదంటే ఆ తప్పంతా ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారిది. ఉద్యమ నాయకుల తప్పిదాల కారణంగా  భారత పీడత ప్రజలు ఓడిపోతూవచ్చారు. ఉద్యమ నాయకులు చేతకాక ఓటమి పాలయ్యారా?  లేక అన్నీ తెలిసీ ద్రోహానికి తలపడ్డారా? అన్నది ఒక్కటే సందేహం.

 

          భారత విద్యా వువస్థను కమ్యూనిస్టు పార్టీలు ‘బానిస విద్యా విధానం’ అంటుంటాయి. మన నియత విద్య ఇక్కడ సరుకుల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడదనీ, ఇక్కడ విద్యావంతులైనవాళ్ళు  విదేశాలకు పోయి అక్కడ ఉత్పత్తి చేసి తీసుకునివచ్చి తిరిగి ఇక్కడి మార్కెట్లో అమ్మడానికి మాత్రమే మన విద్య పనికి వస్తుంది అనేది దీని అర్ధం. కొంచెం తరచి చూస్తే భారత కమ్యూనిస్టు పార్టిలు కూడ బానిస పార్టిలే అని సులువుగా బోధపడుతుంది. బ్రిటీష్ కమ్యూనిస్టు పార్టికి బ్రాంచ్ ఆఫీసుగా భారత కమ్యూనిస్టు పార్టి ఏర్పడింది. బ్రిటన్ లో  ప్రముఖ కమ్యూనిస్టు నాయకునిగా వెలిగిపోతున్న రజనీ ఫామె దత్ ఇక్కడి కమ్యూనిస్టు పార్టి నాయకులకు దారి చూపేవాడు. ఆ తరువాత రష్యా కమ్యూనిస్టు నాయకులు, రష్యా నుండి  ‘పంపబడిన’ కమ్యూనిస్టులు ఇక్కడ పెత్తనం చేయసాగారు. కొంతకాలం ఇంగ్లడ్ కు చెందిన హ్యారీ పొల్లిట్ గాలి వీచింది. రెండో ప్రపంచ యుధ్ధకాలంలో భారత కమ్యూనిస్టుల్ని క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా వుంచిన ఘనుడు అతనే.

 

కార్ల్ మార్క్స్  దృష్టిలో వర్గం అనేది కేవలం ఆర్ధిక ప్రత్యయంకాదు; అది సామాజిక, తాత్విక ప్రత్యయం. ఆర్ధిక నిర్ణాయక వాదాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు. ఆర్ధిక నిర్ణాయక వాదమే మార్క్సిజం అయ్యేదయితే “దేవుడా! నన్ను (అలాంటి) మార్క్సిస్టుగా పుట్టించనందుకు ధన్యవాదాలు” అంటూ ఎద్దేవ చేశాడు.

 

ఉత్పత్తి సంబంధాల విషయంలోనూ మార్క్స్ అభిప్రాయాలు సామాజికమైనవి. ఆయన సామాజిక ఉత్పత్తి సంబంధాలు అన్నాడుగానీ శుష్కంగా ఉత్పత్తి సంబంధాలు అనలేదు. పైగా మార్క్స్ మాటలని చారిత్రక సందర్భంలో సాపేక్షకంగా అర్ధం చేసుకోవాలేగానీ వాటిని అంతిమ, పరిపూర్ణ (Absolute) నిర్ధారణలుగా భావించరాదు. సామాన్య శాస్త్రాలకూ, సమాజ శాస్త్రానికి ప్రధాన తేడా కూడ అదే. సామాన్య శాస్త్రాల్లో నియమాలు స్థిరంగా వుంటాయి. సమాజ శాస్త్రంలో సాపేక్షకంగా వుంటాయి. కోళ్ళ ఫారంలో కోళ్ళు పెరిగినట్టు మనుషులు పెరగరు. ప్రతి వ్యక్తి భిన్న వ్యక్తిత్వం కలిగివుంటాడు. మనుషులు వేరు వ్యక్తి వేరు.

 

భారత కమ్యూనిస్టు పార్టిలు మొదటి నుండీ భారతదేశాన్ని పరిపూర్ణ (Absolute) అర్ధంలో  వర్గ సమాజం అని ప్రచారం చేస్తున్నాయి. వర్గానికి పునాది ఆర్ధికం అనేది అవి తమకు అనుకూలంగా చేస్తున్న వాదన.  కనీసం అణిచివేతను ప్రాతిపదికగా తీసుకున్నా పరిస్థితి కొంచెమయినా భిన్నంగా వుండేది.

 

నిజానికి అంత దూరంగా వున్నా, సమాచారం పెద్దగా అందుబాటులో లేకున్నా భారత ఉపఖండంలో సమాజం విభిన్నంగా వుందని మార్క్స్ ఆ కాలంలోనే గమనించాడు. కుల సమస్య గురించి కూడ కొద్దిగానే అయినా పధ్ధతిగా రాశాడు. ఈ నిజాయితీ భారత కమ్యూనిస్టు పార్టిల నాయకత్వానికి లేదు. 1951 ఫిబ్రవరి రెండవ వారంలో సోవియట్ రష్యాలో స్టాలిన్ ను కలిసిన సిపిఐ బృందానికి ఆయన కూడ “మీ సమాజం రష్యాలాంటిది కాదు; తూర్పు యూరోప్ లాంటిది కాదు; చైనా లాంటిది కూడ కాదు. మీ సమాజ వాస్తవ స్వభావాన్నీ,  ప్రత్యేకతల్ని ముందు లోతుగా అధ్యయనం చేయండి. దాని ఆధారంగా  చేపట్టాల్సిన విప్లవ దశల్ని నిర్ణయించుకోండి. ఆ తరువాత  కార్యాచరణకు  దిగండి” అన్నాడు. రష్యా నుండి తిరిగి వచ్చిన వాళ్ళు సాయుధపోరాటానికి స్వస్తి పలికి పార్లమెంటరి పంధా చేపట్టారు. స్టాలిన్ సూచనలమేరకే పంధా మార్చినట్టు తప్పుడు సంకేతాలు ఇచ్చారు.

 

1980ల ఆరంభంలో పంజాబ్ లో మొదలయిన తిరుగుబాటు మెయిన్‍ ల్యాండ్ భారత సమాజంలో మతతత్త్వ  స్వభావం పెరుగుతోందని తొలి హెచ్చరిక చేసింది. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్, స్వర్ణదేవాలయం మీద దాడి, ఇందిరా గాంధి హత్యానంతరం ఢిల్లీ పరిసరప్రాంతాల్లో సాగిన శిక్కుల ఊచకోత భారత సమాజపు మెజారిటీ మతతత్త్వ స్వభావాన్ని నిర్ధారించాయి. దేశం హిందూమతరాజ్యం దిశగా నడుస్తున్నదని శిక్కులతోపాటూ మైనార్టీ సమూహాలయిన ముస్లింలు, క్రైస్తవులకు స్పష్టంగానే అర్ధం అయింది. శిక్కులు ముస్లింల మధ్య ధార్మిక వివాదాలున్నాయి. దేశవిభజన నాటి ఉద్రేకాలూ వున్నాయి. అప్పట్లో జరిగిన అల్లర్లలో పశ్చిమ పంజాబ్ లో శిక్కులు, తూర్పుపంజాబ్ లో ముస్లింలు ఎక్కువ మంది చనిపోయారు.  మతమైనారిటీలనే అస్తిత్వం శిక్కు ముస్లిం సమూహాలను ఢిల్లీలో ఐక్యం చేసింది. క్రైస్తవుల విషయమూ అంతే. క్రైస్తవులు ముస్లింల మధ్య కూడ ధార్మిక విబేధాలున్నాయి. కొన్నిదేశాల్లో మెజారిటీ మైనారిటీ వివాదాలున్నాయి. క్రైస్తవ, ముస్లిం సమూహాలు రెండూ మైనారిటీలుగా వున్న దేశం భారత దేశం. అలా ఒక ఐక్యత వాళ్ల మధ్య ఏర్పడింది.

 

టెక్నికల్ గా మైనార్టీలయిన జైనులు, పార్శీ జొరాస్ట్రీయన్లు, క్రమంగా హిందూ మతంలో భాగం అయిపోయారు. బుధ్ధుడ్ని హిందూమతం పదవ అవతారంగా మార్చుకుంది. 

 

. 1985లో కేవి రమణా రెడ్డి ‘మతవర్గతత్త్వం’, పుస్తకాన్ని రాస్తే, 1989లో కే బాలగోపాల్ ‘హిందూమత రాజ్యం’ పుస్తకాన్ని రాశాడు. అయితే భారత సమాజానికున్న మత వర్గ స్వభావాన్ని వంద కమ్యూనిస్టు పార్టిల్లో ఏ ఒక్కటీ గుర్తించలేదు.

 

1985లో జరిగిన కారంచేడు దురంతం కుల సమస్యను బలంగా ముందుకు తెచ్చింది. మనది కుల సమాజం అనడానికి కూడ కమ్యూనిస్టు పార్టీలన్నీ మూకుమ్మడిగా తిరస్కరించాయి.

 

యజమాని కులాల్లోని స్థితిమంతులు తమ ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అనేక రాజకీయా పార్టీలను వాడుకున్నాయి. ఆ క్రమంలో వాళ్ళ లోని కొన్ని  సమూహాలు కమ్యూనిస్టు పార్టిలను కూడ వాడుకున్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన సామాజికవర్గాలే కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వం వహించిన ఉద్యమాల మూలంగా ఇతోధికంగా లబ్దిపొందడాన్ని మనం సులువుగానే చూడవచ్చు.  

 

తమ అస్తిత్వాన్నే గుర్తించని పార్టీలు తమ సమస్యల్ని పరిష్కరించలేవని అర్ధం అయ్యాక అణగారిన సమూహాలన్నీ కమ్యూనిస్టు పార్టీల్ని విడిచిపోయాయి. అణగారిన సమూహాల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీలను ఏ పేరుతో అయినా పిలవవచ్చుగానీ కమ్యూనిస్టు పార్టి అని మాత్రం పిలవకూడదు.

 

కమ్యూనిస్టు పార్టీల ద్వార తమ నూతన ఆర్ధిక ప్రయోజనాలు నెరవేరవని గమనించాక ‘వామపక్ష’ యజమాని కులాలు సహితం ఆ పార్టీలను దూరంగా పెట్టాయి. రోజురోజుకు తమ పని దిగదుడుపుగా మారిపోతున్నదని గమనించిన కమ్యూనిస్టు పార్టీలు కొంత పునరాలోచనలో పడ్డాయి. అయితే, కులం వరకు గుర్తిస్తాం కానీ మతాన్ని మాత్రం గుర్తించం అంటున్నాయి.

 

ఇది ప్రాయోజిత రాజకీయాల వ్యవస్థ. తమ పోషకులు యజమాని కులాలవాళ్ళే కనుక వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమంగా కమ్యూనిస్టు పార్టీలు ఆనాడు భారత సమాజంలో కుల స్వభావాన్ని గుర్తించదలచలేదనే ఆరోపణలు బలంగానే  వున్నాయి. సరిగ్గా అలాంటి ఆరోపణలే ఆ పార్టీల మీద ఇప్పుడు మతం విషయంలోనూ వినిపిస్తున్నాయి.  కమ్యూనిస్టు పార్టీల క్రోనీ పాలిటిక్స్ !

 

భారత కమ్యూనిస్టు పార్టీల వల్ల అణగారిన సమూహాలకు మూడు  గొప్ప మేళ్ళు జరొగాయి. మొదటిది;   వాళ్ళకు సమాజాన్ని విశ్లేషించడం అర్ధం అయింది. రెండోది; ధైర్యంగా ప్రశ్నించడం ప్రకటించడం  అలవడింది. మూడోది; దేనినయినా పోరాడి సాధించుకోవాలని బోధపడింది.  అనంతర కాలంలో ఆరంభమయిన  ఎస్టి ఎస్సి బిసి మైనారిటీ సమూహాల సామాజిక ఉద్యమాలకు తొలి దశలో నాయకత్వం వహించినవారందరూ  కమ్యూనిస్టు శిబిరాల్లో శిక్షణ పొందినవారే కావడం యాధృఛ్ఛికం కాదు; అదొక చారిత్రక సహజ పరిణామం.

 

వర్తమాన భారత సమాజంలోని కుల మత తెగల్నేకాక సమస్త వివక్షల్ని, వాటి మహ్య సాగుతున్న వర్గ పోరాటాలను గుర్తించిందే నిజమయిన కమ్యూనిస్టు పార్టి అవుతుంది. దానికి లాల్ నీల్ హర్యాలి నినాదం కావాలి! మిగిలినదంతా ప్రాయోజిత రాజకీయాలే. క్రోనీ పాలిటిక్స్!

 

 

లాల్ నీల్ హర్యాలి నేటి నినాదం కావాలి! తరచుగా హర్యాలి మిస్ అవుతున్నది. ఇది పొరపాటా? ఉద్దేశ్య పూర్వకమా?  

No comments:

Post a Comment