Tuesday 27 May 2014

Teluguganga Controversy and Sribhag Agreement


తెలుగుగంగ ముక్కోణ వివాదంలో శ్రీభాగ్
ఉషా యస్ డానీ

కుక్కలు, రాబందులూ తినేయగా మిగిలిన శవాల్ని వరుసగా పేర్చుకుంటూపోతే ఆ బారు కర్నూలు నుండి కడప  వరకు వుంటుంది. జనాభాలో సగం మంది చనిపోయారు

1837 నాటి నందన కరువును సమీక్షిస్తూ బ్రిటీష్ అధికారులు మదరాసు గెజిట్ లో రాసిన వాక్యాలివి. ఆ కర్నూలు, కడప పట్టణాలని కలుపుతూనే సర్ ఆర్ధర్ కాటన్ ఆధ్వర్యంలో కేసీ కెనాల్ వచ్చింది.

రాయలసీమకు 360 శతకోటి ఘనపు అడుగుల (టీయంసీ) నీరు అందించాలని కృష్ణా, తుంగభద్రలపై సర్ మెకంజి (Archibald Thomas Mackenzie) ఒక ప్రాజెక్టును రూపొందించాడు. మొదటి ప్రపంచ యుధ్ధం రావడంతో మెకంజీ ప్రాజెక్టు పురిట్లోనే కన్ను మూసింది. మరోవైపు, కేసి కెనాల్ ను అప్పట్లో సేద్యపునీటి కోసంకాక, సైనిక రవాణా కోసమే ఉద్దేశించారు.

కేసి కెనాల్ యుధ్ధావసరాలు తీర్చడానికే పరిమితం అయిపోతే, యుధ్ధం మెకంజీ ప్రాజెక్టును నిర్మాణ రూపం దాల్చకుండా నిరోధించి రాయలసీమను ఒక యుగం వెనక్కి నెట్టింది.

కృష్ణా- గోదావరి మందలాలు వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని సాధించేయి. గుడివాడ, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలు ధాన్యం ఎగుమతి కేంద్రాలుగా మారి జాతీయ వాణిజ్యరంగంలో అంతర్భాగం కాగలిగేయి. ఈ నేపథ్యంలోనే తెలుగునాట  ఆధునిక అర్ధంలో జాతీయ భావాలు మొలకెత్తడం ప్రారంభమయ్యాయి.

1913లో పుట్టిన ఆంధ్రమహాసభ రెండేళ్ళలోనే విశాఖసభలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం  కావాలని తీర్మానించింది. 1926లో వచ్చిన ఆంధ్రా యూనివర్సిటీని విశాఖలో నిర్మించడం రాయలసీమ వాసులకు ఉత్తరాంధ్రుల మీద అనుమానాలకు దారితీసి, ఆంధ్రమహాసభలతో రాయలసీమ గొంతు కలపకుండా చేసింది.

దక్షణ జిల్లాల (తమిళనాడు) వారి ఆధిపత్యము వలన నిన్నటి దినముల వరకూ అనుభవించిన భాధను మనము మరువలేము. ఇక నిప్పుడు ఉత్తరాదివారి ప్రాబల్యమును రుచి చూచుచున్నాము అని కడప కోటిరెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఒక బహిరంగ సభ అభిప్రాయపడింది. సాధనపత్రిక సంపాదకులు పప్పూరి రామాచార్యులు చెన్న రాజధాని నుండి ఆంధ్ర రాష్ట్రము విడివడుట లాభకరమైనచో ఆంధ్రరాష్ట్రము నుండి రాయలసీమ విడిపోవుట మరింత లాభముకదా? అని తీర్మానించారు. 

రాయలసీమ నాయకులను జాతీయ స్రవంతి లోనికి తీసుకురావడానికి కోస్తా ఆంధ్రా నాయకులు 1937 అక్టోబరు నెలలో రాయలసీమ నాయకులను విజయవాడ నగర వీధుల్లో ఏనుగు అంబారీలపై ఊరేగించారు. ఈ క్రమానికి కొనసాగింపే అదే సంవత్సరం డిసెంబరు నెలలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మదరాసు నివాస భవనం శ్రీభాగ్లో కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందం. కడప కోటి రెడ్డిగారు అధ్యక్షత వహించిన ఈ సమావేశ ఒప్పంద పత్రాలపై ఇరు ప్రాంతాల నుండి పప్పూరి రామాచార్యులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటివారు ఎనిమిదిమంది సంతకాలు చేశారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను కోస్తా జిల్లాల స్థాయికి అభివృధ్ధి చేయాలనేదే ఈ ఒప్పందపు ప్రధాన ఉద్దేశ్యం.

“ .... ముఖ్యంగా తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదుల నీటిని వాడుకునే విషయంలో ఈ ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడయినా నదీజలాల పంపకపు సమస్య ఎదురయితే ముందుగా ఈ ప్రాంతపు అవసరాలు తీర్చబడాలి అని ఆ రెండు పేజీల ఒప్పందం తీర్మానించింది.

జాతీయ రాజకీయాల్లో ఆనంద్ సాహెబ్ తీర్మానం దుమారాన్ని రేపుతున్నట్లే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీభాగ్ ఒడంబడిక వీలున్నప్పుడెల్లా  ప్రకంపనాలు సృష్టిస్తూనే వుంది. 

ఉమ్మడి మదరాసు రాష్ట్రం 200 శత కోటి ఘనపు అడుగుల నీటితో కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టునిర్మించడానికి 1937లో కేంద్ర ప్లానింగ్ కమీషన్ నుండి అనుమతి సంపాదించింది. ఆ ప్రాజెక్టులో రాయలసీమకూ, తమిళనాడులోని చెంగల్పట్టు ప్రాంతానికీ చెరో వంద టీయంసీల నీటిని కేటాయించారు.

ఆంధ్ర జలాలతో ఆంధ్ర ప్రాంతపు అవసరాల్ని తీర్చకుండానే మదరాసు రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వడం మీద అభ్యంతరాలొచ్చాయి. దానితో, రాయలసీమ ప్రజలు కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టునీళ్లకు నీళ్ళొదులుకుని ఆంధ్రా నాయకులతో గొంతు కలిపారు.
ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత నాగార్జునసాగర్ డామ్ కు శంకుస్థాపన చేస్తూ నెహ్రు దాన్ని ఆధునిక దేవాలయంఅన్నారు. ఆ దేవాలయం నుండి తులసీ తీర్ధం అంతటి నీళ్ళు కూడా రాయలసీమకు పారలేకపోయింది. 

ఆ తరువాత కృష్ణా నదీజలాల వివాదాన్ని పరిష్కరించడానికి ఆర్ ఎస్  బచావత్ ట్రిబ్యూనల్ (1969-1973) ఏర్పడింది.  75 శాతం ఆధారిత ప్రమాణాల ప్రకారం కృష్ణా నదిలో 2060 టియంసీల నికర జలాల లభ్యత వుంటుందని తేల్చిన ట్రిబ్యూనల్ దాని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లకు  వరుసగా 560, 700, 800 టియంసీల చొప్పున  నీటిని కేటాయించింది,

నికర జలాలుకాకుండా ఇంకా లభ్యమయే అదనపు జలాలని వాడుకునే సౌలభ్యాన్ని దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారు.  ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి పూర్తి అయిన, నిర్మాణంలోవున్న, ప్రతిపాదనలోవున్న ప్రాజెక్టుల్లో అదనపు జలాలను స్వేచ్చగా వినియోగించుకోవచ్చు.  అయితే, అదనపు జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్టులు మాత్రం నిర్మించడానికి వీలులేదు. అలా కొత్త ప్రాజెక్టుల్లో అదనపు జలాల్ని ఉపయోగిస్తే, ఒకసారి అనుభవించిన సౌకర్యం తరువాతి కాలంలో హక్కుగా మారే ప్రమాదం వుందనీ, అది ఈ శతాబ్దాంతానికి మరలా జరగాల్సివున్న కృష్ణాజలాల పున:పంపకాలకు అభ్యంతరకరంగా మారుతుందని బచావత్ ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది.

సరిగ్గా ఈ అంశం మీదనే ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ఆంధ్రప్రదేశ్ లోని ఎలక్టోరల్ పార్టీల మధ్య, ఆయలసీమ కరువుల మధ్య ఈనాడు ముక్కోణ వివాదం ఒకటి తీవ్రరూపం దాలుస్తోంది. 

టంగుటూరి అంజయ్యగారి హయాంలో జరిగిన అఖిలపక్ష సమావేశం రాయలసీమకు నీరందించడానికి 1981లో శ్రీశైలం కుడి గట్టు కాలువను రూపకల్పన చేసింది.  తెలుగుదేశం పార్టి అధికారంలోనికి వచ్చిన తరువాత ఇదే కాలువ కొద్దిపాటి మార్పులతో తెలుగుగంగగా అవతరించింది. 

తాగునీరులేక కటకట లాడుతున్న మదరాసు నగరానికి కృష్ణాజలాల్లో తమ తమ వాటాల నుండి చెరో 5 టీయంసీల నీటిని కేటాయిస్తామని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమిళనాడు ప్రభుత్వానికి వాగ్దానం చేశాయి. ఆ విషయంలో నాలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వివాదం ఏమీలేదు.

మదరాసు నగరానికి పంపే నీరుకాక, తెలుగుగంగ ద్వార నెల్లూరుజిల్లాతోపాటూ, రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూముల్లో 5.75 లక్షల ఎకరాలకు సేద్యం కోసం 27.5 టీయంసీల నీరు అందిస్తాననీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్రప్రభుత్వం చూపెడుతున్న ఆయకట్టు విస్తీర్ణానికీ, వాగ్దానం చేసిన నీటికీ పొంతనే లేకపోవడంతో కొత్త వివాదం తలెత్తింది.

శ్రీశైలం నుండి విడుదల చేస్తామంటున్న 27.5 టీయంసీల సాగునీరు నెల్లూరు జిల్లాలో చూపెట్టిన 2.5 లక్షల ఎకరాల సేద్యానికి అయినా సరిపోతాయి; లేదా రాయలసీమలో చూపెడుతున్న 2.75 లక్షల ఎకరాల సేద్యానికి అయినా సరిపోతాయి. అంచేత, ఈ జలాలు నెల్లూరు జిల్లాకా? లేక రాయలసీమ ప్రాంతానికా? అనేది ఒక అనుమానం అయితే, ఈ జలాలు అసలు నికర జలాలేనా అన్నది అంతకన్నా ప్రధాన సమస్య.

అసలౌ నికర జలాలు ఎక్కడున్నాయీ? అని రాష్ట్ర నీటి పారుదలా శాఖా మంత్రి కేఇ కృష్ణమూర్తి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నికర జలాలు చూపెట్టకపోతే కేంద్ర ప్లానింగ్ కమీషన్ కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే ప్రశ్నేలేదు.

అదనపు జలాల్ని కొత్త ప్రాజెక్టుల్లో ఉపయోగించరాదనే కర్ణాటక అభ్యంతరానికిగానీ, కరువును  ఎలా నివారిస్తారని అడుగుతున్న రాయలసీమ ప్రజలకుగానీ ఇవ్వగల సమాధానం తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరేకాదు రాష్ట్రంలోని ఎలక్ట్రోలు పార్టీలు ఎవరి దగ్గరా లేదు. ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడం కోసం అవన్నీ పడరాని పాట్లన్నీ పడుతున్నాయి. ఈ రాజకీయాలకు దూరంగా కన్నీళ్ళు ఇంకిపోయిన  రాయలసీమను సహారా భూతాలు వెంటాడుతున్నాయి. మరో శతాబ్దం గడవకుండానే అనంతపురంజిల్లా ఎడారిగా మారిపోబోతున్నదని శాస్త్రజ్ఞులు గగ్గోలు పెడుతూనే వున్నారు. 

రాష్ట్ర వైజ్ఞానిక సాంకేతిక మండలిని మార్చి 2 న పున:ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని సహజ వనరులను సాధ్యమయినంత ఎక్కువగా వినియోగించుకునే మార్గాల్ని అన్వేషించాల్సిందిగా శాస్త్రజ్ఞుల్ని కోరారు. వాళ్ళిప్పుడు రాయలసీమకు నికర జలాలు చూపెట్తగలరా? లేదా? అన్నది కాదు ప్రశ్న. రాష్ట్రంలోని నదీ పరివాహక జలాల్నీ, భూగర్భ జలాల్నీ సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమకు మరో 350 టీయంసీల జలాలు కేతాయించడం కష్టమేం కాదని గతంలో అనేక మంది నిపుణులు సమర్పించిన నివేదికలు ఏ ప్రయోజనాల కోసం బుట్త దాఖలా అయ్యాయి? అన్నదే అసలు ప్రశ్న.

రాయలసీమ ఎడారిగా మారిపోతుండదానికి కారణం నాటి నిజామా? బ్రిటీష్ వలస పాలకులా? నిన్నటి కాంగ్రెసా? నేటి తెలుగు దేశమా? మిత్రపక్షాలా? విపక్షాలా అన్నదికాదు ప్రశ్న. దేశంలో ఏదో ఓక చోట అధికారపక్షంగా వుంటున్న  ఎలక్టోరల్ పార్టీలు సారాంశంలో పాలకవర్గాల ప్రయోజనాలకు పూర్తి భిన్నంగా ప్రవర్తించగలవా? అన్నదే ప్రశ్న.

నదీ పరివాహక ప్రాంతం నిష్పత్తిలోగానీ, జనాభా నిష్పత్తిలోగానీ, సేద్యపు భూముల నిష్పత్తిలోగానీ రాయలసీమకు జరిగిన అన్యాయం ఎంత అన్నదికాదు సమస్య. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమగ్రమైన అభివృధ్ధిని సాధించకుమ్డా తెలుగు జాతి ప్రజల మధ్య అయినా సమైక్యత సాధ్యపడుతుందా? అనేదే సమస్య.

వీటికి సమాధానం పరిష్కారం రెండూ దొరకనంత వరకు శ్రీభాగ్ ఒప్పందంకోసం చరిత్రలో వెతకాల్సిన పనిలేదు. అది వర్తమానంగా, గతంకన్నా తీవ్రంగా ముందుకు వస్తూనే వుంటుంది.

కడప
మార్చి, 1986

ప్రచురణ : ఎడిట్ పేజి, ఉదయం దినపత్రిక,  మార్చి, 1986



No comments:

Post a Comment