Saturday 29 July 2023

రేపటి ఇండియా ఇప్పటి మణిపూర్!

 రేపటి ఇండియా ఇప్పటి మణిపూర్!

మణిపూర్ మంటలు చెపుతున్నదేమిటీ?

హిందూ సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాలి!

 1350 Words

             సంఘపరివారపు సామాజిక దృక్పథం, భారతీయ జనతా పార్టి రాజకీయార్ధిక విధానాలు దేశాన్ని ఎంతటి  ప్రమాదకర స్థితికి తీసుకుని వెళ్ళగలవో ఇప్పుడు మణిపూర్ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

మణిపూర్ మంటల్లో ఒక్కొక్కరు ఒక్కో పార్శ్వాన్ని మాత్రమే  చూస్తున్నారు. మణిపూర్ లో కుకీలను చూసి దానిని ఆదివాసి, గిరిజన సమస్యగా కొందరు చూస్తున్నారు. కుకీలు కొండల్లో, మైతీలు లోయల్లో నివసిస్తున్నారు కనుక దీనిని మరి కొందరు కొండవాసులు, లోయ వాసుల సమస్యగా చూస్తున్నారు. కుకీల్లో అత్యధికులు  క్రైస్తవులు కనుక దీని కొందరు మైనారిటీ మత సమస్యగా చూస్తున్నారు. మైతీలు మెజారిటీ, కుకీలు మైనారిటీ కనుక దీన్ని మైనార్టిల మీద మెజారిటీల వేధింపు చర్యలుగా ఇంకొందరు చూస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అపారంగావున్న  ఖనిజ నిక్షేపాలను  అస్మదీయ  కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసమే  కుకీల మీద జాతిహననం సాగిస్తున్నారనే వాదనా వుంది. విభిన్నమైన సాంస్కృతిక జీవనంగల కుకీలను వేధించడానికీ, అడవులు, కొండల మీద వాళ్లకున్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయడంకోసమే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిస్తున్నారనే మాటా వినిపిస్తున్నది.  

ప్రజల్లో అపఖ్యాతిపాలయిన ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మైతీలను కుకీల మీదికి ఉసి గొల్పాడనే  ఆరోపణలున్నాయి. మణిపూర్ తూర్పు సరిహద్దుల్లో పొరుగుదేశం  మైన్మార్ కు చెందిన రెండు జిల్లాలుంటాయి.  ఆపైన మైన్మార్, లావోస్, థాయిలాండ్ కలిసే గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) వుంటుంది. అది డ్రగ్స్ ట్రాపికింగ్ కు అంతర్జాతీయ కూడలి. అంచేత మణిపూర్ మంటల్లో  అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ప్రయోజనాలు కూడ ముడిపడివున్నయనే వాదనా వుంది.

ఆర్టికల్ 355 ద్వార మే 4 నుండి  మణిపూర్ శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హొంమంత్రి అమిత్ షాలు దేశప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడంలో గొప్ప నేర్పరులు. కానీ, వాళ్లు శాంతిభద్రతల్ని కాపాడడంలో వాళ్ళు సమర్ధులుకారని  మణిపూర్ లో  తేలిపోయిందని ఇంకొందరు  అంటున్నారు.

ఈ అంశాల్లో ఏ ఒక్కటీ అబధ్ధంకాదు. ఇంతకు మించిన అనేక కోణాలు కూడ ఇప్పుడు మణిపూర్ మంటల నుండి వెలుగులోనికి వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం ఎదుర్కొంటున్న సమస్త సమస్యలు  మణిపూర్ లో వున్నాయి. మణిపూర్ ఇప్పుడు మినీ ఇండియా. అంటే ఇప్పుడు మణిపూర్ లో జరుగుతున్నది రేపు మొత్తం భారత దేశంలో జరిగబోతున్నద్ని అర్ధం.  

దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే చాలామంది   అంగీకరించేవారుకాదు. ఇవ్వాళ దేశంలో ఫాసిస్టు పాలన (ఫాసీవాద్) కొనసాగుతోందని మణిపూర్ ఆదివాసి మహిళలు కూడ గొంతెత్తి అరుస్తున్నారు. కుకీ గిరిజన మహిళ డాక్టర్ ముడూసా వీడియోను ఇప్పుడు అందరూ ప్రపంచమంతా వీక్షీస్తోంది. నాగరీకులం అని గొప్పలు చెప్పుకునే మైదానవాసులను మించిన గొప్ప సామాజిక చైతన్యం ఈరోజు ఆదివాసుల్లో కనిపిస్తున్నది.

1984 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధి హత్య తరువాత ఢిల్లీ పరిసరాల్లో శిక్కుల మీద ఊచకోత సాగింది.  ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రికార్డు స్థాయిలో మెజారిటీ దక్కింది. ఒక మైనారిటీ సమూహాన్ని వేధిస్తుంటే మెజారిటీ ఓటు బ్యాంకు ధృవీకరణ జరుగుతుందనే ఒక కొత్త పోల్ మేనేజ్మెంట్ సూత్రం ముందుకు వచ్చింది. శిక్కులు పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలకు మాత్రమే  పరిమితమయిన మైనారిటీలు. దేశం మొత్తంగా విస్తరించివున్న మత మైనారిటీలు ముస్లింలు. వాళ్లను లక్ష్యంగా చేసుకుని మన దేశంలో విద్వేష రాజకీయాలు రూపుదిద్దుకున్నాయి.

భూగోళం మీద అత్యంత అణిచివేతకు గురవుతున్న సమూహాలు రెండు, మొదటిది;  ముస్లిం సమూహం; రెండోది ఆదివాసి సమూహం.  ఆదివాసుల నివాస ప్రాంతాల్లో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ముస్లిం దేశాల భూముల్లో చమురు నిల్వలున్నాయి. ఈ రెండు నిక్షేపాలు జాతీయ, అంతర్జాతీయ మెగా కార్పోరేట్లకు కావాలి. మనదేశ ప్రభుత్వంతో సహా అనేక దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు కార్పోరేట్ల కోసం ఊడిగం చేస్తున్నాయి. జాతి సంపదను వాళ్లకు అప్పనంగా కట్ట బెడుతున్నాయి.

గతంలోనూ మనకు నియంతలున్నారు. వారికీ ఇప్పటి వారికీ చాలా తేడావుంది. గత నియంతలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసమైనా సంక్షేమ పథకాల ద్వార ప్రజలకు మేలు తలపెట్టేవారు. అంతవరకు టాటా బిర్లాలను ఔటర్ లో వుంచేవారు. సంక్షేమ పథకాల అమలు తరువాత తమ మద్దతుదారులైన కార్పొరేట్లకు మేళ్ళు  చేసిపెట్టేవారు.

ఇప్పటి నియంతలు వేరు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసైనాసరే కార్పొరేట్ల సేవలో తరించాలనుకుంటున్నారు. అవసరమైతే కార్పొరేట్ల పక్షాన నిలబడి దేశంలో జాతుల ప్రక్షాళన చేయడానికి  కూడ వెనుకాడడం లేదు.

కొందరు నమ్ముతున్నట్టు ఇది క్రోనీ కేపిటలిజం కాదు; క్రోనీ లెజిస్లేచరి. ప్రాయోజిత శాసనవ్యవస్థ; ప్రాయోజిత కార్వనిర్వాహకవ్యవస్థ, ప్రాయోజిత న్యాయవ్యవస్థ. ప్రాయోజిత మీడియావ్యవస్థ.

నరేంద్ర మోదీ - అమిత్ షాల పాలన ముస్లింలను వేధిస్తున్నదని ఇప్పుడు అందరికీ తెలుసు.  ముస్లిం, క్రైస్తవ తదితర మైనారిటీ సమూహాలను వేధిస్తుంటే  హిందూ సమూహాలు మొత్తంగా కాకపోయినా వాటిల్లో సగమైనా సంబరపడి  తమకు ఓట్లు వేస్తాయని సంఘపరివారం గట్టిగా నమ్ముతున్నది. తనకు సానుకూల ఫలితాలు వస్తుండడంతో  ప్రతి ఎన్నికల్లోనూ అలాంటి ఎత్తుగడల్నే అది అనుసరిస్తున్నది.

ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిస్తున్నది ముస్లింలను కొత్తగా వేధించడానికే అంటూ సంఘపరిరశ్రేణులే ప్రచారం చేస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతిని ఇప్పుడు ఆదివాసులు ప్రశ్నిస్తున్నారు. దానితో ఇరకాటంలో పడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆదివాసులు, క్రైస్తవులకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. కొన్ని సమూహాలకు మినహాయిస్తే అది ఉమ్మడి పౌరస్స్మృతి ఎలా అవుతుందో వాళ్ళే చెప్పాలి. ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆదర్శమేగానీ ఆచరణ సాధ్యంకాదు. అత్యంత వైవిధ్యపూరిత  సాంస్కృతిక జీవన సాంప్రదాయాలున్న భారత ఉపఖండంలో అస్సలు ఆచరణ సాధ్యంకాదు.

ఇప్పుడు మణిపూర్ మంటల్లో కార్పొరేట్ ప్రయోజనాల్ని చూద్దాము. భాగవతంలో భూమిని చాపలా చుట్టి సముద్రంలోనికి తీసుకుపోయిన హిరణ్యాక్షుని కథ ఒకటి వుంటుంది. మన మెగా కార్పొరేట్లు ఆ అంశలో పుట్టినవారు. ఇప్పటికే  వాళ్ళు సముద్రాన్ని, ఆకాశాన్నీ  మింగేశారు.

ముంద్రా పోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకాల్ పోర్టు, హాజిరా పోర్టు, ధామ్రాపోర్టు, దహెజ్ పోర్టు,  గంగవరం పోర్టు, వైజాగ్ టెర్మినల్, మార్మగోవా టెర్మినల్, విఝింజమ్ పోర్టు, కట్టుపల్లిపోర్టు, కమరజర పోస్టు, టునా టెర్మినల్, అగర్దన షిప్ యార్డ్ అండ్ టెర్మినల్, దిఘి పోర్ట్ ఆదానీ గ్రూపు ఆధీనంలోనే వున్నాయి. ముంబాయి, అహ్మదాబాద్, లక్నో, మంగలూరు, జైపూరు, గువాహటి, త్రివేండ్రపురం, ఎయిర్ పోర్టులు ఆదానీ గ్రూపువే.

జమ్మూ- కశ్మీర్  కు రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హోదాలను రద్దు చేసినపుడు దాన్ని చాలామంది ముస్లింల వేధింపుగా మాత్రమే చూశారు. ఆ రాష్ట్రంలో ముస్లిమేతరులు కూడా వుంటారనీ,  కొండలు, లోయలుగల రాష్ట్రంలో గిరిజన, ఆదివాసి తెగలు పెద్ద సంఖ్యలో వుంటాయనీ, వాళ్లందరూ దీనికి బాధితులవుతారని చాలా మందికి అనికోలేదు. .

ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజం మైనార్టి మత సమూహాలను వేధించాయని మనకు తెలుసు. కానీ అక్కడ కూడ మెజారిటీలయిన క్రైస్తవుల్లోని కార్పొరేట్లు మాత్రమే బాగుపడ్డారుగానీ సామాన్య క్రైస్తవులు అనేక  అగచాట్ల పాలయ్యారు. ఇప్పుడు మనదేశంలోనూ అదే ఫార్మూలా పునరావృతం అవుతున్నది. హిందూ సామాన్య ప్రజలే ఎక్కువగా నష్తపోతున్నారు.

మోదీజీ ప్రధాని పదవిని చేపట్టాక గత ఏడాది చివరి వరకు 4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిక్ రంగ సంస్థల్ని అమ్మేశారు. గడిచిన 8 నెలల్లో అమ్మినవి దీనికి అదనం. మనదేశంలో ముస్లింల జనాభా 20 కోట్లు. మొత్తం దేశజనాభాలో ముస్లింలు 15 శాతం. ప్రభుత్వరంగ సంస్థల్లో వాళ్ళు 4, 5 శాతం కూడ వుండరు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తుంటే ఆ 5 శాతం ముస్లింలు నష్టపోయేమాట నిజమేగానీ, మిగిలిన 95 శాతం హిందువులు కూడ  నష్టపోతారన్నది అంతకన్నా వాస్తవం.

సముద్రం ఆకాశం రెండింటినీ మింగేశాక మన అస్మదీయ కార్పొరేట్లకు  ఇప్పుడు లోయలు కొండలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడవి మీద విరుచుకు పడ్డారు. ఈ విడత ఇది మణిపూర్ తో మొదలయింది.

మైదానంలో వాడుతున్న మెజారిటీ మైనారిటీ  ఫార్మూలానే వాళ్లు అడవిలోనూ అమలు చేస్తున్నారు. మణిపూర్ లో మెజారిటీ మెయితీ తెగను మైనారిటీ కుకీ తెగల మీదికి ఎగదోస్తున్నారు. మణిపూర్ లో జాతి ప్రక్షాళన (Ethnic Cleansing) జరుగుతున్నదనీ,  ముఖ్యమంత్రి బైరేన్ సింగ్ కుకీలకు బధ్ధవ్యతిరేకి అనీ, పోలీసులు ప్రభుత్వాధికారులు బాహాటంగా మెయితీ  అల్లరి మూకలకు సహకరిస్తున్నారని సాక్షాత్తు బిజెపి శాసన సభ్యుడు పావోలియన్ లాల్ హావ్ కిప్ (Paolienlal Haokip) బాహాటంగా  ఆరోపిస్తున్నారు.

అల్లరి మూకలు మణిపూర్ లో పోలీసు స్టేషన్ల నుండి ఆరు వేల ఆయుధాలు ఎత్తుకుని పోయారట.  అల్లరి మూకలంటే అక్కడ మెయితీలు అని అర్ధం చేసుకోవాలి. పావోలియన్ లాల్ హావ్ కిప్ ఆరోపణల్ని బట్టి పోలీసులే వాళ్లకు ఆయుధాలు అందజేశారని అనుకోవాలి.

కార్పొరేట్ల అటవీ ప్రాంత  ఆక్రమణ మణిపూర్ తో ఆగదని దేశంలోని ఆదివాసి సంఘాలకు అర్ధం అయింది. నాగాలండ్ మొత్తం కుకీలకు సంఘీభావాన్ని తెలుపుతోంది. ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా  ఝార్ఖండ్  ఆదివాసీ సమూహాల్లో  ఒక ఉద్యమం ఆరంభమయ్యి క్రమంగా అటు ఈశాన్య రాష్ట్రాలకు, ఇటు ఛతీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.

ఆదానీలకు చెందిన ముంద్రా పోర్టులో టన్నులకొద్దీ హెరాయిన్ డ్రగ్స్ పట్టివేత కేసు 2021లో కొన్నాళ్లు వార్తల్లో  నలిగింది.  ఆ గ్రూపు గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) మీద కన్నేయడానికి  అదొక కారణం అంటున్నారు.

మణిపూర్ లో  శాంతిభద్రతల విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోనికి కొన్న వెంటనే ఆ రాష్ట్రంలో  ఇంటర్నేట్ సదుపాయాలను పూర్తిగా రద్దు చేశారు. సుప్రీం కోర్టు జోక్యం తరువాత మణిపూర్ లో జులై 20 నుండి ఇంటర్నేట్ సదుపాలను పాక్షికంగా పునరుధ్ధరించారు. ఆ తరువాత మాత్రమే మే 4న మణిపూర్ లో జరిగిన ఒక ఘోర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోనికి వచ్చింది.

ముగ్గురు కుకీ మహిళల్ని ఇళ్ళ నుండి లాక్కొని వచ్చి వివస్త్రల్ని చేసి వందలాది మంది చూస్తుండగా  వీధుల వెంట ఈడ్చుకుంటూ వెళ్ళి  బహిరంగంగా అత్యాచారం చేసి ఇద్దర్ని చంపేసిన సంఘటన ఆ వీడియోలో వుంది. బయటికి వచ్చింది ఒక్క వీడియోనే. ఇలాంటి కొన్ని వందల అత్యాచారాలు అక్కడ జరిగినట్టు సోషల్ మీడియా ద్వార తెలుస్తోంది. అనేకమంది బాధిత స్త్రీలు ఆ ఘోరాలను ఇప్పుడు బయటి ప్రపంచంతో పంచుకుంటున్నారు. మైనారిటీలను వేధిస్తుంటే మెజారిటీలు ఎన్నికల్లో తమను గెలిపిస్తారనే వికృత సిధ్ధాంతానికి మణిపూర్  పరాకాష్ట.

ఇప్పుడు మణిపూర్ మంటల సెగ పార్లమెంటుకు తాకింది. గత రెండున్నర నెలలుగా మణిపూర్ లో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంది. గనుక  అక్కడ జరుగుతున్న జాతి హననానికి నేరుగా దానిదే  బాధ్యత. కేంద్ర ప్రభుత్వం అంటే హోంమంత్రి, ప్రధాన మంత్రులే అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  

రాజకీయ సామాజిక ప్రత్యర్ధుల మీద నైతిక దాడి చేయడానికి సంఘపరివారం దగ్గర ఒక పురాతన ఫార్మూలా వుంది. ముస్లింల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మీద విదేశీయులు, చొరబాటుదార్లు, టెర్రరిస్టులు, పొరుగుదేశాల భక్తులు, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు, జాతి వ్యతిరేకులు, భారత వ్యతిరేకులు వంటి నిందల్ని  వేసేవారు. ఇప్పుడు సరిగ్గా అవే నిందల్ని కుకీల మీద వేస్తున్నారు.  అయితే ఇప్పుడు ఒక తేడా వచ్చింది. దేశప్రజలు నరేంద్ర మోదిజీ, అమిత్ షాల మాటల్ని గతంలోలా ఇప్పుడు నమ్మడంలేడు.

మణిపుర్ లో మెజారిటీ సమూహమైన మైతీలను  లూటిలు, దొమ్మీలు, గృహదహనాలు హత్యలు ,అత్యాచారాలు చేసే మూకోన్మాదుల జాతిగా ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఇంతటి అపఖ్యాతిని భరించడం  మెయితీ జాతి లోని సహృదయులకు సాధ్యంకావడంలేదు. వాళ్లలో ఒక మార్పు వచ్చింది. “మమ్మల్ని మీరు తల్లి, సోదరీ అనీ పిలవకండ్రా. మీరు మానవత్వాన్ని కోల్పోయారు. మా పరువు తీసేశారు. మమ్మల్ని అతి క్రూరమైన జాతిగా ముద్దరేసి ప్రపంచ బోనులో నిందితులుగా నిలబెట్టారు.  మీరూ మిమ్మల్ని పెంచిపోషిస్తున్నవారూ యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే వాస్తవాన్ని గుర్తించండి అనే అర్ధం వచ్చేలా వాళ్ళు కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. వాళ్ళు అంటున్న యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే ఆరోపణలు తార్కికంగా ఎవరికి వర్తిస్తాయో విడమరచి చెప్పనవసరం లేదు.  ఇప్పుడు అడవిలో జరుగుతున్నట్టే రేపు మైదాన ప్రాంతంలోని మెజారిటీ సమూహాల్లోనూ ఈ మార్పు తప్పక వస్తుంది.  

ఇన్నాళ్ళుగా మణిపూర్ లో ఏం జరుగుతున్నదో ప్రధాని, హోమంత్ర్లకు తెలియదంటే ఆ పదవులకు వారు అనర్హులు. తెలిసి కూడ అక్కడ దారుణాలని కొనసాగనిచ్చారంటే ఇప్పుడు వినపడుతున్న కార్పొరేట్ కుట్ర సిధ్ధాంతం నిజమే అని దేశం నమ్మాల్సి వుంటుంది.

ఏది ఏమైనా,   పార్లమెంటులో మణిపూర్ మీద మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కలవరం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పుడు వాళ్ళు భారత్, ఇండియా అనే పదాలను వింటేనే అసహనానికి గురవుతున్నారు. ముస్సోలినీ, హిట్లర్ కూడ చివరి రోజుల్లో భయంతోనే బంకర్లలో బతికారు. ఇప్పుడు ఢిల్లీ సన్నివేశాలు ఆ గతాన్ని గుర్తు చేస్తున్నాయి.

మన పార్లమెంటరీ ప్రాతినిధ్య  ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం అరంభం అవుతున్నదనడానికి ఇవి తొలి సంకేతాలు కావచ్చు! ఇప్పటికే మనం  ‘బిజెపి ముక్త్ దక్షణ భారత్’ లో వున్నాం. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత ‘బిజెపి ముక్త్ సంపూర్ణ భారత్’ ఏర్పడవచ్చు. మెజారిటీ సమూహాలు మణిపూర్ లో లా ఆత్మపరిశీలన చేసుకుంటే ఇదేమీ అసాధ్యం కాదు.

డానీ

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్) 9010757776

రచన ః 27 జులై 2023

No comments:

Post a Comment