Tuesday, 18 February 2014

కరిగిన కల – కళ్ళెదుట నిజం!

కరిగిన కల – కళ్ళెదుట నిజం!   

ఏ. యం. ఖాన్ యజ్దాని (డానీ)


  తెలంగాణ అవిర్భవించింది. సమైక్య తెలుగురాష్ట్రం అధ్యాయం ముగిసింది.  ఇప్పుడు ఆరంభం అవ్వాల్సింది సీమాంధ్ర హక్కుల సాధన ఉద్యమం.

  తెలంగాణ అకాంక్ష  దాదాపు ఆరు దశబ్దాలుగా ఆ ప్రాంత ప్రజల్లో కొనసాగుతోంది, తరచూ  ప్రశాంతంగానూ, అంతర్లీనంగానూ, అప్పడప్పుడు వుధృతంగానూ కొనసాగిన ఆ వుద్యమం అంతిమంగా గమ్యానికి చేరుకుంది. సీమాంధ్రలో హక్కుల సాధన వుద్యమం చాలాకాలం క్రితమే ఆరంభం కావల్సివుండింది. కానీ, దాన్ని సమైక్యాంధ్ర భావుకత మింగేసింది.

  ప్రతి ఉద్యమంలోనూ సహజంగానే భావోద్వేగాలుంటాయి. ప్రజల భావోద్వేగాలని ఆచరణ సాధ్యమైన కోరికలుగా మార్చి, ఉద్యమాన్ని గమ్యానికి చేర్చడమే నాయకత్వం చేయాల్సినపని.  కేవలం భావోద్వేగాలు ఎన్నడూ ఏ ఉద్యమాన్నీ గమ్యానికి చేర్చలేవు. భావోద్వేగాలు ఆచరణాత్మక కోరికలుగా మారి, వాటికి సర్వత్రా ఆమోదాంశం లభించినపుడే అవి గమ్యం చేరుకోవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజల  భావోద్వేగాల్ని  "నీళ్ళు, నిధులు, నియామకాలు" అనే మూడు లౌకిక కోరికల రూపంలోనికి మార్చింది ఆచార్య జయశంకర్. దాన్ని గమ్యానికి చేర్చింది కేసిఆర్. ఈ సుదీర్ఘ ప్రక్రియకు తోడ్పడిన పాత్రధారులు, సూత్రధారుల జాబితా చాలా పెద్దదేవుంది.

  రాయలసీమ, తీరాంధ్ర ప్రజలకూ లౌకిక కోరికలు అనేకం వున్నాయి. విద్యా, వైద్య సౌకర్యాలు, ఉపాధికల్పన అవకాశాలు, సాగునీటి హక్కుల పరిరక్షణ మొదలయిన జాబితా చాలానేవుంది. మొదటి నుండీ రాజధాని అంశంతోసహా ఈ ఆంశాలన్నింటినీ చాలా మంది ప్రస్తావిస్తూనే వున్నారు. కానీ, హఠాత్తుగా ఎగువ నుండి సమైక్యవాదం ప్రవేశించి, లౌకిక కోర్కెల్ని తుఛ్ఛమైనవిగా కొట్టిపారేసి,  భావోద్వేగాలని రెచ్చగొట్టింది. అయినప్పటికీ ఆర్థిక అంశాల్ని చాలామంది చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూనే వచ్చారు. పైన్నుండి దిగిన సమైక్యాంధ్ర హోరులో వాళ్ళ గొంతు అణగారిపోయింది.

  సమైక్యవాదం అంటేనే తెలీని సీమాంధ్రులకు తానే దాన్ని నేర్పించానని  నిన్నమొన్నటి వరకు ఒకాయన గొప్పగా చెప్పుకునేవారు. ప్రస్తుతం వారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు కనుక వారి విషయాన్ని వదిలేసి ఈ నినాదంలోని బూటకాన్ని ఇప్పుడైనా విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. సమైక్యవాదాన్ని సీమాంధ్రులకు నేర్పాలనుకోవడమే  మొదటి తప్పు.  సమైక్యం అన్నప్పుడు అన్ని ప్రాంతాలవారినీ కలుపుకోగలగాలి ఒక ప్రాంతానికే పరిమితమైనపుడు సమైక్యానికి అర్ధమేవుండదు. అర్ధమేలేనిది ఎన్నడూ విజయాన్ని సాధించదు.   సమైక్యాంధ్ర అనడం మరో తప్పిదం. ఆంధ్ర అనే పదానికి చరిత్ర  పాఠాల్లోంచి ఉదాహరణలు చూపి ఎంత విస్తృత అర్ధాన్నైనా ఇవ్వవచ్చు.గానీ  ఉద్యమాల్లో చరిత్రకన్నా వర్తమాన అవసరాలే బలంగా పనిచేస్తుంటాయి. ఒకవైపు తెలంగాణవాళ్ళు తమ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నపుడు, మరోవైపు, కోస్తాతోకన్నా  తెలంగాణతో కలిసి రాయల తెలంగాణగా ఎర్పడడమే మేలు అని రాయలసిమవాళ్ళు  బాహాటంగా ప్రకటిస్తున్నపుడు ఆంధ్రా అనే పదం సంకుచితమైపోతుందని గమనించకపోవడం ఘోరతప్పిదం.

సీమాంధ్ర అనే పదం కూడా సమగ్ర ప్రాతినిథ్యం వహించేదికాదు. ఇందులో ఆంధ్రా ఒక్కటే నిర్ధిష్ట నామవాచకం. సీమ అనేది రాయల సీమకు మాత్రమే ప్రత్యేకంగా ప్రాతినిథ్యం వహించే పదం ఏమీకాదు. సీమ అంటే కోనసీమ కావచ్చు, పట్టిసీమ కావచ్చు, నడిగడ్డసీమ కావచ్చు రాయలసీమ కూడా కావచ్చు.  ఇంతకీ సీమాంధ్రలో సీమ అంటే రాయలసీమ అనుకుంటే ఆంధ్ర అనేది కోస్తా ప్రాంతమనేగా అర్ధం. మూడు ప్రాంతాలు కలిసికట్టుగా ఒక రాష్ట్రంగా వుండాలనుకున్నప్పుడు ఒక ప్రాంతం పేరునే మిగిలిన ప్రాంతాలకు ఎలా పెడతారూ? ఒకవైపు రాయల తెలంగాణ అంటున్నపుడు రాయల ఆంధ్రా అంటే బాగుండేది. ప్రస్తుతం  సీమాంధ్రగా పిలుస్తున్న ప్రాంతాన్ని ఇక ముందయినా  రాయలాంధ్ర అనిపిలవాలి. 1956 లో ఏర్పడిన  ఆంధ్రప్రదేశ్ పేరులో తెలంగాణకి ప్రాతినిథ్యం లేకపోవడం కూడా విభజన ఉద్యమం తలెత్తడానికి అనేకానేక కారణాల్లో ఒకటి.

  అయితే,  ఆర్ధిక, లౌకిక దృక్పథాలతోనేకాక, భావోద్వేగాలతో సమైక్యవాదాన్ని నమ్మినవాళ్ళూ తప్పకవుంటారు. దాన్ని  బూటకం అంటే వారి మనోభావాలు నిజంగానే దెబ్బతినవచ్చు.  అలాంటి వారికి ఒక మనవి. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక   ఏపి ఎన్జీవోల సంఘ నాయకులు ఏం చేస్తున్నారో గమనిస్తే చాలు ఈ నినాదం బూటకం సులువుగా అర్ధం అవుతుంది. సందట్లో సడేమియాలా, రాష్ట్రం విడిపోక ముందే అలవెన్సులతోపాటూ ఉద్యోగ విరమణ వయస్సును కూడా  పెంచుకోవాలనే ఆతృతలో ఏపి ఎన్జీవో నాయకులు  తీరికలేకుండా వున్నారు. వారం క్రితం వరకూ వాళ్ళే  సమైక్యవాదానికి "రియల్ హీరోలు" చెలామణి అయ్యారు.

  తెలంగాణలో ప్రజల ఆకాంక్షల్ని ఆ ప్రాంత నాయకులు  ఉద్యమ డిమాండుగా మారిస్తే, రాయలాంధ్రలో ఆ ప్రాంత నాయకులు తమ కోరికల్ని ఉద్యమ డిమాండుగా మార్చారు. ప్రధానంగా ఈ అంశమే విభజన, సమైక్య ఉద్యమాల భవిష్యత్తుని నిర్ణయించింది. ప్రజలు రాయాల్సిన చరిత్రను పాలకవర్గాలు రాశాయి.  పాలకవర్గాలు రాసిన చరిత్రకు అనేక వెర్షన్లు వున్నాయి. ఒక వెర్షన్ ప్రకారం ఈ కథ 2004 ఎన్నికలకు ముందు మొదలై 2014 ఎన్నికల ముందు ముగిసింది. ఇంకో వెర్షన్ ప్రకారం 2009లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి పుట్టిన రోజున ఆరంభమై, 2014లో టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ పుట్టిన రోజున ( మరీ కఛ్ఛితంగా చెప్పాలంటే ఆ మరునాడు) ముగిసింది. మూడో వెర్షన్ ప్రకారం ఈ కథ రాజకీయ నాయకునిగా మారిన సీమాంధ్ర పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ సమైకాంధ్ర భావోద్వేగాన్ని సృష్టించడంతో  మొదలై, ఆయన రాజకీయసన్యాసంతో ముగిసింది.

ప్రతి జాతినీ ఉధ్ధరించడానికి ఒక అంబేడ్కర్ పుట్టినట్టు ప్రతిజాతిలోనూ దాన్ని అప్రతిష్టపాలు చేయడానికి  "ఖాసిం రిజ్వీ" ఒకడు పుడుతుంటాడు. దురదృష్టావశాత్తు రాయలాంధ్రలో చాలామంది ఖాసీం రజ్వీలు పుట్టారు. ఆ పలితాలని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.

  విభజన ప్రక్రియ మొదలయ్యాక రాజధాని ఎక్కడ? నిధులెక్కడా? ఉద్యోగాలు ఎక్కడా? నీళ్ళెక్కడా?  అని నిన్నటి మహానాయకులంతా ఇప్పుడు అమాయిక ముఖం పెట్టి ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇంతకు ముందే ఈ ప్రశ్నల్ని అడిగినవాళ్లను  ఈ మహానాయకులే  విభజనవాదులని ముద్రవేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. "సమైక్యవాదం నినాదంకాదు; విధానం" అంటూ విరుచుకుపడ్డారు.  ఇందులో ఆసక్తికర అంశం ఏమంటే రాయలాంధ్రలో సమైక్యవాదానికి భిన్నమైన స్వరాన్ని వినిపించినవాళ్ళలో అత్యధికులు ఎస్సీ, యస్టీ, బీసీ, మతాల్పసంఖ్యాక వర్గాలవాళ్ళు.. విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశిస్తున్నపుడు అంతిమ పోరాటంగా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన మహాధర్నా వేదిక నుండి మాట్లాడుతూ,  కిషోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మీ, చింతా మోహన్‌లను క్షమించేదిలేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మణిక్యవరప్రసాద్, పీ. బాలరాజు కూడా సమైక్యవాదుల ఆగ్రహానికి గురయ్యారు. దీనినిబట్టి రాయలాంధ్రలో  సామాజికవర్గాల విభజన ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించడం కష్టం ఏమీకాదు. ఇప్పటివరకు  రాయలాంధ్రను వరకు ఏలినవారి హోరు చల్లబడింది కనుక సమీప భవిష్యత్తులో అక్కడ బలహీనవర్గాల గొంతు బలంగా వినిపించవచ్చు.

సీమాంధ్రలో ఇప్పటివరకు సాగినదానికన్నా రసవత్తరమైన  రాజకీయం ఇక ముందు వుధృతం కానుంది. వారం క్రితం వరకూ  సమైక్య ఆదర్శాన్ని వల్లించినవాళ్ళు సహితం ఇప్పుడు "తేడావస్తే రక్తపాతం సృష్టిస్తాం" అంటున్నారు. సంయుక్త తెలుగు రాష్ట్రంలో  నిన్నటి వరకు హైదరాబాద్ కోసం సాగిన యుధ్ధం ముగిసి, ఇప్పుడు రాయలాంధ్రలో రాజధాని నగరం కోసం పోరు మొదలయింది. రాయలసీమ _ కోస్తాంధ్ర ప్రాంతంలో రాజధాని నగరం అనగానే గుర్తుకు వచ్చే నగరాలు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. ఇవికాక, విస్తారమైన ప్రభుత్వ భూములున్న అనేక పట్టణల పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రతి పట్టణానికీ తనదైన చరిత్ర,, సంస్కృతి, భౌగోళిక సౌకర్యాలేకాక, రాజకీయ కోణాలు సామాజికవర్గాల సమీకరణలు వున్నాయి. కొందరయితే తిరుపతి, వినుకొండ విషయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా తమ వాదనకు వత్తాసుగా ఉటంకిస్తున్నారు. 



రాయలాంధ్రులకు హైదరాబాద్ ఒక అందమైన కలేకావచ్చుగానీ, అదినేర్పిన కొన్ని చేదు పాఠాలున్నాయి.  అభివృధ్ధి కేంద్రీకరణ సృతి మించితే, అది అసమానతలకూ వివాదాలకూ, వినాశనానికి దారి తీస్తుందని హైదరాబాద్ అనుభవం చాటిచెప్పింది. మళ్ళీ ఆ పొరపాటు జరగ కూడదు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటూ ఉత్తర సర్కారు, రాయలసీమ ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీలు రానున్నాయి. ఒక ప్రాంతంలో అభివృధ్ధి ప్యాకేజీలు, మరో ప్రాంతంలో సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇంకో ప్రాంతంలో హైకోర్టు, మరోచోట జాతీయ విద్యాసంస్థలు నిర్మిస్తే అన్ని జిల్లాలూ సమానాభివృధ్ధి సాధించేందుకు వీలుంటుంది. ఇప్పుడు రాయలాంధ్రులు ఈ దిశగా ఆలోచన సాగించాలి. "తేడాలొస్తే ఫ్యాక్షనిజాన్ని పునరుధ్ధరిస్తాం" అని రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పుడు వుంటారు. ఇప్పుడు కావల్సింది రెచ్చగొట్టే ప్రసంగాలుకాదు.; సమిష్టిగా అభివృధ్ధిని సాధించడం. మనలో చాలా మంది ఇన్నాళ్ళూ కళ్ళు తెరచి చూడలేదుగానీ అభివృధ్ధిలో కొత్తపుంతలు తొక్కగల వనరులన్నీ రాయలాంధ్ర గడ్ద మీద వున్నాయి.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

విజయవాడ
24   ఫిబ్రవరి  2014

ప్రచురణ :
ఆంధ్రప్రభ, ఎడిట్ పేజి, 26 ఫిబ్రవరి 2014


Wednesday, 12 February 2014

మైకు ముక్క, పెప్పర్ స్ప్రే


మైకు ముక్క, పెప్పర్ స్ప్రే 
కాదేది ప్రతిదాడికి అనర్హం?  

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


మైకు ముక్క, పెప్పర్ స్ప్రే
కాదేది ప్రతిదాడికి అనర్హం?

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

సాంప్రదాయబధ్ధంగానో,  సాంప్రదాయ విరుధ్ధంగానో  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు - 2013 లోక్ సభలో ప్రవేశించేసింది. ఆ  విషయం లోక్ సభ అధికారిక  వెబ్ సైట్ లో  నమోదు అయిపోయింది. ఈ బిల్లు  పుట్టుక ఏమిటోగానీ దాని ప్రతీ కదలికాలోను మార్మికత  పుష్కలంగా  విస్తరిస్తోంది. రాష్ట్ర శాసనసభలో  బిల్లు పెట్టినపుడూ ఇలాంటి గందరగోళమే  చెలరేగింది. లోక్ సభలో బిల్లుపెట్టినపుడు అది పునరావృతమైంది. అయితే, రెండు సంఘటనల మధ్య ఒక గుణాత్మక తేడా వుంది. శాసనసభలో బిల్లును పెట్టినట్టు ప్రకటించిన  అప్పటి శాసన సభావ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఇద్దరూ  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, బిల్లును   ప్రవేశపెట్టినట్టు ప్రకటించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కమల్ నాథ్,  బిల్లు ప్రవేశాన్ని ధృవీకరించిన  లోక్  సభా స్పీకర్ మీరా కుమార్ ముగ్గురూ  యూపియే ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి ఆశిస్సుల్ని  టోకుగా అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు మహాత్యం ఏమిటోగానీ దాని దెబ్బకు రాజకీయరంగం  అతలాకుతలమైపోతోంది. రాజకీయ పార్టీలు పార్టీల్లా వుండడంలేదు. రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల్లా వుండడంలేదు. దీనికి వామపక్షం, కుడిపక్షం అనే తేడాలేదు. ఏ పార్టీ అయినా ఒక్కటే. బీజేపి జాతీయ నాయకుడు యం. వెంకయ్య నాయుడిపై ఆ పార్టి తెలంగాణ శాసనసభ్యుడు యెన్నెం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు,  కమలవంశ భీష్ముడు  లాల్ కిషన్ అడ్వాణీ, రాజ్ నాధ్ సింగ్ ల మధ్య సాగుతున్న ప్రఛ్ఛన్న యుధ్ధం దీనికి తాజా ఉదాహరణైతే,  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినపుడు జరిగిన ముష్టియుధ్ధం దీనికి పరాకాష్ట.. ఎస్_కాంగ్రెస్, టి_కాంగ్రెస్  యంపీలు సోనియా గాంధి సాక్షిగా తలపడ్డారు. టీ_తమ్ముళ్ళు, ఎస్_తమ్ముళ్ళు తలపడ్డారు.

భారత పార్లమెంటు ప్రజాస్వామ్య చరిత్రలో ఫిబ్రవరి 13 బ్లాక్ డే అనడంలో ఎవ్వరికీ వీసమెత్తు అనుమానం కూడా లేదు. కానీ, ఆరోజు దాడి చేసిందెవరూ? దాడిపై  ప్రతిదాడి చేసిందెవరూ? అనే విషయంలో విభనవాదులు, సమైక్యవాదులిద్దరిదీ పొంతన కుదరని వాదన. విత్తు ముందా? చెట్టుముందా? అనేది తాత్విక సమస్య. కొందరికి చెట్టే ముందు అనిపించవచ్చు మరికొందరికి విత్తే ముందు అనిపించవచ్చు. ఎవరి దృక్పథం వారిది.  వాస్తవ నివేదిక ప్రకారం అయితే,  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతున్న సుశీల్ కుమార్ షిండేను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సీమాంధ్ర ఎంపీలు, మంత్రుల్ని తెలంగాణ ఎంపీలు, మంత్రులు అడ్డుకున్నారు. ఈ అడ్డుకోవడం శృతిమించి కొట్టుకున్నారు. ద్వంద్వ యుధ్ధాలు, ముష్టి యుధ్ధాలు చేసుకున్నారు.

మొదటి నుండీ సమైక్యవాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విజయవాడ యంపి లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు  పెప్పర్ స్ప్రేకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.   పాతికేళ్ల క్రితం రాజీవ్ గాంధి హత్యకు గురైనపుడు ఆర్డీయస్ తో పాటూ లొట్టో రన్నింగ్ షూస్ ప్రాచూర్యంలోనికి వచ్చాయి. ఇప్పుడు బ్లాక్ డే సంఘటనతో పెప్పర్ స్ప్రేకు ఎక్కడలేని ప్రచారం వచ్చింది. నిర్భయ కేసు సందర్భంగా కూడా పెప్పర్ స్ప్రేకు రానంత ప్రచారాన్ని లగడపాటి పార్లమెంటు సాక్షిగా  కల్పించారు. రాజగోపాల్ క్రీడా సంఘాల్లోనూ క్రియాశీలంగా వున్నారు. వారు పార్లమెంటులో చెడుగుడు ఆడతామని ముందుగానే ప్రకటించారు. చెడుగుడులో కూత ఆపి  పెప్పర్ స్ప్రే చల్లవచ్చని ఇక ముందు కొత్త నిబంధనలూ రావచ్చు!

తెలంగాణ డిమాండు ముందుకు వచ్చాక అనేక వివాదాస్పద విలువలు పుట్టుకు వస్తున్నాయి. తెలంగాణ తల్లి బిడ్డలమైన తాము తెలుగు తల్లిని గౌరవించాల్సిన పనిలేదని (వీలైతే అవమానిస్తామని) టీ_జేయేసి ఛైర్మన్ కోదండరామ్ ఏడెనిమిదేళ్ళ క్రితం ఒక సంచలన ప్రకటన చేశారు. దానికి తార్కిక కొనసాగింపే ట్యాంకుబండ్ పై సీమాంధ్ర మహాపురుషుల విగ్రహల విధ్వంసం. తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు అసలు భారతదేశంలో ఎందుకు కలిసుండాలి? అని ఎస్_ తమ్ముళ్ళు కొత్త ప్రశ్నను లేవనెత్తుతున్నారు. భారత దేశం నుండి విడిపోయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్,  లా కొత్త దేశం ఏర్పాటు చేసుకుని, స్వంత పార్లమెంటు పెట్టుకుంటామని కూడా వాళ్ళంటున్నారు. "తెలంగాణపై యూ_టర్న్ లేదు. పార్టీ అధ్యక్షుడిగా చెపుతున్నాను. విభజన బిల్లుకు మేము మద్దతిస్తాము" అని కుండబద్దలుగొట్టిన బీజేపి అధినేత  రాజ్ నాథ్ సింగ్ పైన కూడా వాళ్ళు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలయిన సమైక్యవాదం చివరకు దేశవిభజన వరకు చేరుకుంది. అతివాదం మితవాదం రెండూ ఒకటే అనడానికి ఇంతకన్నాగొప్ప ఉదాహరణ ఇంకేముంటుందీ?  భారత దేశం నుండి విడిపోతామని ఇంకెవరయినా ప్రకటించివుంటే కమలనాధులు ఈపాటికి ఉగ్రనరసింహులు అయిపోయేవారు. ఈసారి వాళ్ళు ఎస్_తమ్ముళ్లకు రాయితీ ఇచ్చినట్టున్నారు! వియ్యం పొందాలనుకున్నప్పుడు కొన్నింటిని సహించక తప్పదు. కొన్నింటిని వదులు కోకతప్పదు.

తొలుత వివాదాస్పందంగా కనిపించే ఇలాంటి డిమాండ్లు మారిన కాలంలో కొత్త విలువలుగానూ మారవచ్చు. తాము అణిచివేతకు గురవుతున్నామని భావించే ఏ సామాజికవర్గం కూడా ఇతర సామాజికవర్గాలను ప్రశాంతంగా వుండనివ్వదు. దానికి ఒక్కటే పరిష్కారం; అణిచివేతను అణిచివేయడం. అధికారంలో వున్నవాళ్ళకు అంతటి ఔదార్యం వుండదు. వాళ్ళు అణిచివేతను అణిచివేయడానికి బదులు అణగారిన వర్గాలని అణిచివేస్తారు.

రాష్ట్ర విభజన ఉద్యమంలో మొదటి ఘట్టంలో  జరిగిందే చివరి ఘట్టంలోనూ జరుగుతోంది. విభజనవాదుల మధ్య సమైక్యత పరిఢవిల్లుతుండగా, సమైక్యవాదుల మధ్య విభజన కొనసాగుతోంది. గురువారం లోక్ సభలో సాగిన భీభత్స ఘట్టంలోనూ, ఈ తేడా ప్రస్పుటంగా కనిపించింది. "తెలుగు ప్రజలు సమైక్యంగా వుంటే గెలుస్తారు; విడిపోతే ఓడిపోతారు అని పదేపదే చెప్పే సీమాంధ్ర నాయకులు ఆ విషయం తమకూ వర్తిస్తుందని గుర్తిస్తున్నట్టులేదు.

నాయకత్వంలో చీలిక వున్నప్పుడు ప్రజల్లో నిర్లిప్తత ప్రబలుతుంది. లోక్ సభలో తమ ప్రాంత ఎంపీల బహిష్కరణకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోల సంఘం ఇచ్చిన బంద్ పిలుపుకు సీమాంధ్ర ప్రజల నుండి నామమాత్రపు స్పందన మాత్రమే వచ్చింది. ప్రజల నిర్లిప్తత కారణంగా శుక్రవారం నాటి బంద్ కొన్ని పార్టూలు, సంఘాలు, నాయకుల సంస్థాగత వ్యవహారంగా మాత్రమే సాగింది. పైగా ఈ బంద్ లో నాయకుల మీద  కొన్ని ప్రతికూల సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఎస్ _కాంగ్రేస్ ప్రజాప్రతినిధులు తమ టీమ్ కెప్టెన్ గా భావిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను పలుచోట్ల టిడిపి నేతలు దహనం చేశారు.  కేంద్రమంత్రుల దిష్టి బొమ్మల్ని ఏయూ విద్యార్ధి జేయేసి నేతలు తగలబెట్టారు.  ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతల స్వంత జిల్లా మాత్రమేగాక, ఇటీవల జగన్ రెండు నెలలపాటు సమైక్య శంఖారావాన్ని పూరించి వచ్చిన చిత్తూరు జిల్లాలో బంద్ కు నామమాత్రపు స్పందన కూడా రాలేదు.  లోక్ సభ సంఘటనతొ పెప్పర్ స్ప్రే వీరునిగా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ స్వంత నియోజకవర్గం విజయవాడలో బంద్ పాక్షికం అనదగ్గ స్థాయిలో కూడా జరగలేదు. దీనిని్బట్టి సీమాంధ్ర నాయకుల చేష్టలతో ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల నిర్లిప్తకు మరో కారణం కూడా వుండవచ్చు. విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశించకుండా తమనాయకులు అడ్డుకుంటారని సీమాంధ్ర ప్రజలు నమ్మకంతో వున్నారు. బిల్లు లోక్ సభలో ప్రవేశించడంతో ఇక సమైక్య అధ్యాయం ముగిసిందని కూడా వాళ్ళు ఓక నిర్ణయానికి వచ్చివుండవచ్చు.

సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభ ప్రవేశం  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నిష్క్రమణకు ద్వారం తెరిచింది. . రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన  బిల్లునే పార్లమెంటులో పెడితే ముఖ్యమంత్రి పదవికి తక్షణం రాజీనామా చేస్తానని వారు భీషణ ప్రతిజ్ఞ చేసివున్నారు. పంతం కోసమే కావచ్చుగానీ, రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన  బిల్లునే కామా, ఫుల్ స్టాప్ కూదా మార్చకుండా లోక్ సభలో ప్రవేశపెట్టించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి. ఇక ముఖ్యమంత్రి తన  ప్రతిజ్ఞను పాటించడం\మే తరువాయి!

నాలుగు రోజులుగా కిరణ్ కుమార్ రాజీనామా వ్యవహారం "గోడమీద రేపు" గా  సాగుతోంది. ముఖ్యమంత్రి వికెట్టు కూడా పడేసుకుంటే వెంటనే  పిచ్ మీద స్టంపులు పీకేసి ఆట అయిపోయింది అని ప్రకటించేస్తారని ఎస్_కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు స్పష్టంగా తెలుసు. అందుకే వాళ్ళు సీయం కుర్చీని మాత్రం వదలవద్దని కిరణ్ కుమార్ ను కోరుతూ వుండవచ్చు.

సరిగ్గా ఈ సంధి దశలోనే  సీమాంధ్రలో సరికొత్త రాజకీయం ఊపిరి పోసుకునే అవకాశం వుంది. ఏందుకంటే, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు సీమాంధ్రలో తమకుతామే సమైక్య వీరులమని ప్రచారం చేసుకుంటూ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో వున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేనపుడు ప్రజల దృష్టిలో వీరులుకాస్తా, పరాజితులు అవుతారు. చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటుంది. పరాజితుల్నికాదు! పరాజితులు ముందు తాము ఓడిపోయి, తమను నమ్మినవాళ్లనూ ఓడిస్తారు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
14  ఫిబ్రవరి  2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
16   ఫిబ్రవరి  2014

రాష్ర్ట విభజనలో నాలుగు స్తంభాలాట!


రాష్ర్ట విభజన రాజకీయంలో నాలుగు స్తంభాలాట!

. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
 
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై దేశరాజధానిలో  నాలుగు స్థంభాలాట సాగుతోంది.  రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం, కాంగ్రెస్ కేంద్రకార్యాలయం, బీజేపి కేంద్రకార్యాలయంల చుట్టూ  విభజన వివాదం తిరుగుతోంది. విభజనవాదులు దీన్ని రాజకీయ అంశంగా భావించి, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపి అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ లను నమ్ముకుని ముందుకు సాగుతుంటే,  సమైక్యవాదులు దీన్ని రాజ్యాంగ ప్రక్రియగా భావించి రాష్ట్రపతి ప్రభన్ ముఖర్జీ పై వత్తిడి పెంచే పనిలో వున్నారు.
 
సీమాంధ్ర నేతల వ్యూహాలు ఎత్తుగడల్లో మొదటి నుండీ ఒక  అసంబధ్ధత కనిపిస్తూవుంది. మబ్బుల్లో నీళ్లని చూసి వాళ్ళు ముందుగా ముంత వలకబోసుకుంటారు. అవి కురిసే మబ్బులు కావని ఆలస్యంగా తెలుసుకుని, ఒకలబోసుకున్న నీళ్లను ముంతలో నింపడానికి ఇసకను పిండుతుంటారు.  అనుమానం వున్నవాళ్ళు నివృత్తి కోసం ఓ యాభై రోజులు వెనక్కి వెళితే చాలు. అంధ్రప్రదేశ్ పునర్  వ్యవస్థీకరణ బిల్లు  2013 రాష్ట్ర అసెంబ్లీకి చేరిన రోజు జరిగిన పరిణామాల్ని అప్పుడే ఎవరూ మరిచిపోయివుండరు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, కుర్చీలు విరగొట్టడాలూ, వెల్ లోనికిపోవడాలూ,  స్ఫీకర్ పోడియంను చుట్టుముట్టడాలూ, సభాకార్యక్రమాలను స్థంభింపచేయడాలు, స్పీకర్ మైకు విరగ్గొట్టడాలు ఎప్పుడూ జరిగేవే! ఆరో కొన్ని పరిణామాలు  అదనంగా కొత్తగా జరిగాయి.  సభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన బిల్లు ప్రతుల్ని కొందరు కాళ్ల కిందపెట్టి తొక్కేశారు. కొందరు. కొందరు ప్రతుల్ని చించి గాల్లోకి ఎగరేశారు, కొందరు చించిన ముక్కల్ని స్పీకర్ మొఖాన్న కొట్టారు. కొందరయితే  మీడియా పాయింట్ వద్ద బిల్లు ప్రతుల్ని తగలబెట్టారు.
 
ఇదేదో క్షణికోద్రేకంలో జరిగిన సంఘటనలు కావు. దాదాపు నెలరోజుల తరువాత జరిగే సంక్రాంతి పండగ సందర్భంగా బిల్లు ప్రతుల్ని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలని. ఏపీ ఎన్జీవోల సంఘం అగ్రనేత పరుచూరి అశోక్ బాబు పిలుపునిచ్చారు. దాన్ని చాలామంది నాయకులు ఆచరించడమేగాక, తమ పోరాటశీలతను చాటుకోవడానికి మీడియా కవరేజీని కూడా జాగ్రత్తగా చేయించుకున్నారు.
 
        సీమాంధ్రనాయకులు బిల్లు ప్రతులతో ఫుట్ బాల్, క్రికెట్ వగయిరా ఆటలు ఆడుతున్నప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లోనే శీతాకాల విడిది చేసివున్నారు. మీడియా ద్వారనే కాకుండా,  తన సిబంది ద్వార కూడా సీమాంద్ర నాయకుల చేష్టలు రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు తెలిసే వుంటాయి. అందులో ఏదైనా కొరవ వుంటే బిల్లును స్వాగతించే తెలంగాణ నేతలు  దాన్ని తీర్చు వుంటారు.
 
రాష్ట్రపతి పంపిన బిల్లుతో ఫుట్ బాల్ ఆడుకునీ, మొదాలు బిల్లే తప్పు, అందులోనూ నకిలీ అని అన్నవారికి ఇప్పుడు ఇప్పుడు పరిశుధ్ధాత్మ కలిగి,రాష్ట్రపతి అనగా రాజ్యాంగ అధినేత అని ఆదివాక్యం గుర్తుకు వచ్చింది.  రాష్ట్రపతి హైదరాబాద్ లో వున్నప్పుడు ఆయన పంపిన బిల్లును రాచి రంపాన పెట్టినవాళ్ళు, ఇప్పుడు ఆదే బిల్లును ఆపాలంటూ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.  
 
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నంత కాలం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగదని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు  ఇప్పుడు అంటున్నారు. రాజ్యాంగానికి పెద్ద దిక్కురాష్ట్రపతేననీ,  ఐదు కోట్ల సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సింది కూడాఆయనేనని మరీ చెపుతున్నారు. అంటే, అంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచే బాధ్యత రాష్ట్రపతిదే అనేది వారి భావం.  డిసెంబరుకూ  ఫిబ్రవరికీ ఎంత తేడా!
 
వివిధ సామాజికవర్గాలు రాజ్యాంగాన్నో, రాజ్యాంగంలోని కొన్ని అధీకరణాలనో  వ్యతిరేకించడం, చించిపారేయ్యడం, తగలబెట్టడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొత్తేమీ కాదు.  వెనుకబడిన తరగతులకు రాజ్యాంగంలో ఉద్దీపన సౌకర్యం కల్పించనందుకు అలనాటి అవిభక్త  మద్రాసు రాష్ట్రంలో  ఇవీ రామస్వామి నాయకర్   నాయకత్వన చాలా పెద్ద ఉద్యమం జరిగింది. వాళ్ళు రాజ్యాంగ ప్రతుల్ని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని సవరించే వరకు పోరాడారు. భారత రాజ్యాంగానికి మొదటి సవరణ వచ్చిందే ఆ ఫోరాటంవల్ల. ఆ పోరాటానికీ దిగి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 1951 మే 10 న  పార్లమెంటులో సవరణను ప్రతిపాదించగా 18 జూన్ న పార్లమెంటు దాన్ని  ఆమోదించింది. నరేంద్ర మోదీ మైకంలో హిందూ వెనుకబడిన కులాల నాయకులు ఇప్పుడు  బీజేపికి మద్దతు పలక వచ్చుగానీ, ఆ రోజు పార్లమెంటులో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించింది నేటి బీజీపికి మాతృక అయిన జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ.  అప్పట్లో వారు కాంగ్రెస్ నుండి బయటపడి జనసంఘ్  ను నిర్మించే పనిలోవున్నారు.  నెహ్రు ప్రతిపాదనను గట్టిగా సమర్ధించినవాడు బీఆర్ అంబేడ్కర్.  
 
రాష్టాన్ని సమైక్యంగా వుంచడానికి దేనికైనా సిధ్ధమేనని సీమాంధ్ర నేతలు అంటున్నారు.   ఇదొక నకిలీ సన్నధ్ధత. ఫేక్ ఎకాంప్లిస్!  రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి సీమాంధ్ర నాయకులు చేయాల్సిన పని ఒక్కటే; తెలంగాణ ప్రజల నమ్మకాన్నీ, ప్రేమనూ పొందడం. కానీ, ఆ పని ఒక్కటితప్ప వాళ్ళు ఇతర  పనులు చాలా చేస్తున్నారు.  సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రతి పనీ వాళ్లను తెలంగాణ ప్రజలకు మరింత దూరం చేస్తోంది.  ఇలాంటి అనాలోచిత చర్యల ద్వార వాళ్ళు  తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య బావోద్వేగాలను  భావోద్రేకాలుగా మారుస్తున్నారనిపిస్తోంది.
 
మనకు నచ్చినా నచక పోయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  అంటే ఓట్లు, సీట్లే!   సీమాంధ్ర నాయకుల్లో అగ్రగణ్యులయిన కిరణ్ కుమార్ రెడ్డి,  చంద్రబాబు నాయుడు, జగన్ మోహన రెడ్డి తెలంగాణ ఓట్ల మీద ఆశల్ని  ఎప్పుడో  వదులుకున్నారు. వాళ్ల దృష్టి అంతా ఇప్పుడు రాబోయే సీమాంధ్ర రాష్ట్రానికి సియం కావడం ఎట్లా అన్నదే!  కొందరికి ఇది  అతిశయోక్తిగా వుండవచ్చుగానీ  వాళ్లదగ్గర మరో మార్గం లేదు.
 
        సీమాంధ్ర రాజధానిని ఎక్కడ నిర్మిస్తున్నారో? ఎలా నిర్మిస్తున్నారో కూడా బిల్లులోనే పేర్కొనాలి. సీమాంధ్రకు ప్రకటించే ఆర్థిక ప్యాకేజీకి  ప్రణాళికా సంఘం నుంచి అనుమతి పొందాలి. పన్నులు తదితర చెల్లింపుల విషయంలో పదేళ్లపాటు కొత్త రాష్ట్రానికి రాయితీలు కల్పించాలి. హైదరాబాద్ ఆదాయ పంపిణీని స్పష్టం చేయాలి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సీమాంధ్ర విద్యార్థులు మరో పదేళ్లపాటు అక్కడ జరిగే అన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో పాల్గొనేందుకు వారిని స్థానికులుగా పరిగణించాలి. హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్స్  లో మరో పదేళ్లపాటు సీమాంధ్రులకు వైద్యసౌకర్యం కల్పించాలి. రాయలసీమకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భద్రత కల్పించాలి. వంటి అనేక డిమాండ్లు సీమాంధ్ర నేతలు చెయ్యాల్సివుంది. కానీ, వాళ్ల కాళ్ల కింది కాలం ఎప్పుడో జారిపోయింది. వాళ్ళిప్పుడు  ముందుకు పోలేరు. వెనక్కి రాలేరు! ఇదో ప్రతిష్టంభన.
 
        ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు నినాదంతో ఆంధ్రప్రదేశ్ విభజనకు తొలుత గంట కట్టిన బీజేపి ఇప్పుడు తెలంగాణతో పాటూ సీమాంధ్రలోనూ కొన్ని ఓట్లు పోగేసుకోవాలను కుంటోంది.  సీమాంధ్ర ప్రజలు కోరదలుచుకున్న ఓ పన్నెండు ఆంశాల కోర్కెల పట్టికను అది ముందుకు పెట్టింది.  తను పొందాలనుకున్న ఖ్యాతిని బీజేపి తన్నుకుపోతుంటే కాంగ్రెస్ చూస్తూ వూరుకుంటుందా?  ఊరుకోదనేదే సమాధానం! అప్పుడు బీజేపి కోరిన కోర్కెలన్నింటినీ  సీమాంధ్ర మంత్రుల నోట చెప్పించే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టనం చేస్తోంది,. ఘనతంతా కాంగ్రేశ్ కొట్టేసి, నిందలు మాత్రం తమ మీద నెట్టేస్తే బీజేపి ఊరుకుంటుందా?  

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336
 
హైదరాబాద్‌
ఫిబ్రవరి  2014
 
ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
 ఫిబ్రవరి  2014 

Tuesday, 4 February 2014

ఎన్టీవి అనుబంధం

డానీ నోట్స్
4 ఫిబ్రవరి 2014

ఎన్టీవి అనుబంధం

N-TV లో గత ఐదున్నరేళ్ల కొలువును అద్భుతంగా ఆస్వాదించా. మధురవాణి ముచ్చట్లు, లల్లూ బ్రదర్స్, నా వార్తలు నా ఇష్టంమూడూ కలిపి రెండు వేల ఎపిసోడ్ల వరకు రాశాను. మనకు రాసే నైపుణ్యం వున్నా, రాసే ఆవకాశం రావడం మహత్తర విషయం. ఆ అవకాశం కల్పించిన NTV యాజమాన్యానికి ధన్యవాదాలు.

నన్ను ఎంతగానో ప్రోత్సహించిన డైరెక్టర్ రమాదేవి మేడంగారికీ, ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరీ గారికి, దివంగత బీఎల్ రావుగారికీ కృతజ్ఞతలు. నన్ను రచనా టెలివిజన్ లో అవకాశం ఇచ్చిన ఓల్గా గారికి ప్రత్యేక ధన్యవాదాలు!

        NTV లో నా విజయాలన్నీ సంపూర్ణంగా నావికావు; మా బృందానివి.  మా క్రియేటివ్ హెడ్ అడవి శ్రీనివాస్, క్యారికేచరిస్టు స్యూర్య, యానిమేటర్ శివ, వీడియో ఎడిటర్లు శ్రీనివాసరెడ్డి, రవి, మిమిక్రీ ఆర్టిస్టులు భవిరి రవి, అయ్యంగారి వసంతలక్ష్మి తదితరులకూ,  నా మూడు కార్యక్రమాల్ని ఇన్నాళ్ళూ  పర్యవేక్షించిన ఎడిటర్ వీఎస్ ఆర్  శాస్త్రి గారికీ  bbb కృతజ్ఞతలు.


నేను బయటికి రావడానికి ప్రత్యేక కారణాలు ఏమీలేవు. ఈ మధ్య నాలోని రచయిత తీవ్ర అసంతృప్తితో వున్నాడు; వాడికి కొన్ని రచనలు చేయడం ఇష్టంలేదు. కొన్ని వాతావరణాలు పడడంలేదు. నాలాగ వాడికీ శ్వాసనాళవ్యాధి వుంది. వాడిని సంతృప్తిపరచడం కూడా నా బాధ్యత కదా! అంతే. అంతకు మించి మరేమీలేదు! 

Saturday, 1 February 2014

మూజువాణీ వ్యూహాన్ని కేంద్రమూ అనుసరిస్తే!

మూజువాణీ వ్యూహాన్ని కేంద్రమూ అనుసరిస్తే!
. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

భారత రాజ్యాంగాన్ని  మయసభ అనుకోవచ్చు. అందులో అనేక అంశాలు వున్నవి లేనట్టుగానూ, లేనివి వున్నట్టుగానూ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ శాసన సభ గురువారం  మూజువాణీ ఓటింగుతో చేసిన  తీర్మానాన్ని ప్రియదర్శిని అనుకోవచ్చు, అందులో, ఎవరికి నచ్చింది వారికి కనిపిస్తుంది. విభజనవాదులూ, సమైక్యవాదులూ ఎవరికి తోచిన అన్వయాన్ని వాళ్ళు చేసుకుని, అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ  సంబరాలు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పై రాష్ట్ర శాసన సభ అభిప్రాయాలు, సవరణలు తెలుసుకోవాలనే రాజ్యాంగ ప్రక్రియ మొత్తం ఏడువారాలు సాగి గురువారం ముగిసింది. సినిమావాళ్ళ భాషలో ఏడు వారాలంటే 50 రోజుల బొమ్మ. సినిమాల స్క్రీన్ ప్లేలకు  ఒక నిర్ధిష్ట చట్రం వుంటుంది. ఏర్పాటు, ఘర్షణ, పరిష్కారం అనే మూడు స్థూల అంకాలతోపాటూ, మిడ్ పాయింట్, పించ్ పాయింట్, ప్లాట్ పాయింట్ వంటి ఓ డజను మెలికలు అందులో వుంటాయి. ఇలాంటి సందర్భాల్లో  సిడ్ ఫీల్డ్ ను చాలామంది స్క్రీన్ ప్లే గురు అంటుంటారు. శాసనసభలో చర్చ అచ్చం సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే పారడిమ్ ప్రకారమే నడిచింది. మిడ్ పాయింట్ వరకు  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరక్కుండా సీమాంధ్ర ప్రతినిధులు అడ్డుకున్నారు. మిడ్ పాయింట్ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరణ తీర్మానంపై ఓటింగు జరక్కుండా తెలంగాణ ప్రతినిధులు అడ్డుకున్నారు. వాళ్ళు వీళ్ళు అయ్యారు. వీళ్ళువాళ్ళు అయ్యారుతప్ప యాక్షన్ ఒక్కటే! చివరకు విభజన బిల్లుపై చర్చ ముగియడమూ, తిరస్కరణ తీర్మానం ఆమోదం పొందడమూ రెండూ కొన్ని క్షణాల తేడాలో జరిగిపోయాయి.

        ఈ సినిమాలో నాటకీయ మలుపు అద్భుతంగా పండింది.  సిడ్ ఫీల్డ్ భాషలో దీన్ని ప్లాట్ పాయింట్ – 2  అంటారు. బిల్లు పేరుతో శాసనసభకు వచ్చింది చిత్తుప్రతి మాత్రమే అని ప్రకటించి కిరణ్ కుమార్ రెడ్డి పెను సంచలనం రేపారు. నేరం రుజువయ్యి శిక్షపడేంత వరకు దోషిని నిందితుడు లేదా ఆరోపితుడు అనాలి అన్నట్టు  చట్టసభల ఆమోదం పొందనంతవరకు ప్రతిపాదిత చట్టాన్ని డ్రాఫ్ట్  లేదా బిల్లు అనాలి.  డ్రాఫ్ట్ కాపీని తెలుగులో చిత్తుప్రతి, ముసాయిదా వగయిరా పేర్లతో వ్యవహరిస్తుంటారు.  దాని అర్ధం వాటికి ఎలాంటి విలువ లేదనికాదు. కేంద్ర హోంశాఖ మీద ప్రత్యక్షంగానూ, రాష్ట్రపతి మీద పరోక్షంగానూ ముఖ్యమంత్రి సంధించిన విమర్శల్లో నిజానిజాలెలావున్నా, వారు ఆశించిన సంచలనాన్ని మాత్రం అద్భుతంగా సాధించారు. మీడియాలోగానీ, రాజకీయాల్లోగానీ  సంయమనం కన్నా సంచలనాలకే ఎక్కువ ఆకర్షణ వుంటుంది.

        విభజన బిల్లు అసెంబ్లీ దశను కూడా దాటేసిందని తెలంగాణ నేతలు   సంబరాలు చేసుకుంటే,  ఏకంగా బిల్లునే తిరస్కరించేశామని సీమాంధ్ర నేతలు మిఠాయిలు పంచుకున్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు కొడుకుల తండ్రిపాత్ర పోషిస్తున్న చంద్రబాబు కూడా చాలా ఆనందపడివుంటారు, శాసనసభలో సమన్యాయ సిధ్ధాంతాన్ని వివరించాల్సిన ఇబ్బంది తప్పినందుకు. ముఖ్యమంత్రి అయ్యాక భారీ విజయాలు లేని కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా సీమాంధ్రలో సూపర్ స్టార్ అయిపోయారు. 

        ఇంతకీ ఏడు వారాల వ్యవధిలో అసెంబ్లీ సాధించిందేమిటీ? రాష్ట్ర విభజన కోసం సర్వశక్తులు పెట్టి పోరాడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒక్కరంటే ఒక్క సీమాంధ్ర ప్రజాప్రతినిధిని కూడా తమ వాదంతో ఒప్పించలేకపోయారు. సమైక్యవాదాన్ని పదేపదే వల్లించే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఒక్కరంటే ఒక్క తెలంగాణ ప్రజాప్రతినిధి మనసును కూడా దోచుకోలేకపోయారు.  దీని అర్ధం ఏమిటీ? రెండు ప్రాంతాల మధ్య మానసిక విభజన మరింత కరడుగట్టింది. తెలంగాణ ప్రజాప్రతినిధులది ఎలాగూ విభజనవాదమే కనుక ఇది వారి విజయం. ఆ మేరకు ఇది సమైక్యవాదుల పరాజయం!  

శాసన సభలో సమైక్యవాదులు మూటగట్టుకున్న పరాజయాలు అంతటితో ఆగలేదు. రాష్ట్రం విడిపోతే, నష్టపరిహారంగా సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలో ఒక్కరంటే ఒక్కరూ సభలో అడగలేదు. పోలవరం, పులిచింతల ముంపు ప్రాంతాల్ని సీమాంధ్రలో చేరిస్తే కృష్ణా, గోదావరి డెల్టా రైతులకు భద్రత వుంటుందని ఎవ్వరూ అనలేదు. రేపటి సీమాంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ స్థాయి విద్యా, వైద్య సౌకర్యాల గురించిగానీ, ఉపాధికల్పన గురించిగానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. పార్టీలకు అతీతంగా సిమాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా  చేసింది ఒక్కటే;  జీవనాధారమైన ఆర్ధిక అంశాల్ని పక్కన పెట్టి ప్రజల్లో భావోద్వేగాల్ని మరింతగా రెచ్చగొట్టడం. రాష్ట్ర విభజనను నిలిపివేసినట్టు ఒక బూటకపు ప్రచారాన్ని ఇప్పుడు వాళ్ళు ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమకు  చేసిన అన్యాయాన్ని గుర్తించడానికి సీమాంధ్ర ప్రజలకు పెద్ద సమయం పట్టకపోవచ్చు. సమీప భవిష్యత్తులోనే ప్రజల తిరస్కారాన్ని ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరూ చవి చూస్తారు. బహుశ, వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలి ఎన్నికల్లోనే దీని ప్రభావం వుంటుంది.

అసెంబ్లీకి వచ్చిన బిల్లునే పార్లమెంటులో పెట్టాలనీ, అది  ఆమోదం పొందితే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ కొత్త సవాలు విసురుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.  ఇది బొత్తిగా అర్ధంలేని సవాలు. అసెంబ్లీకి వచ్చిన బిల్లునే పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారూ? బిల్లు మీద శాసనసభలో 86 మంది మాట్లాడారు. దాదాపు శాసనసభ్యులందరూ తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించారు. ఇవికాక, బిల్లులోని వివిధ క్లాజులపై దాదాపు వెయ్యి సవరణలు, సూచనల్ని సభ్యులు  లిఖితపూర్వకంగా అందజేశారు, వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిగణన లోనికి తీసుకోకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నరని పిస్తోంది. శాసన సభలో ఏడు వారాలు సాగిన  చర్చను కేంద్ర ప్రభుత్వం పరిగణన లోనికి  తీసుకుంటే, పార్లమెంటులో  ప్రవేశపెట్టడానికి ముందు బిల్లులో అనివార్యంగా మార్పులు చేయాల్సి వుంటుంది. అది సహజ ప్రక్రియ.

బిల్లు సభకు రాకముందే ఫలితం అందరికీ తెలుసు. 119 నియోజకవర్గాల తెలంగాణ  ప్రతినిధులు బిల్లును ఆహ్వానిస్తారనీ, 175 నియోజకవర్గాల సీమాంధ్ర ప్రతినిధులు బిల్లును వ్యతిరేకిస్తారనీ. ఒకరిద్దరు సభ్యులు తప్ప మిగిలినవారందరూ ముందుగా ఊహించినట్టే ప్రవర్తించారు.  రాష్ట్రాన్ని కలిపివుంచడంపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మధ్య చెప్పుకోదగ్గ చీలిక వచ్చినా,  రాష్ట్రాన్ని విభజించడంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల మధ్య చెప్పుకోదగ్గ చీలిక వచ్చినా ఫలితాలు మారేవేమో. గానీ, శాసనసభ్యులందరూ తమ ప్రాంతపు భావోద్వేగాలకే కట్టుబడివున్నప్పుడు  ఫలితంలో మార్పు వచ్చే అవకాశాలు లేవు.

ప్రజాస్వామ్యం అంటే సంఖ్యాబలమే కనుక,  119కన్నా 175 పెద్ద సంఖ్య కనుక విజయం తమదే అని సీమాంధ్ర నాయకులు కొందరు అతి ఉత్సాహంతో వున్నారు.  వివాదం వచ్చినపుడు సంఖ్యాబలాన్ని అలా చూడరు. వివాద ప్రాంతంలో సంఖ్యాబలాన్ని మాత్రమే చూస్తారు. అలా చూస్తే తెలంగాణ ప్రాంతంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఒక్కరు మాత్రమే మాట్లడారు. వారు కూడా విభజన అనివార్యం అన్నారు. ఆ ప్రాంతపు మిగిలిన సభ్యులందరూ విభజనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  అదే అంతిమ ప్రమాణం! 

చివరి బంతిని కిరణ్ కుమార్ భారీ షాట్ కొట్టి సోనియా మూతి పగులగొట్టారని ముఖ్యమంత్రి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కిరణ్ కొట్టిన షాట్ తమకు అనుకోని వరమని కాంగ్రెస్ అధిష్టానం కూడా  ఆనందిస్తోందని వారికి తెలిసి వుండకపోవచ్చు. రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన మూజువాణీ వ్యూహాన్నే రేపు  పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు బిల్లును ఆమోదింప చేసుకోడానికి యూపియే  ఛైర్  పర్సన్ సోనియా గాంధి అనుసరించినా ఆశ్చర్యపడాల్సిన ఆవసరం లేదు. పైగా, శాసనసభలో ఇప్పుడు సీమాంధ్ర ప్రతినిధులు వ్యవహరించిన తీరు కాంగ్రెస్ అధిష్టానం రేపు పార్లమెంటులో అనుసరించే వ్యూహానికి నైతిక సమర్ధన ఇస్తుంది.


 (రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
1 ఫిబ్రవరి  2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

1 ఫిబ్రవరి  2014

Saturday, 25 January 2014

ఒక మంచిసినిమా – ఒక చెత్త సినిమా!

ఒక మంచిసినిమా ఒక చెత్త సినిమా!
. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్ని ముఫ్పయ్యేసి సార్లు చూసేవారట నిన్నటితరపు మరో హీరో కృష్ణంరాజు. మంచి సినిమాను చూసేకొద్దీ  రసాస్వాదన పెరుగుతుంది.  ప్రతిసారీ అంతకు ముందు మనం గమనించని అనేక సునిసిత అంశాలు ఆవిష్కారం అవుతుంటాయి.

తెలుగు వెండి తెరపై యన్టీ రామారావు ప్రచండభానుడిగానూ, అక్కినేని నాగేశ్వరరావు వెండి వెన్నల జాబిలిగానూ వుండేవారు.  దాని అర్ధం యన్టీ రామారావు సాత్వికపాత్రల్నీ,  అక్కినేని నాగేశ్వరరావు రౌద్రపాత్రల్నీ పోషించలేరనికాదు. కానీ, వాళ్ళిద్దరి ఆహార్యానికి అవి అంతగా నప్పేవికావు.

        అక్కినేని మా అమ్మమ్మకు బాలరాజు; మా అమ్మ, నాన్నలకు నాగేశ్వరరావు; మా తరానికి ఏఎన్నార్. 1964లో నరసాపురం పరిసరాల్లో మూగమనసులు సినిమా తీశారు. అందులో హీరో అక్కినేని. ఆ సినిమా  చాలా పెద్ద హిట్టు.  అలా ఆయన గోదావరినదికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అంతకు ముందు సినిమాల్లో గోదావరి వుందోలేదోగానీ,  మూగమనసులు తరువాత గోదావరి తీరం అనేది  తెలుగు సినిమా రంగంలో పెద్ద హిట్టు ఫార్మూలా అయిపోయింది.

1969 సంక్రాంతికి విడుదలైన అదృష్టవంతులు సినిమాలో అయ్యయ్యో బ్రహ్మయ్య పాటలో అక్కినేని నేరో కట్ ట్రౌజర్ లో కనిపించి ఆనాటి యువతరాన్ని షేక్ ఆడించారు. కాలేజీ జీవితాన్ని గడుపుతున్న  మాతరం అంతా ఆ పాట మైకంలో దర్జీ దుకాణాలకు పరుగులు పెట్టి పాత గొట్టం ప్యాంటుల్ని ఆల్టర్ చేయించుకోవాల్సి వచ్చింది.

ప్రేక్షకుల మీద మహానటుల ప్రభావం కేవలం చొక్క, ప్యాంటు, హెయిర్ స్టైల్, సిగరెట్టు pogaపొగ రింగులు వదలడానికే పరిమితంకాదు. అది అంతకు మించిన ఒక ఉన్నత సంస్కృతిని ప్రమోట్ చేస్తుంది. వెండితెర మీద భగ్నప్రేమికుడ్ని అక్కినేని అద్భుతంగా ఆవిష్కరించారు.  రొమాంటిక్ హీరో ఇమేజ్ ను కొనసాగిస్తూనే ట్రాజెడీ కింగ్ అనిపించుకోవడం  సాధారణమైన విన్యాసంకాదు.  అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలి అనేదానికి మా తరానికి అక్కినేనియే ప్రమాణికం. నిజజీవితంలో డోంట్ కేర్గా వుండే యువకులు సహితం అమ్మాయిల విషయం రాగానే చాలా సున్నితంగా మారిపోయేవారు. విఫలప్రేమికులు సహితం ప్రియురాలి పెళ్ళికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పివచ్చేవారు. మిత్రుల మధ్య అదొక వున్నత విలువగా కొనసాగేది. మా తరంలో ప్రేమనగర్ సినిమా ప్రభావం ఆ స్థాయిలో వుండేది.

గొప్ప నటులు, గొప్ప సినిమాల గురించి చెప్పుకున్నాక, చెత్త నటులు, చెత్త సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇబ్బందిగానే వుంటుంది. చెత్త సినిమాను ఒక్కసారి చూడడం కూడా శిక్షగానే వుంటుంది. చెత్త సినిమాను ఎవరైనా  శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలతో పోల్చారోలేదోగానీ, పోల్చినా తప్పుకాదు. 

        వైయస్ విజయమ్మగారికి నెల రోజులుగా తీరని సందేహం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు – 2013పై  చర్చ మాత్రమే వుంటుందా? ఓటింగు కూడా నిర్వహిస్తారా? వారికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎప్పటికీ సమాధానం చెప్పరు. ఈ పునరుక్తి దోషాన్ని మనం ఇప్పటికే డజన్ల సార్లు ఛుశాం. ఈ నెలాఖరు వరకు చూడకతప్పకపోవచ్చు.

హిచ్ కాక్ సినిమా అనుకుంటాను. ఒకమ్మాయి దుస్తులన్నీ తీసేసి స్విమ్మింగ్ పూల్ లోనికి దూకుతుంది. సరిగ్గా ఆమె చివరి కాస్ట్యూము తీసే సమయానికి ఒక కారు అడ్డం వస్తుంది. ఆ సినిమాని ఒక ప్రేక్షకుడు వరుసగా నెల రోజులు చూశాట్ట. ఆ అమ్మాయి ఒక్కసారయినా కారు రాకముందే దూకకపోద్దా? లేకపోతే, కారు వెళ్ళిపోయాక  అయినా దూకకపోద్దా? అని. తెలుగు టివీ న్యూస్ ఛానళ్లలో శాసనసభా ప్రత్యక్ష ప్రసారాలు చూసేవాళ్ళు ఆ హిచ్ కాక్ సినిమా ప్రేక్షకునికన్నా భిన్నమైనవాళ్ళేమీకాదు. విజయమ్మగారికి కొత్త సందేహం వస్తుందేమోననీ,  పాత నిర్ణయాలకు మాండేట్ రాలేదు కనుక చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకుంటారేమోననీ, జగన్ సమైఖ్య శంఖారావం  చిత్తూరు జిల్లా దాటుతుందేమోననీ,  కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒక క్షణాన్న కొత్త పార్టీని ప్రకటిస్తారేమోనని, సీమాంధ్ర  సభ్యులు ఇప్పుడైనా  భారీ ప్యాకేజి అడుగుతారేమోనని, తెలంగాణ సభ్యులు కొంచెమైనా మెతకబడతారేమోనని వాళ్ళు కళ్లప్పగించి, టీవీలకేసి  చూస్తుంటారు. 
తల్లిదండ్రులు ఏది ఇచ్చినా పిల్లలు కింద పడేసుకుని, మళ్ళీ అదే కావాలని మారాం చేస్తుంటారు. క్రిస్మస్, న్యూయియర్, సంక్రాంతి పేరున శెలవులు ఆస్వాదించి, జాతి చరిత్రలో అత్యంత ప్రాణప్రదమైన సమయాన్ని నిర్లక్ష్యంగా వృధాచేసిన  సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బిల్లుపై చర్చకు మరింత గడువు అడగడం పిల్లచేష్టకన్నా భిన్నమైనదేంకాదు. బహుశ సొమవారం నుండి శాసన సభలో కొత్త అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. కొత్త అధ్యాయం అన్నంతమాత్రాన అది  ప్రగతిశీలమైనది అయిపోనక్కరలేదు. బిల్లుపై చర్చ జరగకుండానే  వచ్చేవారం కూడా గడిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చర్చకు వ్యవధి మరింత పెంచాలని  సీమాంధ్ర నేతలు మరోవారం రోజులు భీకరపోరు చేయవచ్చు. ఈసారి రాష్ట్రపతిని కూడా టార్గెట్ చేయవచ్చు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం ( ఎక్స్ పెడైట్) చేయడానికి వీలుగా శాసనసభలో చర్చను త్వరగా ముగించాలని గడువు పెంపు ఉత్తర్వుల్లో రాష్ట్రపతి  పేర్కొనడం కొత్త వివాదానికి కావలసినంత ఇంధనాన్ని సరఫరా చేసింది.

ఏపీఎన్జీవోలు భారీగా ప్రచారం చేసిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రతిరోజూ ఇందిరాపార్క్ వద్ద జరిగే అనేకానేక నిరసన కార్యక్రమాల్లో ఒకానొక కార్యక్రమంగా మిగిలిపోయింది. ఎన్జీవోలు తమ కోర్కెల్ని  నెరవేర్చుకున్నాక వాళ్లలో పూర్వపు విద్యుత్తు కనిపించడంలేదు. రాజు తిరుగుబాటు చేయడం రాజ్యాంగబధ్ధమేనా? అంటూ కేజ్రీవాల్ ధర్నాపై ఎంయల్ శర్మా అనే న్యాయవాది ఈమధ్య సుప్రీంకోర్టులో ప్రజాహిత వాజ్యం వేశారు. రాజాస్థాన ఉద్యోగులు చేసే తిరుబాట్లు కూడా ఈ కోవలోనికే వస్తాయి!  

 ఇందిరాపార్కు అయినా, శాసనసభ అయినా సీమాంధ్ర ప్రతినిధుల వ్యవహారశైలిలో పెద్దగా మార్పులేదు. సమైక్యతా  సమగ్రతా  తమ  నినాదం,  విధానం అనేవాళ్ళు సభలో ఎలా  ప్రవర్తించాలీ? విభజన కోరేవాళ్లను నచ్చచెప్పాలి.  ఒప్పించాలి. బతిమాలాలి. బుజ్జగించాలి. అలా కాకుండా కాలుదువ్వితే ఏమవుతుందీ? విభజన ప్రక్రియ మరింత వేగం అవుతుంది. ఈపాటి ధర్మసూక్ష్మం తెలిసినవాళ్ళు కూడా మనకిప్పుడు రాజకీయాల్లో కనిపించడంలేదు. రాష్ట్రాన్ని విభజించాలనుకునేవాళ్ళూ,  రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలంటున్నవాళ్ళూ ఒకే విధంగా కాలుదువ్వుతున్నారు.  సంభాషణల్ని సినిమావాళ్ళే రాస్తున్నారో మరొకటోగానీ, మన ప్రతినిధులు ఈ మధ్య సినిమా డైలాగులు విపరీతంగా వాడుతున్నారు. 

చాలా కాలంక్రితం చదివిన అల్పిక. కొడవటిగంటి కుటుంబరావుగారిది అనుకుంటాను. బక్కపల్చగావున్న హింసావాది, బాగాబలిసిన అహింసావాది తలపడతారు. ఆ పోరులో హింసావాది చనిపోతాడు. "హింసావాదం చనిఫోయింది. అహింసావాదం గెలిచింది". అని అహింసావాది  విజయగర్వంతో అరుస్తాడు.  సేవ్ ఆంధ్రప్రదేశ్ ధర్నా శిబిరం వద్ద  "ఎవడి దెబ్బ తగిలితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే సమైక్యవాదిడైలాగ్ విన్నప్పుడు  ఎవరికైనా కోకు అల్పిక గుర్తుకు వచ్చివుండాలి. కత్తి మొన మీద సమైక్యతను సాధించడానికి కొందరు ఉత్సాహంగా వున్నట్టున్నారు!.  ఎక్కడో ఒకచోట  విభజన ప్రక్రియకు  దైవికంగా బ్రేక్ పడుతుందనే ఒక విశ్వాసం  కొందరు సమైక్యవాదుల్ని నడిపిస్తున్నట్టుంది.

        రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సీమాంధ్రులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నింగ్  ను ఈ వారం చూడగలిగాం. వారు క్రీజు లోనికి దిగడానికి ముందు సుదీర్ఘ ప్రాక్టీస్ చేశారని ఎవరికైనా అర్ధం అవుతుంది.  అయితే, వారు సుదీర్ఘ ఇన్నింగ్  ఏమీ ఆడలేదు.  లగడపాటి రాజగోపాల్ ఊరించినట్టు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించలేదు. కొన్నిసార్లు భారీ షాట్ల కోసం కు ప్రయత్నించి, బ్యాటును గాల్లోకి లేపారుగానీ బంతిని మాత్రం ఆశించినట్టు పెవిలియన్ కప్పు పైకి పంపలేకపోయారు. అయితే, వారు వచ్చే వారం మరో ఇన్నింగ్ ఆడే అవకాశాలు కూడా వున్నాయి. అప్పుడు బ్యాట్ ను ఝళిపిస్తారని అనుకోవచ్చు.

తొలి ఇన్నింగ్స్ లో కిరణ్ కుమార్ తీసిన పరుగులు పెద్దగా లేకపోయినా, స్వంత టీమ్ నుండి మంత్రులు డొక్క మాణిక్యవరప్రసాద్, పసుపులేటి బాలరాజు  భిన్న స్వరాన్ని అందుకోవడం వారికి పెద్ద దెబ్బే. వరప్రసాద్, బాలరాజు ఇద్దరూ అణగారినవర్గాలకు చెందినవారు. సీమాంధ్రలో  బలహీనవర్గాలు భిన్నంగా ఆలోచిస్తున్నారు అనడానికి ఇది సంకేతం అయితే, ఈ సంకేతాన్ని తక్కువగా చూడడానికి వీల్లేదు.

తొలి ఇన్నింగ్ ముగిశాక ఢిల్లీ బహుత్ దూర్ హై అంటూ  కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్ చరిత్రాత్మకమైనది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో యన్టీ రామారావు ముప్ఫయి యేళ్ల క్రితం కేంద్ర మిధ్యా అన్నారు. దానికి ఏమాత్రం తగ్గనిది ఇప్పటి కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్! ఇలాంటి వాదాలు  విస్తృతంగాసాగి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించగలిగితే ఫెడరల్ విలువలు పెరగడానికి దోహదపడవచ్చు!

మనకిప్పుడు శాసనసభలో కళ్ళకు కనిపిస్తున్న ఒక వైచిత్రి కొనసాగుతోంది.   సమైక్యతావాదులు అనైక్యతారాగాన్ని ఆలపిస్తుంటే, విభజనవాదులు సమైక్యతారాగాన్ని ఆలపిస్తున్నారు.  రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ వుండేవే. ఆ అంశాన్ని పక్కన పెడితే, ఆధునిక శాసనకర్తలు ఎలా వుండాలో ఈవారం అక్బరుద్దీన్ ఒవైసీ, కేటిఆర్ చాటిచెప్పారు. వాళ్ళు చెప్పిన అభిప్రాయాల మీద సీమాంధ్రుల్లో కొందరికో అందరికో భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. అయినప్పటికీ, పరిశోధన, సంసిధ్ధత, సమర్పణ లేనిదే ఎవరూ శాసనసభలో రాణించలేరని వారిధ్ధరూ నిరూపించారు. ప్రస్తుతం మనకు సీమాంధ్ర నుండి శాసనసభలో సభ్యత్వం పొందినవాళ్ళున్నారుగానీ  శాసనకర్తలులేరంటే ఎవరూ బాధపడాల్సిన పనిలేదు!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
25  జనవరి 2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

26    జనవరి  2014

Saturday, 18 January 2014

గడువు పొడిగించే వ్యూహం

గడువు పొడిగించే వ్యూహం 

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

సింగితం శ్రీనివాసరావు సినిమా ఆదిత్య_369 లో కథానాయకుడు బాలకృష్ణ టైమ్ మిషన్ లో ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి చేరుకుంటాడు. అక్కడ జరిగే ప్రతీ విషయం కథానాయకునికి ముందుగానే తెలిసిపోతుంటుంది. జరిగే విషయాలను ముందుగానే పసిగట్టడానికి టైం మిషన్లు అఖ్ఖరలేదు. కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలకు కారణమైన హేతువునూ, చర్యప్రతిచర్యల్నీ, వివిధ సంఘటనల మధ్య అన్యోన్యసంబంధాన్నీ గుర్తించగలిగితే జరగబోయే పరిణామాల్ని కచ్చితంగా కాకపోయినా కొంచెం అటుఇటుగా అయినా  పరికల్పన చేయవచ్చు. ఇదేమీ జ్యోతిష్యంకాదు. సామాజికశాస్త్రం. ప్రకృతి శాస్త్రానికీ, సామాజికశాస్త్రానికీ ఒక తేడా ఏమంటే  ప్రకృతిశాస్త్రాల్లో ఫలితాన్ని కఛ్ఛితంగా అంచనావేయవచ్చు. సామాజికశాస్త్రాల్లో ఫలితాన్ని ఊహాగానం మాత్రమే చేయగలం. పరిణామం అలాగే వుండవచ్చు లేదా స్వల్పమార్పులు వుండవచ్చు.

ఎవరైనా చనిపోగానే కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా భోరున ఏడుస్తారు. ఇరుగుపొరుగు వచ్చి వాళ్ళు ఏడుస్తూ, వీళ్లను ఓదారుస్తారు. అరగంట తరువాత అందరి ఏడ్పులు ఆగిపోతాయి. బంధువులు చొరవచేసి మృతుని కుటుంబ సభ్యుల్ని ఏదైనా తినమని బతిమాలుతారు. ఆ సమయంలో, మృతునితోపాటూ తాము కూడా చనిపోదామనే భావోద్వేగంలోవున్నకుటుంబసభ్యులు ఆహారాన్ని నిరాకరిస్తారు.  ఒకటి రెండు గంటల తరువాత  పిల్లలకు పాలు పట్టించడంతో మళ్ళీ ఆహార కార్యక్రమం మొదలవుతుంది.  వాతావరణం నిశ్శబ్దంగా వుంటుంది. శవం అంతిమ యాత్ర మొదలవుతుంది. కుటుంబసభ్యులు,  బంధుమిత్రులు ఒక్కసారిగా భోరున ఏడుస్తారు.  శవానికి అంత్యక్రియలు జరిపి మగవాళ్ళు తిరిగివస్తారు.  మళ్ళీ ఏడ్పులు. మళ్ళీ నిశ్శబ్దం.  మరో రెండు గంటల తరువాత ఎవరో దయగలవారు భోజనం వండి పంపిస్తారు. ఈసారి కుటుంబ సభ్యులు సహితం ఎంగిలిపడతారు. మరునాడూ ఏడ్పులు, నిశ్శబ్దంతో గడుస్తుంది. ఆ తరువాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు.  దీనికి స్క్రిప్టు, దర్శకత్వం ఏదీ వుండదుగానీ ఎవరైనా చనిపోయినపుడు అందరి ఇళ్లలోనూ దాదాపు ఇలానే జరుగుతుంది. కొన్ని పనులు తధ్ధర్మక్రియలా జరిగిపోతుంటాయి.  ఇదే గ్రాండ్ నేరేటివ్స్!  

శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు_2013 పై  చర్చ సాగుతున్న తీరు గ్రాండ్ నేరేటివ్స్ కు చక్కటి తాజా  ఉదాహరణ. సభ ప్రారంభంకాగానే అన్ని పార్టీల సభా నాయకులు వాయిదా తీర్మానాలు ప్రవేశపెడతారు. స్పీకర్ వాటిని తిరస్కరిస్తారు. బీయేసీలో  నిర్ణయించిన ప్రకారం పోదాం అంటారు. సభ్యులు వినరు. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టుతారు.  సభా కార్యక్రమాల్ని స్థంభింపచేస్తారు. స్పీకర్ సభను అరగంట వాయిదా వేస్తారు. అరగంట తరువాత వైయస్సార్ సిపి సభానాయకురాలు వైయస్  విజయమ్మ సభలో ముందు ఓటింగ్ జరిపి తరువాత చర్చ మొదలెట్టాలంటారు. స్పీకర్ కుదరదంటారు. దానికి నిరసనగా ఆరోజుకు వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి విజయమ్మ వెళ్ళిపోతారు. ఆ తరువాత విభజనవాదులు, సమైక్యవాదులు తమ తమ ప్రసంగాలు మొదలెడతారు. పురాణగాధలు, తమ గురించిన అతిశయోక్తులుతప్ప,  ప్రత్యర్ధుల్ని సహితం ఒప్పించే ప్రయత్నం  అందులో ఏ కోశానా వుండదు.

సీమాంధ్ర టీం కెప్టెన్లలో జగన్  సమయం అంతా చిత్తూరుజిల్లాలో  స్పెషల్ ప్రాక్టీసు చేయడానికే సరిపోతోంది.  వారు వాటర్ బాయ్ ద్వార టీం మెంబర్సుకు  మార్గదర్శకాలు పంపగలరుగానీ, బ్యాటు పట్టి శాసన సభలో బ్యాటింగ్ విన్యాసాలు చేయలేరు. ఇక్కడ శాసన సభలో జగన్ టీం వైస్ కెప్టెన్ వైయస్ విజయలక్ష్మీ ప్రతిరోజూ  రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరుగుతున్నారు. టీంలో ఎంతమంది వున్నారో కూడా వారికి అంచనా లేనట్టుంది.  సభలో వారి నిస్సహాయతను చూసి ఎవరికైనా జాలి వేస్తుంది.

సీమాంధ్ర మరో కెప్టెన్ చంద్రబాబు ఒకే సమయంలో తెలంగాణ టీంకు కూడా కోచ్ గా వ్యవహరిస్తున్నారు.  ద్వంద సభ్యత్వం కారణంగా  వారు ప్యాడ్లు కట్టుకుని బ్యాటు పట్టుకుని మైదానంలోనికి దిగే అవకాశాలు చాలా తక్కువ.  "కీప్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్స్" అనేది  పేకాటలో  మంచి వ్యూహమేగానీ, తన ముక్కలు తానే చూసుకోలేని పరిస్థితి చంద్రబాబుకైనా చిత్రమైన విషాదమే!

సీమాంధ్ర తాజా కెప్టెన్  కిరణ్ కుమార్ రెడ్డి, బ్యాటింగ్ విన్యాసాలు మనకు తెలీనప్పటికీ, ఇప్పటికైతే వారు  ప్రత్యర్ధులతో బ్రహ్మాండంగా మైండ్ గేమ్ అడుతున్నారు.  ఏరికోరి తెచ్చుకున్న సాకే శైలజానాథ్ ను ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా  పంపి తన తెలివిని ప్రదర్శించారు.  కెప్టెన్ ఆదేశాల ప్రకారం  శైలజానాధ్   వికెట్ల ముందు పాతుకుపోయే ప్రయత్నం విజయవంతంగా  చేసినప్పటికీ స్పోర్ట్స్ మీడియా దృష్టిలో మాత్రం  నైట్  వాచ్ మన్ అనిపించుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లోనే బ్యాట్ తో ప్రత్యర్ధులకు సమాధానం చెపుతాను అని కెప్టెన్ కిరణ్ చేసిన ప్రకటన కూడా శైలజానాధ్ ను  నైట్  వాచ్ మన్ గా మార్చాయి.  అయితే, మ్యాచ్ ముగిశాక  శైలజానాథే తమ ప్రధాన బ్యాట్స్ మన్ అని కెప్టెన్ ప్రకటించడం వేరే విషయం!

బ్యాటింగ్ లోనూ అతివాదులు, మితవాదులు వుంటారు. యువరాజ్ సింగ్, మహెందర్ ధోనీ భారీ యాక్షన్ తో బంతిని కసితీరా కొట్టి బౌండరీలు దాటిస్తారు. అజహరుద్దీన్, వీవీఏస్ లక్ష్మణ్ వంటివాళ్ళు మణికట్టు మాయాజాలంతో  సుతారంగా బంతి దారి మళ్ళించి  బౌండరీలు సాధిస్తారు. సభలో శైలజానాధ్ భారీ షాట్లకు ప్రయత్నించారుగానీ,  టెక్నిక్  లేమివల్ల  బంతుల్ని మాత్రం బౌండరీలు దాటించలేకపోయారు.

శైలజానాధ్ తొలిరోజు ఆటలో కొన్ని చూడ ముఛ్చటైన షాట్లున్నాయి.  అవిభక్త హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అప్పటి గజ్వేల్ ఎమ్మెల్యే  వాసుదేవ్ ఇచ్చిన ఆర్ధిక నివేదికని ప్రస్తావించడం అందులో ఒకటి.  వ్యవసాయరంగ అభివృధ్ధి గురించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యనేకాదు, సీమాంధ్రలో రాయలసీమ, తీరాంధ్ర మధ్యన కూడా అపోహలున్నాయి. 1956లో అంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి తెలంగాణ, తీరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నీటిపారుదలా సౌకర్యంవున్న వ్యవసాయ భూముల విస్తీర్ణం వివరాలు ఇప్పుడు కావాలీ? శైలజానాధ్ చెపుతున్న గణాంకాల ప్రకారం అంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక  తెలంగాణలో సాగునీటి సౌకర్యం 15 నుండి 20 శాతం వరకు పెరిగింది. ఈ స్థాయిలో, తీరాంధ్ర, రాయలసీమల్లో సాగునీటి సౌకర్యం  పెరిగిందా? అన్నది సమంజసమైన ప్రశ్నే!

వీర తెలంగాణ పోరాటం గురించి దళితులకు తెలిసినట్టు దొరలకేం తెలుసూ? గడీలకేం తెలుసూ? అంటూ శైలజానాధ్ తాను మాత్రమే విసరగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఇలాంటి షాట్ ను మనం బహుశ కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగులో కూడా చూడలేకపోవచ్చు. అయితే,  శైలజానాధ్ మరో వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం వుంది.  అంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అభివృధ్ధికి నోచుకోని ప్రాంతాల్లో వర్గపొరాటాలు మొదలవ్వడం, నీటిపారుదలా సౌకర్యం సమృధ్ధిగా వున్న ప్రాంతాల్లో కులపోరాటాలు తలెత్తడం ఒక ధోరణిగా సాగుతోంది. కంచికచర్ల కోటేశు, కారంచేడు, చుండూరు, పిప్పర, పాదిరి కుప్పం, వేంపెంట, లక్ష్మీపేట తదితర అమానుషదాడులన్నీ సీమాంధ్రప్రాంతంలోనే జరిగాయి.  దళితులపై దాడులు తెలంగాణలో సాపేక్షంగా తక్కువ.

శైలజానాధ్ వాదన పటిమను ప్రదర్శించే అవకాశం ఆయనకూ, చూసే అవకాశం . మనకూ దక్కడం గొప్ప విషయమే. అయితే, తెలుగువాళ్లను విభజించడానికి  జరుగుతున్న కుట్రను అడ్డుకోవడానికీ  తాము పోరాడుతున్నామని చెప్పిన శైలజానాధ్ ఆ పోరాటానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రం శూన్యం, పైగా, ఆయన ఉపన్యాసంలో టెక్నిక్ లోపించడంవల్ల తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని మరింత రెచ్చగొట్టింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని నచ్చచెప్పడంకన్నా, రెచ్చగొట్టడమే సీమాంధ్రలో తనకు భారీ రాయితీలు తెచ్చి పెడతాయని శైలజానాథ్ అనుకుంటె అదివేరేవిషయం!

చట్ట సభల్లో టెక్నిక్ అంటే ఏమిటీ?  అనేది యక్ష ప్రశ్న. వాదన ముఖ్యమా? కార్యసాధన ముఖ్యమా? అనేది అంతకన్నా క్లిష్ట సమస్య!  మన అభిప్రాయాల్ని బలంగా చెప్పడం వాదన. కరడుగట్టిన ప్రత్యర్ధులు కూడా మన అభిప్రాయాలతో  ఏకీభవించేలా చేయడం కార్యసాధన. ఎప్పుడైనా నాయకునికి వాదనకన్నా కార్యసాధన ముఖ్యం.

శాసనసభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అనుసరుస్తున్న వ్యూహాలు, ఎత్తుగడల్ని చూస్తే ఎవరికైనా సులువుగానే ఒక విషయం అర్ధం అవుతుంది. వీళ్ళు రాష్ట్ర విభజననను ఎలాగూ అడ్డుకోలేరు. విభజన సంధర్భంగా సీమాంధ్రకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల్నీ సాధించలేరు. ఆ మేరకు సీమాంధ్రకు తీరని అన్యాయం చేస్తారు. వాళ్ళు గెలవడం కోసం యుధ్ధం చేయడంలేదు.  ఘోరంగా ఓడి ప్రజల సానుభూతి సాధించే దగ్గరదారుల్ని వెతుక్కుంటున్నారు. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల గేటు ముందు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నిస్తున్నదీ  సానుభూతి రాయతీల కోసమే!  గ్రాండ్ నేరేటివ్స్ గురించి కనీస అవగాహన వున్నా రేపు జరగబోయేది ఊహించడం కష్టంకాదు.

ఒకవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేసిఆర్ అప్పుడే కసరత్తు మొదలు పెట్టేశారు. టీఆర్ ఎస్ అగ్రనేతలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి న్యాయకోవిదుల్ని కలిసి రాజ్యాంగపరమైన చిక్కుల్ని అధిగమించేమార్గాలపై చర్చిస్తున్నారు.    

మరోవైపు, రాష్ట్రపతి పంపిన ముసాయిదా రాష్ట్రానికి వచ్చి నెల రోజులు దాటినా సభలో చర్చ జరిగింది ఒక్కరోజే!   వాదనతో కాకుండా సాంకేతిక కారణాలతో  రాష్ట్ర పునర్విభజన బిల్లును అడ్డుకోవాలని భావిస్తున్న సీమాంధ్ర నేతలు బిల్లుపై చర్చకు మరి కొంతకాలం గడువుకోరాలని భావిస్తున్నారు. ప్రశ్నలన్నింటికీ సమగ్రంగా సమాధానం  రాయగల సమర్ధులు పరీక్షహాల్లో  పది అడిషన్ షీట్లు అడిగి తీసుకున్నా అర్ధం వుంది. ప్రశ్నాపత్రం అర్ధంకాక,  ఏం చేయాలో తోచక మూడుగంటలు గడిపేసినోళ్ళు  కూడా చివరి నిముషంలో  పది అడిషన్ షీట్లు అడిగితే అర్ధం ఏమిటీ?


(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
18 జనవరి 2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
19    జనవరి  2014