Saturday 31 May 2014

Brand Andhra

బ్రాండ్ ఆంధ్రా
ఉషా యస్ డానీ

వరాలన్నీ వరాలూకానట్టే శాపాలన్నీ శాపాలుకావు. కొన్నిశాపాలు వరాలుగా మారుతాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలు రాష్ట్ర విభజనను ఇప్పుడు వరంగా మార్చుకునే దిశలో ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఇటీవలి జమిలి ఎన్నికలు గతాన్ని మరిచిపోయి రాష్ట్ర పునర్ నిర్మాణనికి అద్దం పట్టాయి. సీమాంధ్రులు ఇంత త్వరగా కోలుకుని నూతన ఉత్సాహంతో నడుం బిగిస్తారని చాలా మంది అనుకునివుండరు. వాళ్లను ఓదార్చాలనుకున్నవాళ్లనే ఓదార్చేంతగా వాళ్ల మనోధైర్యం ఎదిగిపోయింది.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల నాయకత్వంలోని యూపియే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్  పునర్  వ్యవస్థీకరణకు సిధ్ధమైనపుడు రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో రాజకీయ సునామీ చెలరేగింది. ఆ ప్రాంత ప్రజల్ని కలచివేసిన ఒకే ఒక ప్రశ్న హైదరాబాద్ లేని జీవితం సాధ్యమా అనేదే! తెలంగాణ గ్రామీణ ప్రాంతాలేకాదు, సీమాంధ్రలోని పట్టణాలు సహితం దాదాపు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ మీద అంతగా ఆధారపడిపోయాయి. చదువు పూర్తి అయినా, మధ్యలో ఆగిపోయినా, కరువో, వరదలో వచ్చి ఉపాధి కోల్పోయినా రాజధానికి ప్రయాణమయ్యే హైదరాబాద్ బస్సు ఎకానమి సీమాంధ్ర అంతటా కొనసాగింది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదాన్ని పొందాక ఆ దశ ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే  రైళ్ళు బస్సుల్లోకన్నా, విజయవాడ నుండి హైదరాబాద్ వచ్ఛే రైళ్ళు బస్సుల్లో టిక్కెట్లు సులువుగా దొరుకుతున్నాయి. తిరుగు - వలసలు మొదలయ్యాయి అనడానికి ఇదొక సంకేతం.

బ్రాండ్ హైదరాబాద్ ను నమ్ముకుని సాగుతున్న రోజుల్లో చాలా మంది గమనించ లేదుగానీ హైదరాబాద్ లా అభివృధ్ధి చెందగల మౌలిక  లక్షణాలు, సదుపాయాలున్న పట్టణాలు, నగరాలు సీమాంధ్రలో కోకొల్లలుగా వున్నాయి.  చరిత్ర పుటల్లో  రెండు, మూడు శతాబ్దాలు వెనక్కిపోతే రాజధాని నగరాలుగా ఒక వెలుగు వెలిగిన  పట్టణాలేకాదు గ్రామాలు సహితం అనేకం కనిపిస్తాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీనులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, వెలనాటి చోళులు, విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజులు మొదలుకుని బహమనీలు, కుతుబ్ షాహీలు, పాలెగాళ్ళు, నిజాం పాలకులు, జమీందారులు, చివరకు మదరాసు ప్రెసిడెన్సీ వరకు అనేక చారిత్రక దశల్లో విలసిల్లిన నాటి రాజధాని నగరాలు సీమాంధ్రలో అడుగడుగున కనిపిస్తాయి.  విజయనగరం, బొబ్బిలి, రాజమండ్రి మాత్రమేకాదు జాబితా తయారు చేయడం మొదలెడితే జిల్లాకు పది గ్రామాలైనా అలాంటివి కనిపిస్తాయి. 

అల్లోపతి వైద్యం ఇంగ్లీషు వైద్యంగామారి ఆయుర్వేద, యూనానీ,  హోమియోపతి వైద్యాలను మింగేసినట్టు, హైదరాబాద్ అభివృధ్ధి సీమాంధ్ర పట్టణాలు, నగరాల అభివృధ్ధిని మింగేసింది. తెలంగాణ పోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నగరాన్ని అన్వేషించడానికి వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ సీమాంధ్రలోని ప్రతి నగరానికీ రాజధాని అయ్యే యోగ్యత వుందని అనడంలో అతిశయోక్తి ఏమాత్రంలేదు.

శివరామకృష్ణన్ కమిటీ నిర్ణిత కాలపరిమితి ప్రకారం  ఆగస్టు లోపు  కేంద్ర ప్రభుత్వానికి తన సూచనల్ని అందచేస్తుంది. ఈలోపులో రాజఢాని నగరం గురించిన చర్చలు, ఊహాగానాలు సాగుతూనే వుంటాయి. రాజధాని నగరాన్ని తమ దగ్గరే నిర్మించాలని సీమాంధ్రలోని జిల్లాలన్నీ సహజంగానే కోరుతాయి.  ప్రతి జిల్లాకూ, ప్రతి నగరానికీ,  పట్టణానికీ, ఆ మాటకొస్తే ప్రతి గ్రామానికీ ఏవో కొన్ని ప్రత్యేక వసతులుంటాయి. కొన్నింటికి చారిత్రక నేపథ్యం కూడా వుంటుంది.

 సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైనపక్షంలో డీ-గ్రేడేడ్ అటవీ ప్రాంతాన్ని సహితం డీ-నోటిఫై చేస్తామని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు కనుక ఇప్పుడు కొందరు అటవీ ప్రాంతాల్లో సహితం రాజధాని నగరాన్ని అన్వేషిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తే కాలక్రమంలో ఆ ప్రాంతం అభివృధ్ది చెందుతుందనే వాదన ఇలాంటి ప్రయత్నాలకు ఒక సమర్ధనగా వుంది.  అయితే ఆధునిక రాజధాని నగర నిర్మాణం అనేది ఒకటి రెండు ఆంశాల మీదగాక అనేకానేక అంశాల మీద ఆధారపడి నిర్ణయించాల్సిన విషయం.

ఉత్తరాన ఇచ్చాపురం నుండి దక్షణాన తడ మధ్య రోడ్డు, రైలుమార్గాల పొడవు  దాదాపు  970 కిలో మీటర్లు.  అనంతపురం / చిత్తూరు నగరాల నుండి ఇచ్చాపురం దాదాపు 1070 కిలో మీటర్లు. లెఖ్ఖగట్టి మ్యాప్ మీద మధ్య బిందువును గుర్తిస్తే  అది ఏలూరు, తాడేపల్లిగూడేం మధ్యన వుంటుంది. అయితే, రాజధాని నగరానికి రోడ్డు, రైలు, విమాన రవాణా సౌకర్యం, జలవనరులు పుష్కలంగా వుండాలిగానీ, స్కేలుపెట్టి కొలిచినట్టు  అది రాష్ట్రానికి సరిగ్గా మధ్యన వుండాలనే నియమం ఏమీలేదని శివరామకృష్ణన్ కమిటీ ముందుగానే చెప్పింది.

హైదరాబాద్ ను చూసిన కళ్లతో సీమాంధ్ర కొత్త రాజధాని నగరాన్ని ఊహించాల్సిన పనిలేదు. అలాంటి ఊహ మరికొన్ని తప్పులకు దారితీస్తుంది.  హైదరాబాద్ లో రాజధాని నగరమేగాక అనేక ఇతర అంశాలూ వున్నాయి. వాటన్నింటినీ విడివిడిగా చూడాల్సిన అవసరం వుంది. లేకపోతే అన్ని అంశాలనూ ఒకేచోట కేంద్రీకరించేసి హైదరాబాద్ లో చేసిన తప్పునే మళ్ళీ సీమాంధ్రలో చేసే ప్రమాదముంది.

వ్యాపార, వాణిజ్యకేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, వినోద పరిశ్రమ,  పరిపాలనా కేంద్రం ఒక్కచోటే వుండాల్సిన పనిలేదు. భారతదేశానికి ఢిల్లీ పరిపాలన కేంద్రం అయితే ముంబాయి వాణిజ్య కేంద్రం. మొన్నటి ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గుజరాత్ లో సహితం పరిపాలనా కేంద్రం గాంధీనగర్ అయితే వాణిజ్యకేంద్రం అహ్మదాబాద్.

సీమాంధ్రలోను ఇలాంటి విభజనను మనం చూడవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పరిపాలనా కేంద్రంకాగా రాజమండ్రి వాణిజ్యకేంద్రం. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పరిపాలనా కేంద్రంకాగా, విజయవాడ వాణిజ్యకేంద్రం.  రాయలసీమలో చిత్తూరు, తిరుపతి కూడా ఇలాంటివే. ఇలా వికేంద్రీకరణ దిశగా కొత్త ఆలోచనలు సాగాలి. ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి  1953 అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడూ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, విశ్వవిద్యాలయాల్ని మూడు ప్రాంతాలకు చెందిన  కర్నూలు, గుంటూరు, విజయవాడ/ విశాఖపట్నంలకు పంచారు. అదే ఫార్మూలాను యధాతథంగా కాకున్నా అవసరమైన మార్పులతో ఇప్పుడూ అనుసరిస్తే మంచి ఫలితాలుంటాయి.

మిగిలిన అలంకారాలను పక్కనపెట్టి ఆలోచిస్తే అసలు రాజధాని నగరం అంటే ఏమిటీ?. సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాలు, మంత్రులు, శాసనసభ్యులు, సచివాలయ అధికారులు, సిబ్బంది కోసం ఇళ్ల సముదాయం ఇవన్నీ ఒక సమూహం. ఇవి కూడా ఒకే చోటా వుండాల్సిన పనిలేదు.  రెండు చోట్ల వుండవచ్చు. మహారాష్ట్రలో ముంబాయి, నాగ్ పూర్ లలో  అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. జమ్మూ- కాశ్మీర్  వేసవి రాజధాని శ్రీనగర్ కాగా, శీతాకాలం రాజధాని జమ్ము. మనకు పొరుగునున్న కర్ణాటక విధాన్ సౌధ బెంగళూరులో వున్నట్టు అందరికీ తెలుసు. కానీ, ఆ రాష్ట్ర శాసనసభా శీతాకాల సమావేశాలు బెల్గాంలో జరుగుతాయని చాలా మందికి తెలీదు. 

సాధారణంగా సచివాలయం వున్న నగరంలోనే పోలీసు కేంద్ర కార్యాలయం వుండాల్సి రావచ్చుగానీ,  హైకోర్టు కూడా అదే నగరంలో వుండాల్సిన పనిలేదు.  ఆ తరువాత కావలసింది రాజకీయ పార్టీల రాష్ట్ర కార్యాలయ భవనాలు. అధికారిక సమావేశాలు జరపడానికి ఓ నాలుగు భారీ కన్వెన్షన్ సెంటర్లు,  ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సభలు, నిరసన ప్రదర్శనలు జరపుకోడానికి ఓ నాలుగు అలకమైదానాలు. రాజధాని నగరానికి వచ్చేవారి విడిది కోసం కొన్ని ప్రభుత్వ  అతిధి గృహాలు, హోటళ్ళు. నిజానికి వివిధ ప్రభుత్వశాఖల కేంద్ర కార్యాలయాలు కూడా ఒకే నగరంలో వుండాల్సిన పనిలేదు.

కొత్త రాజధాని నగర నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందన్న అంశం మీద ఎవరి అంచనాలు వారికున్నాయి. ఈ వ్యాసకర్త ఇటీవల ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ  ప్రతినిధిని కలిసినపుడు  చాలా ఆశ్ఛర్యకర విషయం చెప్పాడతను. రాజధాని నిర్మాణానికి పెట్టుబడి దేనికీ? అని ప్రశ్నించాడాయన. మన స్థలంలో బిల్డర్ అపార్ట్ మెంటు కట్టి మనకు ఫ్లాట్లు ఇస్తున్నట్టే  తగిన స్థలం అప్పచెప్పి, డిజైన్ ఇచ్చేస్తే ఆ నిష్పత్తి ప్రకారం రాజధాని నగరాన్ని ఊరికే కట్టివ్వడానికి అనేక నిర్మాణ సంస్థలు సిధ్ధంగా వుంటాయి అన్నాడతను. ఇదేమీ కొట్టిపడేయదగ్గ  ఆలోచన కాదనిపించింది. నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి (బీవోటి) పధ్ధతిలో కూడా రాజధాని నగరాన్ని  నిర్మించవచ్చు.  ఆ అంశాన్ని అలా వుంచినా,  సీమాంధ్ర కొత్త రాజధానికి కావలసిన శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు తదితర భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని పునర్ వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు కనుక రాజధాని ఎక్కడో తేల్చడమే ఇప్పుడు కీలకం.

పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీమాంధ్రలో చర్చ మొత్తం ఇప్పటికీ  రాజధాని చుట్టే సాగుతున్నప్పటికీ సీమాంధ్ర పునర్ నిర్మాణాన్ని ఆరంభించడం అంతకన్నా ప్రాణప్రదమైన  అంశం.

సుదీర్ఘ సముద్రతీరం భౌగోళికంగా సీమాంధ్రకు గొప్పవరం. దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం సీమాంధ్రకు వుంది. ఇది తెలంగాణకన్నా సీమాంధ్రను విభిన్నంగా నిలబెట్టే అంశం. విశాపట్నం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం  ఓడరేవుల గురించి అందరికీ తెలుసు. శతాబ్దాల క్రితమే ప్రపంచాన్నిఆకర్షించి తరువాత నిర్లక్ష్యానికి గురైన ఓడరేవులు సీమాంధ్ర తీరం వెంట అనేకం వున్నాయి. వాడరేవు- నిజాంపట్నం అభివృధ్ధి (వాన్ పిక్ ) ప్రాజెక్టు మొదలై ఆగిపోయింది. అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో దూగరాజపట్నం వద్ద భారీ ఓడరేవు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

మన మనోఫలకాల నుండి చెరిగిపోతున్న మరో రేవు పట్టణం నరసాపురం. 18వ శతాబ్దానికి ముందే యూరప్ మార్కెట్లకు నూలు దుస్తులు ఎగుమతి చేసిన ఘనత  నరసాపురం (రివర్ పోర్ట్)  నదీ- ఓడ రేవుది.  అప్పట్లో, నరసాపురం రేవును మాధవాయిపాలెం అనేవారు. మాధవాయిపాలెం నుండి వచ్చే నూలు వస్త్రాల్ని యూరప్ మార్కెట్లలో మాధోపల్లెమ్స్ అనేవారు.  వీటి తాకిడికి మాంచెస్టర్, ల్యాంక్ షైర్ జౌళి మిల్లులు విలవిల్లాడేవట.   చివరకు, జౌళీ పరిశ్రమాధిపతుల వత్తిడి మేరకు ఇంగ్లండ్ లో మాధోపల్లెమ్స్  దిగుమతుల్ని బ్రిటీష్ పార్లమేంటు నిషేధించాల్సి వచ్చింది. జర్మనీకి చెందిన సమాజశాస్త్రం ప్రొఫెసర్ మారియా మేస్ 1982 లో రాసిన లేస్ మేకర్స్ ఆఫ్ నర్సాపూర్ : ఇండియన్ హౌస్ వైవ్స్ ప్రొడ్యూస్ ఫర్ ద వరల్డ్ మార్కెట్పుస్తకంలో ఇలాంటి వివరాలు మరికొన్ని వున్నాయి. గతించిన నాటి పోటీతత్వానికి కొత్త ఉత్తేజాన్ని నింపగలిగితే సీమాంధ్ర జాతీయా మార్కెట్ నేకాదు, అంతర్జాతీయ మార్కెట్ ను సహితం ఆకర్షించగలదు. బ్రాండ్ ఆంధ్రా నిర్మాణం కష్టసాధ్యం అయితే కావచ్చుగానీ ఆసాధ్యం మాత్రం కాదు.

సీమాంధ్ర అందులో ముఖ్యంగా తీరాంధ్ర అనగానే గుర్తు కొచ్చేది కృష్ణా, గోదావరి నదులు. నిజానికి ఈ రెండు నదులు నాలుగు రాష్ట్రాల మీదుగా వచ్చినప్పటికీ ఈ రెండు నదుల పేర్లతో నాలుగు జిల్లాలున్న ప్రాంతం తీరాంధ్ర ఒక్కటే. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలేకాదు, ఇప్పటి గుంటూరుజిల్లా కూడా మునుపు కృష్ణా మండలంలో వుండేది, నదులతో తీరాంధ్రకు వున్న అనుబంధం అలాంటిది. కృష్ణా, గోదావరి మండలాల్ని ఇప్పటికీ దక్షణ భారతదేశపు ధాన్యాగారం అంటారు. దక్షణ భారత దేశంలో కాలువల వ్యవసాయం ముందుగా కృష్ణా- గోదావరి డెల్టాలోనే పుట్టి  తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో, కృష్ణా-గోదావరి డెల్టా వాసుల్ని కాలవల సంతతి అన్నా అతిశయోక్తికాదు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటూ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా ఈ ప్రాంతంలో పుష్కలంగా అవకాశాలున్నాయి. తీరాంధ్రతో పోలిస్తే రాయసీమలో నీటివనరులు తక్కువే అయినప్పటికీ చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో సహితం వ్యవసాయాధార పరిశ్రమలు నెలకొల్పడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి.

దాదాపు రెండు శతాబ్దాలు నేరుగా బ్రిటీష్ పాలన కింద వున్న ప్రాంతమిది. సవాళ్లను ఎదుర్కొని, ముందుకు సాగగల సంసిధ్ధతలో  సీమాంధ్రకు రెండు వందల సంవత్సరాల చరిత్రవుంది. 

రాయలసీమ ఖనిజాలకు తరగని గని.  వైయస్సార్ కడప జిల్లాలో భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వున్న అవకాశాలను ఆరు నెలలలోగా  సెయిల్ పరిశీలించనుంది. మరోవైపు, తీరాంధ్రలో గ్రీన్ ఫీల్డ్ నూనెశుధ్ధి కర్మాగారం  నిర్మాణానికి వున్న అవకాశాలను కూడా ఆరు నెలలలోగా ఐవోసీ, గానీ హెచ్ పిసీఎల్ గానీ పరిశీలించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చొరవతో  ఢిల్లీ-ముంబాయి పారిశ్రామిక కారిడార్ తరహాలో, విశాఖపట్నం - చెన్నయ్   పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కాబోతున్నది.
రాయలసీమ. తీరాంధ్ర సరిహద్దుల్లోని నల్లమల అడవులు, ఉత్తర సర్కారు జిల్లాల పశ్చిమ ప్రాంతంలోని దండకారణ్యం అటవీ సంపదకేకాక, బాక్సైటు తదితర ఖనిజాలకూ నిలయంగా వున్నాయి. అయితే, ఏ ప్రాంతంలో అయినా వనరులుంటే చాలదు వాటిని వినియోగంలోనికి తేవడానికి మౌళిక సదుపాయాలుండాలి. వాటిల్లో కీలకమైనవి రవాణా సౌకర్యాలు.

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్రస్తుతమున్న విమానాశ్రాయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృధ్ధ్ది చేయడానికికున్న అవకాశాలను  పరిశీలించడమేగాక వాటి  నిర్మాణానికి చొరవ తీసుకుంటానని కేంద్ర ప్రభుత్వం  హామీ ఇచ్చింది. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వేజోన్ ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా భారత రైల్వేశాఖ పరిశీలిస్తున్నది. విశాఖపట్నంతోపాటూ విజయవాడ – గుంటురు – తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటీ లలో మెట్రో రైలు నిర్మాణం  చేపట్టడానికికున్న అవకాశాలను పరిశీలించడమేగాక, దాని నిర్మాణానికి చొరవ తీసుకుంటానని కూడా ఢిల్లీ చెప్పింది. దీనికి ముక్తాయింపు ఏమంటే, కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నుండి వేలువిడుస్తున్న రాజధాని  హైదరాబాద్ కు విస్తృత రోడ్డు రవాణ సౌకర్యం కల్పించడానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

కొత్త రాష్ట్రాన్ని వెంటాడుతున్న మరో ప్రధాన సమస్య నిధుల కొరత. 40 శాతం జనాభావున్న తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ వాటా 60 శాతం వుండగా, 60 శాతం జనాభావున్న సీమాంధ్ర ప్రాంతంలో రెవెన్యూ వాటా 40 శాతం మాత్రమే వుంది. భారీ కొరతను తీర్చడానికి సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వం తొలి రోజు నుండే నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడితీరాలి.

అయితే, రెవెన్యూ లోటును తీర్చడానికి అంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో కొన్ని హామీలున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు పదమూడవ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల్ని ఇప్పుడు ఏర్పడిన రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదిక, ఇతర సూచికల ఆధారంగా పంపకాలు చేస్తానని  కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందుబాటులోవున్న ఆదాయ వనరుల్ని పరిగణనలోనికి తీసుకుని వాటికి విడివిడిగా నిధుల్ని కేటాయించాలని  పదమూడవ ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి ఆదేశిస్తారని కూడా బిల్లులో పేర్కొన్నారు. అంతేగాక, కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలి ఏడాది, - మరీ ముఖ్యంగా అప్పాయింటెడ్ డే నుండి, 14 ఆర్థిక సంఘం సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలోగా-,  తలెత్తే రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు  2014-15  జాతీయ బడ్జెట్ లోనే నిధుల్ని కేటాయిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రత్యేక హామీ ఇచ్చారు.

సీమాంధ్రకు హైదరాబాద్ తో వున్న మరో ప్రగాఢ  అనుబంధం విద్యారంగానికి సంబంధించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటిలోనూ ప్రవేశం కోసం  ప్రస్తుతం అమల్లోవున్న కోటా విధానమే మరో పదేళ్ల పాటు కొనసాగుతుందని  పునర్ వ్యవస్థీకరణ బిల్లు స్పష్టంగా పేర్కొంది. ఆమేరకు ఉన్నత చదువులు ఆశించే సీమాంధ్ర విద్యార్ధులకు గట్టి హామీ వుందనే భావించాలి. పదేళ్ల గడువు పూర్తికాకముందే జాతీయ స్థాయి విద్యాసంస్థలు పదింటిని సీమాంధ్రలో  నెలకొల్పుతారు.  ఐఐటి, ఎన్ ఐటి, ఐఐయం, ఐఐయస్ ఇఆర్, ఐఐఐటి లతోపాటూ  కేంద్ర విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం  ఇందులో వున్నాయి. ప్రకృతి విలయాల నివారణ నిర్వహణ సంస్థను నెలకొల్పడమేగాక, ఏఐఐఎమ్ ఎస్ (ఏయిమ్స్) తరహాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియూ బోధనా సంస్థను నిర్మిస్తారు

ఇంత పెద్ద ఎత్తున మౌలిక రంగాన్ని విస్తరిస్తున్నపుడు పెద్దఎత్తున  పెట్టుబడుల్ని ఆకర్షించడం ఒక ప్రధాన కర్తవ్యం. కొత్తగా ఏర్పడే సీమాంధ్రలో  పారిశ్రామీకరణ, ఆర్ధికాభివృధ్ధి వేగవంతంగా సాగేలా ప్రోత్సహించం కోసం పన్ను రాయితీలతోసహా అనేక ఆర్ధిక చర్యలు, ప్రోత్సాహకాలు, ప్రత్యేక అభివృధ్ధి ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం అందించాల్సి వుంది.  

రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు, ఉత్తర తీరాంధ్ర ప్రాంతానికి చెందిన మూడు జిల్లాలతో పాటూ, మొత్తం పదమూడు  జిల్లాలతో ఏర్పడే భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందించడానికి వీలుగా ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తారు. ఈ హోదా ఐదేళ్లపాటు అమల్లో వుంటుంది. దానివల్ల భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక స్థితి పటిష్టంగా మారడానికి అవకాశం వుంటుంది. రాయలసీమ, ఉత్తర తీరాంధ్రలని వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి వాటికి  ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ని అందించే అంశాన్ని  కూడా పునర్ వ్యవస్థీకరణ బిల్లులోనే పేర్కొన్నారు. ఒడీశా లోని కోరాపుట్ బాలంగీర్ కలహండి (కే-బీ-కే), మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతాలకు ప్రస్తుతం అందిస్తున్న ప్రోత్సాహకాల  తరహాలో ఈ  ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వుంటుంది. ఈప్రాంతాల్లో టాక్స్  హాలిడేను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

అయితే ఇందులో అనేక తిరకాసులున్నాయి. హామీలిచ్చిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ప్రధానిగాలేరు. ఆయన ప్రాతిధ్యం వహించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేకపోవడమేకాదు ప్రధాన ప్రతిపక్షంగానూ లేదు. అసలు, ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలకు చట్టబధ్ధత వుందా? లేదా?  అనేది అంతకన్నా కీలక అంశం. ఒకవేళ చట్టబధ్ధతవున్నా యూపియే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎన్డీయే ప్రభుత్వం  ఏమేరకు చిత్తశుధ్ధితో నెరవేరుస్తుందనేది ఇంకా తేలాల్సిన అంశాలు. ఇలాంటివి చట్టాల పరిధిలోకన్నా కొత్త ప్రధాని నరేంద్ర మోదీ, కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య కొనసాగే సత్సంబంధాల మీద ఆధారపడి పరిష్కారం అవుతాయి.

కొత్త యుగంలోనికి ప్రవేశిస్తున్న తరుణంలో మనం అభివృధ్ధి, పెరుగుదలలకు సంబంధించిన అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాల్సి వుంది. లేనిపక్షంలో సీమాంధ్ర సామాన్య ప్రజలకు మరోమారు తీవ్ర అన్యాయం జరగబోతున్నదని గ్రహించాలి.  అభివృధ్ధిని మనం సాధారణంగా  సాలీన స్థూల జాతీయోత్పత్తి (జీడిపి) పెరుగుదల శాతంతో కొలుస్తుంటాం. మనుషుల జీవన  నాణ్యతా ప్రమాణాలు జీడీపి కొలమానంలో  ప్రతిఫలించవని మహబూబ్ ఉల్ హక్ వంటి విఖ్యాత ఆర్ధికవేత్తలు గతంలో ఐక్యరాజ్యసమితికి అందచేసిన మానవాభివృధ్ది నివేదికల్లో హెచ్చరించివున్నారు.

వస్తు వుత్పత్తిలో పెరుగుదల అనేది అభివృధ్ధిలో ఒక పార్శ్వం మాత్రమే. పంపిణీ అనేది అంతకన్నా ప్రాణప్రదమైన పార్శ్వం. ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం ఎంత సంపాదించిందనేదానికన్నా ఆ సంపాదన ఎక్కడికి చేరుతోంది? ఎవరికి చేరుతోంది? అనేది అంతకన్నా మహత్తర ప్రశ్న. మనుషుల శక్తిసామర్ధ్యాల (Capabilities) వికాసం మన లక్ష్యంకావాలి.  వాటిని సాధించడం కోసం మనం పెరుగుదల అధారిత నిర్మీతిని (growth – Based Paradigm)  నిరాకరించి మానవాభివృధ్ధి నిర్మితిని (Human Development Paradigm) పరిగణనలోనికి తీసుకోవాలి.  
అమర్త్యాసేన్, మార్థా నస్ బామ్ వంటి ఆర్ధికవేత్తలు మానవ శక్తిసామర్ధ్యాల వికాసానికి సంబంధించి కొన్ని జాబితాలు తయారు చేశారు. అందరికీ సమానంగా విద్యా, వైద్య ఆరోగ్య సేవల అందుబాటు, స్త్రీపురుష, ధనికపేద వివక్ష నిర్మూలన, స్వేఛ్ఛాయుత మీడియా, బహిరంగ చర్చలు చేసే స్తోమత వంటి ప్రమాణాల్ని  అమర్త్యాసేన్ ప్రతిపాదించగా, మార్థా నస్ బామ్ తనవైన రీతిలో పది అంశాలను ప్రతిపాదించారు. ఆ ఇద్దరిలో సామాన్యాశం ఏమంటే జీడిపికన్నా మానవాభివృధ్ధి సూచికను ప్రమాణంగా తీసుకోవాలనేదే.

సీమాంధ్రకు ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండీ భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. వస్తాయి. అవి ఇక్కడ లాభాల పంటలు పండించుకుంటాయి, ఆ లాభాలు తమ మాతృరాష్ట్రాలకో, మాతృదేశాలకో తరలి వెళ్ళిపోతే సీమాంధ్రుల జీవనప్రమాణాలు అభివృధ్ధి చెందకపోగా మరింతగా దిగజారిపోతాయి. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన చారిత్రక బాధ్యత సీమాంధ్ర ఆలోచనాపరులు అందరి మీదా వుంది.  బ్రాండ్ ఆంధ్రా విభిన్నంగా వుండాలి. మానవీయంగా తన ప్రత్యేకతను చాటుకోవాలి. 
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

హైదరాబాద్
22 మే  2014
ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి, 1 జూన్ 2014

http://epaper.andhrajyothy.com/index.aspx?eid=31855#







No comments:

Post a Comment